Advertisement
తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 16 జనవరి 2024
January Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 16 జనవరి 2024

January 16, 2024 Current affairs in Telugu. రోజువారీ జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో పొందండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షల కొరకు సిద్దమవుతున్న ఆశావహుల కోసం వీటిని అందిస్తున్నాం.

సదరన్ నేవల్ కమాండ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఉపల్ కుందు

రియర్ అడ్మిరల్ ఉపల్ కుందు సదరన్ నేవల్ కమాండ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ నావెల్ అకాడమీ పూర్వ విద్యార్థి అయిన ఈయన, 1991లో ఇండియన్ నేవీలో కెరీర్ ప్రారంభించారు. ఫ్లాగ్ ఆఫీసర్, యాంటీ-సబ్‌మెరైన్ వార్‌ఫేర్ స్పెషలిస్ట్ అయిన ఈయన, ఐఎన్ఎస్ త్రికాండ్, ఐఎన్ఎస్ కుతార్, ఐఎన్ఎస్ అక్షయ్, ఐఎన్ఎస్ తానాజీ మరియు ఐఎన్ఎస్ కదంబలో కమాండ్‌గా పనిచేశారు.

సదరన్ నేవల్ కమాండ్ భారత నౌకాదళం యొక్క మూడు కమాండ్-స్థాయి నిర్మాణాలలో ఒకటి. దీని ప్రధాన కార్యాలయం కేరళలోని కొచ్చిలో ఐఎన్ఎస్ వెందురుతిలో ఉంది. ఇది ఇండియన్ నేవీకి చెందిన శిక్షణా కమాండ్ . దీనికి వైస్-అడ్మిరల్ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తారు. భారత నౌకాదళం యొక్క ప్రధాన స్థావరాలు ముంబై, గోవా, కార్వార్, కొచ్చి, చెన్నై, విశాఖపట్నం, కోల్‌కతా మరియు పోర్ట్ బ్లెయిర్‌లో ఉన్నాయి.

ఐఎన్ఎస్ చీతా, గుల్దార్ & కుంభీర్ ఇండియన్ నేవీ నుండి ఉపసంహరణ

భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ చీతా, గుల్దార్ మరియు కుంభీర్ నౌకలు నాలుగు దశాబ్దాల సేవల తర్వాత జనవరి 12న ఉపసంహరించబడ్డాయి. ఈ డికమిషన్ కార్యక్రమం పోర్ట్ బ్లెయిర్‌లో సంప్రదాయ వేడుకగా నిర్వహించబడింది. ఈ మూడు నౌకలకు చెందిన నావల్ ఎన్‌సైన్ మరియు డీకమిషనింగ్ పెన్నెంట్‌లను చివరిసారిగా సూర్యాస్తమయం సమయంలో కిందకు దించారు.

ఐఎన్ఎస్ చీతా, గుల్దార్ మరియు కుంభీర్‌లను పోలాండ్‌లోని గ్డినియా షిప్‌యార్డ్‌లో పోల్నోక్నీ క్లాస్ ల్యాండింగ్ షిప్‌లుగా నిర్మించారు. ఇవి వరుసగా 1984, 1985 మరియు 1986లో భారత నౌకాదళంలోకి ప్రవేశింపబడ్డాయి. ఐఎన్ఎస్ చీతా కొద్దికాలం పాటు కొచ్చి మరియు చెన్నైలో సేవలు అందించింది. ఐఎన్ఎస్ కుంభీర్ మరియు గుల్దార్ విశాఖపట్నంలో సేవలు అందించాయి. తర్వాత కాలంలో ఈ మూడు నౌకలు తిరిగి అండమాన్ మరియు నికోబార్ కమాండ్‌కు కేటాయించబడ్డాయి. చివరి డీకమిషనింగ్ వరకు ఇవి అక్కడే సర్వీస్ అందించాయి.

