Advertisement
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ 01, 2023
Telugu Current Affairs

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ 01, 2023

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ 01, 2023. జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు తాజా సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్సీ, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, రైల్వే వంటి  వివిధ పోటీ పరీక్షల కోసం సిద్దమవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఇవి రూపొందించబడ్డాయి.

వన్ నేషన్ వన్ ఎలక్షన్ సాధ్యాసాధ్యాల కోసం రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ

లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని సెప్టెంబర్ 1, 2023న కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి, రాజ్యసభలో మాజీ ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ మరియు మాజీ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్‌కె సింగ్ సభ్యులుగా ఉన్నారు. ఈ ప్యానెల్ వచ్చే నెల రోజుల్లో తన నివేదికను సమర్పించే అవకాశం ఉంది.

కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 18 నుంచి ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు పిలుపునివ్వడంతో పాటుగా ఈ కమిటీని ఏర్పాటు చేయడంతో దేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ సాధ్యాసాధ్యాలపై మరియు ముందస్తు ఎన్నికల నిర్వహణపై చర్చలు ఊపందుకున్నాయి. వచ్చే నవంబర్-డిసెంబర్‌లో జరగబోయే తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటుగా అన్ని రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు.

ఒక దేశం, ఒకే ఎన్నికలు' అనే ఆలోచన గత కొన్నియేళ్ళుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుర్తుచేస్తూనే ఉన్నారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలు, స్థానిక సంస్థలతో సహా దేశంలోని అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనేది ఆయన ఆలోచన. దీనివల్ల డబ్బు, సమయం ఆదా అవడంతోపాటు ఎన్నికల సంఘంపై భారం కూడా తగ్గుతుందనేది నిపుణుల నమ్మకం. అయితే ఇది దేశంలోని సమాఖ్య నిర్మాణాన్ని నిర్వీర్యం చేస్తుందని మరియు కేంద్ర ప్రభుత్వానికి అధిక అధికారాన్ని ఇస్తుందనే ఆందోళనలు కూడా ఉన్నాయి.

"ఒక దేశం, ఒకే ఎన్నికలు" ప్రతిపాదనను అమలు చేయడంలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ఒక సవాలు ఏమిటంటే, రాష్ట్ర అసెంబ్లీల పదవీకాలం ఏకరీతిగా ఉండదు. కొన్ని రాష్ట్రాలకు ఐదేళ్లు, మరికొన్ని రాష్ట్రాలకు నాలుగేళ్ల కాలపరిమితి ఉంటుంది. ఏకకాల ఎన్నికలు నిర్వహించే ముందు ఇది సమకాలీకరించబడాలి. మరొక సవాలు ఏమిటంటే, "ఒక దేశం, ఒకే ఎన్నికలు" ప్రతిపాదనకు రాజ్యాంగ సవరణ అవసరం. దీనికి పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలలో మూడింట రెండు వంతుల సభ్యుల ఆమోదం అవసరం ఉంటుంది.

మెజారిటీ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉండటంతో ఈ ఆలోచన వారి పార్టీల మనుగడకు ప్రశ్నర్ధకం చేస్తుంది. కావున ఈ ఆలోచనను ఆయా ప్రభుత్వాలు ఆమోదించే అవకాశం ఉండదు. రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని ప్యానెల్ ఈ సవాళ్లన్నింటినీ పరిశీలించి, “ఒకే దేశం, ఒకే ఎన్నికలు” ప్రతిపాదనను ఎలా అమలు చేయాలనే దానిపై సిఫార్సులు చేయాల్సి ఉంటుంది. భారతదేశాన్ని నిజంగా ఒక దేశంగా మార్చే ప్రక్రియలో ఈ ప్యానెల్ యొక్క నివేదిక ముఖ్యమైన భూమిక పోషించనుంది.

నవ భారత్ సాక్షరత అవగాహన కోసం అక్షరాస్యత వారోత్సవం

అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని 2023 సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 8 వరకు అక్షరాస్యత వారోత్సవాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉల్లాస్-నవ్ భారత్ సాక్షరత కార్యక్రమం గురించి పౌరులకు అవగాహన కల్పించేందుకు దీనిని రూపొందించింది.

