Advertisement
Daily Current affairs in Telugu : 17 డిసెంబర్ 2023 కరెంట్ అఫైర్స్
Telugu Current Affairs

Daily Current affairs in Telugu : 17 డిసెంబర్ 2023 కరెంట్ అఫైర్స్

Daily Current affairs in Telugu 17 December 2023. రోజువారీ జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి వివిధ పోటీ పరీక్షల కొరకు సిద్దమవుతున్న అభ్యర్థులకు ఇవి ఉపయోగపడతాయి.

ఐటీఎఫ్ ప్రపంచ ఛాంపియన్ అవార్డులు 2023

అరీనా సబాలెంకా మరియు నోవాక్ జొకోవిచ్‌లు 2023 ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీఎఫ్) ప్రపంచ ఛాంపియన్‌లుగా ఎంపికయ్యారు. వీరు ఇద్దరు, ఈ సీజన్‌లో జరిగిన నాలుగు గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్‌లలో కనీసం సెమీఫైనల్‌కు చేరుకున్న ఏకైక సింగిల్స్ ఆటగాళ్ళుగా నిలిచారు. జొకోవిచ్ రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ఏటీపీ ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానంలో నిలిచాడు. జొకోవిచ్ ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, మరియు యూఎస్. ఓపెన్‌లను గెలుచి పురుషుల ఆధిక్య గ్రాండ్ స్లామ్ (24) విజేతగా నిలిచాడు. అలానే వింబుల్డన్. యందు న్నరప్‌గా నిలిచాడు. ఇది అతనికి రికార్డు స్థాయిలో ఎనిమిదో ఐటీఎఫ్ ప్రపంచ ఛాంపియన్ అవార్డు.

సబలెంకా ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ రూపంలో తన మొదటి గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన తర్వాత, యూఎస్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది, ఫ్రెంచ్ ఓపెన్ మరియు వింబుల్డన్‌లలో సెమీఫైనల్‌కు చేరుకుంది. ఇది సబలెంకాకు మొదటి ఐటీఎఫ్ ప్రపంచ ఛాంపియన్ అవార్డు. సబలెంకా ఈ ఏడాది సెప్టెంబరులో డబ్ల్యుటిఎ ర్యాంకింగ్స్‌లో నంబర్. 1 స్థానానికి చేరుకుంది, ప్రస్తుతం రెండవ ర్యాంకులో ఉంది.

ఇతర ఐటీఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌లలో మహిళల డబుల్స్‌ నుండి స్టార్మ్ హంటర్ మరియు ఎలిస్ మెర్టెన్స్, పురుషుల డబుల్స్‌ నుండి రాజీవ్ రామ్ మరియు జో సాలిస్‌బరీ, మహిళల వీల్ చైర్ విభాగంలో డైడ్ డి గ్రూట్, పురుషుల వీల్ చైర్ విభాగంలో ఆల్ఫీ హెవెట్, క్వాడ్ వీల్ చైర్ విభాగంలో నీల్స్ వింక్ మరియు అలీనాలు విజేతలుగా నిలిచారు.

డబ్ల్యుటిఎ ప్లేయర్ మరియు కోచ్ అవార్డు విజేతలు

ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ (డబ్ల్యుటిఎ) 2023 ఏడాదికి సంబంధించి ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ మరియు కోచ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేతలను ప్రకటించింది. మహిళా టెన్నిస్ ప్రస్తుత ప్రపంచ నెంబర్ వన్ ఇగా స్వియాటెక్ వరుసగా రెండవ ఏడాది ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకుంది. దీనితో సెరెనా విలియమ్స్ తర్వాత బ్యాక్-టు-బ్యాక్ సీజన్లలో ఈ గౌరవం పొందిన మొదటి క్రీడాకారిణిగా ఈ పోలాండ్ ప్లేయర్ అవతరించింది. అయితే 2012 నుండి 2016 వరకు సెరెనా విలియమ్స్ వరుసగా ఆరుసార్లు ఈ ఘనత దక్కించుకుంది.