ఈ మూడు నౌకలు దాదాపు 40 సంవత్సరాల పాటు చురుకైన నావికాదళ సేవలో ఉన్నాయి. దాదాపు 12,300 రోజులకు పైగా సముద్రంలో ఉన్నాయి, మూడు కలిసి 17 లక్షల నాటికల్ మైళ్లు ప్రయాణించాయి. ఇవి అండమాన్ మరియు నికోబార్ కమాండ్ యొక్క ఉభయచర ప్లాట్‌ఫారమ్‌లుగా, ఆర్మీ దళాలను ఒడ్డుకు దింపడానికి 1300 పైగా బీచింగ్ కార్యకలాపాలను నిర్వహించాయి.

ఈ నౌకలు అనేక సముద్ర భద్రతా మిషన్లు మరియు మానవతా సహాయం మరియు విపత్తు సహాయ కార్యకలాపాలలో పాల్గొన్నాయి. భారత మరియు శ్రీలంక సరిహద్దుల గుండా ఆయుధాలు మరియు అక్రమ వలసలను నియంత్రించడానికి మే 1990లో ఇండియన్ నేవీ మరియు ఇండియన్ కోస్ట్ గార్డ్‌ల మధ్య జరిగిన ఒక సంయుక్త ఆపరేషన్ ఆపరేషన్ అమన్‌లో ఇవి కీలక భూమిక పోషించాయి.

1997 తుఫాను, 2004 హిందూ మహాసముద్ర సునామీ తర్వాత శ్రీలంక సహాయక చర్యల్లో ఇవి సహకారం అందించాయి. ఒకే రోజులో ఒకే తరగతికి చెందిన మూడు యుద్ధనౌకలు ఏకకాలంలో తొలగించబడినందున ఈ ఈవెంట్ ప్రత్యేకంగా నిర్వహించారు.

నిరుద్యోగ యువత కోసం యువ నిధి పథకం ప్రారంభం

కర్ణాటక ప్రభుత్వం,  రాష్ట్రంలోని విద్యావంతులైన నిరుద్యోగ యువత కోసం కాంగ్రెస్ ఐదవ ఎన్నికల హామీ అయిన యువ నిధి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని జనవరి 12, 2024న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రారంభించారు. ఈ పథకం కింద నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు నెలవారీ రూ . 3,000 స్టైఫండ్‌ని అందజేస్తారు. ఈ పథకం 2022-23 విద్యా సంవత్సరంలో డిగ్రీలు పొందిన గ్రాడ్యుయేట్లు మరియు డిప్లొమా హోల్డర్‌లకు వర్తిస్తుంది.

యువ నిధి పథకం కోసం నమోదు ప్రక్రియ ఆన్‌లైన్‌ ద్వారా స్వీకరిస్తున్నారు. కర్ణాటక నైపుణ్యాభివృద్ధి, ఉపాధి మరియు వ్యవస్థాపకత శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో లబ్ధిదారులు తమను తాము నమోదు చేసుకోవచ్చు. అలానే ప్రభుత్వం స్కిల్ కనెక్ట్ పోర్టల్ ద్వారా లబ్ధిదారులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణను కూడా అందిస్తుంది. ఇది వారి ఉపాధి నైపుణ్యాలను మెరుగుపరిచి, తద్వారా ఉద్యోగ అవకాశాలు పొందేందుకు అవకాశం కల్పిస్తుంది. కర్ణాటక ప్రభుత్వం అమలు చేస్తున్న 5 గ్యారెంటీ పథకాల వివరాలు

  • గృహ జ్యోతి పథకం: ఈ పథకం ద్వారా జూలై 1 నుంచి ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు ఈ పథకానికి అర్హులు.
  • గృహ లక్ష్మి పథకం: ఈ పథకం ద్వారా ఆగస్టు 5 నుండి ప్రతి నెల మహిళలకు ₹ 2,000 ఆర్థిక సాయం అందిస్తున్నారు. బీపిఎల్ ఇతర ఆర్థికంగా బలహీన కుటుంబాలకు చెందిన మహిళలు దీనికి అర్హులు. ఇదే పథకం కింద మహిళకు ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పిస్తున్నారు.
  • యువ నిధి పథకం: ఈ పథకం ద్వారా 2024 జనవరి 12 నుండి కర్ణాటకలోని నిరుద్యోగ గ్రాడ్యుయేట్‌లకు నెలకు ₹ 3,000 భత్యం అందజేస్తున్నారు. ఈ పథకం ద్వారా నిరుద్యోగ డిప్లొమా హోల్డర్లు నెలకు ₹ 1,500 అందిస్తున్నారు.
  • అన్న భాగ్య పథకం: ఈ పథకం కింద బీపీఎల్ కుటుంబాలకు జూలై 1 నుంచి 10 కిలోల బియ్యం ఉచితంగా అందజేయనున్నారు.
  • శక్తి పథకం: ఈ పథకం కింద 2023 జూన్ 11 నుంచి మహిళలకు రాష్ట్రంలో ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు.

