Advertisement
తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 24 అక్టోబర్ 2023
Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 24 అక్టోబర్ 2023

రోజువారీ తెలుగు కరెంట్ అఫైర్స్ 24 అక్టోబర్ 2023, తాజా జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి  వివిధ పోటీ పరీక్షల కొరకు సిద్దమవుతున్న అభ్యర్థులకు ఇవి ఉపయోగపడతాయి.

ఉమ్రోయ్ కాంట్‌లో ఎక్సర్‌సైజ్ హరిమౌ శక్తి 2023

భారతదేశం మరియు మలేషియా సైన్యం మధ్య నిర్వహించే ఉమ్మడి ద్వైపాక్షిక శిక్షణ వ్యాయామం “ఎక్సర్‌సైజ్ హరిమౌ శక్తి 2023" మేఘాలయలోని ఉమ్రోయ్ కంటోన్మెంట్‌లోని జాయింట్ వార్‌ఫేర్ ట్రైనింగ్ సెంటర్‌లో అక్టోబర్ 23, 2023 న ప్రారంభమైనది. ఈ రెండు వారాల ఉమ్మడి సైనిక వ్యాయామం నవంబర్ 5 వరకు జరుగుతుంది.

ఈ వ్యాయామంలో మలేషియా ఆర్మీ బృందం నుండి మలేషియా సైన్యం యొక్క 5వ రాయల్ బెటాలియన్, భారత్ సైన్యం నుండి రాజ్‌పుత్ రెజిమెంట్‌కు చెందిన బెటాలియన్ ప్రాతినిధ్యం వహించాయి. ఈ వ్యాయామం యొక్క చివరి ఎడిషన్ నవంబర్ 2022లో మలేషియాలోని క్లూయాంగ్‌లోని పులైలో నిర్వహించబడింది.

ఈ వ్యాయామంలో రెండు వైపుల నుండి సుమారు 120 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఇది సాంప్రదాయ సైనిక శిక్షణ అంశాలతో బహుళ సైనిక డొమైన్ కార్యకలాపాల నిర్వహణ కోసం సైనిక సామర్థ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో ఉమ్మడి కమాండ్ పోస్ట్ మరియు ఇంటిగ్రేటెడ్ సర్వైలెన్స్ గ్రిడ్‌ను ఏర్పాటు చేయడం, జంగిల్, సెమీ-అర్బన్ మరియు అర్బన్ ఎన్విరాన్‌మెంట్‌లలో ఉమ్మడి దళాల పనితీరును రిహార్సల్ చేయడం, క్యాజువాలిటీ నిర్వహణ మరియు తరలింపు కసరత్తులు నిర్వహించడం అలానే లాజిస్టిక్స్ నిర్వహణ, మనుగడ శిక్షణను అభ్యసించడం వంటివి ఉన్నాయి.

ఈ శిక్షణలో ఇరువర్గాల సైనికులు ప్రధానంగా శారీరక దృఢత్వం, వ్యూహాత్మక స్థాయిలో కసరత్తులు చేయడం మరియు ఒకరితో ఒకరు ఉత్తమ అభ్యాసాలను పంచుకోవడంపై దృష్టి సారిస్తారు. సెమీ-అర్బన్ ప్రాంతంలో 48 గంటల సుదీర్ఘ ధ్రువీకరణ వ్యాయామంతో ఈ వ్యాయామం ముగుస్తుంది.

ఎక్సర్‌సైజ్ హరిమౌ శక్తి భారత సైన్యం మరియు మలేషియా సైన్యం మధ్య రక్షణ సహకార స్థాయిని పెంపొందించడానికి ఉద్దేశించబడింది. ఇది రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను కూడా పెంపొందిస్తుంది. ఈ వార్షిక శిక్షణా కార్యక్రమం 2012 నుండి నిర్వహించబడుతోంది.

భారత తీరంలో జంట తుఫానులు తేజ్ మరియు హమూన్

అరేబియా సముద్రం మరియు బంగాళాఖాతం మీదగా రెండు తుఫానులు తేజ్ మరియు హమూన్ ఏకకాలంలో అభివృద్ధి చెందినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ దృగ్విషయం చివరిసారిగా 2018లో అరేబియా, బంగాళాఖాతంలో ఒకే సమయంలో సంభవించిన లుబాన్ మరియు తిత్లీ తుఫానులు ద్వారా చోటుచేసుకుంది. రెండు సముద్రాలు ఒకే సమయంలో చాలా అరుదుగా చురుకుగా ఉంటాయి కాబట్టి ఇది అరుదైన దృగ్విషయం.

