Advertisement
తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 27 సెప్టెంబర్ 2023
Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 27 సెప్టెంబర్ 2023

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ 27, 2023. జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు తాజా సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్సీ, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, రైల్వే వంటి  వివిధ పోటీ పరీక్షల కోసం సిద్దమవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఇవి రూపొందించబడ్డాయి

25వ పుట్టినరోజును జరుపుకున్న గూగుల్

సెప్టెంబర్ 27, 2023న గూగుల్ తన 25వ పుట్టినరోజును జరుపుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గూగుల్ "G25gle"గా మారే ప్రత్యేక డూడుల్‌ను రూపొందించింది. గూగుల్‌ను 1998లో స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని ఇద్దరు పీహెచ్‌డీ విద్యార్థులు లారీ పేజ్ మరియు సెర్గీ బ్రిన్ స్థాపించారు. వారు వరల్డ్ వైడ్ వెబ్ కోసం మెరుగైన సెర్చ్ ఇంజన్‌ని అభివృద్ధి చేసే ప్రాజెక్ట్‌లో భాగంగా దీనిని రూపొందించారు. తర్వాత రోజుల్లో ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన శోధన ఇంజిన్‌గా మారింది.

నేడు, గూగుల్ ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీలలో ఒకటి. ఇది శోధన, ఇమెయిల్, క్లౌడ్ కంప్యూటింగ్ మరియు కృత్రిమ మేధస్సుతో సహా అనేక రకాల ఉత్పత్తులు మరియు సేవలను అందిస్తుంది. గత 25 ఏళ్లుగా గూగుల్ ప్రపంచ సమాచారాన్ని నిర్వహించడం, దానిని విశ్వవ్యాప్తంగా ప్రాప్యత కల్పించడం, అందరికి ఉపయోగకరంగా చేయడమే లక్ష్యంగా పనిచేసింది.

గూగుల్ యొక్క 25వ పుట్టినరోజు కంపెనీకి ఒక మైలురాయి. ప్రపంచాన్ని మార్చగల సాంకేతిక శక్తికి ఇది నిదర్శనం. వ్యక్తులు సమాచారాన్ని యాక్సెస్ చేయడం, ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వడం మరియు కొత్త విషయాలను నేర్చుకోవడాన్ని గూగుల్ సులభతరం చేసింది. ఇంటర్నెట్ మరియు డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో కూడా ఈ కంపెనీ ప్రధాన పాత్ర పోషించింది. ఈ తరానికి అపరిమితమైన సాధికారత కల్పించడంలో విజయం సాదించింది.

భారతదేశం నుండి 2024 ఆస్కార్ బరిలో మలయాళ చిత్రం '2018'

మలయాళ చిత్రం 2018: ఎవ్రీవన్ ఈజ్ ఏ హీరో 2024లో జరిగే 96వ అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీకి భారతదేశం యొక్క అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. ఈ చిత్రానికి జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వం వహించారు మరియు టోవినో థామస్, కుంచాకో బోబన్, ఆసిఫ్ అలీ, వినీత్ శ్రీనివాసన్, లాల్, అపర్ణ బాలమురళి, కలైయరసన్ మరియు నరైన్ నటించారు.

2018 అనేది 2018లో కేరళను అతలాకుతలం చేసిన వినాశకరమైన వరదల సమయంలో ఒకరికొకరు సహాయం చేసుకునేందుకు కలిసిన వ్యక్తుల సమూహం యొక్క కథను చెప్పే సర్వైవల్ డ్రామా. ఈ చిత్రం విమర్శనాత్మకంగా మరియు వాణిజ్యపరంగా విజయం సాధించింది. ఇది వివిధ చలన చిత్రోత్సవాలలో అనేక అవార్డులను కూడా గెలుచుకుంది. గురు (1997), అదామింటే మకాన్ అబు (2011), మరియు జల్లికట్టు (2019) తర్వాత మలయాళ చిత్రం ఆస్కార్‌కు భారతదేశ అధికారిక ఎంట్రీగా ఎంపిక కావడం ఇది నాలుగోసారి. అయితే వీటిలో ఏ ఒక్క సినిమా కూడా ఆస్కార్‌కు నామినేట్ కాలేదు.

ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎఫ్‌ఐ)కి చెందిన 16 మంది సభ్యుల కమిటీ ఈ చిత్రాన్ని ఎంపిక చేసింది. ఎఫ్‌ఎఫ్‌ఐ అనేది ఆస్కార్‌లకు భారతదేశం యొక్క అధికారిక ప్రవేశాన్ని ఎంపిక చేసే అధికారిక సంస్థ. ఎఫ్‌ఎఫ్‌ఐ ప్రెసిడెంట్ రవి కొట్టారకర ఒక ప్రకటనలో, ఈ చిత్రం యొక్క శక్తివంతమైన కథనం, దాని సాంకేతిక నైపుణ్యం, కథలో ఉన్నసార్వత్రిక సందేశం కమిటీని ఆకట్టుకుందని అన్నారు. తెలుగు నుండి బలగం వంటి సినిమాలు దరఖాస్తు చేసిన వాటికీ అవకాశం దక్కలేదు.

పిల్లలలో పఠనాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమం

రాజస్థాన్ ప్రభుత్వం అనేక కార్యక్రమాల ద్వారా ప్రారంభ గ్రేడ్ పఠనాన్ని ప్రోత్సహించేందుకు సిద్దమవుతుంది. దీని కోసం యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (USAID) మరియు రూమ్ టు రీడ్ ఇండియా, రాజస్థాన్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (SCERT)తో భాగస్వామ్యమై 27 పిల్లల కథల పుస్తకాలను ప్రచురించింది. వీటి ద్వారా పఠన నైపుణ్యాలను ప్రోత్సహిస్తుంది. పిల్లలలో చదివే అలవాటును పెంపొందించే ప్రయత్నం చేస్తుంది.

అండర్‌స్టాండింగ్ మరియు న్యూమరాసీ (నిపున్ భారత్ మిషన్)తో చదవడంలో నైపుణ్యంను పెంపొందిస్తుంది. ఈ మిషన్ భారతదేశంలోని పిల్లలందరూ గ్రేడ్ 3 చివరి నాటికి ఆ తరగతి స్థాయిలో చదవగలరని మరియు అర్థం చేసుకోగలరని నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది. సమర్థవంతమైన ప్రారంభ గ్రేడ్ పఠన సూచనలపై ఉపాధ్యాయులకు కూడా శిక్షణ అందించనుంది. ఈ శిక్షణలో ఫోనెమిక్ అవేర్‌నెస్, ఫోనిక్స్, ఫ్లూయెన్సీ, వోకాబులరీ మరియు కాంప్రహెన్షన్ వంటి అంశాలు ఉంటాయి.

వీటికి అదనంగా పాఠశాల యందు లైబ్రరీలను ఏర్పాటు చేయడం, విద్యార్థులకు పుస్తకాలు అందుబాటులో ఉంచడం, హోమ్ లైబ్రరీలను ప్రోత్సహించడం మరియు తల్లిదండ్రులు తమ పిల్లలతో ఇంట్లో చదివేలా చేయడం వంటి చొరవను కూడా అమలు చేయనుంది.

ఈ కార్యక్రమాలు రాజస్థాన్‌లో ప్రారంభ గ్రేడ్ పఠనంపై సానుకూల ప్రభావాన్ని చూపుతున్నాయి. రాజస్థాన్‌లోని 1-3 తరగతుల పిల్లలు ఇప్పుడు భారతదేశంలోని ఇతర రాష్ట్రాల పిల్లల కంటే మెరుగ్గా చదువుతున్నారని తాజా అధ్యయనం కనుగొంది.