తైవాన్ కొత్త అధ్యక్షుడుగా విలియం లై ఎన్నికయ్యారు

జనవరి 13, 2024న తైవాన్ కొత్త అధ్యక్షుడిగా విలియం లై చింగ్-టే ఎన్నికయ్యారు. డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న విలియం లై, 40 శాతం ఓట్లను సాధించి, వరుసగా మూడోసారి అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. తైవాన్ మరియు చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఈ ఎన్నికలు జరిగాయి, ఓటింగ్‌కు కొన్ని నెలల ముందు తైవాన్ ప్రభుత్వంపై  చైనా సైనిక వ్యాయామాలు మరియు దౌత్యపరమైన ఒత్తిడిని పెంచుతూ వచ్చింది.

అయితే తాజా ఎన్నికల ఫలితాల సరళిని చూస్తే తైవాన్ యొక్క స్వాతంత్ర అనుకూల ఉద్యమానికి ఊతంగా భావించవచ్చు, అయితే ఇది చైనా సమస్యపై తైవాన్ సమాజంలోని విభజనలను కూడా హైలైట్ చేస్తుంది. ఇకపోతే అధ్యక్షుడిగా గెలిచిన విలియం లై ముందు చైనాతో సంక్లిష్ట సంబంధాన్ని నావిగేట్ చేయడం, తైవాన్ యొక్క అంతర్జాతీయ పొత్తులను బలోపేతం చేయడం మరియు ఆర్థిక అసమానత వంటి దేశీయ సమస్యలను పరిష్కరించడం వంటి సమస్యలు ఉన్నాయి.

తైవాన్‌ను అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ చైనాగా పిలుస్తారు. ఇది తూర్పు ఆసియాలోని ఒక చిన్న దేశం. ఇది వాయువ్య పసిఫిక్ మహాసముద్రంలో తూర్పు మరియు దక్షిణ చైనా సముద్రాల జంక్షన్ నడుమ ఉంది. దీని వాయువ్య దిశలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, ఈశాన్య దిశలో జపాన్ మరియు దక్షిణాన ఫిలిప్పీన్స్ దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి.

  • దేశం : తైవాన్‌
  • రాజధాని నగరం : తైపీ సిటీ
  • కరెన్సీ : న్యూ తైవాన్ డాలర్
  • అధికారిక భాష : చైనీస్
  • అధ్యక్షుడు : విలియం లై

దావోస్‌లో నాల్గవ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం

ఉక్రెయిన్‌లో శాశ్వత శాంతి కోసం జాతీయ భద్రతా సలహాదారుల నాల్గవ సమావేశం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జనవరి 14, 2024న నిర్వహించారు. ఈ సమావేశానికి స్విట్జర్లాండ్ మధ్యవర్తిగా హోస్ట్‌గా వ్యవహరించడంతో పాటుగా, ఉక్రెయిన్‌లో 2026 వరకు మానవతా సహాయం కోసం మిలియన్ల కొద్దీ స్విస్ ఫ్రాంక్‌లను అందజేసింది. ఈ సమావేశం వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సహకారంతో నిర్వహించారు.

ఈ అత్యున్నత స్థాయి సమావేశం ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంఘర్షణకు ముగింపు పలకడం మరియు ఆ దేశంలో శాశ్వత శాంతిని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి 83 దేశాలు మరియు అంతర్జాతీయ సంస్థల జాతీయ భద్రతా సలహాదారులు హాజరయ్యారు.

