Advertisement
తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 26 మార్చి 2024
March Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 26 మార్చి 2024

26 మార్చి 2024 కరెంట్ అఫైర్స్ అంశాలను తెలుగులో పొందండి. వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను ఈ ఆర్టికల్ ద్వారా మీకు అందిస్తున్నాం.

ఆస్టరాయిడ్‌కు భారతీయ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ జయంత్ మూర్తి పేరు

అంతర్జాతీయ ఖగోళ యూనియన్ (ఐఏయూ) భారతదేశానికి చెందిన ప్రొఫెసర్ జయంత్ మూర్తి పేరు మీద ఒక గ్రహశకలంకు పేరు పెట్టింది. గతంలో 2005 EX296 గా పిలిచే గ్రహశకలంకు ఇప్పుడు జయంత్‌మూర్తి (215884)గా నామకరణం చేసింది. సౌర వ్యవస్థలోని చిన్న వస్తువులకు పేర్లు పెట్టే బాధ్యత కలిగిన ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ యొక్క వర్కింగ్ గ్రూప్ ఈ ప్రకటన చేసింది.

గ్రహశకలం (215884) జయంత్‌మూర్తిని 2005లో అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త మార్క్ బ్యూయ్ అరిజోనాలోని కిట్ పీక్ నేషనల్ అబ్జర్వేటరీలో కనుగొన్నారు. ఇది ప్రతి 3.3 సంవత్సరాలకు మార్స్ మరియు బృహస్పతి మధ్య సూర్యుని పూర్తి కక్ష్యను పూర్తి చేస్తుంది.

ప్రొఫెసర్ జయంత్ మూర్తి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (ఐఐఎ) నుండి 2021లో పదవీ విరమణ చేశారు. ఆయన 2018 నుండి అక్టోబర్ 2019 వరకు ఐఐఎ యొక్క తాత్కాలిక డైరెక్టర్‌గా కూడా సేవలు అందించారు. ప్రస్తుతం ఇదే సంస్థలో గౌరవ ఆచార్యుడిగా సేవలందిస్తున్నారు. అలానే అమెరికన్ ఆస్ట్రోనామికల్ సొసైటీలో కూడా ఈయన కొన్ని కీలక ప్రాజెక్టులలో సేవలు అందించారు.

ఐఏయూ : అంతర్జాతీయ ఖగోళ యూనియన్ (ఐఏయూ) 1919లో స్థాపించబడింది. ఇది ఖగోళ శాస్త్రంలో అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడానికి, ఖగోళ శాస్త్ర పరిశోధనలను సమన్వయం చేయడానికి మరియు ఖగోళ శాస్త్రం గురించి వ్యాప్తి చేయడానికి బాధ్యత వహిస్తుంది. దీని ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్‌లోని పారిస్‌లో ఉంది. ఐఏయూ 80 కంటే ఎక్కువ దేశాల నుండి 12,000 మందికి పైగా సభ్యులను కలిగి ఉంది.

ఐఐఎ : భారతీయ ఖగోళ శాస్త్ర సంస్థ 1971లో స్థాపించబడింది. ఇది భారతదేశంలో ఖగోళ శాస్త్రం మరియు ఖగోళ భౌతికశాస్త్రంలో పరిశోధనలకు నాయకత్వం వహించే స్వయంప్రతిపత్తి పరిశోధనా సంస్థ. దీని ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది.

