Advertisement
రోజువారీ కరెంట్ అఫైర్స్ 22 నవంబర్ 2023 | Current affairs in Telugu
Telugu Current Affairs

రోజువారీ కరెంట్ అఫైర్స్ 22 నవంబర్ 2023 | Current affairs in Telugu

తెలుగు ఎడ్యుకేషన్ కరెంట్ అఫైర్స్ 22 నవంబర్ 2023. తాజా జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి వివిధ పోటీ పరీక్షల కొరకు సిద్దమవుతున్న అభ్యర్థులకు ఇవి ఉపయోగపడతాయి.

ఎస్‌బిఐ మేనేజింగ్ డైరెక్టర్‌గా వినయ్ ఎం టోన్సే

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన మేనేజింగ్ డైరెక్టర్‌గా వినయ్ ఎం టోన్సే నియమితులయ్యారు. టోన్సే వచ్చే రెండేళ్ల కాలానికి అంటే నవంబర్ 30, 2025 వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. టోన్సే ప్రస్తుతం ఇదే బ్యాంకులో  డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను నలుగురు మేనేజింగ్ డైరెక్టర్లు మరియు ఒక ఛైర్మన్ నిర్వహిస్తారు.

వినయ్ ఎం టోన్సే 1988లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా కెరీర్ ప్రారంభించారు. బ్యాంకింగ్ రంగంలో అయన 30 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగివున్నారు. కార్పొరేట్ క్రెడిట్, ట్రెజరీ, రిటైల్ మరియు అంతర్జాతీయ బ్యాంకింగ్ వంటి వాణిజ్య బ్యాంకింగ్ యొక్క విభిన్న కోణాలలో ఆయనకు అనుభవం ఉంది.

భారతదేశం, లిథువేనియా 9వ విదేశాంగ కార్యాలయ సంప్రదింపులు

భారతదేశం మరియు లిథువేనియా నవంబర్ 21, 2023 న న్యూ ఢిల్లీలో తమ 9వ విదేశాంగ కార్యాలయ సంప్రదింపులు నిర్వహించాయి. ఈ సమావేశానికి భారతదేశం నుండి విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ వర్మ మరియు లిథువేనియా నుండి విదేశాంగ శాఖ ఉప మంత్రి ఎగిడిజస్ మెయిలనాస్ నాయకత్వం వహించారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్ వివాదం, భారతదేశం యొక్క జీ20 ప్రెసిడెన్సీ, బహుపాక్షిక వేదికలలో సహకారం మరియు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణలతో సహా పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ప్రాంతీయ మరియు ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలను పంచుకున్నారు.

అలానే ఇరు దేశాలలో వాణిజ్యం, పెట్టుబడులు, సాంస్కృతిక అనుసంధానం వంటి రంగాల్లో సంబంధాలను మరింతగా పెంచుకోవడంపై కూడా ఇరు పక్షాలు చర్చించుకున్నారు. రిపబ్లిక్ ఆఫ్ లిథువేనియా ఐరోపాలోని బాల్టిక్ ప్రాంతంలో ఉన్న ఒక దేశం. ఇది మూడు బాల్టిక్ రాష్ట్రాలలో ఒకటి. ఇది బాల్టిక్ సముద్రం యొక్క తూర్పు ఒడ్డున ఉంది.

  • రాజధాని : విల్నియస్
  • అధికారిక భాష : లిథువేనియన్
  • ప్రధాన మంత్రి : ఇంగ్రిడా షిమోనిటే
  • అధ్యక్షుడు : గీతానాస్ నౌసేదా

ధహన్ ప్రైజ్ అందుకున్న మొదటి మహిళగా దీప్తి బాబుత

పంజాబీ రచయిత్రి దీప్తి బాబుత తన "లమ్హాన్" పుస్తకానికి గాను పంజాబీ సాహిత్య అవార్డు ధహన్ బహుమతిని అందుకున్నారు. దీనితో పంజాబీ సాహిత్యానికి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులలో ఒకటైన ఈ బహుమతిని గెలుచుకున్న మొదటి మహిళగా ఆమె నిలిచారు. నవంబర్ 16న సర్రేలో జరిగిన ఒక వేడుకలో ఈ అవార్డు ఆమెకు అందజేశారు. ఈ అవార్డు విలువ $ 25,000 డాలర్లు.