డబ్ల్యుటిఎ అవార్డులు ఒక సీజన్‌లో లేదా కెరీర్‌లో మహిళా క్రీడాకారులు మరియు కోచ్‌లు సాధించిన అత్యుత్తమ విజయాల కోసం అందించబడతాయి. మహిళల టెన్నిస్ అసోసియేషన్ అనేది మహిళల ప్రొఫెషనల్ టెన్నిస్ యొక్క ప్రధాన ఆర్గనైజింగ్ బాడీ. ఇది 1973లో స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం పీటర్స్‌బర్గ్ (ఫ్లోరిడా), దీని యూరోపియన్ ప్రధాన కార్యాలయం లండన్‌లో మరియు దీని ఆసియా-పసిఫిక్ ప్రధాన కార్యాలయం బీజింగ్‌లో ఉంది.

  • ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ : ఇగా స్వియాటెక్
  • డబుల్స్ టీమ్ ఆఫ్ ది ఇయర్ : స్టార్మ్ హంటర్ & ఎలిస్ మెర్టెన్స్
  • మోస్ట్ ఇంప్రూవ్డ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ :  జెంగ్ క్విన్వెన్
  • న్యూకమర్ ఆఫ్ ది ఇయర్: మిర్రా ఆండ్రీవా
  • కమ్‌బ్యాక్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్: ఎలీనా స్విటోలినా
  • కోచ్ ఆఫ్ ది ఇయర్: టోమాస్జ్ విక్టోరోవ్స్కీ
  • జెర్రీ డైమండ్ ఏసెస్ అవార్డు: జెస్సికా పెగులా
  • కరెన్ క్రాంట్జ్కే స్పోర్ట్స్‌మన్‌షిప్ అవార్డు & పీచీ కెల్‌మేయర్ ప్లేయర్ సర్వీస్ అవార్డు: ఒన్స్ జబీర్

భారతదేశ అగ్రగామి హాస్పిటల్‌గా ఆస్టర్ మెడ్‌సిటీ

ది వీక్-హన్సా రీసెర్చ్ 2023 ద్వారా కేరళలోని కొచ్చిలో ఉన్న ఆస్టర్ మెడ్‌సిటీ ఇటీవల 'ఉత్తమ మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్ ఎమర్జింగ్' విభాగంలో అగ్ర స్థానాన్నిదక్కించుకుంది. నాణ్యతతో కూడిన ఆరోగ్య సంరక్షణను అందించడంలో ఈ ఆసుపత్రి నిబద్ధతకు ఈ ప్రతిష్టాత్మక ర్యాంకింగ్ అందించబడింది. ఈ ఏడాది ఆల్ ఇండియా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ర్యాంకింగ్ సర్వే కూడా ఈ హాస్పిటల్ దేశవ్యాప్తంగా 4వ స్థానంలో నిలిచింది.

ఆస్టర్ మెడ్‌సిటీ 2015లో ప్రారంభించబడింది. ఇది ప్రారంభమైనప్పటి నుండి భారతీయ ఆరోగ్య సంరక్షణ పరిశ్రమలో రికార్డులు సృష్టిస్తోంది. ఇది క్లినికల్ ఎక్సలెన్స్ మరియు అత్యాధునిక సాంకేతికతకు ప్రసిద్ధి చెందింది. ఆస్టర్ మెడ్‌సిటీ ఈ ఏడాది దక్షిణ భారతదేశంలో 2వ స్థానంలో మరియు జాతీయ స్థాయిలో 4వ స్థానంలో నిలిచింది.

తెలంగాణలో ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటు బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

తెలంగాణలో సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటు బిల్లును పార్లమెంట్ ఉభయసభలు ఆమోదించాయి. దీని కోసం 2009 కేంద్రీయ విశ్వవిద్యాలయాల చట్టం సవరించడానికి కేంద్రీయ విశ్వవిద్యాలయాల (సవరణ, బిల్లు 2023ని డిసెంబర్ 13, 2023న రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లు ఇదివరకే 7 డిసెంబర్ 2023న లోక్‌సభలో ఆమోదం పొందింది. దీనితో ఇది దేశంలో మూడవ ట్రైబల్ యూనివర్శిటీగా అవతరించనుంది. ఇందిరా గాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్శిటీ (అమర్‌కంటక్) మరియు సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (విజయనగరం) ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.