ఈ సమావేశంలో పాల్గొన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ, రష్యాతో శత్రుత్వానికి ముగింపు పలకాలని కోరారు. ఆయన ఈ సంధర్బంగా ప్రవేశపెట్టిన 10-పాయింట్ల శాంతి ప్రణాళికలో ఉక్రెయిన్ నుండి రష్యా దళాల ఉపసంహరణ, ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు విడుదల, ఆహారం భద్రత, ఇంధన భద్రత, అణు భద్రత, పర్యావరణ పరిరక్షణ మరియు ఇప్పటి వరకు రష్యా పాల్పడిన నేరాలకు న్యాయం వంటి అంశాలు జాబితా చేయబడ్డాయి.

ఈ సమావేశంలో అధికారిక ఒప్పందాలు ఏవీ రానప్పటికీ, ఉక్రెయిన్ సార్వభౌమాధికారం మరియు ప్రాదేశిక సమగ్రతకు మద్దతు ఇవ్వడానికి అంతర్జాతీయ సమాజం యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించడానికి ఉపయోగపడింది. ఈ సమావేశంలో పాల్గొనేవారు ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితిపై అభిప్రాయాలను మార్పిడి చేసుకున్నారు.

దావోస్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఒక ముఖ్యమైన దౌత్య ప్రయత్నాన్ని సూచిస్తుంది. ఇది వివిధ దేశాలు మరియు దృక్కోణాల నుండి కీలకమైన వాటాదారులను ఒకచోట చేర్చింది, సంభాషణ మరియు అవగాహన కోసం ఒక వేదికను అందించింది.

మార్చి 15లోపు సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని భారత్‌ను కోరిన మాల్దీవులు

మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు, మార్చి 15, 2024లోగా భారత సైన్యాన్ని తమ భూభాగం నుండి ఉపసంహరించుకోవాలని అభ్యర్థించారు. మాల్దీవుల రాజధాని మాలేలో మాల్దీవులు మరియు భారతీయ అధికారుల మధ్య జరిగిన ఒక సమావేశంలో ఈ అభ్యర్థన చేయబడింది. ఈ అభ్యర్థనకు అధికారిక కారణం ఏదీ ఇవ్వబడనప్పటికీ, మాల్దీవుల సార్వభౌమత్వాన్ని నొక్కిచెప్పడానికి ముయిజ్జు చేస్తున్న ప్రయత్నంలో ఇవి భాగమని నమ్ముతున్నారు.

ఇటీవలే ఇరు దేశాల మధ్య పర్యాటకంగా చోటుచేసుకున్న వివాదాస్పద అంశాలు కూడా దీనికి కారణం అయ్యుండొచ్చు. 2023లో మాల్దీవుల అధ్యక్షుడుగా మొహమ్మద్ ముయిజ్జు ఎన్నికైన తర్వాత. ఆ దేశం భారతదేశంపై ఆధారపడటాన్ని తగ్గించి, దాని విదేశీ సంబంధాలను వైవిధ్యపరిచే విధానాలను అమలు చేస్తుంది. ఇందులో భాగంగానే మొహమ్మద్ ముయిజ్జు ఈ ఏడాది రెండవ వారంలో చైనాలో పర్యటించారు.

భారతదేశం మరియు మాల్దీవులు శతాబ్దాలుగా సన్నిహిత చారిత్రక మరియు సాంస్కృతిక సంబంధాలను కలిగి ఉన్నాయి. వాణిజ్యం, పర్యాటకం మరియు భద్రతా సహాయం కోసం మాల్దీవులు భారత్‌పై ఎక్కువగా ఆధారపడుతుంది. 1988లో భద్రతా భాగస్వామ్యాన్ని పటిష్టం చేస్తూ మాల్దీవుల వేర్పాటువాదుల తిరుగుబాటు ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి అప్పటి అధ్యక్షుడు గయూమ్ అభ్యర్థన మేరకు భారతదేశం సైనిక జోక్యం చేసుకుంది.