మంగోలియాపై టి20ఐ రికార్డులను బద్దలు కొట్టిన నేపాల్

సెప్టెంబర్ 27, 2023న జరిగిన 2022 ఆసియా క్రీడలలో నేపాల్ జట్టు, మంగోలియాపై అత్యధిక టి20ఐ స్కోరు 314/3 స్కోర్ చేయడం ద్వారా చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ20ల్లో ఒక జట్టు చేసిన ఆల్ టైమ్ అత్యధిక స్కోరు ఇదే. 2019లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ చేసిన 278/3 స్కోరు ఇప్పటి వరకు అత్యధిక టి20 జట్టు స్కోరుగా ఉండేది.

దీనితో పాటుగా ఈ మ్యాచులో అనేక రికార్డులు నమోదు అయ్యాయి. నేపాల్ బ్యాటర్ దీపేంద్ర సింగ్ టి20ఐ క్రికెట్‌లో యువరాజ్ సింగ్ రికార్డును బద్దలు కొట్టి 9 బంతుల్లో అత్యంత వేగవంతమైన అర్ద సెంచరీ నమోదు చేసాడు. మరో నేపాల్ బ్యాటర్ కుశాల్ మల్లా కేవలం 34 బంతులతో అత్యంత వేగవంతమైన టి20 సెంచురీని నమోదు చేసాడు. దీనితో డేవిడ్ మిల్లర్ మరియు రోహిత్ శర్మల ఉమ్మడి మునుపటి రికార్డు (35 బంతులు)ను అధిగమించాడు.

మంగోలియాపై నేపాల్ విజయం కూడా రికార్డ్ బద్దలు కొట్టింది, ఎందుకంటే ఇది టి20ఐ మ్యాచ్‌లో అతిపెద్ద విజయం. 2019లో టర్కీపై చెక్ రిపబ్లిక్ నెలకొల్పిన 257 పరుగుల రికార్డును నేపాల్ 273 పరుగుల తేడాతో అధిగమించింది. నేపాల్ జట్టు ఈ రికార్డులు బద్దలు కొట్టడం ఆ దేశంలో క్రికెట్ పటిష్టతకు నిదర్శనం. ఇటీవలి సంవత్సరాలలో నేపాల్ తన క్రికెట్‌ను క్రమంగా మేరుపర్చుకుంటుంది. ఐసీసీ టీ20ఐ ర్యాంకింగ్స్‌లో నేపాల్ ఇప్పుడు 16వ ర్యాంక్‌లో ఉంది.

ఉత్తరప్రదేశ్‌లో శక్తి దీదీ పేరుతొ మహిళా బీట్ పోలీస్ ఆఫీసర్లు

ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మహిళా బీట్ పోలీస్ ఆఫీసర్లను శక్తి దీదీగా నామకర్ణం చేసింది. ఈ పేరు మార్పు అనేది మహిళలకు సాధికారత కల్పించడానికి మరియు రాష్ట్రంలో వారికి సురక్షితమైన అనుభూతిని కలిగించే విస్తృతమైన చొరవలో భాగం.

శక్తి దీదీలు తమకు కేటాయించిన బీట్‌లను పెట్రోలింగ్ చేయడం, మహిళలు మరియు బాలికల సమస్యలను అర్థం చేసుకోవవడం, వారికి సహాయం చేయడం వంటి అంశాలకు బాధ్యత వహిస్తారు. మహిళల భద్రతపై అవగాహన పెంచేందుకు, నేరాలను నివేదించేలా మహిళలను ప్రోత్సహించేందుకు కూడా వారు కృషి చేస్తారు.

దీని కోసం యుపి ప్రభుత్వం "శక్తి" అనే మొబైల్ యాప్‌ను కూడా ప్రారంభించింది, ఇది మహిళలు నేరాలను నివేదించడానికి మరియు శక్తి దీదీల నుండి సహాయం కోరడానికి అనుమతిస్తుంది. ఈ యాప్ మహిళల భద్రత మరియు రాష్ట్రంలోని మహిళలకు అందుబాటులో ఉన్న వనరుల గురించి సమాచారాన్ని అందిస్తుంది.

అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో లియాండర్ పేస్

లియాండర్ పేస్ అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌కు నామినేట్ చేయబడిన మొదటి ఆసియా ఆటగాడిగా అవతరించాడు. టెన్నిస్ చరిత్రలో అత్యంత విజయవంతమైన డబుల్స్ ఆటగాళ్లలో పేస్ ఒకరు. అతను 18 గ్రాండ్ స్లామ్ డబుల్స్ టైటిల్స్ మరియు 10 గ్రాండ్ స్లామ్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిళ్లను గెలుచుకున్నాడు. అతను 1996 సమ్మర్ ఒలింపిక్స్‌లో పురుషుల డబుల్స్‌లో కాంస్య పతకాన్ని కూడా గెలుచుకున్నాడు. ఈయన టెన్నిస్‌లో ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న ఏకైక భారతీయుడుగా కూడా గుర్తింపు పొందాడు.

అయితే 2024 తరగతికి ప్రకటించిన ఆరుగురు నామినీలలో లియాండర్ పేస్‌తో పాటుగా అనా ఇవనోవిక్, కార్లోస్ మోయా, ఫ్లావియా పెన్నెట్టా, కారా బ్లాక్ మరియు డేనియల్ నెస్టర్‌లు ఉన్నారు. అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు సంపాదించేందుకు పేస్‌ వీరితో పోటీ పడాల్సి ఉంటుంది.

ఇకపోతే 2019లో అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌కు నామినేట్ చేయబడిన మొదటి ఆసియా క్రీడాకారిణిగా చైనీస్ ఏస్ లీ నా ఈ రికార్డు కలిగి ఉన్నారు. ఈమె చైనా నుండి ఆస్ట్రేలియన్ ఓపెన్ మరియు ఫ్రెంచ్ ఓపెన్‌లలో మహిళల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్నారు. ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ అనేది టెన్నిస్ చరిత్రను సంరక్షిస్తుంది. క్రీడాకారులను ప్రోత్సహిస్తుంది. అలానే అత్యుత్తమ క్రీడాకారులకు యేటా ఈ ఫేమ్‌పై చోటు కల్పిస్తుంది. ఇది ఒక అరుదైన గౌరవం.

కల్పక్కంలోని శక్తి - 2023 పేరుతో మెగా జాతీయ కార్యక్రమం

భారత ప్రభుత్వం సెప్టెంబర్ 26, 2023న తమిళనాడులోని కల్పక్కంలో ఉన్న ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ యందు శక్తి 2023 అనే మెగా జాతీయ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని ఇండియన్ సొసైటీ ఆఫ్ హీటింగ్, రిఫ్రిజిరేటింగ్ & ఎయిర్ కండిషనింగ్ ఇంజనీర్లు, ఇండియన్ ఉమెన్ సైంటిస్ట్స్ అసోసియేషన్ సహకారంతో నిర్వహించబడింది.

ఈ ఈవెంట్ "సాంకేతిక పురోగతి మరియు సామాజిక ఉద్ధరణలో మహిళలు" అనే థీమ్‌తో జరిగింది. ఈ కార్యక్రమానికి భారతదేశం నలుమూలల నుండి మహిళా శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు మరియు పారిశ్రామికవేత్తలతో సహా 300 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సైన్స్ అండ్ టెక్నాలజీలో మహిళల పాత్ర, కార్యాలయంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు, సామాజిక అభ్యున్నతికి మహిళలు దోహదపడే మార్గాలు వంటి అంశాలపై పలు కీలకోపన్యాసాలు, ప్లీనరీ చర్చలు, చర్చాగోష్ఠులు నిర్వహించారు.

శక్తి 2023 ఈవెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు సామాజిక అభ్యున్నతిలో మహిళల పాత్రను ప్రోత్సహించడంలో విజయవంతమైంది. ఈ కార్యక్రమం మహిళా శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు మరియు పారిశ్రామికవేత్తలు తమ అనుభవాలను మరియు ఆలోచనలను పంచుకోవడానికి ఒక వేదికను అందించింది. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో వృత్తిని కొనసాగించడానికి యువతులను ప్రేరేపించింది.

Post Comment