తేజ్ తుపాన్ మధ్య-దక్షిణ అరేబియా సముద్రం మీదుగా ఏర్పడిన అత్యంత తీవ్రమైన ఉష్ణమండల తుఫాను. అక్టోబర్ 20న ఏర్పడిన ఈ తుపాన్, అక్టోబర్ 24న సోకోత్రా మరియు యెమెన్‌లపై ల్యాండ్‌ఫాల్ అయ్యింది. 2018 లుబాన్ తుఫాను తర్వాత ఆ దేశంలో తీరాన్ని తాకిన మొదటి తుఫాను ఇది. అక్టోబరు 16న, భారత వాతావరణ శాఖ అరేబియా సముద్రంలో ఈ తుఫాను ఏర్పడే అవకాశాలను పర్యవేక్షించడం ప్రారంభించింది. దీనికి భారత్ ప్రతిపాదించిన తేజ్ అనే పేరునే పెట్టబడింది.

హమూన్ చాలా తీవ్రమైన సైక్లోనిక్ తుఫాను. ఇది 21 అక్టోబర్ 2023న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడన ప్రాంతం నుండి పుట్టుకొచ్చింది. ఈ తుఫాను అక్టోబరు 22న తీవ్ర అల్పపీడనంగా మరియు అక్టోబర్ 23న తుఫానుగా మారి, అక్టోబర్ 24న బంగ్లాదేశ్ తీరంలో ల్యాండ్‌ఫాల్ అయ్యింది. ఈ హమూన్ తుపాన్ పేరును ఇరాన్ ప్రతిపాదించింది.

ఏడు దేశాలకు వీసా రహిత ప్రవేశానికి శ్రీలంక ఆమోదం

ఇండియా, చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేషియా మరియు థాయ్‌లాండ్ నుండి వచ్చే విదేశీ ప్రయాణికులకు తక్షణ వీసా రహిత ప్రవేశానికి శ్రీలంక క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దేశంలో విదేశీ పర్యాటకులను ఆకర్శించేందుకు శ్రీలంక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ అర్హత ఉన్న ఏడు దేశాల నుండి వచ్చే సందర్శకులు వీసా లేకుండా 30 రోజుల వరకు శ్రీలంకలో పర్యటించవచ్చు. అయితే పర్యటకులు చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్ మరియు రిటర్న్ టిక్కెట్‌ను కలిగి ఉండాలి.

భారతీయ సందర్శకులకు శ్రీలంక వీసా రహిత ప్రవేశం ఒక ముఖ్యమైన పరిణామం. శ్రీలంక యొక్క అతిపెద్ద పర్యాటక వాటాదారులలో భారతదేశం ఒకటి. 2022లో 400,000 మంది భారతీయ పర్యాటకులు శ్రీలంకను సందర్శించారు. ఈ కొత్త వీసా రహిత ఆహ్వానం భారతదేశం మరియు ఇతర దేశాల నుండి పర్యాటకాన్ని మరింత పెంచుతుందని భావిస్తున్నారు.

తక్షణ పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా మార్చి 31, 2024 వరకు ఈ ఉచిత వీసాలు జారీ చేయడానికి శ్రీలంక క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ ట్వీట్ చేశారు. 2019 ఈస్టర్ సండే బాంబు దాడుల తర్వాత ఈ దేశంకు పర్యాటకుల రాక బాగా తగ్గింది. ఈ దాడిలో 11 మంది భారతీయులు సహా 270 మంది ప్రాణాలు కోల్పోయారు, 500 మందికి పైగా వ్యక్తులు గాయపడ్డారు.

దీనితో పాటుగా శ్రీలంక ప్రస్తుతం తీవ్రమైన రాజకీయ, ఆర్థిక సవాళ్లతో కొట్టుమిట్టాడుతోంది. దేశంలో ఉన్న ప్రస్తుత తీవ్ర ఆర్థిక సంక్షోభం వలన ఆహారం, ఔషదాలు, వంటగ్యాస్, ఇతర ఇంధనాలు, టాయిలెట్ పేపర్ మరియు అగ్గిపెట్టెలతో సహా ప్రాథమిక అవసరాల యొక్క  కొరతకను ఎదుర్కొంటుంది.

సైబర్ భద్రత కోసం డిజికవాచ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన గూగుల్

ఇటీవలే నిర్వహించిన గూగుల్ ఫర్ ఇండియా 2023 ఈవెంట్‌లో భారతీయ వినియోగదారుల కోసం డిజి కవాచ్ అనే కొత్త ప్రోగ్రామ్‌ను గూగుల్ ప్రకటించింది. డిజికవాచ్ అనేది ముందస్తు సైబర్ ముప్పును గుర్తించే ఒక హెచ్చరిక వ్యవస్థ. ఇది విస్తృతమైన హాని కలిగించే ఆర్థిక మోసాల నమూనాలను గుర్తించడానికి మరియు విశ్లేషించడానికి రూపొందించబడింది.

ప్రతి ఒక్కరికీ సురక్షితమైన డిజిటల్ పర్యావరణ వ్యవస్థను రూపొందించడంలో సమిష్టిగా సహాయం చేయడానికి, నిబద్ధత కలిగిన నిపుణులు ఇందులో భాగం కానున్నారు. భారతదేశంలో ప్లే స్టోర్‌లో దోపిడీ డిజిటల్ లెండింగ్ యాప్‌లను ఎదుర్కోవడానికి గూగుల్ ఫిన్‌టెక్ అసోసియేషన్ ఫర్ కన్స్యూమర్ ఎంపవర్‌మెంట్ కూడా ఇందులో భాగం కానుంది.