ఈ వారం రోజుల పాటు జరిగే ఈ అక్షరాస్యత ప్రచారం దేశంలోని ప్రతి పౌరునిలో కర్తవ్యబోధ్ మరియు జనభాగిదారి భావాన్ని పెంపొందించడానికి సామూహిక భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి సహాపడుతుందని భావిస్తున్నారు. ఈ దార్శనికత ఈ పథకాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చి భారతదేశాన్ని సంపూర్ణ అక్షరాస్యతను సాధించే లక్ష్యాన్ని చేరుకోవడంలో సహాయపడుతుంది ఆశిస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమం సెప్టెంబర్ 8న జరుపుకునే అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవంతో ముగుస్తుంది.

నవ భారత్ సాక్షరత కార్యక్రమం (ఉల్లాస్) అనేది 15 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వయోజనులందరికి నూతన సాంకేతిక అనువర్తనాల ఆధారంగా ప్రాథమిక విద్యను, నైపుణ్య శిక్షణను అందించే కార్యక్రమం. దీనిని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. 2030 నాటికి భారతదేశాన్ని సంపూర్ణ అక్షరాస్యత కలిగిన దేశంగా మార్చడమే దీని ప్రధాన లక్ష్యం.

భారతదేశంలో సార్వత్రిక అక్షరాస్యత లక్ష్యాన్ని సాధించేందుకు ఈ అక్షరాస్యత వారోత్సవ ప్రచారం దోహదపడుతుందని విద్యా మంత్రిత్వ శాఖ విశ్వసిస్తోంది. కలిసి పని చేయడం ద్వారా, లక్షలాది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావచ్చు మరియు మరింత అక్షరాస్యత మరియు సంపన్న దేశాన్ని నిర్మించవచ్చు అనేది వారి భావన.

ఎన్‌సిఇఆర్‌టికి డీమ్డ్ యూనివర్శిటీ హోదా మంజూరు

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సిఇఆర్‌టి)కి యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) డీమ్డ్ యూనివర్సిటీ హోదాను మంజూరు చేసింది. సెప్టెంబర్ 1, 2023న ఎన్‌సిఇఆర్‌టికి 63వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ ప్రకటన చేశారు.

డీమ్డ్ యూనివర్శిటీ హోదా అనేది ఉన్నత విద్యా స్థాయిని కలిగి ఉన్న సంస్థలకు మంజూరు చేయబడే ఒక ప్రత్యేక హోదా. ఇది ఆ సంస్థలను వారి స్వంత డిగ్రీలను ప్రదానం చేయడానికి మరియు వారి సొంత విద్యా కార్యక్రమాలు మరియు కార్యకలాపాలలో ఎక్కువ స్వయంప్రతిపత్తిని కలిగి ఉండటానికి అనుమతిస్తుంది.

ఎన్‌సిఇఆర్‌టి అనేది అనేది భారత విద్యా వ్యవస్థలను పర్యవేక్షించే అత్యున్నత విద్యా సంస్థ. ఇది దేశంలో పాఠశాల విద్య కోసం జాతీయ అపెక్స్ బాడీగా 1961లో స్థాపించబడింది. దేశవ్యాప్తంగా పాఠశాలల కోసం పాఠ్యపుస్తకాలు, పాఠ్యాంశాలు మరియు బోధన-అభ్యాస సామగ్రిని అభివృద్ధి చేయడం మరియు వ్యాప్తి చేయడం దీని ప్రధాన బాధ్యత. ఇది విద్యలో పరిశోధనలు మరియు ఉపాధ్యాయులకు శిక్షణ కూడా అందిస్తుంది.

ఎన్‌సిఇఆర్‌టికి డీమ్డ్ యూనివర్శిటీ హోదా కల్పించడం అనేది విద్యారంగంలో మరింత చురుకైన పాత్రను పోషించేందుకు వీలు కల్పించే ఒక ముఖ్యమైన దశ. ఈ హోదా ఎన్‌సిఇఆర్‌టికి విస్తృత శ్రేణి విద్యా కార్యక్రమాలను అందించేందుకు, మరింత అత్యాధునిక పరిశోధనలను చేపట్టేందుకు అవకాశం కల్పిస్తుంది. ఈ నిర్ణయం భారతదేశంలో పాఠశాల విద్య నాణ్యతను మెరుగుపరచడానికి మరియు 21వ శతాబ్దపు అవసరాలకు మరింత సందర్భోచితంగా చేయడానికి కూడా సహాయపడుతుంది.

