తెలుగు కరెంట్ అఫైర్స్ జనవరి 2023 : రిపోర్టులు & ర్యాంకులు
Telugu Current Affairs

తెలుగు కరెంట్ అఫైర్స్ జనవరి 2023 : రిపోర్టులు & ర్యాంకులు

2023 జనవరి నెలకు సంబంధించిన జాతీయ మరియు అంతర్జాతీయ నివేదికలు మరియు ర్యాంకులు సంబంధించి తాజా అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, రైల్వే, బ్యాంకింగ్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటి వివిధ పోటీ పోటీ పరీక్షలకు సిద్దమౌతున్న అభ్యర్థులకు ఈ అంశాలు ఉపయోగపడతాయి.

Advertisement

డీపీఈ సర్వేలో పవర్ గ్రిడ్ కార్పొరేషకు ప్రథమస్థానం

2023 డిపార్టుమెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సర్వే (DPE)లో సేవా రంగానికి సంబంధించి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 1 వ ర్యాంకులో నిలిచింది. అలానే టాప్ 10 లాభదాయక పబ్లిక్ సెక్టార్ కంపెనీలలో 3వ స్థానంను దక్కించుకుంది. ఈ సర్వే 2021-2022 ఏడాదికి సంబంధించింది.

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ యాజమాన్యంలోని భారతీయ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఇది వివిధ రాష్ట్రాలలో బల్క్ పవర్ ట్రాన్స్‌మిషన్‌ సేవలు అందిస్తుంది. ఇది 1989లో స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం గురుగ్రామ్‌లో ఉంది.

డిపార్టుమెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సర్వే అనేది భారతీయ ఆర్థిక వ్యవస్థలో సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ (CPSE)ల పురోగతి మరియు సహకారాన్ని కొలవడానికి రూపొందించే ఒక ప్రత్యేకమైన డేటా రిపోజిటరీ. 51 శాతం లేదా అంతకంటే ఎక్కువ ప్రభుత్వ వాటా ఉండే కంపెనీలను పబ్లిక్ సెక్టార్ సంస్థలుగా పరిగణిస్తారు.

సిరియమ్ గ్లోబల్ ఎయిర్‌పోర్టు ర్యాంకింగ్ 2023

ఏవియేషన్ అనలిటిక్స్ కంపెనీ సిరియమ్ యొక్క 2023 వార్షిక గ్లోబల్ ఎయిర్‌పోర్టు మరియు ఏవియేషన్ ర్యాంకింగ్ ప్రకారం మూడు భారతీయ విమానయాన సంస్థలు ఇండిగో, ఎయిర్ ఏషియా ఇండియా మరియు విస్తారాలు ఆసియా-పసిఫిక్‌ రీజియన్ నుండి టాప్ టెన్ ఎయిర్‌లైన్స్‌ జాబితాలో స్థానం దక్కించుకున్నాయి.

అలానే ఆన్-టైమ్ అరైవల్ (ఓటీఎ) పనితీరులో బెంగుళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం మరియు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయాలు టాప్ టెన్ గ్లోబల్ విమానాశ్రయాల జాబితాలో ఇండియా నుండి చోటు దక్కించుకున్నాయి. ఈ జాబితాలో టోక్యోలోని హనెదా ఇంటర్నేషనల్ విమానాశ్రయం ప్రథమ స్థానంలో నిలిచింది.

ప్రపంచ అత్యంత బలమైన పాస్‌పోర్ట్ జాబితాలో జపాన్ అగ్రస్థానం

హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2023 నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుగా జపాన్ పాస్‌పోర్టు అగ్రస్థానంలో ఉంది. ఈ జాబితాలో భారతదేశ పాస్‌పోర్టు 85వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఈసారి కూడా ఆసియా దేశాలలే ఆధిపత్యం కనబర్చాయి. రెండవ స్థానంలో సింగపూర్, దక్షిణ కొరియాలు, మూడవ స్థానంలో జర్మనీ, స్పెయిన్ దేశాలు ఉమ్మడిగా ర్యాంకులు పంచుకున్నాయి.

ఈ నివేదికలో193 వీసా ఫ్రీ యాక్సెస్ స్కోర్‌తో జపాన్ అగ్రస్థానంలో ఉంది. అంటే జపాన్ 193 దేశాలకు వీసా ఫ్రీ లేదా ఆన్ అరైవల్ వీసా యాక్సెస్‌ను పొందే అవకాశం కలిగి ఉంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌గా జపాన్‌ పాస్‌పోర్ట్‌కు పట్టం కట్టడం ఇది వరుసగా ఐదోసారి. పాస్‌పోర్ట్ ఇండెక్స్ యందు ఉత్తమ ర్యాంకు కలిగిన దేశాలు అత్యధిక దేశాలకు ఎటువంటి పరిమితులు లేకుండా ప్రయాణించే అవకాశం లభిస్తుంది.

దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2023 వార్షిక సమ్మిట్

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2023 వార్షిక సమావేశం స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరంలో జనవరి 16న ప్రారంభమై జనవరి 20 వరకు జరగనుంది. ఈ ఏడాది ఈ సమావేశాలను 'కోపరేషన్ ఇన్ ఏ ఫ్రాగ్మెంటెడ్ వరల్డ్‌' థీముతో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో ఇటీవలే గ్లోబల్ రిస్కు రిపోర్టులో పొందుపర్చిన కీలక అంశాలు చర్చకు రానున్నాయి.