  • గ్రహశకలాలు అనేవి సూర్యుని చుట్టూ తిరిగే చిన్న రాతి వస్తువులు.
  • గ్రహశకలాలు సూర్యుని చుట్టూ గ్రహాల వలె తిరుగుతున్నప్పటికీ, అవి గ్రహాల కంటే చాలా చిన్నవిగా ఉంటాయి.
  • గ్రహశకలాలు సుమారు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం మన సౌర వ్యవస్థ ఏర్పడినప్పటి నుండి ఉనికిలో ఉన్నాయి.
  • మెజారిటీ గ్రహశకలాలు అంగారక గ్రహం మరియు బృహస్పతి మధ్య ఉన్న ఆస్టరాయిడ్ బెల్ట్‌లో తిరుగుతూ ఉంటాయి.
  • ఆస్టరాయిడ్స్ గ్రహాలు చేసే విధంగానే సూర్యుని చుట్టూ తిరుగుతాయి, అయితే వాటి కక్ష్యలు తరచుగా గ్రహాల కంటే దీర్ఘవృత్తాకారంలో (ఓవల్ ఆకారంలో) ఉంటాయి.
  • గ్రహశకలాలు కూడా గ్రహాల కంటే నెమ్మదిగా తిరుగుతాయి. కొన్ని గ్రహశకలాలకు చంద్రులు కూడా ఉంటారు.
  • మన సౌర వ్యవస్థలో మిలియన్ల కొద్దీ గ్రహశకలాలు ఉన్నాయి. ఇంకా కనుగొనని బిలియన్ల కొద్దీ గ్రహశకలాలు ఉండవచ్చని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు.

కొల్లాంలో బ్రూసెథోవా ఇస్రో అనే కొత్త సముద్ర ఐసోపాడ్ కొనుగొన్న పరిశోధకులు

కేరళలోని కొల్లం తీరంలో పరిశోధకులు కొత్త సముద్ర ఐసోపాడ్‌ జాతులను కనుగొన్నారు. ఈ లోతైన సముద్ర ఐసోపాడ్ లకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ పేరుతొ బ్రూసెథోవా ఇస్రో అని నామకరణం చేసారు. ఈ పరాన్నజీవి క్రస్టేసియన్ బ్రూసెథోవా జాతికి చెందినదిగా పరిశోధకులు భావిస్తున్నారు.

స్పైనిజా గ్రీన్ ఐ అని పిలువబడే లోతైన సముద్రపు చేప యొక్క గిల్ కుహరంలో ఇవి నివసిస్తున్నట్లు కనుగొనబడింది. ఇవి భారతదేశంలో ఇప్పటివరకు నమోదు చేయబడిన బ్రూసెథోవా జాతికి చెందిన రెండవ జాతిగా పేర్కొన్నారు. భారత అంతరిక్ష రంగంలో ఇస్రో చేసిన అపురూపమైన సేవలను గౌరవించేందుకు ఈ కొత్త జాతికి బ్రూసెథోవా ఇస్రో అని పేరు పెట్టారు.

  • బ్రూసెథోవా ఇస్రోకు చెందిన ఆడ జీవులు మగ వాటి పరిమాణం కంటే పెద్దవిగా ఉంటాయి.
  • ఆడ జీవులు 19 మిల్లీమీటర్ల పొడవు మరియు 6 మిల్లీమీటర్ల వెడల్పు వరకు పెరుగుతాయి. మగవాటి పరిమాణం వీటిలో దాదాపు సగం ఉంటుంది.
  • ఈ ఐసోపాడ్ అరేబియా సముద్ర లోతుల్లో నివసిస్తుంది, ఇది అధిక పీడనం మరియు తక్కువ ఉష్ణోగ్రతలతో కూడిన కఠినమైన వాతావరణం.
  • ఇవి స్పైనీజా గ్రీన్ ఐ ఫిష్ యొక్క గిల్ కేవిటీకి అతుక్కుని, హోస్ట్ యొక్క రక్తం లేదా శ్లేష్మాన్ని తింటూ జీవనం సాగిస్తుంది.

బ్రూసెథోవా ఇస్రో యొక్క ఆవిష్కరణ లోతైన భారత సముద్రలలో ఉన్న అపారమైన జీవవైవిధ్యాన్ని హైలైట్ చేస్తుంది. ఇది లోతైన సముద్రం యొక్క నిరంతర అన్వేషణ యొక్క ప్రాముఖ్యతను కూడా హైలైట్ చేస్తుంది. ఈ కొత్త జాతి, ఐసోపాడ్‌ల గురించి మరియు సముద్ర ఆహార గొలుసులో వాటి పాత్రపై మనకు శాస్త్రీయ అవగాహన కల్పిస్తుంది.