ఆకాశవాణి ప్రిన్సిపల్ డిజిగా డాక్టర్ వసుధ గుప్తా బాధ్యతలు స్వీకరణ

సీనియర్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫీసర్ డాక్టర్ వసుధ గుప్తా ఆకాశవాణి మరియు న్యూస్ సర్వీసెస్ డివిజన్ ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు. గత ఒక ఏడాది ఈ సంస్థలో కీలక బాధ్యతలు స్వీకరించిన ఆమె, ఆకాశవాణిని పునరుద్ధరించడంలో కీలకపాత్ర పోషించారు.

డాక్టర్ గుప్తా 1989-బ్యాచ్ అధికారిని, తన 33 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖలో వివిధ హోదాల్లో ఆమె పనిచేశారు. గతంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) డైరెక్టర్ జనరల్‌గా కూడా పనిచేశారు. పీఐబీలో ఆమె పని చేస్తున్న సమయంలో, కోవిడ్ మహమ్మారి సమాచార వ్యాప్తి ఉత్పత్తులను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. వివిధ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో భారత ప్రభుత్వానికి ఫీడ్‌బ్యాక్ డ్యాష్‌బోర్డ్‌ను అభివృద్ధి చేయడంలో ముఖ్యమైన చొరవకు నాయకత్వం వహించారు.

కక్రాపర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ యూనిట్-3 కార్యకలాపాలు ప్రారంభం

గుజరాత్‌లోని కక్రాపర్‌లో స్వదేశీంగా అభివృద్ధి చేసిన మొదటి 700 మెగావాట్ల అణు విద్యుత్ ప్లాంట్ యొక్క యూనిట్-3 పూర్తి సామర్థ్యంతో కార్యకలాపాలు ప్రారంభించింది. కక్రాపర్ అటామిక్ పవర్ ప్రాజెక్ట్ (కెఎపిపి)లోని రియాక్టర్ జూన్ 30 న వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించగా, ఇప్పటి వరకు దాని సామర్థ్యంలో 90 శాతం మాత్రమే పనిచేస్తోంది. అయితే ఆగస్ట్ 31 నుండి దాని పూర్తి సామర్థ్యంతో పనిచేయడం ప్రారంభించింది. ఈ ప్లాంట్‌లోని మొదటి రెండు యూనిట్లు, 700 మెగావాట్ల పీహెచ్‌డబ్ల్యూఆర్‌లు, వరుసగా 1993 మరియు 2000లో ప్రారంభించబడ్డాయి.

కెఎపిపి యొక్క మూడవ యూనిట్‌ను ప్రారంభించడం భారతదేశ అణుశక్తి కార్యక్రమంలో ఒక ప్రధాన మైలురాయి. దేశీయంగా అభివృద్ధి చేసిన 700 మెగావాట్ల పీహెచ్‌డబ్ల్యూఆర్‌ను ప్రారంభించడం ఇదే తొలిసారి. భారతీయ అణు శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్లకు ఇది ఒక ముఖ్యమైన విజయం. కెఎపిపి సంవత్సరానికి దాదాపు 2,100 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందని అంచనా. గుజరాత్ మరియు భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చడానికి ఇది సహాయపడుతుంది.

6వ రాష్ట్రీయ పోషణ మాహ్ కార్యక్రమం ప్రారంభం

6వ రాష్ట్రీయ పోషణ్ మాహ్ కార్యక్రమంను ఈ ఏడాది 1 సెప్టెంబర్ నుండి 30 సెప్టెంబర్ మధ్య నిర్వహించారు. ఈ కార్యక్రమం "సుపోషిత్ భారత్, సాక్షర భారత్, సశక్త్ భారత్" అనే థీమ్‌తో జరిగింది. పోషకాహార లోపం మరియు ఆరోగ్యం, విద్య మరియు ఆర్థిక ఉత్పాదకతపై దాని ప్రభావం గురించి అవగాహన పెంపొందించడం ఈ రాష్ట్రీయ పోషణ్ మాహ్ యొక్క ప్రధాన లక్ష్యం.

మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ రాష్ట్రీయ పోషణ్ మాహ్ వేడుకకు నాయకత్వం వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలు మరియు కార్పొరేట్‌ సంస్థలతో సహా పలు రకాల భాగస్వాములతో కలిసి నెల పొడవునా దీనికి చెందిన వివిధ ఈవెంట్‌లు మరియు కార్యకలాపాలను నిర్వహించింది.

