Advertisement
తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 15 జనవరి 2024
January Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 15 జనవరి 2024

January 15, 2024 Current affairs in Telugu. రోజువారీ జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో పొందండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షల కొరకు సిద్దమవుతున్న ఆశావహుల కోసం వీటిని అందిస్తున్నాం.

2024లో ప్రపంచ నిరుద్యోగిత రేటు 5.2 శాతంగా అంచనా

ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ), ఈ సంవత్సరం ప్రపంచ నిరుద్యోగిత రేటును 5.2 శాతంగా అంచనా వేచింది. ఐఎల్ఓ యొక్క 2024 వరల్డ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ సోషల్ ఔట్‌లుక్ నివేదిక ప్రకారం ఈ ఏడాది నిరుద్యోగుల సంఖ్య 2 మిలియన్లకు పెరగనుంది. అనేక అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో నిరుద్యోగం పెరగడం ఈ నిరుద్యోగం రేటు పెరగడానికి ప్రధాన కారణంగా పేర్కొంది.

ముఖ్యంగా అధిక-ఆదాయ దేశాలలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఈ నివేదిక పేర్కొంది. కోవిడ్ మహమ్మారి తర్వాత 2022 లో 5.3 శాతంగా ఉన్న నిరుద్యోగిత, 2023లో స్వల్ప మెరుగుదలతో 5.1 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. అయితే ఈ ఏడాది దీనిలో పెరుగుదల కనిపించనున్నట్లు పేర్కొంది.

జీ20 దేశాలలో అధికభాగంలో డిస్పోజబుల్ ఆదాయాలు క్షీణించినట్లు పేర్కొంది, సాధారణంగా ద్రవ్యోల్బణం ఫలితంగా జీవన ప్రమాణాల క్షీణత చోటు చేసుకుంటున్నట్లు తెలిపింది. ధనిక మరియు పేదల మధ్య అంతరం కూడా పెరుగుతుందని ఈ నివేదిక హెచ్చరించింది. అసమాన పునరుద్ధరణ మరియు శ్రామిక పేదరికం పెరగడం వల్ల ఈ ధోరణి మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని కూడా వెల్లడించింది.

2023లో అధిక ఆదాయ దేశాల్లో ఉద్యోగాల అంతరం 8.2 శాతం కాగా, తక్కువ ఆదాయ సమూహంలో ఇది 20.5 శాతంగా ఉన్నట్లు తెలిపింది. అదేవిధంగా, 2023 నిరుద్యోగం రేటు అధిక-ఆదాయ దేశాలలో 4.5 శాతంగా ఉండగా, తక్కువ-ఆదాయ దేశాలలో ఇది 5.7 శాతంగా పేర్కొంది.

ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేది అంతర్జాతీయ కార్మిక ప్రమాణాలను కాపాడే ఒక ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ. ఇది లీగ్ ఆఫ్ నేషన్స్ క్రింద అక్టోబర్ 1919లో స్థాపించబడింద. ఇది ఐక్యరాజ్యసమితి యొక్క మొదటి మరియు పురాతన ప్రత్యేక ఏజెన్సీలలో ఒకటి. దీని ప్రధాన కార్యాలయం జెనీవా (స్విట్జర్లాండ్) లో ఉంది.

నాసిక్‌లో 27వ జాతీయ యువజనోత్సవాలను ప్రారంభించిన ప్రధాని

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జనవరి 12 వ తేదీన మహారాష్ట్రలోని నాసిక్‌లో 27వ జాతీయ యువజనోత్సవాలను ప్రారంభించారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జనవరి 12 నుండి 16వ తేదీ వరకు జాతీయ యువజనోత్సవాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా మై భారత్ వాలంటీర్లు, ఎన్ఎస్ఎస్ యూనిట్లు, నెహ్రూ యువకేంద్ర సంఘటన్ వాలంటరీలు మరియు అనేక విద్యా సంస్థల నుండి 88,000 మందికి పైగా వాలంటీర్లు పాల్గొన్నారు.