ఆంగ్లంలోకి అనువదించబడిన మొదటి మగాహి నవలగా ఫూల్ బహదూర్

ఆంగ్లంలోకి అనువదించబడిన మొదటి మగాహి భాష నవలగా ఫూల్ బహదూర్ అరుదైన గుర్తింపును దక్కించుకుంది. ప్రముఖ భారతీయ కవి-దౌత్యవేత్త, సంపాదకుడు మరియు అనువాదకుడు అభయ్ కె దీనిని ఆంగ్లంలోకి అనువదించారు. 19-21 మార్చి 2024 వరకు జరిగిన దిబ్రూఘర్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ లిటరరీ ఫెస్టివల్ యందు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా దీనిని ఆవిష్కరించారు.

ఈ పుస్తకాన్ని పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ప్రచురించి. ఫూల్ బహదూర్ అనేది బీహార్‌లోని నలంద జిల్లాలోని బీహార్‌షరీఫ్ పట్టణ నేపథ్యంలో సాగే ఒక ఆహ్లాదకరమైన నవల. ఈ కథ ప్రతిష్టాత్మకమైన ముఖ్తార్ సామ్‌లాల్ చుట్టూ తిరుగుతుంది. ఇది ఒక నవాబ్, ఒక వేశ్య మరియు సర్కిల్ ఆఫీసర్ మధ్య సామరస్యపూర్వకమైన దోపిడీ సంబంధాలను అన్వేషిస్తుంది.

ఫూల్ బహదూర్ వాస్తవానికి 1928లో జయనాథ్ పతిచే వ్రాయబడింది. ఇది మొదటి మాగాహి నవల అయినప్పటికీ, ఇది మొదట్లో పాఠకుల మధ్య పెద్దగా ఆదరణ పొందలేకపోయింది. అయితే అభయ్ కె యొక్క ఆంగ్ల అనువాదం కారణంగా ఇది తిరిగి ఉనికిలోకి వచ్చింది. ది బుక్ ఆఫ్ బీహారీ లిటరేచర్ ఎడిట్ చేస్తున్నప్పుడు ఈ సాహిత్య రత్నాన్ని చూసినట్లు అభయ్ కె వెల్లడించారు.

  • పుస్తకం పేరు : ఫూల్ బహదూర్
  • ఒరిజినల్ (మాగాహి) : జయనాథ్ పతి (1928)
  • ఆంగ్ల అనువాదం : అభయ్ కె (2024)

మాగాహి లేదా మాగధి అనేది తూర్పు భారతదేశంలోని బీహార్, జార్ఖండ్ మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మరియు నేపాల్‌లోని తేరాయ్‌లో మాట్లాడే ఇండో-ఆర్యన్ భాష. ఇది బీహార్‌లోని సుమారు పదకొండు జిల్లాల పరిధిలో విస్తృతంగా వాడకంలో ఉంది. మగాహి భాష పురాతన మగధి ప్రాకృతం నుండి ఉద్భవించినట్లు చరిత్ర చెబుతుంది.

ఇది పురాతన మగధ రాజ్యంలో సృష్టించబడింది, దీని ప్రధాన భాగం గంగానదికి దక్షిణాన మరియు సోన్ నదికి తూర్పున ఉంది. మగాహిలో మాట్లాడే వారి సంఖ్య దాదాపు 12.6 మిలియన్లు ఉన్నప్పటికీ, భారతదేశంలో ఇది రాజ్యాంగపరంగా గుర్తించబడలేదు.

పీడబ్ల్యూడీ ఓటర్ అభ్యర్థనల కోసం సాక్షం యాప్ ప్రారంభించిన ఎన్నికల సంఘం

వికలాంగుల (పిడబ్ల్యుడి) ఓటరు గుర్తింపు మరియు నమోదు ప్రక్రియను సులభతరం చేయడానికి భారత ఎన్నికల సంఘం సాక్షం అనే కొత్త యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ దివ్యాంగుల కోసం ఓటింగ్ ప్రక్రియను సులభతరం చేయడం మరియు పోలింగ్ స్టేషన్‌లలో వారి అనుభవాన్ని మెరుగుపర్చడం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ యాప్ 40% బెంచ్‌మార్క్ వైకల్యం ఉన్న దివ్యాంగులు మరియు 85 ఏళ్లు పైబడిన ఓటర్లు ఇంటి నుండే ఓటు వేయడానికి కూడా అనుమతిస్తుంది. ఈ యాప్ దివ్యాంగులు ఓటు నమోదు చేసుకోవడానికి, వారి పోలింగ్ స్టేషన్‌ను కనుగొనడానికి మరియు ఓటు వేయడానికి అనేక ఫీచర్లను అందిస్తుంది.