ధహన్ ప్రైజ్ అనేది కెనడా - ఇండియా ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా పంజాబీ ఫిక్షన్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన రచయతలకు అందించే వార్షిక బహుమతి. దీనిని పంజాబీకి చెందిన గురుముఖి లేదా షాముఖి లిపిలో వ్రాసిన మూడు కల్పిత పుస్తకాలకు బహుమతి ఇవ్వబడుతుంది. ఈ బహుమతి కెనడియన్ పంజాబీ వ్యాపారవేత్త బార్జ్ సింగ్ ధహన్ పేరు మీద అందించబడుతుంది. ఈ అవార్డును 201 నుండి అందిస్తున్నారు.

శారీ వాకథాన్ కోసం ఈ-రిజిస్ట్రేషన్ పోర్టల్ ప్రారంభం

టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో నిర్వహించే శారీ వాకథాన్ కోసం ఇ - రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను ప్రారంభించింది. భారతదేశంలోని చేనేత చీరల సంస్కృతిని ప్రోత్సహించడానికి ఈ వాకథాన్ నిర్వహించబడుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు వాకథాన్‌లో పాల్గొని చీరలు కట్టే విధానాన్ని ప్రదర్శించేందుకు ఆహ్వానిస్తున్నారు. భారతదేశం యొక్క "భిన్నత్వంలో ఏకత్వం" భావనను ప్రదర్శించడం కోసం దీనిని ఏర్పాటు చేస్తున్నారు.

ఈ ఇ-రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రి దర్శన జర్దోష్ నవంబర్ 21, 2023 న ప్రారంభించారు. ఆసక్తి ఉన్నవారు మొబైల్ నెంబర్ ఓటీపీ ఆధారితంగా రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. డిసెంబర్ 10న ముంబైలోని ఎంఎంఆర్‌డీఏ గ్రౌండ్‌లో ఈ శారీ వాకథాన్‌ నిర్వహించనున్నారు.

ఇప్పటికే  మొదటి చీర వాకథాన్ సూరత్‌లో నిర్వహించబడింది. ఇందులో 15,000 మందికి పైగా మహిళలు వివిధ రకాల చీరలు ధరించి ఫిట్‌నెస్ మరియు సంప్రదాయ వస్త్రాల స్ఫూర్తిని ప్రోత్సహించే లక్ష్యంతో పాల్గొన్నారు. ఇది విజయవంతం అయిన తర్వాత, ముంబై దేశంలోనే అతిపెద్ద శారీ వాకథాన్‌కు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఈవెంట్ మహిళల్లో ఫిట్‌నెస్ గురించి అవగాహన పెంచడం మరియు ఆరోగ్యకరమైన జీవన అలవాట్లు ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్‌ విజేతగా పంకజ్ అద్వానీ

నవంబర్ 21 న దోహాలో జరిగిన ఐబిఎస్ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను భారత క్యూయిస్ట్ పంకజ్ అద్వానీ 26వ సారి గెలుచుకున్నాడు. అంతర్జాతీయ బిలియర్డ్స్ & స్నూకర్ ఫెడరేషన్ (ఐబిఎస్ఎఫ్) అనేది ప్రపంచవ్యాప్తంగా నాన్-ప్రొఫెషనల్ స్నూకర్ మరియు ఇంగ్లీష్ బిలియర్డ్స్‌ను నిర్వహించే సంస్థ. ఇది 1971లో స్థాపించబడింది. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఖతార్‌లోని దోహాలో ఉంది.

పంకజ్ అర్జన్ అద్వానీ ప్రముఖ భారతీయ బిలియర్డ్స్ మరియు ప్రొఫెషనల్ స్నూకర్ ప్లేయర్. 2003లో అద్వానీ తన మొదటి ప్రపంచ టైటిల్‌ను గెలుచుకున్నాడు . బిలియర్డ్స్ మరియు స్నూకర్ రెండింటిలో అన్ని ఫార్మాట్లలో ప్రపంచ టైటిల్స్ గెలుచుకున్న ఏకైక ఆటగాడు. పంకజ్ అద్వానీ భారత ప్రభుత్వం నుండి పద్మభూషణ్, పద్మశ్రీ మరియు అర్జున అవార్డు కూడా అందుకున్నాడు.

కిష్త్వార్ జిల్లాలోని కుంకుమపువ్వుకు జీఐ ట్యాగ్‌

జమ్మూ మరియు కాశ్మీర్‌లోని పర్వతాలతో కూడిన కిష్త్వార్ జిల్లా కుంకుమ పువ్వుకు భౌగోళిక సూచికల రిజిస్ట్రీ భౌగోళిక సూచిక (జీఐ) ట్యాగ్‌ని మంజూరు చేసింది. కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలతో పాటు జమ్మూలోని కిష్త్వార్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ సుగంధ పంటను పండిస్తారు. ఈ ప్రాంతంలో ఇది అత్యంత ఖరీదైన పంట. కిష్త్వార్ కుంకుమపువ్వు ఉత్పత్తి ప్రాంతాన్ని స్థానికంగా మండల్ అని పిలుస్తారు.