దేశంలోని గిరిజన జనాభాకు ప్రధాన్యతతో కూడిన ఉన్నత విద్య మరియు పరిశోధన సౌకర్యాలను అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేస్తుంది. సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీలు గిరిజన విద్యపై దృష్టి పెట్టడమే కాకుండా, ఇతర కేంద్రీయ విశ్వవిద్యాలయాల మాదిరిగానే అన్ని విద్యా మరియు ఇతర కార్యకలాపాలను నిర్వహిస్తాయి. అలానే దేశంలోని గిరిజన కళలు, సంస్కృతి, ఆచారాలు మరియు సాంకేతికత పురోగతిలో బోధన మరియు పరిశోధన సౌకర్యాలను అందించడం ద్వారా అధునాతన జ్ఞానాన్ని కూడా ప్రోత్సహిస్తాయి.

సెంట్రల్ యూనివర్శిటీల (సవరణ) బిల్లు 2023 యొక్క ప్రకటన మరియు లక్ష్యాల ప్రకారం, సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ స్థాపన రాబోయే సంవత్సరాల్లో ప్రాంతీయ ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుంది. ఈ ప్రతిపాదిత సంస్థ, ఉన్నత విద్య యొక్క ప్రాప్యత మరియు నాణ్యతను పెంచుతుందని మరియు తెలంగాణ ప్రజలకు ఉన్నత విద్య మరియు పరిశోధన సౌకర్యాలను సులభతరం చేస్తుందని భావిస్తున్నారు.

కేంద్రీయ విశ్వవిద్యాలయాల చట్టం 2009, వివిధ రాష్ట్రాల్లో బోధన మరియు పరిశోధన కోసం విశ్వవిద్యాలయాలను స్థాపించడానికి మరియు విలీనం చేయడానికి రూపొందించబడింది. అయితే ఈ చట్టాన్ని ఎప్పటికప్పుడు మార్చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో 47 సెంట్రల్ యూనివర్సిటీలు, 23 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలు (ఐఐటీ), 21 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం), 31 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), 25 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), 7 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ (ఐఐఎస్ఈ)లు ఉన్నాయి.

సూరత్ విమానాశ్రయంకు అంతర్జాతీయ విమానాశ్రయ హోదా

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించిన కేంద్ర మంత్రివర్గం, సూరత్ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించే ప్రతిపాదనను డిసెంబర్ 15న ఆమోదించింది. దీనితో సూరత్ విమానాశ్రయం అంతర్జాతీయ ప్రయాణికులకు గేట్‌వేగా మారడమే కాకుండా అభివృద్ధి చెందుతున్న వజ్రాలు మరియు వస్త్ర పరిశ్రమల కోసం అతుకులు లేని ఎగుమతి-దిగుమతి కార్యకలాపాలను సులభతరం చేస్తుంది.

సూరత్ విమానాశ్రయం దక్షిణ గుజరాత్‌లోని మగ్దల్లాలో ఉంది. ఇది మొత్తం 770 ఎకరాల విస్తీర్ణంలో అహ్మదాబాద్ విమానాశ్రయం తర్వాత ఆ రాష్ట్రలో రెండవ రద్దీ విమానాశ్రయంగా సేవలు అందిస్తుంది. దీనిని ప్రభుత్వం 1970ల ప్రారంభంలో నిర్మించింది. దీని కొత్త విమానాశ్రయ టెర్మినల్ భవనాన్ని 27 ఫిబ్రవరి 2009న కేంద్ర పెట్రోలియం శాఖ మాజీ మంత్రి దిన్షా పటేల్ ప్రారంభించారు.

గుజరాత్‌లోని ప్రధాన పారిశ్రామిక మరియు వాణిజ్య కేంద్రమైన సూరత్‌కు ఇది ఒక ముఖ్యమైన పరిణామం. ఈ నిర్ణయం ఆ నగరం యొక్క ఆర్థిక వ్యవస్థ మరియు కనెక్టివిటీపై సానుకూల ప్రభావం చూపుతుంది. సూరత్ మరింత విదేశీ పెట్టుబడులు మరియు వాణిజ్యాన్ని ఆకర్షిస్తుంది, ఇది ఉపాధి అవకాశాలు మరియు ఆర్థిక వృద్ధికి దారి తీస్తుంది.