  • వాయిస్ సహాయం: ఈ యాప్ దృష్టి లోపం ఉన్న దివ్యాంగుల కోసం వాయిస్ సహాయాన్ని అందిస్తుంది.
  • టెక్స్ట్-టు-స్పీచ్: ఈ యాప్ వినికిడి లోపం ఉన్న పిడబ్ల్యుడిల కోసం టెక్స్ట్-టు-స్పీచ్ అందిస్తుంది.
  • యాక్సెసిబిలిటీ ఫీచర్‌లు: యాప్‌లో పెద్ద ఫాంట్‌లు మరియు హై-కాంట్రాస్ట్ కలర్స్ వంటి అనేక యాక్సెసిబిలిటీ ఫీచర్‌లు ఉన్నాయి.
  • పోలింగ్ స్టేషన్ల సమాచారం: ఈ యాప్ పోలింగ్ స్టేషన్ ఉన్న ప్రదేశం, పోలింగ్ స్టేషన్‌లో అందుబాటులో ఉండే యాక్సెసిబిలిటీ ఫీచర్లు మరియు పోలింగ్ అధికారుల సంప్రదింపు వివరాలతో సహా పోలింగ్ స్టేషన్‌లకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది.
  • ఫిర్యాదులు: ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేటప్పుడు వారు ఎదుర్కొనే ఏవైనా సమస్యల గురించి ఫిర్యాదులను దాఖలు చేయడానికి ఈ యాప్ అనుమతిస్తుంది.

ఈ చొరవ ఎన్నికల ప్రక్రియలో దివ్యాంగులు చురుకుగా పాల్గొనేందుకు మరియు వారి వాణిని వినిపించేందుకు వారికి ప్రాప్యతను కల్పిస్తుంది. ఏ ఒక్క ఓటరు పోలింగ్ ప్రక్రియకు ఉండకూడదు అనే నినాదంతో ఎన్నికల సంఘం ప్రతిఒక్కరు యాక్సెస్ చేయగల ఓటింగ్‌పై దృష్టి సారిస్తుంది.

పోయెమ్ -3 యొక్క జీరో డెబ్రిస్ రీ-ఎంట్రీతో అరుదైన ఘనతను సాధించిన ఇస్రో

ఇస్రో పిఎస్ఎల్‌వి ఆర్బిటల్ ఎక్స్‌పెరిమెంటల్ మాడ్యూల్-3 (POEM-3)ని విజయవంతంగా తిరిగి భూమిపైకి చేరుకోవడం ద్వారా ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. ఈ మిషన్, మార్చి 21, 2024న పూర్తయింది, దీనితో అంతరిక్షంలో ఆచరణాత్మకంగా ఎటువంటి శిధిలాలను వదలకుండా బాధ్యతాయుతమైన అంతరిక్ష పరిశోధనలో ఒక పెద్ద ముందడుగును వెచింది.

పోయెమ్ -3 మాడ్యూల్, పిఎస్ఎల్‌వి-సి58 మిషన్ యందు భాగంగా జనవరి 1, 2024న అంతరిక్షంలోకి ప్రవేశించింది. ఈ ప్రయోగంలో పోయెమ్ 3 మొత్తం తొమ్మిది వేర్వేరు ప్రయోగాత్మక పేలోడ్‌లను అనరిక్షంలోకి తీసుకువెళ్లింది. తర్వాత కాలంలో అన్ని ఉపగ్రహాలను వాటి కావలసిన కక్ష్యలలోకి చొప్పించే ప్రాథమిక మిషన్‌ను ఇది పూర్తి చేసింది.

