Advertisement
అంతర్జాతీయ అంశాలు : జనవరి 2022
Telugu Current Affairs

అంతర్జాతీయ అంశాలు : జనవరి 2022

బార్బడోస్‌కు తదుపరి భారత హైకమిషనర్‌గా బాలచంద్రన్

బార్బడోస్‌కు తదుపరి భారత హైకమిషనర్‌గా ఎస్ బాలచంద్రన్ నియమితులయ్యారు. ఎస్ బాలచంద్రన్ ప్రస్తుతం రిపబ్లిక్ ఆఫ్ సురినామ్‌లో భారత రాయబారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. భారత విదేశాంగశాఖ ప్రకటన ప్రకారం ఎస్ బాలచంద్రన్ ఏకకాలంలో ఈ రెండు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. బార్బడోస్‌ ఇటీవలే గణతంత్ర రాజ్యాంగా అవతరించిన విషయం తెలిసిందే.

ఫ్రాన్స్ చేతిలో యూరోపియన్ కౌన్సిల్ ఆఫ్ ది రొటేటింగ్ ప్రెసిడెన్సీ

ఫ్రాన్స్, 14 సంవత్సరాలలో మొదటిసారిగా, స్లోవేనియా నుండి కౌన్సిల్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ (EU) అధ్యక్ష పదవిని చేపట్టనుంది. ఫ్రాన్స్ 2022 జనవరి 1 నుండి జూన్ 30 వరకు ఆరు నెలల పాటు ఈయూ కౌన్సిల్ అధ్యక్ష పదవిని కలిగి ఉంటుంది. యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ ప్రెసిడెన్సీని ప్రతి 6 నెలలకు ఈయూ సభ్య దేశాల మధ్య తిరుగుతుంది. అధ్యక్ష పదవిని స్వీకరించిన దేశం ఈ ఆరు నెలల సమయంలో యూనియన్ యొక్క సాధారణ పరిపాలన కార్యకమాలను నిర్వహించే బాధ్యతను స్వీకరిస్తాయి.

ప్రస్తుతం యూరోపియన్ యూనియన్ జాబితాలో మొత్తం 27 సభ్య దేశాలు  ఉన్నాయి, ఇవి యూనియన్ వ్యవస్థాపక ఒప్పందాలకు లోబడి నడుచుకుంటాయి. ఈ జాబితాలో ఆస్ట్రియా, బెల్జియం, బల్గేరియా, క్రొయేషియా, రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్ , చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఎస్టోనియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, హంగరీ, ఐర్లాండ్, ఇటలీ, లాట్వియా, లిథువేనియా, లక్సెంబర్గ్, మాల్టా, పోలాండ్, నెదర్లాండ్స్ పోర్చుగల్, రొమేనియా, స్లోవేకియా, స్లోవేనియా, స్పెయిన్ మరియు స్వీడన్ లు ఉన్నాయి.

సూడాన్‌ ప్రధాని అబ్దల్లా హమ్‌డోక్‌ రాజీనామా

పట్టాలు తప్పిన సైనిక తిరుగుబాటు తరువాత రాజకీయ ప్రతిష్టంభన మరియు విస్తృతమైన ప్రజాస్వామ్య అనుకూల నిరసనల మధ్య సూడాన్ ప్రధాన మంత్రి అబ్దల్లా హమ్‌డోక్ రాజీనామా చేశారు. గత ఏడాది అక్టోబర్ 25న జరిగిన తిరుగుబాటు తర్వాత సైన్యంతో అతను కుదుర్చుకున్న స్వల్పకాలిక ఒప్పందానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ప్రజా నిరసనలు కొనసాగుతున్నందున అబ్దల్లా హమ్‌డోక్  నిర్ణయం తీసుకున్నారు. సైన్యం యొక్క అధికార దోపిడీకి వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు నిరసన కొనసాగించడంతో కొత్త ప్రభుత్వంను గాడిలో పెట్టడంలో హామ్‌డోక్ విఫలమయ్యారు.