ఈ సమావేశాల్లో గ్లోబల్ లీడర్‌లు, సెలబ్రిటీలు, బిజినెస్ హెడ్‌లు, సామాజిక కార్యకర్తలు, ఆర్థికవేత్తలు మరియు వ్యాపార ప్రముఖులు పాల్గొంటారు. ఈ సమావేశాలకు భారత్ నుంచి కేంద్ర మంత్రులు అశ్వినీ వైషవ్, స్మృతి ఇరానీ, ఆర్కే సింగ్, మన్సుఖ్ మాండవియా హాజరుకానున్నారు.

రాష్ట్రాల నుంచి ముగ్గురు ముఖ్యమంత్రులు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్రకు చెందిన ఏక్‌నాథ్ షిండే మరియు కర్ణాటకకు చెందిన బిఎస్ బొమ్మై - సమావేశాలకు హాజరుకానున్నారు. తెలంగాణ నుండి మంత్రి కేటీఆర్ హాజరుకాగా, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ఆహ్వానం అందినా, ఎవరూ హాజరు కాలేదు.

ఈ ఏడాది సమావేశాలు ప్రపంచ జీవన వ్యయ సంక్షోభం, ప్రపంచ దేశాల ఆర్థిక మందగమనం, ఇంధన సమస్యలు, సహజ వనరుల సంక్షోభాలు, ఉద్యోగాల భవిష్యత్తు, లింగ అసమానత వంటి ప్రస్తుత ప్రపంచ సవాళ్లకు వేదిక కానుంది. కోవిడ్ -19 మహమ్మారి, యుఎస్-చైనా శత్రుత్వం, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధ అంశాలు కూడా కీలకం కానున్నాయి.

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అనేది స్విట్జర్లాండ్‌లోని జెనీవా కేంద్రంగా ఉన్న అంతర్జాతీయ ప్రభుత్వేతర మరియు లాబీయింగ్ సంస్థ. దీనిని జర్మన్ ఇంజనీర్ మరియు ఆర్థికవేత్త క్లాస్ స్క్వాబ్ 24 జనవరి 1971న స్థాపించారు. ఇది ప్రపంచ, ప్రాంతీయ మరియు పరిశ్రమల ఎజెండాలను రూపొందించడానికి వ్యాపారం, రాజకీయ, విద్యా మరియు సమాజంలోని ఇతర నాయకులను, నిపుణులను భాగస్వామ్యం చేస్తుంది.

గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2023 : నాల్గువ స్థానంలో భారత్

గ్లోబల్ ఫైర్‌పవర్ ఇండెక్స్ 2023 వెలువడింది. తాజా నివేదిక భారతదేశాన్ని ప్రపంచంలోని 4వ అత్యంత శక్తివంతమైన సైన్యంగా పేర్కొంది. 145 దేశాలకు సంబంధించి ఇచ్చిన ర్యాంకింగులో యూఎస్ అగ్రస్థానంలో ఉండగా, తర్వాత నాలుగు స్థానాల్లో వరుసగా రష్యా, చైనా, ఇండియా మరియు యూకే దేశాలు నిలిచాయి.

గ్లోబల్ ఫైర్‌ పవర్ (GFP) అనేది ప్రపంచ దేశాల వార్షిక రక్షణ సమీక్షగా పరిగణించబడుతుంది. ఇది త్రివిధ దళాల బలం, జాతీయ వనరులు, ఆర్థిక స్థితి, లాజిస్టిక్స్ సామర్థ్యం మరియు భౌగోళిక స్థాయి వంటి దాదాపు 60 అంశాల ఆధారంగా ర్యాంకులు అందిస్తుంది. గ్లోబల్ ఫైర్‌పవర్ ఇండెక్స్ స్కోరు 0.0000 అనేది అత్యుత్తమమైనది. ఈ విలువ యెంత తక్కువ ఉంటే, ఆ దేశం యొక్క సంప్రాదయ పోరాట సామర్థ్యం అంత శక్తివంతంగా ఉన్నట్లు.

పిఎన్‌జి నెట్‌వర్క్‌లో దేశంలో తోలి గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్

పైప్డ్ నేచురల్ గ్యాస్ (పిఎన్‌జి) నెట్‌వర్క్‌లో భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ఆపరేషన్‌ ప్రారంభించిన సంస్థగా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టిపిసి) నిలిచింది. సూరత్‌లోని తన కవాస్ టౌన్‌షిప్‌లో ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్టును గుజరాత్ గ్యాస్ లిమిటెడ్ మరియు ఎన్‌టిపిసి సంయుక్త నిర్వహించనున్నాయి.

గృహాలకు H2-NG (సహజ వాయువు) సరఫరా చేయడానికి ఈ ప్రాజెక్టు రూపొందించారు. సహజ వాయువుతో కలిపిన గ్రీన్ హైడ్రోజన్ CO2 ఉద్గారాలను తగ్గిస్తుంది. యూకే, జర్మనీ మరియు ఆస్ట్రేలియా వంటి కొన్ని ఎంపిక చేసిన దేశాలు మాత్రమే ఈ ఘనతను సాధించాయి. ఇది ప్రపంచ హైడ్రోజన్ ఆర్థిక వ్యవస్థలో భారతదేశ తోలి అడుగును ప్రతిభింబిస్తుంది.

ఈ ప్రయత్నం భారతదేశ హైడ్రోకార్బన్ దిగుమతిని గణనీయంగా తగ్గించడమే కాకుండా ప్రపంచానికి గ్రీన్ హైడ్రోజన్ మరియు గ్రీన్ కెమికల్స్ ఎగుమతిదారుగా అవతరించే అవకాశం కల్పించనుంది.

Advertisement

Post Comment