స్వామి వివేకానంద జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకోవడానికి 1984 సంవత్సరంలో భారత ప్రభుత్వం దీనిని మొదటిసారిగా ప్రకటించింది. అప్పటి నుండి (1985), దేశవ్యాప్తంగా  జనవరి 12న జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకోవడం ప్రారంభించబడింది. స్వామి వివేకానంద బోధనలు, జీవన విధానం మరియు ఆలోచనలతో యువతను ప్రేరేపించడానికి ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ 2024

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సహకారంతో అభివృద్ధి చేయబడిన 19వ వార్షిక గ్లోబల్ రిస్క్‌ల నివేదిక 2024 వెలువడింది. ఈ నివేదిక వచ్చే దశాబ్దంలో మానవాళి ఎదుర్కొనే అత్యంత తీవ్రమైన ప్రమాదాలను విశ్లేషిస్తుంది. తాజా నివేదిక వేగంగా మారుతున్నా టెక్నాలజీ మార్పులు, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, అంటువ్యాదులు, వేవాతావరణ మార్పులు మరియు వివిధ దేశాల మధ్య ఏర్పడుతున్నసంఘర్షణల నేపథ్యంలో రాబోయే దశాబ్దంలో మనం ఎదుర్కొనే అత్యంత తీవ్రమైన నష్టాలను హైలైట్ చేసింది.

2024 గ్లోబల్ రిస్క్‌ నివేదిక, 1,400 మంది కంటే ఎక్కువ వ్యాపార, ప్రభుత్వ మరియు విద్యావేత్తల నుండి వచ్చిన అంతర్దృష్టుల ఆధారంగా రూపొందించబడింది. ఈ నివేదిక వచ్చే దశాబ్దకాలంలో ప్రపంచం ఎదుర్కొనే ప్రధాన ప్రమాదాలలో సైబర్ క్రైమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రతికూల ఫలితాలు మరియు తీవ్రమైన వాతావరణ సంఘటనలు ఉన్నట్లు పేర్కొంది. వెచ్చే 2 ఏళ్ళు మరియు 10 ఏళ్ళ కాలంలో జాబితా చేయబడ్డ గ్లోబల్ రిస్క్‌లు. వాటి స్వల్ప మరియు దీర్ఘకాలిక తీవ్రత ఆధారంగా కింది విదంగా ర్యాంక్ చేయబడ్డాయి.

ర్యాంకు వచ్చే రెండేళ్ల కాలంలో వచ్చే దశాబ్దకాలంలో
1వ తప్పుడు సమాచారం & గ్లోబల్ ప్రచారం తీవ్రమైన వాతావరణ సంఘటనలు
2వ తీవ్రమైన వాతావరణ సంఘటనలు భూమి వ్యవస్థలలో క్లిష్టమైన మార్పులు
3వ సామాజిక ధ్రువణత జీవవైవిధ్య నష్టం & పర్యావరణ వ్యవస్థ పతనం
4వ సైబర్ అభద్రత సహజ వనరుల కొరత
5వ అంతర్రాష్ట్ర సాయుధ పోరాటాలు తప్పుడు సమాచారం & గ్లోబల్ ప్రచారం
6వ ఆర్థిక లోటు ఎఐ సాంకేతికతల యొక్క ప్రతికూల ఫలితాలు
7వ ద్రవ్యోల్బణం అసంకల్పిత వలసలు
8వ అసంకల్పిత వలసలు సైబర్ అభద్రత
9వ ఆర్ధిక తిరోగమనం సామాజిక ధ్రువణత
10వ కాలుష్యం కాలుష్యం

1. విపరీత వాతావరణ సంఘటనలు: వచ్చే దశాబ్ద కాలంలో వాతావరణ మార్పుల కారణంగా హీట్‌వేవ్‌లు, వరదలు, కరువులు మరియు అడవి మంటలు వంటి విపరీత వాతావరణ సంఘటనలు చాలా తరచుగా మరియు తీవ్రంగా మారుతున్నాయని ఈ నివేదిక హెచ్చరించింది. ఈ సంఘటనలు ప్రజలు, ఆర్థిక వ్యవస్థలు మరియు పర్యావరణానికి వినాశకరమైన పరిణామాలను కలిగిస్తాయిని పేర్కొంది.

2. వాతావరణ చర్య వైఫల్యం: గ్లోబల్ వార్మింగ్‌ను 2 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా పరిమితం చేయాలనే లక్ష్యంతో ఉన్న పారిస్ ఒప్పందం యొక్క లక్ష్యాలను చేరుకోవడానికి ప్రపంచం మార్గంలో లేదని ఈ నివేదిక కనుగొంది. వాతావరణ మార్పులపై నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడంలో వైఫల్యం విపత్కర పరిణామాలకు దారి తీస్తుందని హెచ్చరిస్తుంది.

