Advertisement
తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 11 ఫిబ్రవరి 2024
February Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 11 ఫిబ్రవరి 2024

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 11 ఫిబ్రవరి 2024. పోటీ పరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆశావహుల కోసం వీటిని ప్రత్యేకంగా రూపొందిస్తున్నాం.

హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్‌కు భారతరత్న అవార్డు

ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త మరియు భారత హరిత విప్లవ పితామహుడుగా గుర్తింపు పొందిన ఎంఎస్ స్వామినాథన్‌కు మరణానంతరం ప్రతిష్టాత్మకమైన భారతరత్న అవార్డును అందజేశారు. భారతీయ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమానికి ఆయన చేసిన కృషికి గాను ఆయనకు ఈ అవార్డు అందజేసినట్లు ప్రధాని మోడీ ఫిబ్రవరి 9న తన ట్విటర్ ఖాతా ద్వారా తెలిపారు.

స్వామినాథన్ 1925లో తమిళనాడులోని కుంభకోణంలో జన్మించారు. అతను కోయంబత్తూరు వ్యవసాయ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్, న్యూఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నుండి పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. స్వామినాథన్ బంగాళాదుంపలు, గోధుమలు, బియ్యం, సైటోజెనెటిక్స్, అయోనైజింగ్ రేడియేషన్ మరియు రేడియోసెన్సిటివిటీ వంటి రంగాలలో ప్రాథమిక పరిశోధనలకు సహకరించారు.

స్వామినాథన్ 1972లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసిఏఆర్) డైరెక్టర్ జనరల్‌గా మరియు భారత ప్రభుత్వ కార్యదర్శిగా నియమితులయ్యారు. అలానే 1982లో ఫిలిప్పీన్స్‌లోని ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఆర్‌ఆర్‌ఐ) కి మొదటి ఆసియా డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. 2004లో ఏర్పాటైన రైతుల యొక్క జాతీయ కమిషన్‌కు అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. 2007లో రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ద్వారా రాజ్యసభకు నామినేట్ చేయబడ్డారు.

స్వామినాథన్ 1987లో మొదటి ప్రపంచ ఆహార బహుమతిని అందుకున్నారు. ఈ బహుమతి డబ్బును ఆయన ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను స్థాపించడానికి ఉపయోగించుకున్నారు. నార్మన్ బోర్లాగ్ తర్వాత ప్రపంచ ఆహార బహుమతి ఎంపిక కమిటీకి అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. స్వామినాథన్ 2002 నుండి 2005 వరకు ఆకలిపై ఐక్యరాజ్యసమితి మిలీనియం ప్రాజెక్ట్‌కు సహ-అధ్యక్షుడిగా ఉన్నారు మరియు 2002 మరియు 2007 మధ్య సైన్స్ మరియు ప్రపంచ వ్యవహారాలపై పగ్‌వాష్ కాన్ఫరెన్స్‌లకు అధిపతిగా ఉన్నారు.

స్వామినాథన్ 1960ల ప్రారంభంలో, అధిక దిగుబడినిచ్చే గోధుమలు మరియు వరి రకాలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ రకాలు, మెరుగైన నీటిపారుదల మరియు ఎరువుల వాడకం వంటి ఇతర అంశాలతో సంబంధం లేకుండా భారతదేశ ఆహార ఉత్పత్తిని గణనీయంగా పెంచడానికి సహాయపడ్డాయి. ఫలితంగా, భారతదేశం 1970ల మధ్య నాటికి ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించగలిగింది.

స్వామినాథన్ పరిశోధనలు భారతదేశంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపాయి. అతను హరిత విప్లవం యొక్క వాస్తుశిల్పిలలో ఒకరిగా విస్తృతంగా పరిగణించబడ్డారు. అతని రచనలు మిలియన్ల మంది ప్రజలకు ఆహార భద్రత మరియు పోషకాహారాన్ని మెరుగుపరచడంలో సహాయపడ్డాయి.