కిష్త్వార్ కుంకుమపువ్వు దాని గొప్ప సువాసన, శక్తివంతమైన రంగు మరియు అధిక క్రోసిన్ కంటెంట్‌కు ప్రసిద్ధి చెందింది. క్రోసిన్ అనేది కుంకుమపువ్వు నుండి ఎరుపు రంగును ఇచ్చే ఒక సమ్మేళనం. ఈ కుంకుమపువ్వు కిష్త్వార్ జిల్లాలోని ఎత్తైన ప్రాంతాలలో పండిస్తారు. ఈ ప్రాంతంలో ఉండే చల్లని వాతావరణం, ఎత్తైన ప్రదేశాలు దాని ప్రత్యేక రుచి మరియు సువాసనకు దోహదం చేస్తాయి.

కిష్త్వార్ కుంకుమపువ్వు పెంపకందారులకు జీఐ ట్యాగ్ ఒక ముఖ్యమైన ప్రోత్సాహం. ఇది కిష్త్వార్ కుంకుమపువ్వు ఖ్యాతిని కాపాడేందుకు మరియు నకిలీ ఉత్పత్తుల విక్రయాలను నిరోధించడానికి సహాయపడుతుంది. దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో కుంకుమపువ్వును ప్రోత్సహించడానికి కూడా ఇది సహాయపడుతుంది.

లడఖ్ బక్‌థార్న్‌కి జీఐ ట్యాగ్‌

జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జిఐ) రిజిస్ట్రీ భారతదేశంలోని 'లడఖ్ సీ బక్‌థార్న్'కి జిఐ ట్యాగ్‌ని మంజూరు చేసింది. ఈ విలువైన పంటను పండించే ఈ ప్రాంతం మరియు రైతులకు ఈ గుర్తింపు ఒక ముఖ్యమైన విజయం. సీ బక్‌థార్న్ (హిప్పోఫే రామ్‌నోయిడ్స్) అనేది లడఖ్‌తో సహా హిమాలయాలలోని ఎత్తైన ప్రాంతాలలో పెరిగే చిన్న ముళ్ల పొద. ఈ మొక్క దాని ప్రకాశవంతమైన నారింజ బెర్రీలకు ప్రసిద్ధి చెందింది. ఇవి అధిక విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి. సీ బక్థార్న్ బెర్రీలు శతాబ్దాలుగా సాంప్రదాయ వైద్యంలో వివిధ రకాల వ్యాధుల చికిత్సకు ఉపయోగించబడుతున్నాయి.

ఈ గుర్తింపు లడఖ్ సీ బక్‌థార్న్ ఖ్యాతిని కాపాడేందుకు మరియు నకిలీ ఉత్పత్తుల విక్రయాలను నిరోధించడానికి సహాయపడుతుంది. దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో ఉత్పత్తిని ప్రోత్సహించడానికి కూడా ఇది సహాయపడుతుంది. అదనంగా, ఈ ప్రాంతంలో సీ బక్‌థార్న్ పెంపకందారుల ఆదాయాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది. ఇప్పటి వరకు లడఖ్ ప్రాంతం నుండి ఐదు ఉత్పత్తులకు జీఐ ట్యాగులు లభించాయి.

  1. లడఖ్ పష్మినా : చంగ్రా మేక యొక్క అండర్ కోట్ నుండి తయారు చేయబడిన చక్కటి, మృదువైన ఉన్ని.
  2. లడఖ్ ఆప్రికాట్ (రక్త్సే కార్పో) : లడఖ్ ప్రాంతంలో పండించే ఒక రకమైన నేరేడు పండు.
  3. లడఖ్ సీ బక్‌థార్న్: సీ బక్‌థార్న్ అనేది హిమాలయాలలోని చల్లని, పర్వత ప్రాంతాలలో పెరిగే ఒక పొద.
  4. లడఖ్ వుడ్ కార్వింగ్ : లడఖ్‌లో శతాబ్దాలుగా ఆచరించబడుతున్న ఒక సాంప్రదాయక కళారూపం.
  5. బసోలి పెయింటింగ్ : బసోలి ప్రాంతంలో ఉద్భవించిన సూక్ష్మ చిత్రలేఖనం.

Post Comment