3. మానవ నిర్మిత పర్యావరణ నష్టం & జీవవైవిధ్య నష్టం: భూగ్రహం యొక్క పర్యావరణ వ్యవస్థలకు అటవీ నిర్మూలన, కాలుష్యం మరియు ఓవర్ ఫిషింగ్ వంటి మానవ కార్యకలాపాల యొక్క ప్రమాదాలను ఈ నివేదిక హైలైట్ చేసింది. జీవవైవిధ్య నష్టం ఆహార గొలుసులు, నీటి సరఫరా మరియు ప్రకృతి వైపరీత్యాల స్థితిస్థాపకతకు భారీగా అంతరాయం కలిగిస్తుందని నివేదించింది.

4. సామాజిక సమన్వయ క్షీణత: పెరుగుతున్న అసమానతలు, ధ్రువణత మరియు సంస్థలపై విశ్వాసం క్షీణించడం అనేక దేశాలలో సామాజిక ఐక్యతకు ముప్పు కలిగిస్తున్నాయని ఈ నివేదిక హెచ్చరించింది. ఇది సామాజిక అశాంతికి, సంఘర్షణకు మరియు అస్థిరతకు దారితీస్తుందని పేర్కొంది.

5. జీవనోపాధి సంక్షోభాలు: పేదరికం, నిరుద్యోగం మరియు ఆహార అభద్రత వంటి కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు జీవనోపాధి సంక్షోభాలను ఎదుర్కొంటున్నారని ఈ నివేదిక కనుగొంది. ఈ సంక్షోభాలు వ్యక్తులు, కుటుంబాలు మరియు సంఘాలపై వినాశకరమైన ప్రభావాన్ని చూపుతాయిని వెల్లడించింది.

6. సైబర్ అభద్రతా : సైబర్‌ సెక్యూరిటీ ఉల్లంఘనలు, సామూహిక విధ్వంసక ఆయుధాలు మరియు తప్పుడు సమాచారం/తప్పుడు వివరాలు సంభావ్య ప్రమాదాలను కలిగిస్తాయని పేర్కొంది. ఇవి సామాజిక, ఆర్థిక నష్టాన్ని కల్గిస్తాయని హెచ్చరించింది. సాంకేతిక పురోగతి యొక్క వేగవంతమైన అభివృద్ధి బాధ్యతాయుతమైనదిగా ఉండాలని నివేదించింది.

7. ఆర్థిక సంక్షోభాలు : వచ్చే దశాబ్ద కాలంలో ఆర్థిక నష్టాలు ఆందోళనకరంగానే ఉంటాయని, రుణ సంక్షోభాలు , స్టాగ్‌ఫ్లేషన్ మరియు ఆస్తి ధర పతనం విస్తృత అంతరాయాన్ని కలిగిస్తాయిని తెలిపింది. ప్రపంచ ఆర్థిక మందగమనం మరియు పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఈ ఆందోళనలకు దోహదం చేస్తాయిని పేర్కొంది.

హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2024లో భారతదేశం ర్యాంక్ 80

హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2024లో ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ జాబితాలో భారత్ 80వ స్థానంలో నిలిచింది. ఉజ్బెకిస్థాన్‌తో భారత్ ఈ 80వ స్థానాన్ని పంచుకుంది. ఈ తాజా ర్యాంకింగ్ ప్రకారం భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్‌లు ప్రపంచవ్యాప్తంగా 62 దేశాలకు వీసా-రహిత ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. ఇది 2023లో భారత్‌లో ఉన్న 85వ స్థానం నుండి స్వల్ప మెరుగుదలని కనబర్చింది.

హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2024లో 199 విభిన్న పాస్‌పోర్ట్‌లు మరియు 227 విభిన్న ప్రయాణ గమ్యస్థానాలను కవర్ చేసింది. తాజా జాబితాలో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్ మరియు స్పెయిన్ దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ దేశాల పాస్‌పోర్ట్‌లు 194 గమ్యస్థానాలకు వీసా రహిత యాక్సెస్‌ను కలిగి ఉన్నాయి. గత ఐదేళ్లుగా మొదటి రెండు స్థానాలలో ఉండే జపాన్‌, సింగపూర్‌లు ఈసారి మిగతా నాలుగు యూరోప్ దేశాలతో అగ్రస్థానం పంచుకున్నాయి.