జర్మనీ అద్యక్షతలో G7 ప్రెసిడెన్సీ

G7 ప్రెసిడెన్సీ అధ్యక్ష హోదాను ఈ ఏడాది జెర్మనీ కైవసం చేసుకుంది. 1975లో G7 స్థాపించబడినప్పటి నుండి జర్మనీ ఈ అధ్యక్ష పదవిని చేపట్టడం ఇది ఏడువసారి. గ్రూప్ ఆఫ్ సెవెన్ అనేది కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్‌డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్‌లతో కూడిన ఇంటర్-గవర్నమెంటల్ పొలిటికల్ ఫోరమ్. ఇది ప్రపంచంలోని ప్రముఖ పారిశ్రామిక దేశాల నాయకులను ఒకచోట చేర్చే అనధికారిక వేదికగా 1975లో ఏర్పాటు చేయబడింది. దీని ప్రధాన కార్యాలయం ఇటలీలోని టోర్మినా (సిసిలీ) ఉంది.

ఇండోనేషియా కొత్త రాజధానిగా నుసంతారా

ఇండోనేషియా తన రాజధానిని జకార్తా నుండి 'నుసాంటారా' ద్విపానికి మార్చుతున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన బిల్లుకు ఇటీవలే ఆ దేశ పార్లమెంటు ఆమోదముద్ర వేచింది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన జకార్తాలో పర్యావరణ సమస్యలు వాతావరణ మార్పుల మధ్య భారీ వరదలకు గురయ్యే అవకాశం ఉన్నందున దేశం యొక్క రాజధానిని తరలించడానికి నిర్ణయం తీసుకున్నారు. రాజధాని మార్చినా జకార్తా ఎప్పటిలానే ఆ దేశ కమర్షియల్ మరియు ఆర్థిక రాజధానిగా ఉండనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో 2019 లో రాజధాని నగరాన్ని జకార్తా నుండి తరలించే ప్రణాళికను మొదట ప్రకటించారు. రాజధానిని మార్చడం ద్వారా, ప్రభుత్వం కూడా సంపదను పునఃపంపిణీ చేయాలని భావిస్తోంది. 'నుసాంటారా' బోర్నియో ద్వీపానికి తూర్పున ఉన్న అడవితో కప్పబడిన ప్రాంతం. 'నుసాంటారా' అనగా ఇండోనేషియా భాషలో ద్వీపసమూహం అని అర్ధం.

ఐక్యరాజ్యసమితి కౌంటర్ టెర్రరిజం కమిటీ ఛైర్మన్‌గా టిఎస్ తిరుమూర్తి

ఐక్యరాజ్య సమితి లోని భారత రాయబారి టీఎస్ తిరుమూర్తి 2022 కొరకు భద్రతా మండలి కౌంటర్ టెర్రరిజం కమిటీ (CTC) అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. తిరుమూర్తి 2020 నుండి ఐక్యరాజ్య సమితిలో శాశ్వత భారత రెప్రెసెంటేటివ్'గా ఉన్నారు. సీటీసీ కమిటీ సెప్టెంబర్ 2001 లో ప్రారంభించగా, 2012 లో భారత్ ఇందులో భాగస్వామ్యం అయ్యింది.

ఈ కమిటీలో మొత్త్తం 15 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఈ జాబితాలో అల్బేనియా, బ్రెజిల్,  చైనా ఫ్రాన్స్ గాబన్, ఘనా, భారతదేశం, ఐర్లాండ్, కెన్యా, మెక్సికో, నార్వే, రష్యా, యూఏఈ, యూకే మరియు యూఎస్ ఉన్నాయి. ఈ కమిటీ ప్రపంచ దేశాలపై ఉగ్రవాద ముప్పు సంబంధిత భద్రతా వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది.

యుఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రెసిడెంట్‌గా అతుల్ కేశప్

రాయబారి అతుల్ కేశప్ జనవరి 5 నుండి యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ (USIBC) అధ్యక్షుడిగా నియమితులైనట్లు యూఎస్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ప్రకటించింది. వాషింగ్టన్ డీసీ ఆధారిత ఈ వ్యాపార న్యాయవాద సమూహం, యునైటెడ్ స్టేట్స్, ఇండియా మరియు ఇండో-పసిఫిక్ అంతటా పనిచేస్తున్న అగ్ర గ్లోబల్ కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తుంది.

షాంఘై సహకార సంస్థ కొత్త సెక్రటరీ జనరల్‌గా జాంగ్ మింగ్

ప్రముఖ సీనియర్ చైనీస్ దౌత్యవేత్త, జాంగ్ మింగ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజషన్ (SCO) కొత్త సెక్రటరీ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్'ను షాంఘై ఒప్పందం అని కూడా పిలుస్తారు, ఇది యురేషియా రాజకీయ, ఆర్థిక మరియు భద్రతా కూటమి. దీని ప్రధాన కార్యాలయం బీజింగ్'లో ఉంది. 2001 లో చైనా , రష్యా , కజకిస్తాన్, ఉజ్జికిస్తాన్, తజికిస్తాన్ , కిర్గిస్థాన్ దేశాలు ఉమ్మడిగా దీనిని స్థాపించాయి.

ఈ ఒప్పందం ద్వారా రాజకీయ, వాణిజ్య, ఆర్థిక, పరిశోధన, సాంకేతికత, సంస్కృతి, అలాగే విద్య, శక్తి, రవాణా, పర్యాటకం, పర్యావరణ పరిరక్షణ మరియు ఇతర రంగాలలో వారి సమర్థవంతమైన సహకారాన్ని, ప్రోత్సాహాన్ని సభ్య దేశాలు అందించుకుంటాయి.

పాకిస్థాన్‌ తొలి మహిళా సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ అయేషా మాలిక్

జస్టిస్ అయేషా మాలిక్ పాకిస్తాన్ సుప్రీంకోర్టుకు మొదటి మహిళా న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ అయేషా మాలిక్ తన న్యాయవాద వృత్తిని 1997లో ప్రారంభించారు. 2012 నుండి ఆమె లాహోర్ హైకోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయేషా మాలిక్ పదోన్నతికి పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఆమోదం తెలిపారు.

ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్‌గా పియర్-ఒలివర్ గౌరించస్

అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ప్రధాన ఆర్థికవేత్తగా ఫ్రెంచ్ ఆర్థికవేత్త పియర్-ఒలివర్ గౌరించస్ నియమితులయ్యారు. ఈయన త్వరలో ఐఎంఎఫ్ యొక్క మొట్టమొదటి మహిళా చీఫ్ ఎకనామిస్ట్ అయిన గీతా గోపీనాథ్ స్థానంలో బాధ్యతలు స్వీకరించనున్నారు.

కజకిస్తాన్ నూతన ప్రధాన మంత్రిగా అలీఖాన్ స్మైలోవ్

అలీఖాన్ స్మైలోవ్ కజకిస్తాన్ నూతన ప్రధాన మంత్రిగా నియమితులయ్యారు. ప్రెసిడెంట్ కస్సిమ్-జోమార్ట్ టోకయేవ్ సమక్షంలో దేశ కొత్త ప్రధానమంత్రిగా అలీఖాన్ స్మైలోవ్ నియామకాన్ని కజకిస్థాన్ పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది.

యూరోపియన్ పార్లమెంట్ కొత్త అధ్యక్షరాలుగా రాబర్టా మెత్సోలా

యూరోపియన్ కొత్త అధ్యక్షుడిగా రాబర్టా మెత్సోలా బాధ్యతలు స్వీకరించారు. ఈమె యూరోపియన్ పార్లమెంట్‌కు నాయకత్వం వహించే మూడవ మహిళ అధ్యక్షరాలుగా నిలువనున్నారు. ఈమె 2020 నుండి యూరోపియన్ పార్లమెంట్‌కు ఉపాధ్యక్షరాలుగా ఉన్నారు.

Post Comment