స్వామినాథన్ ప్రపంచ ఆహార బహుమతితో పాటుగా రామన్ మెగసెసే అవార్డు మరియు పద్మ విభూషణ్‌ వంటి అనేక అవార్డులు మరియు గౌరవాలను అందుకున్నారు. అతను రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ మరియు యునైటెడ్ స్టేట్స్ యొక్క నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సభ్యుడుగా ఉన్నారు. స్వామినాథన్‌కు భారతరత్న అవార్డు అందివ్వడం, భారతీయ వ్యవసాయానికి మరియు ఆకలికి వ్యతిరేకంగా ప్రపంచ పోరాటానికి ఆయన చేసిన విశిష్టమైన కృషికి తగిన గుర్తింపుగా భావించాలి.

దుబాయిలో వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్ 2024

వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్ 2024 ఫిబ్రవరి 12-14 తేదీల మధ్య యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో జరిగింది. ఈ సదస్సు "షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్" అనే థీమ్‌తో నిర్వహించారు. ఈ సదస్సులో 20 మంది ప్రపంచ నాయకులు, 10 మంది అధ్యక్షులు మరియు 10 మంది ప్రధానులు పాల్గొన్నారు. 120 దేశాలకు చెందిన ప్రభుత్వాలు మరియు ప్రతినిధులు దీనికి ప్రాతినిధ్యం వహించారు.

వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్ 2024లో ఈ ఏడాది భారత్, టర్కీ మరియు ఖతార్ గౌరవ అతిధి దేశాలుగా పాల్గొన్నాయి. దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆహ్వానం మేరకు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన ప్రభుత్వాలు ప్రజాసేవలో, తమ విధానాలలో ఈజ్ ఆఫ్ లివింగ్, ఈజ్ ఆఫ్ జస్టిస్, ఈజ్ ఆఫ్ మోబిలిటీ, ఈజ్ ఆఫ్ ఇన్నోవేషన్ మరియు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన నొక్కి చెప్పారు.

వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్ 2024 ఎజెండాలో భాగంగా మానవాళికి మెరుగైన భవిష్యత్తును రూపొందించడంపై దృష్టి పెట్టింది. ఈ సదస్సు లో 6 ప్రధాన భవిష్యత్ ఇతివృత్తాలను హైలైట్ చేసింది. వాటిలో డిజిటల్ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు, ఆర్థిక అభివృద్ధి, ఎడ్యుకేషన్, సస్టైనబిలిటీ అండ్ ది న్యూ గ్లోబల్ షిఫ్ట్స్ మరియు ప్రపంచీకరణ & గ్లోబల్ హెల్త్ అంశాలు ఉన్నాయి.

వరల్డ్ గవర్నమెంట్స్ సమ్మిట్ అనేది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో జరిగే వార్షిక కార్యక్రమం. ఇది ఫ్యూచరిజం, టెక్నాలజీ ఇన్నోవేషన్ మరియు ఇతర అంశాలపై దృష్టి సారించే ప్రభుత్వ ప్రక్రియ మరియు విధానాల చర్చల కోసం ప్రపంచ నాయకులను ఒకచోట చేర్చుతుంది. మొదటి ప్రపంచ ప్రభుత్వాల శిఖరాగ్ర సమావేశం 2013లో దుబాయ్‌లో జరిగింది మరియు అప్పటి నుండి ఏటా నిర్వహించబడుతోంది.

స్పోర్ట్‌స్టార్ ఏసెస్ అవార్డులు 2024

2024 ఏడాదికి సంబంధించి స్పోర్ట్‌స్టార్ ఏసెస్ అవార్డులను భారతదేశంలో అత్యుత్తమ క్రీడాకారులు మరియు క్రీడా ప్రపంచానికి సహకరించిన వ్యక్తులకు అందించబడ్డాయి. ఈ సంవత్సరం 24 విభాగాల వారీగా వివిధ క్రీడలలో భారతదేశం యొక్క అత్యుత్తమ అథ్లెట్ల విజయాలకు ఈ అవార్డులు అందజేశారు. ఈ ఏడాది భారత క్రికెటర్ మహమ్మద్ షమీకి  స్పోర్ట్స్‌మెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును, భారత్ క్రికెట్ జట్టు కోచ్ రాహుల్ ద్రావిడ్‌కు కోచ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందజేశారు.