ఈ కార్యక్రమం ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, కౌమారదశలో ఉన్న బాలికలు మరియు ఆరేళ్లలోపు పిల్లలతో సహా అన్ని వయసుల మరియు నేపథ్యాల ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, తల్లిపాలు మరియు ఇతర పోషకాహార సంబంధిత పద్ధతులను ప్రోత్సహించడంపై దృష్టి పెడుతుంది. ఇందులో భాగంగా ప్రజా చైతన్య ప్రచారాలు, ర్యాలీలు ఆరోగ్య శిబిరాలు మరియు వర్క్‌షాప్‌ల ద్వారా అవగహన కల్పిస్తారు.

భారతదేశంలో పోషకాహార లోపం సమస్యను పరిష్కరించడానికి 6వ రాష్ట్రీయ పోషణ్ మాహ్ ఒక ముఖ్యమైన కార్యక్రమం. పోషకాహార లోపం అనేది ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్య, ఇది ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. పోషకాహారం గురించి అవగాహన పెంచడం మరియు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడం ద్వారా, ప్రచారం భారతీయ జనాభా యొక్క పోషకాహార స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

లడఖ్‌లో మొట్టమొదటి ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఈవెంట్

కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లో మొట్టమొదటి ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఈవెంట్ నిర్వహించబడింది. క్లైమేట్ ఫుట్‌బాల్ కప్ 2023 పేరుతొ నిర్వహించిన ఈ ఈవెంట్ సెప్టెంబర్ 1-7, 2023 మధ్య లేహ్‌లోని స్పిటుక్‌లోని ఓపెన్ ఆస్ట్రోటర్ఫ్ స్టేడియంలో జరపబడింది. లడఖ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ మరియు లడఖ్ స్పోర్ట్స్ కౌన్సిల్ దీనిని నిర్వహించాయి.

ఈ టోర్నీలో ఢిల్లీ ఫుట్‌బాల్ క్లబ్, టిబెటన్ ఫుట్‌బాల్ నేషనల్ ఫుట్‌బాల్ అసోసియేషన్, లడఖ్ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్లబ్ మరియు లడఖ్ రాష్ట్ర జట్లు పాల్గొన్నాయి. సముద్ర మట్టానికి 11000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఓపెన్ స్టేడియం అనేది లడఖ్‌లో కృత్రిమ గడ్డితో కూడిన అల్ట్రామోడర్న్ స్పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇది ఇటీవల ఖేలో ఇండియా ప్రోగ్రామ్ కింద ముప్పై వేల మంది ప్రేక్షకుల సామర్థ్యంతో నిర్మించబడింది. ఇది ప్రపంచంలోని ఎత్తైన ప్రాంతంలో ఉన్న స్టేడియంలలో ఒకటిగా పేరుగాంచింది.

ఆధార్ అనుసంధానిత జనన నమోదును ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా నాగాలాండ్

ఆధార్-లింక్డ్ బర్త్ రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రారంభించిన మొదటి ఈశాన్య రాష్ట్రంగా నాగాలాండ్ గుర్తింపు పొందింది. ఈ చొరవ 1 నుండి 5 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఆధార్ నమోదు ఆధారంగా జనన నమోదును సులభతరం చేస్తుంది. వివిధ సామాజిక సంక్షేమ పథకాలను పిల్లలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఈ చొరవ సహాయపడుతుంది. దీని కోసం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాతో రాష్ట్ర పభుత్వం కలిసి పనిచేస్తుంది.

37 ఏళ్ల తర్వాత భారత టాప్ చెస్ ప్లేయర్‌గా గుకేష్

తమిళనాడుకు చెందిన టీనేజ్ గ్రాండ్‌మాస్టర్ డి. గుకేష్ మూడు దశాబ్దాలకు పైగా భారతదేశపు టాప్ చెస్ ప్లేయర్‌గా ఉన్న లెజెండరీ విశ్వనాథన్ ఆనంద్ స్థానంను అధిగమించాడు. తాజా అంతర్జాతీయ చదరంగం సమాఖ్య ర్యాంకింగ్ ప్రకారం 2758 రేటింగ్‌తో ఆయన భారత్ టాప్ చెస్ క్రీడాకారునిగా అవతరించడంతో పాటుగా ప్రపంచ చెస్ ర్యాంకింగులో 8వ స్థానంలో నిలిచాడు.

