Advertisement
తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 22 అక్టోబర్ 2023
Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 22 అక్టోబర్ 2023

రోజువారీ తెలుగు కరెంట్ అఫైర్స్ 22 అక్టోబర్ 2023, తాజా జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి  వివిధ పోటీ పరీక్షల కొరకు సిద్దమవుతున్న అభ్యర్థులకు ఇవి ఉపయోగపడతాయి.

ఆసియా పారా గేమ్స్ 2023 విజేతలు

ఆసియా పారా గేమ్స్ 2023, చైనాలోని హాంగ్‌జౌలో అక్టోబర్ 22 నుండి 28 మధ్య నిర్వహించబడ్డాయి. దీనిని ఆసియా పారాలింపిక్ కమిటీచే నాలుగేళ్లకు ఒకసారి నిర్వహిస్తారు. శారీరక వైకల్యాలున్న క్రీడాకారుల కోసం ప్రతి ఆసియా క్రీడల తర్వాత ఈ ఈవెంట్ నిర్వహించబడుతుంది. ఇది ఆసియా పారా గేమ్స్ యొక్క నాల్గవ ఎడిషన్‌.

ఈ క్రీడలలో భారతదేశం నుండి మొత్తం 303 అథ్లెట్లు పాల్గొన్నారు. వీరిలో 191 మంది పురుషులు మరియు 112 మంది మహిళలు ఉన్నారు. ఈ ఈవెంట్ యందు భారత్ మొత్తం 29 స్వర్ణాలు, 31 రజతాలు మరియు 51 కాంస్యాలతో సహా 111 పతకాలు సాధించింది. ఆసియా పారా గేమ్స్ యందు భారత్ ఈ మార్కును చేరుకోవడం ఇదే మొదటిసారి. పాయింట్ల పట్టికలో భారత్ 5వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఉన్న టాప్ దేశాలు