స్పోర్ట్‌స్టార్ ఏసెస్ అవార్డులు అనేవి ప్రముఖ క్రీడా వార్తాపత్రిక స్పోర్ట్‌స్టార్ మరియు ఆసియా కార్పొరేట్ లీడర్‌షిప్ & సస్టైనబిలిటీ ద్వారా అందించే వార్షిక క్రీడా అవార్డులు. ఈ కార్యక్రమం ముంబైలోని తాజ్ హోటల్ యందు అట్టహాసంగా నిర్వహించారు.

  • కోచ్ ఆఫ్ ది ఇయర్ : రాహుల్ ద్రవిడ్
  • స్పోర్ట్స్ మాన్ ఆఫ్ ది ఇయర్ (టీమ్) : హార్దిక్ సింగ్, మహ్మద్ షమీ
  • స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ (టీమ్) : వందనా కటారియా
  • స్పోర్ట్స్ మాన్ ఆఫ్ ది ఇయర్ (వ్యక్తిగతం) : సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి
  • స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ (వ్యక్తిగతం) : రమేష్‌బాబు వైశాలి, సిఫ్ట్ కౌర్ సమ్రా
  • స్పోర్ట్స్ మాన్ ఆఫ్ ది ఇయర్ (పారా స్పోర్ట్స్) : సుమిత్ యాంటిల్
  • స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ (పారాస్పోర్ట్స్) : తులసిమతి మురుగేషన్
  • స్పోర్ట్స్ మాన్ ఆఫ్ ది ఇయర్ (ట్రాక్ అండ్ ఫీల్డ్) : పురుషుల రిలే జట్టు
  • స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ (ట్రాక్ అండ్ ఫీల్డ్): పారుల్ చౌదరి
  • స్పోర్ట్ స్టార్ ఆఫ్ ది ఇయర్ (పురుషుడు) : నీరజ్ చోప్రా
  • స్పోర్ట్స్ స్టార్ ఆఫ్ ది ఇయర్ (మహిళ) : శీతల్ దేవి
  • యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ (పురుషుడు) : ప్రథమేష్ సమాధాన్ జావ్కర్
  • యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ (మహిళ) : తిలోత్తమ సేన్
  • నేషనల్ టీమ్ ఆఫ్ ది ఇయర్ : భారత పురుషుల క్రికెట్ జట్టు
  • క్లబ్/స్టేట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ : సౌరాష్ట్ర క్రికెట్ జట్టు
  • క్రీడల ప్రోత్సాహానికి సంబంధించి ఉత్తమ రాష్ట్రం : తమిళనాడు
  • ఏస్ ఆఫ్ ఏసెస్ అవార్డు : రోహన్ బోపన్న
  • లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు : చందు బోర్డే & కర్ణం మల్లీశ్వరి

న్యూఢిల్లీలో వరల్డ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ సమ్మిట్ 2024

వరల్డ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ సమ్మిట్‌ 2024 ఫిబ్రవరి 7 మరియు 9వ తేదీలలో న్యూఢిల్లీలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని భారత ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్‌ఖర్ ప్రారంభించారు. ఈ సమావేశానికి గయానా ప్రధాని మార్క్ ఫిలిప్స్, కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రి భూపేందర్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.ఈ సదస్సు ఇండియా హాబిటాట్ సెంటర్‌లో జరిగింది.

వరల్డ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ సమ్మిట్‌ను ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించింది. ఈ సదస్సు సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ సాధించే దిశగా ప్రపంచ ప్రయత్నాలను వేగవంతం చేయడంపై దృష్టి పెట్టింది. వాతావరణ మార్పులు, పునరుత్పాదక శక్తి, వనరుల సామర్థ్యం మరియు స్థిరమైన వ్యవసాయంపై చర్చలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ప్రసంగించిన వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధంఖర్, పర్యావరణ పరిరక్షణతో ఆర్థిక వృద్ధిని సమతుల్యం చేసే భారతదేశం యొక్క చొరవలను గుర్తు చేస్తూ, భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు స్ఫూర్తిదాయకంగా పనిచేస్తుంది అని అన్నారు.