దీనితో 1986 నుండి భారతదేశం యొక్క టాప్-ర్యాంక్ ఆటగాడిగా ఉన్న ఆయన గురువు విశ్వనాథన్ ఆనంద్‌ను అధిగమించాడు. డి. గుకేష్, ఆయన ఆయన గురువు విశ్వనాథన్ ఆనంద్‌ కంటే కేవలం నాలుగు పాయింట్ల అధిక రేటింగుతో ఈ ఘనత దక్కించుకున్నాడు. తాజా ఎఫ్ఐడిఈ రేటింగ్‌ల ప్రకారం, గుకేశ్ 2758 రేటింగ్‌ను కలిగి ఉండగా, ఆనంద్‌కి 2754 రేటింగ్ ఉంది.

ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారతదేశ జిడిపి వృద్ధి 7.8% నమోదు

నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ షేర్ చేసిన అధికారిక డేటా ప్రకారం భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-2024) ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి నమోదు అయ్యింది. ఇది 2022-23 ఆర్థిక సంవత్సరం క్రితం జనవరి-మార్చి త్రైమాసికంలో నమోదు అయినా 6.1 శాతం వృద్ధితో పోలిస్తే మెరుగైన ఫలితంగా ఉంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుతుపవనాల వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ ఆర్థిక వృద్ధిరేటు 6.5 శాతానికి చేరుకుంటుందని భావిస్తున్నారు. ప్రభుత్వం మరియు రిజర్వ్ బ్యాంక్ రెండూ సరఫరాను నిర్వహించడానికి మరియు ధరలను అదుపులో ఉంచడానికి తగిన చర్యలు తీసుకుంటున్నందున ద్రవ్యోల్బణం అదుపు తప్పే అవకాశం లేదని భావిస్తున్నారు.

మొత్తంమీద, 7.8% జిడిపి వృద్ధి భారత ఆర్థిక వ్యవస్థకు సానుకూల సంకేతం. కొవిడ్-19 మహమ్మారి నుండి ఆర్థిక వ్యవస్థ బాగా కోలుకోవడంతో పాటుగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దాని వృద్ధి లక్ష్యాలను సాధించడానికి ట్రాక్‌లో ఉందని ఇది చూపిస్తుంది.

అక్టోబర్‌ను హిందూ వారసత్వ నెలగా ప్రకటించిన జార్జియా

అమెరికాలోని జార్జియా రాష్ట్రం అక్టోబర్‌ను హిందూ వారసత్వ మాసంగా ప్రకటించింది. సెప్టెంబర్ 1, 2023న గవర్నర్ బ్రియాన్ కెంప్ ఈ ప్రకటన చేశారు. ఆ రాష్ట్రంలో నివసిస్తున్న శక్తివంతమైన హిందూ-అమెరికన్ కమ్యూనిటీ చేసిన విలువైన సహకారానికి గుర్తింపుగా దీనిని ప్రకటించారు.

యునైటెడ్ స్టేట్స్‌లో దాదాపు మూడు మిలియన్ల మంది హిందువులు నెళవైఉన్నరు. హిందూ మతం అమెరికాలో మూడవ అతిపెద్ద మతంగా ఉంది. ఈ అధికారిక ప్రకటన ప్రకారం, అక్టోబర్ నెలలో, జార్జియా రాష్ట్రంలోని హిందూ సమాజం వారి సంస్కృతి మరియు ఆధ్యాత్మిక సంప్రదాయాలను సమిష్టిగా సెలెబ్రేట్ చేసుకునే అవకాశం లభిస్తుంది.

బీసీసీఐ యొక్క టీవీ & డిజిటల్ మీడియా హక్కులు వయాకామ్ 18 సొంతం

వయాకామ్ 18, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ అంతర్జాతీయ మరియు దేశీయ మ్యాచ్‌ల కోసం ప్రత్యేక మీడియా హక్కులను వచ్చే ఐదేళ్ల కాలానికి రూ. 5,963 కోట్లకు దక్కించుకుంది. ఈ ఒప్పందం ప్రకారం 2023 నుండి 2028 వరకు 88 మ్యాచ్‌ల ప్రచార హక్కులు వయాకామ్ 18 కి లభిస్తాయి. ఇందులో 25 టెస్టులు, 27 వన్డే మ్యాచులు మరియు 36 టీ20 మ్యాచులు ఉన్నాయి.

రిలియన్స్ ఇండిస్ట్రిస్ ఆధీనంలోని వయాకామ్18, స్పోర్ట్18 మరియు జియో సినిమాలు ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కి డిజిటల్ హక్కులను కూడా కలిగి ఉన్నాయి. తాజా ఒప్పందంతో భారతీయ స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టింగ్ మార్కెట్‌లో ఏకైక అతిపెద్ద సంస్థగా వయాకామ్ 18 అవతరించింది.

Post Comment