మాల్దీవుల ప్రభుత్వ అభ్యర్థన మేరకు భారతదేశం చాలా సంవత్సరాలుగా మాల్దీవులలో ఒక చిన్న సైనిక బృందాన్ని కొనసాగిస్తుంది. తాజా ప్రభుత్వ లెక్కల ప్రకారం, ప్రస్తుతం మాల్దీవులలో 88 మంది భారతీయ సైనిక సిబ్బంది సేవల్లో ఉన్నారు. వీరికి ప్రధానంగా భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు సముద్ర భద్రత మరియు విపత్తు సహాయక చర్యలలో సహాయం అందిస్తున్నారు.

మాల్దీవులు పైరసీ, తీవ్రవాదం మరియు ప్రకృతి వైపరీత్యాలు వంటి అనేక భద్రతా బెదిరింపులను ఎదుర్కొంటోంది. భారతదేశం తన సైనిక శక్తితో, సముద్ర భద్రత, శిక్షణ మరియు సామగ్రిలో మాల్దీవులకు సహాయం చేస్తుంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌకలు క్రమం తప్పకుండా మాల్దీవియన్ ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్‌లో పెట్రోలింగ్ నిర్వహిస్తాయి, పైరసీ మరియు అక్రమ చేపల వేటను ఇవి చాలా వరకు అరికట్టాయి. అలానే భారత సైనిక సిబ్బంది మాల్దీవుల భద్రతా దళాలకు శిక్షణ కూడా అందిస్తున్నారు.

ఇరు దేశాల మధ్య ఈ చారిత్రాత్మక భాగస్వామ్యం ఉన్నప్పటికీ, కొంతమంది మాల్దీవుల పౌరులు మరియు రాజకీయ నాయకులు భారత సైనిక ఉనికి గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, వారు తమ జాతీయ సార్వభౌమత్వానికి ముప్పుగా భావిస్తున్నారు. ఇది "ఇండియా అవుట్" ప్రచారానికి దారితీసింది, భారత దళాలను ఉపసంహరించుకోవాలని కోరుకుంటుంది.

ప్రెసిడెంట్ ముయిజ్జు ఆధ్వర్యంలోని ప్రస్తుత మాల్దీవుల ప్రభుత్వం భద్రతకు సంబంధించిన 100 ఒప్పందాలను సమీక్షిస్తూ భారతదేశం పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించింది. మార్చి 15, 2024లోగా భారత సైన్యాన్ని ఉపసంహరించుకోవాలన్న అభ్యర్థన కూడా ఇందులో ఉంది.

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశం 2024

2024 వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశం, జనవరి 15 నుండి 19 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో నిర్వహించబడింది. ఈ సమావేశాలు "రీబిల్డింగ్ ట్రస్ట్" అనే థీమ్‌తో జరిగాయి. ఈ వార్షిక సమావేశంకు 100 దేశాల ప్రభుత్వాలు, అన్ని ప్రధాన అంతర్జాతీయ సంస్థలు, 1000 మంది ఫోరమ్ భాగస్వాములు, అలాగే పౌర సమాజ నాయకులు, నిపుణులు హాజరయ్యారు.

2024 వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశం ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) ప్రతికూలతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి మరియు శక్తి, శాంతి మరియు భద్రత వంటి నాలుగు థీమ్‌లపై చర్చలు నిర్వహించింది. ఇటీవలే విడుదల అయినా వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ యొక్క గ్లోబల్ రిస్క్‌ల నివేదిక 2024 ప్రకారం వచ్చే దశాబ్దంలో అత్యంత ముప్పుగా పరిగణించే సైబర్‌ సెక్యూరిటీ అంశంపై కూడా చర్చలు చోటు చేసుకున్నాయి.