వరల్డ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ సమ్మిట్ అనేది స్వతంత్ర పరిశోధనా సంస్థ అయిన ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్‌చే నిర్వహించబడే వార్షిక సమావేశం. ఇది ఢిల్లీ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ సమ్మిట్‌గా 2001లో స్థాపించబడింది. ప్రస్తుతం జరిగింది ఈ సమ్మిట్ యొక్క 23వ ఎడిషన్. 2005 నుండి ప్రతి సంవత్సరం ఒక ప్రముఖ ప్రపంచ నాయకుడికి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ లీడర్‌షిప్ అవార్డ్ ప్రదానం చేస్తున్నారు. ఈ అవార్డు సుస్థిర అభివృద్ధి రంగంలో వారి సేవలను సత్కరిస్తుంది.

2024 పాకిస్తాన్ సాధారణ ఎన్నికలు

పాకిస్థాన్‌ 16వ జాతీయ అసెంబ్లీ ఎన్నికలు 8 ఫిబ్రవరి 2024న గందరగోళ పరిస్థితుల నడుమ నిర్వహించబడ్డాయి. పాకిస్తాన్ ఎన్నికల సంఘం 15 డిసెంబర్ 2023న ఈ ఎన్నికలకు సంబంధించి వివరణాత్మక షెడ్యూల్‌ను ప్రకటించింది. తాజా ఎన్నికలలో 103 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలుచుకున్నారు, వీరిలో మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్ యొక్క పిటిఐ మద్దతుతో గెలిచిన 93 మంది సభ్యులు ఉన్నారు. అలానే నవాజ్ షరీఫ్ యొక్క పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్) 75 సీట్లు, బిలావల్ భుట్టో జర్దారీ యొక్క పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ 54 సీట్లను గెలుచుకుంది.

  1. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) : 93 సీట్లు
  2. పాకిస్తాన్ ముస్లిం లీగ్ (పీఎంఎల్ - ఎన్) : 75 సీట్లు
  3. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) : 54 సీట్లు

పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లు ఉన్నాయి, అయితే వాటిలో 266 సీట్లకు మాత్రమే ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తారు. మిగిలిన 70 సీట్లు రిజర్వు చేయబడతాయి, అందులో 60 సీట్లు మహిళలకు కాగా మిగతా 10 సీట్లు ముస్లిమేతరులకు కేటాయిస్తారు. ఈ రిజర్వ్‌డ్ స్థానాలు ఎన్నికల ఫలితాల తర్వాత జాతీయ అసెంబ్లీలో ఒక్కో రాజకీయ పార్టీ బలం ప్రకారం కేటాయిస్తారు. అలానే ఎన్నికల ఫలితాల తర్వాత స్వతంత్ర అభ్యర్థులు ఏ పార్టీలోనైనా చేరవచ్చు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఒక రాజకీయ పార్టీకి పార్లమెంటులో 133 సీట్లు అవసరం.

ఏప్రిల్ 2022లో పిటిఐకి చెందిన ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి నుండి తొలగించిన తరువాత ఆ దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఈ రెండు సంవత్సరాల రాజకీయ అశాంతి తరువాత తాజా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు ముందు వివాదాస్పద పిటిఐ నాయకుడు ఇమ్రాన్ ఖాన్‌ అవినీతి కేసులో అరెస్టు చేయబడ్డారు.