పోయెమ్-3 తిరిగి భూవాతావరణంలోకి తెచ్చేందుకు, ఇస్రో వ్యూహాత్మకంగా ఈ ప్లాట్‌ఫారమ్ యొక్క కక్ష్యను 650 కిలోమీటర్ల నుండి 350 కిలోమీటర్లకు తగ్గించింది, ఇది భూమి యొక్క వాతావరణంలోకి త్వరగా తిరిగి ప్రవేశించేలా చేసింది. అదనంగా, ఈ ప్రక్రియలో ప్రమాదవశాత్తూ బ్రేక్-అప్ ప్రమాదాలను తగ్గించడానికి అవశేష ప్రొపెల్లెంట్‌లను తొలగించి, నిష్క్రియం చేయబడింది.

పోయెమ్-3 యొక్క విజయం స్థిరమైన అంతరిక్ష అభ్యాసాల పట్ల ఇస్రో యొక్క నిబద్ధతను ప్రదర్శిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రయోగించబడుతున్న ఉపగ్రహాల సంఖ్య పెరుగుతున్నందున, అంతరిక్ష శిధిలాలు భవిష్యత్ మిషన్లకు గణనీయమైన ముప్పును కలిగిస్తాయి. ఇస్రో యొక్క ఈ వినూత్న విధానం బాధ్యతాయుతమైన అంతరిక్ష అన్వేషణకు మార్గం సుగమం చేస్తుంది.

స్వల్పకాలిక అంతరిక్ష ప్రయోగాలను నిర్వహించడానికి చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న ప్లాట్‌ఫారమ్‌గా పోయెమ్-3 పనిచేస్తుంది. తక్కువ ఖర్చుతో కూడిన కక్ష్య ప్రయోగ వేదికను అందించడంలో ఇస్రో తన నిబద్ధతను కొనసాగిస్తుంది.

మిచెల్ తలాగ్రాండ్‌కు 2024 అబెల్ బహుమతి ప్రదానం

మిచెల్ తలాగ్రాండ్ 2024 ఏడాదికి గాను ప్రతిష్టాత్మకమైన అబెల్ బహుమతిని అందుకున్నారు. విశ్వం యొక్క యాదృచ్ఛికతను వివరించడంలో మరియు అంచనా వేయడంలో ఆయన సాధించిన అభివృద్ధి కోసం ఈ అవార్డు అందించబడింది.

పారిస్‌లోని ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ సభ్యుడుగా ఉన్న తలగ్రాండ్, యాదృచ్ఛికత యొక్క సంక్లిష్టతలను పరిశోధించడానికి నాలుగు దశాబ్దాలుగా పరిశోధిస్తున్నారు. అతని పరిశోధన యాదృచ్ఛిక చరరాశుల క్రమాలను, యాదృచ్ఛిక ప్రక్రియల ప్రవర్తనను అర్థం చేసుకోవడం మరియు అంచనా వేయడంపై దృష్టి పెడుతుంది.

అబెల్ కమిటీ తలాగ్రాండ్‌ను "అత్యుత్తమ మరియు అత్యంత ఉత్పాదక గణిత శాస్త్రజ్ఞుడు" అని ప్రశంసించింది, అతని పరిశోధన ప్రాబబిలిటీ థియరీ, ఫంక్షనల్ అనాలిసిస్ మరియు స్టాటిస్టిక్ సిద్ధాంతాలను గణనీయంగా ప్రభావితం చేసింది. ఫైనాన్స్, కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ వంటి విభిన్న రంగాలను ఈయన పరిశోధన ప్రభావితం చేస్తుంది.

  • అబెల్ ప్రైజ్ అనేది విశిష్ట గణిత శాస్త్రజ్ఞులను గౌరవించే ప్రతిష్టాత్మక అవార్డు.
  • దీనిని నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్ అందిస్తుంది.
  • ఈ అవార్డును తరచుగా గణితంలో నోబెల్ బహుమతిగా భావిస్తారు.
  • దీనిని గణిత శాస్త్రజ్ఞుడు నీల్స్ హెన్రిక్ అబెల్ పుట్టిన 200వ వార్షికోత్సవం సందర్భంగా 2002లో స్థాపించారు.
  • ఈ అవార్డు 2002 నుండి నార్వేజియన్ ప్రభుత్వ సహాయంతో యేటా అందజేస్తున్నారు.

Post Comment