అలానే దక్షిణ కొరియా, స్వీడన్ మరియు ఫిన్లాండ్ 193 దేశాలకు యాక్సెస్‌తో రెండవ స్థానంలో నిలిచాయి. ఆస్ట్రియా, డెన్మార్క్, ఐర్లాండ్ మరియు నెదర్లాండ్స్ 192 దేశాలకు యాక్సెస్‌తో మూడవ స్థానాన్ని పంచుకున్నాయి. యూకే మరియు యూఎస్ పాస్‌పోర్ట్‌లు 191 మరియు 188 గమ్యస్థానాల యాక్సెస్‌తో వరుసగా నాలుగు మరియు ఏడవ స్థానాల్లో ఉన్నాయి. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2024లో యెమెన్ (100వ స్థానం), పాకిస్తాన్ (101వ స్థానం), ఇరాక్ (102వ స్థానం), సిరియా (103వ స్థానం), మరియు ఆఫ్ఘనిస్తాన్ (104వ స్థానం) దేశాలు ఈ ఏడాది కింది ఐదు స్థానాలలో నిలిచాయి.

హెన్లీ గ్లోబల్ పాస్‌పోర్ట్ ర్యాంకింగ్ గత 19 సంవత్సరాలుగా ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ డేటా ఆధారంగా ర్యాంకింగ్ రూపొందిస్తుంది. ఈ సంస్థ ప్రయాణ సమాచారం యొక్క ప్రపంచంలోనే అతిపెద్ద మరియు అత్యంత ఖచ్చితమైన డేటాబేస్‌ను నిర్వహిస్తుంది. ప్రతి పాస్‌పోర్ట్‌కు దాని హోల్డర్ ముందస్తు వీసా లేకుండా యాక్సెస్ చేయగల గమ్యస్థానాల సంఖ్య ఆధారంగా స్కోర్ కేటాయించబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా వీసా విధానాల్లో మార్పులను ప్రతిబింబించేలా స్కోర్ నెలవారీగా నవీకరించబడుతుంది.

దేశం పాస్‌పోర్ట్ ర్యాంకు వీసా ఫ్రీ యాక్సెస్
ఫ్రాన్స్ 1వ ర్యాంకు 194 దేశాలు
జర్మనీ 1వ ర్యాంకు 194 దేశాలు
ఇటలీ 1వ ర్యాంకు 194 దేశాలు
జపాన్, 1వ ర్యాంకు 194 దేశాలు
సింగపూర్ 1వ ర్యాంకు 194 దేశాలు
స్పెయిన్ 1వ ర్యాంకు 194 దేశాలు
ఫిన్లాండ్ 2వ ర్యాంకు 193 దేశాలు
దక్షిణ కొరియా 2వ ర్యాంకు 193 దేశాలు
స్వీడన్ 2వ ర్యాంకు 193 దేశాలు
ఆస్ట్రియా 3వ ర్యాంకు 192 దేశాలు
డెన్మార్క్ 3వ ర్యాంకు 192 దేశాలు
ఐర్లాండ్ 3వ ర్యాంకు 192 దేశాలు
నెదర్లాండ్స్ 3వ ర్యాంకు 192 దేశాలు
యునైటెడ్ కింగ్‌డమ్ 4వ ర్యాంకు 191 దేశాలు
అమెరికా (యూఎస్) 7వ ర్యాంకు 188 దేశాలు
ఇండియా  80వ ర్యాంకు 62 దేశాలు
ఉజ్బెకిస్థాన్‌ 80వ ర్యాంకు 62 దేశాలు

బెస్ట్ ఎన్విరాన్‌మెంట్ ఆఫీసర్ అవార్డు అందుకున్న దీపా భండారే

భారతీయ చక్కెర పరిశ్రమలో బెస్ట్ ఎన్విరాన్‌మెంట్ ఆఫీసర్ అవార్డును గెలుచుకున్న మొదటి మహిళా అధికారిగా దీపా భండారే చరిత్ర సృష్టించారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లోని శ్రీ దత్తా కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీకి అనుబంధంగా ఆమె చేసిన విశిష్ట సేవలకు గానూ వసంతదాదా షుగర్ ఇన్‌స్టిట్యూట్ చైర్మన్ శరద్ పవార్ ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఆమెకు అందజేశారు.

ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్‌లో మాస్టర్స్ డిగ్రీని చేసిన దీపా భండారే, తన భర్త మరణానంతరం చక్కెర పరిశ్రమలో చేరారు. ప్రారంభ సవాళ్లు ఉన్నప్పటికీ, ఆమె తన పాత్రలో విజయవంతమయ్యారు. పనిలో అంకితభావం మరియు అభిరుచితో, ఆమె శ్రీ దత్తా సహకార చక్కెర కర్మాగారంలో దాని పర్యావరణ పనితీరును గణనీయంగా మెరుగుపరిచే ప్రభావవంతమైన కార్యక్రమాలను అమలు చేశారు. రాష్ట్ర చక్కెర పరిశ్రమలో అటువంటి స్థానాన్ని కలిగి ఉన్న అతి కొద్ది మంది మహిళల్లో ఆమె ఒకరు కావడం గమనార్హం.

బాన్సెరాలో తోలి అంతర్జాతీయ గాలిపటాల పండుగ

బాన్సేరా' వెదురు పార్క్‌లో ఢిల్లీ యొక్క మొదటి అంతర్జాతీయ గాలిపటాల పండుగ (పతంగ్ ఉత్సవ్‌) జనవరి 13-14 తేదీలలో నిర్వహించారు. ఈ ఉత్సవాన్ని జనవరి 13 న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రారంభించారు. కేంద్ర విదేశీ వ్యవహారాలు మరియు సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ వేడుకకు ఐదు వేలకు పైగా అంతర్జాతీయ మరియు రాజస్థాన్, సిక్కిం, మహారాష్ట్ర, కర్నాటక, పంజాబ్, లక్షద్వీప్ మరియు గుజరాత్‌లకు చెందిన ప్రొఫెషనల్ కైట్ ఫ్లైయర్‌లు హాజరయ్యారు. ఢిల్లీ యొక్క మొట్టమొదటి అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవం అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇది వార్షిక సంప్రదాయంగా మారే అవకాశం ఉంది.

కానిడ్ అడవి కుక్కల కోసం అట్పాడి కన్జర్వేషన్ రిజర్వ్

మహారాష్ట్ర ప్రభుత్వం సాంగ్లీ జిల్లాలోని కీలకమైన కానిడ్ అడవి కుక్కల సంరక్షణ కోసం అట్పాడి కన్జర్వేషన్ రిజర్వ్ పేరుతొ కొత్త వన్యప్రాణుల ఆవాసాన్ని ప్రకటించింది. 9.48 చదరపు కిలోమీటర్ల ఈ కొత్త రిజర్వ్ ఈ ప్రాంతంలోని తోడేళ్ళు, నక్కలు, అడవి కుక్కలు, హైనాల ఆవాసాలను సంరక్షించడంలో సహాయపడుతుంది.

అట్పాడి కన్జర్వేషన్ రిజర్వ్ సాంగ్లీ జిల్లాలోని అటవీ భూమిలో పచ్చని పశ్చిమ కనుమల మధ్య నెలకొని ఉంది. ఈ వ్యూహాత్మక ప్రాంతం, పశ్చిమాన మైని పరిరక్షణ ప్రాంతాన్ని ఈశాన్యంలోని మధోక్ పక్షుల అభయారణ్యంతో కలుపుతూ కీలకమైన పర్యావరణ వంతెనను ఏర్పరుస్తుంది. ఈ మెరుగైన కనెక్టివిటీ ఈ ప్రాంతంలోని వన్యప్రాణుల జనాభా యొక్క కదలిక మరియు జన్యు వైవిధ్యాన్ని సులభతరం చేస్తుంది.

ఈ అభయారణ్యంలో వృక్షజాలం మరియు జంతుకూడా సమృద్ధిగా ఉంది. ఇందులో 35 రకాల చెట్లు, 15 రకాల పొదలు, 14 తీగలు, 116 రకాల మూలికలు మరియు ఒక పరాన్నజీవి మొక్క ఉన్నాయి. అలానే ఈ ప్రాంతం జింకలు, సివెట్‌లు, కుందేళ్ళు వంటి క్షీరదాలకు కూడా ఆవాసంగా ఉంది.

Post Comment