ఈ కేసులో ఆయన ఐదేళ్లపాటు రాజకీయాల నుండి నిషేధించబడ్డారు. అతను ఇప్పుడు ఈ ఎన్నికలలో పాల్గొనడానికి లేదా ప్రభుత్వ పదవిని చేపట్టడానికి అనర్హుడయ్యాడు. అలానే అంతర్గత పార్టీ ఎన్నికలను నిర్వహించడంలో విఫలమైందనే కారణంతో పిటిఐ ఎన్నికల గుర్తును కూడా ఆ దేశ సుప్రీం కోర్టు తొలగించింది. ఈ ఎన్నికలలో పిటిఐ సభ్యులు స్వతంత్రులుగా పోటీ చేశారు.

13 ఫిబ్రవరి 2024న పాకిస్తాన్ ముస్లిం లీగ్ మరియు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాయి. పాకిస్థాన్ నూతన ప్రధానిగా షెహబాజ్ షరీఫ్, అధ్యక్షుడిగా ఆసిఫ్ అలీ జర్దారీలు ఈ ప్రభుత్వాన్ని నడిపేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సంకీర్ణ ప్రభుత్వంలో మిగతా పార్టీలు, సభ్యులు కూడా భాగం కానున్నారు. ఫిబ్రవరి 23న ఈ కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది.

తాజా పాకిస్తాన్ ఎన్నికల నిర్వహణపై ఐక్యరాజ్యసమితి మరియు హ్యూమన్ రైట్స్ వాచ్‌తో సహా యూఎస్, యూకే పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలలో పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీ భారీస్థాయిలో రిగ్గింగుకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అనేక మంది పీటీఐ అభ్యర్థులు జైలు పాలవ్వడంతో పాటుగా, ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు నివేదించబడింది.

ఎన్నికల రోజున, తర్వాత ఫలితాల వెలువడే వరకు దేరంలో మొబైల్ ఫోన్ నెట్‌వర్క్‌లను పూర్తిగా మూసివేయడంతో సహా, విస్తృతంగా ఇంటర్నెట్ అంతరాయం ఏర్పడినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ గమనించింది. ప్రధాన ప్రతిపక్షాల, ప్రజల భావ ప్రకటనా స్వేచ్ఛ మరియు శాంతియుత సమావేశ హక్కుల ఉల్లంఘన జరిగినట్లు నివేదించబడింది.

పాకిస్థాన్‌లో ఏ ప్రధానమంత్రి కూడా వారి పూర్తి ఐదేళ్ల పదవీకాలం ఇప్పటి వరకు పని చేయలేదు. పిపిపి పార్టీకి చెందిన యూసఫ్ రజా గిలానీ 4 సంవత్సరాల 86 రోజుల సుదీర్ఘ పదవీకాలం ప్రధానిగా సేవలు అందించారు. మొత్తంగా ఆయన సుమారుగా 9 సంవత్సరాల 215 రోజులు ప్రధానిగా ఉన్నారు. అయితే నవాజ్ షరీఫ్ మూడు పదవీకాలాల్లో మొత్తం 9 సంవత్సరాలకు పైగా ప్రధానిగా ఉన్నారు. షరీఫ్ పాకిస్తాన్‌లో ఎక్కువ కాలం పనిచేసిన ప్రధానమంత్రి. ఈయన ప్రతి పదవీకాలం అతని బహిష్కరణతో ముగిసింది.

2024 పాకిస్తాన్ సాధారణ ఎన్నికల ఫలితాలు ప్రపంచ వ్యాప్తంగా ఆకర్షించాయి. పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీ సైన్యం మద్దతుతో అఖండ విజయం సాధిస్తుందని బయట ప్రపంచం భావించింది. అయితే రాజకీయాలలో సైన్యం జోక్యంతో నిరాశ చెందిన ఓటర్లు, స్వతంత్రంగా పోటీ చేసిన పీటీఐ అభ్యర్థులకు ఓటు వేయాలని నిర్ణయించుకున్నారని ఒక నివేదిక పేర్కొంది. ఎన్నికలు ఫలితాలు కూడా అదే తీరున వెలువడ్డాయి. పార్టీ గుర్తు లేకుండా పోటీ చేసిన పీటీఐ స్వతంత్ర అభ్యర్థులే మెజారిటీ స్థానాలలో విజయం సాధించారు.

Post Comment