ఈ సమావేశాలకు భారతదేశం నుండి కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, స్మృతి ఇరానీ మరియు హర్దీప్ సింగ్ పూరీలతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వంటి వారు హాజరయ్యారు. అలానే ప్రముఖ భారత వ్యాపారాలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

  • ఉక్రెయిన్‌లో యుద్ధంతో సహా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలను పరిష్కరించడం, వాతావరణ మార్పులు వంటి ప్రపంచ సవాళ్లపై అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించే ప్రయత్నం చేసింది.
  • పెరుగుతున్న ఆటోమేషన్ మరియు మారుతున్న పని స్వభావం మధ్య, స్థిరమైన ఆర్థిక వృద్ధికి కొత్త మార్గాలను అన్వేషించాలని కోరింది.
  • ప్రపంచ నాయకులపై విశ్వాసం క్షీణించడాన్ని సమావేశం గుర్తించింది. ప్రజల విశ్వాసాన్ని పునర్నిర్మించడానికి పారదర్శకత, జవాబుదారీతనం మరియు సహకారం యొక్క అవసరాన్ని నొక్కి చెప్పింది.
  • పునరుత్పాదక శక్తికి పరివర్తనను వేగవంతం చేయడం, జీవవైవిధ్యాన్ని రక్షించడం మరియు వాతావరణ మార్పుల ప్రభావాలకు అనుగుణంగా మారడంపై దృష్టి సారించింది.
  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు బ్లాక్‌చెయిన్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల సంభావ్యత మరియు సవాళ్లును గుర్తు చేసింది, వాటిని ఉపయోగించడం మరియు వాటి నష్టాలను తగ్గించడంపై దృష్టి సారించాలని కోరింది.
  • గ్లోబల్ రిస్క్‌ల నివేదిక 2024 చెప్పినట్లుగా వాతావరణ చర్య వైఫల్యం, విపరీత వాతావరణ సంఘటనలు మరియు జీవనోపాధి సంక్షోభాలను రాబోయే దశాబ్దంలో మొదటి మూడు ప్రపంచ ప్రమాదాలుగా గుర్తించింది.
  • ఈ సమావేశాల్లో గ్లోబల్ కోఆపరేషన్ బేరోమీటర్ 2024 ప్రారంభించబడింది. ఇది ఆర్థిక, సాంకేతిక, పర్యావరణ, ఆరోగ్యం మరియు భద్రతా డొమైన్‌లలో ప్రపంచ సహకారం యొక్క స్థితిని కొలుస్తుంది.
  • సంఘర్షణ ప్రాంతాలలో పిల్లల అవసరాలను తీర్చడానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ మరియు యూనిసెఫ్ మధ్య కొత్త భాగస్వామ్యంతో సహా అనేక ప్రధాన ప్రకటనలు చేయబడ్డాయి.

మొత్తంమీద, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశం 2024 ప్రపంచంలోని అత్యంత తీవ్రమైన సవాళ్లపై కీలక చర్చలకు వేదికను అందించింది. ప్రపంచ సమస్యలకు సంబంధించి ఈ సమావేశాల్లో సులభమైన పరిష్కారాలు ఏవీ కనుగొనబడనప్పటికీ, అందరికీ మంచి భవిష్యత్తును నిర్మించడానికి సమిష్టి చర్య యొక్క అవసరాన్ని ఈ సమావేశం హైలైట్ చేసింది.

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అనేది ప్రభుత్వ-ప్రైవేట్ రంగ సహకారం కోసం ఏర్పాటు చేయబడ్డ అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థ. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉంది. దీనిని 24 జనవరి 1971లో జర్మన్ ఇంజనీర్ క్లాస్ స్క్వాబ్ స్థాపించారు. ఇది మొదట యూరోపియన్ మేనేజ్‌మెంట్ ఫోరమ్ పేరుతొ ఏర్పాటు చేయబడింది.

1987లో దీని పేరును వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌గా మార్పు చేసారు. ఇది 1,000 కిపైగా బహుళ-జాతీయ సంస్థల నిధుల సహాయంతో సేవలు అందిస్తుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశం యేటా దావోస్‌లో జనవరి చివరి వారంలో నిర్వహిస్తారు. ప్రస్తుతం దీని అధ్యక్షుడుగా నార్వేజియన్ రాజకీయవేత్త మరియు దౌత్యవేత్త బోర్జ్ బ్రెండే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Post Comment