ఇథనాల్‌ తయారీలో చెరకు రసం వినియోగానికి ప్రభుత్వం ఆమోదం

ఇథనాల్ తయారీకి చెరకు రసాన్ని ఉపయోగించడంపై తాత్కాలిక నిషేధాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇథనాల్ ఉత్పత్తికి చెరకు రసాన్ని ఉపయోగించడంపై ఇటీవల విధించిన నిషేధాన్ని రద్దు చేస్తూ, ఆహార మంత్రిత్వ శాఖ ఈ తాజా ఉత్తర్వును జారీ చేసింది. సవరించిన ఈ ఆదేశం 2023-24 సరఫరా సంవత్సరంకు మాత్రమే వర్తిస్తుంది. దీని ద్వారా ఇథనాల్‌ను ఉత్పత్తి చేయడానికి చెరకు రసం మరియు బి-హెవీ మొలాసిస్ రెండింటినీ ఉపయోగించడానికి పరిశ్రమకు అనుమతి లభిస్తుంది.

అయితే ఈ ప్రయోజనం కోసం చక్కెర మళ్లింపును 17 లక్షల టన్నులకు పరిమితం చేసింది. ఇథనాల్ ఉత్పత్తి కోసం చెరుకు రసం వాడకాన్ని నిషేధించిన వారం తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఇథనాల్‌ ఉత్పత్తికి మరో 13-14 లక్షల టన్నుల చక్కెరను మళ్లించేందుకు పరిశ్రమల నుంచి డిమాండ్‌ రావడంతో, నెల లేదా రెండు నెలల్లో పరిస్థితిని సమీక్షిస్తామని వెల్లడించింది.

పభుత్వం ఇటీవలి జీ20 సమ్మిట్ సందర్భంగా, పెట్రోల్‌తో ఇథనాల్ కలపడాన్ని 20%కి పెంచడం అనే ముఖ్య లక్ష్యంతో ప్రభుత్వం గ్లోబల్ బయో ఫ్యూయల్స్ అలయన్స్ ప్రవేశపెట్టింది. 2025–26 నాటికి 20% ఇథనాల్ బ్లెండింగ్ రేటు లక్ష్యం సాదించేందుకు నిబద్ధతగా పనిచేస్తుంది. ఇది జాతీయ ఇంధన వినియోగంలో జీవ ఇంధన వినియోగాన్ని మరింత మెరుగుపరచాలనే దాని నిబద్ధతకు అనుగుణంగా ఉంది.

చెరకు ఇథనాల్ అనేది చెరకు రసం మరియు మొలాసిస్ యొక్క కిణ్వ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేయబడిన ఆల్కహాల్ ఆధారిత ఇంధనం. ఇది స్వచ్ఛమైన కార్బన్ జీవ ఇంధనం అయినందున, చెరకు ఇథనాల్ రవాణా రంగానికి ప్రముఖ పునరుత్పాదక ఇంధనంగా ఉద్భవించింది. ఇథనాల్ గ్యాసోలిన్‌కు ఆక్సిజన్‌ను జోడిస్తుంది. ఇది వాయు కాలుష్యం మరియు హానికరమైన టెయిల్‌పైప్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుంది. శిలాజ ఇంధనాలతో పోల్చినప్పుడు ఇథనాల్ గ్రీన్హౌస్ గ్యాస్ ఉద్గారాలను 90% వరకు తగ్గిస్తుంది.

చెరకు రసం బయోఇథనాల్ ఉత్పత్తికి అనువైన ముడిసరుకుగా ఉంది. దీనికి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతుంది. బ్రెజిల్ ప్రపంచంలోనే అతిపెద్ద చెరకు ఇథనాల్ ఉత్పత్తిదారుగా ఉంది.ఈ దేశం ఇథనాల్‌ను మోటారు ఇంధనంగా ఉపయోగించడంలో అగ్రగామిగా ఉంది. 2019లో బ్రెజిల్ తన గ్యాసోలిన్ అవసరాలలో 47% చెరకు ఇథనాల్‌తో భర్తీ చేసింది. 2019-20లో బ్రెజిలియన్ ఇథనాల్ ఉత్పత్తి 32.5 బిలియన్ లీటర్లకు చేరుకుంది.

Post Comment