భారతదేశంలో ఆన్‌లైన్ ఆర్థిక మోసాలకు వ్యతిరేకంగా పోరాటంలో డిజికవాచ్ కార్యక్రమం ఒక ముఖ్యమైన దశ. ఆన్‌లైన్ ఆర్థిక మోసం వల్ల భారతదేశం ప్రతి సంవత్సరం బిలియన్ల డాలర్లు కోల్పోతుందని అంచనా. యేటా పెరుగుతున్న ఈ సమస్యను పరిష్కరించేందుకు, మోసం నుండి వ్యక్తులు మరియు వ్యాపారాలను రక్షించడానికి ఈ ప్రోగ్రామ్ సహాయం చేస్తుంది. అలానే ఇది డిజిటల్ పర్యావరణ వ్యవస్థపై నమ్మకాన్ని పెంపొందించడానికి కూడా సహాయపడుతుంది.

విద్యుదయస్కాంత రైల్‌గన్‌ని విజయవంతంగా ప్రయోగించిన జపాన్

ఆఫ్‌షోర్ ప్లాట్‌ఫారమ్‌లో మీడియం-క్యాలిబర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రైల్‌గన్‌ పరీక్షను జపాన్ విజయవంతంగా నిర్వహించింది. ది రైల్‌గన్ టెక్నాలజీ అభివృద్ధిలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఆఫ్‌షోర్ ప్లాట్‌ఫారమ్ నుండి రైల్‌గన్‌ని విజయవంతంగా పరీక్షించడం ఇదే మొదటిసారి. ఈ పరీక్షను జపనీస్ మారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ మరియు అక్విజిషన్ టెక్నాలజీ & లాజిస్టిక్స్ ఏజెన్సీ నిర్వహించాయి. రైల్‌గన్ మాక్ 6. 5 వేగంతో 40-మిమీ ప్రక్షేపకాన్ని కాల్చింది, ఇది ధ్వని వేగం కంటే ఆరు రెట్లు ఎక్కువ.

రైల్‌గన్ ఒక ప్రక్షేపకాన్ని హైపర్‌సోనిక్ వేగంతో వేగవంతం చేయడానికి శక్తివంతమైన విద్యుదయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగిస్తుంది. హైపర్‌సోనిక్ క్షిపణులు మరియు యాంటీ-షిప్ బాలిస్టిక్ క్షిపణులు వంటి అధునాతన బెదిరింపులను ఎదుర్కోవడానికి ఇది ఉపయోగపడుతుంది. జపాన్ ప్రభుత్వం ఇటీవలి సంవత్సరాలలో రైల్‌గన్ అభివృద్ధిలో భారీగా పెట్టుబడి పెట్టింది. ఈ విజయవంతమైన పరీక్ష వారికీ ఒక ప్రధాన మైలురాయి. రాబోయే దశాబ్దంలో తన యుద్ధనౌకలపై రైల్‌గన్‌లను మోహరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

రైల్‌గన్‌ల అభివృద్ధిని యునైటెడ్ స్టేట్స్, చైనా మరియు రష్యాతో సహా ఇతర దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. రైల్‌గన్‌లు నావికా యుద్ధాన్ని విప్లవాత్మకంగా మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. రైల్‌గన్‌ల విస్తరణ నావికా యుద్ధంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. రైల్‌గన్‌లు సాంప్రదాయ నావికా ఫిరంగి కంటే ఎక్కువ దూర లక్ష్యాలను ఖచ్చితత్వంతో చేరుకోవడానికి ఉపయోగించబడతాయి.

హిమాచల్‌లో అరుదైన పెయింట్ బ్రష్ స్విఫ్ట్ సీతాకోకచిలుక

హెస్పెరిడే కుటుంబానికి చెందిన అరుదైన సీతాకోకచిలుక జాతి అయిన పెయింట్ బ్రష్ స్విఫ్ట్ (బావోరిస్ ఫారి) హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో కనిపించింది. డల్హౌసీ ఫారెస్ట్ డివిజన్‌లోని భట్టియాట్ ఫారెస్ట్ రేంజ్ ప్రారంభించిన వైల్డ్ భట్టియాట్ ప్రాజెక్ట్ కింద నిర్వహించిన ఫీల్డ్ సర్వేలో ఇది కొనుగొనబడింది.

ఒకప్పుడు ఈశాన్య, మధ్య మరియు దక్షిణ భారతదేశంలో కనిపించే పెయింట్ బ్రష్ స్విఫ్ట్ జాతి 1878లో కనుగొనబడినప్పటి నుండి తర్వాత దేశంలో ఇప్పటి వరకు ఎక్కడ డాక్యుమెంట్ చేయబడలేదు. హిమాచల్ ప్రదేశ్ ప్రస్తుతం భారతదేశంలో కనిపించే 25% సీతాకోకచిలుక జాతులకు నిలయంగా ఉంది.

Post Comment