  1. చైనా 521 పతకాలు (214 గోల్డ్),
  2. ఇరాన్ 131 పతకాలు (44 గోల్డ్),
  3. జపాన్ 150 పతకాలు (42 గోల్డ్) ,
  4. సౌత్ కొరియా 103 పతకాలు (30 గోల్డ్)
  5. ఇండియా  111 పతకాలు (29 గోల్డ్)
  • 2023 ఆసియా పారా గేమ్స్‌లో పురుషుల క్లబ్ త్రో ఎఫ్51 ఈవెంట్‌లో భారతదేశానికి చెందిన ప్రణవ్ సూర్మ రికార్డు స్థాయిలో 30.01 మీటర్ల త్రో విచిరి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
  • ఆసియా పారా గేమ్స్‌లో పురుషుల టీ63 హైజంప్‌లో శైలేష్ కుమార్, తంగవేలు మారియప్పన్ వరుసగా స్వర్ణం మరియు రజత పథకాలు గెలుచుకున్నారు. మారియప్పన్ ఇది వరకు 2016 రియో డి జనెరియో లో జరిగిన వేసవి పారాలింపిక్ క్రీడలలో టీ-42 విభాగంలో స్వర్ణ పతకం, 2020 వేసవి పారాలింపిక్స్ యందు రజత పతకం సాధించాడు. 2017 లో భారత ప్రభుత్వం తంగవేలుని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 2020 లో మేజర్ ధ్యాన్ చాంద్ ఖేల్ రత్న అవార్డు కూడా అందుకున్నాడు.
  • ఆసియా పారా గేమ్స్ 2022లో పురుషుల హైజంప్ టీ47 ఈవెంట్‌లో నిషాద్ కుమార్ స్వర్ణ పతకాన్నిగెలుచుకున్నాడు.
  • ఆసియా పారా గేమ్స్‌లో కానో మహిళల కేఎల్2 ఈవెంట్‌లో భారత క్రీడాకారిణి ప్రాచీ యాదవ్ బంగారు పతకాన్ని గెలుచుకుంది. దీనితో పారా కానోలో బంగారు పతకం సాధించిన తొలి భారతీయురాలుగా ప్రాచీ యాదవ్ చరిత్రాత్మక మైలురాయిని సాధించింది. అలానే వీఎల్2 ఈవెంట్‌లో రజత పథకం కూడా దక్కించుకుంది. అలానే పురుషుల కెనో కేఎల్3 ఈవెంట్‌లో ఈమె భర్త మనీష్ కౌరవ్ కాంస్యం సాధించాడు. దీనితో ఆసియా పారా గేమ్స్‌లో భార్యాభర్తలు పతకాలు సాధించి అరుదైన ఘనత సాధించారు.
  • పురుషుల హైజంప్ టీ47లో భారతదేశానికి చెందిన నిషాద్ కుమార్ కొత్త ఆసియా క్రీడల రికార్డును నెలకొల్పుతూ స్వర్ణం సాధించాడు. నిషాద్ రికార్డు స్థాయిలో 2.02 మీటర్ల ఎత్తుతో దూకి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
  • ఆసియా పారా గేమ్స్ 2023 పురుషుల డిస్కస్ త్రో ఎఫ్54/55/56 ఈవెంట్‌లో నీరజ్ యాదవ్ స్వర్ణం గెలుచుకున్నాడు. ఇదే పోటీలో రెండవ స్థానంలో నిలిచి మరో భారతీయ పారా అథ్లెట్ యోగేష్ కథునియా వెండి పథకం దక్కించుకున్నాడు.
  • మహిళల 400మీ-టీ20 ఈవెంట్‌లో భారత క్రీడాకారిణి దీప్తి జీవన్‌జీ 56.69 సెకన్ల టైమింగ్‌తో ఆసియా రికార్డును బద్దలు కొట్టి బంగారు పతకాన్ని గెలుచుకుంది.
  • మిక్స్‌డ్ 50 మీ రైఫిల్ SH1ఈవెంట్‌లో 222.2 స్కోరుతో రుద్రాంశ్ ఖండేల్వాల్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. అలానే పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ఈవెంట్‌లో 238.3 పాయింట్లతో మరో రజత పతకాన్ని అందుకున్నాడు.
  • ఆసియన్ పారా గేమ్స్ 2022లో మహిళల R2 10m ఎయిర్ రైఫిల్ స్టాండ్ SH1 ఈవెంట్‌లో అవని ​​లేఖరా స్వర్ణ పతకాన్నిగెలుచుకుంది. ఈమె గతంలో టోక్యో 2020 పారాలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్‌లో బంగారు పతకాన్ని మరియు 50 మీటర్ల రైఫిల్ 3 స్థానాల్లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది.
  • పురుషుల హై జంప్-T64 ఈవెంట్‌లో భారతదేశానికి చెందిన ప్రవీణ్ కుమార్ 2.02 మీటర్ల జంప్‌తో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
  • భారత పారా అథ్లెట్ సుమిత్ యాంటిల్ జావెలిన్, F64 ఈవెంట్‌లో 73.29 మీటర్ల త్రో బంగారు పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించాడు.
  • ఆసియా పారా గేమ్స్ 2023లో పురుషుల జావెలిన్ త్రో - F37 / F38 ఫైనల్‌లో భారతదేశానికి చెందిన హానీ బంగారు పతకాన్ని సాధించాడు.
  • సుందర్ సింగ్ గుర్జార్ పురుషుల జావెలిన్ F46 ఈవెంట్‌లో 59.42 మీటర్ల జావెలిన్ త్రోతో స్వర్ణంతో పాటుగా ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.
  • పురుషుల 1500 మీటర్ల T11 లో 4:27.70 సెకన్ల అసాధారణ పరుగుతో అంకుర్ ధామా భారత జట్టుకు బంగారు పతకాన్ని అందించాడు.
  • మహిళల 1500 మీటర్ల T12 క్లాస్, నాన్-మెడల్ ఈవెంట్‌లో, భారతదేశానికి చెందిన రాధా వెంకటేష్ 5:19.35 సెకన్లలో మొదటి స్థానంలో నిలిచింది.
  • మహిళల 1500 మీటర్ల T11 ఈవెంట్‌లో రక్షిత రాజు బంగారు పతకాన్ని గెలుచుకుంది.
  • మహిళల లాంగ్ జంప్ T47 ఈవెంట్‌లో నిమిషా సురేష్ బంగారు పతకాన్ని గెలుచుకుంది.
  • కాంపౌండ్ ఓపెన్ మిక్స్‌డ్ టీమ్ ఆర్చరీ ఈవెంట్‌లో భారతదేశానికి చెందిన రాకేష్ కుమార్ మరియు శీతల్ దేవి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు.
  • పురుషుల షాట్‌పుట్ F46 ఈవెంట్‌లో సర్జేరావ్ ఖిలారీ స్వర్ణం సాధించాడు.
  • భారత షూటర్ సిద్ధార్థ బాబు R6 మిక్స్‌డ్ 50 మీటర్ల రైఫిల్స్ ప్రోన్ SH-1 లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.
  • పురుషుల 1500 మీటర్ల T38 ఈవెంట్‌లో భారత పారా అథ్లెట్ రామన్ శర్మ రికార్డు బద్దలు కొట్టి స్వర్ణం గెలుచుకున్నాడు.
  • పురుషుల లాంగ్ జంప్ T-64 ఈవెంట్‌లో సోలైరాజ్ ధర్మరాజ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు.
  • బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ SL3 గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో ప్రమోద్ భగత్ గ్రేట్ బ్రిటన్‌కు చెందిన డేనియల్ బెథెల్‌ను ఓడించి స్వర్ణం గెలుచుకున్నాడు.
  • పురుషుల డబుల్స్ SL3 -4 బ్యాడ్మింటన్ ఈవెంట్‌లో నితేష్ కుమార్ మరియు తరుణ్ ద్వయం స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు.
  • పారా బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ SU5 విభాగంలో తులసిమతి మురుగేశన్ స్వర్ణం గెలుచుకుంది.
  • పురుషుల జావెలిన్ త్రో F55లో నీరజ్ యాదవ్ స్వర్ణం సాధించి, కొత్త ఆసియా పారా గేమ్స్ రికార్డును నెలకొల్పాడు.
  • పురుషుల 400 మీటర్ల T47 ఈవెంట్‌లో దిలీప్ మహదు గవిత్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నడు.
  • పురుషుల వ్యక్తిగత ర్యాపిడ్ VI - B1 ఈవెంట్‌లో సతీష్ ఇనాని దర్పన్ స్వర్ణం గెలుచుకున్నాడు.

నేషనల్ కోఆపరేటివ్ ఫర్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ ప్రారంభం

కేంద్ర సహకార మంత్రి అమిత్ షా అక్టోబర్ 23న న్యూఢిల్లీలో నేషనల్ కోఆపరేటివ్ ఫర్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ (NCEL) ప్రారంభించారు. ఎన్‌సిఇఎల్ అనేది సహకార రంగ ఎగుమతుల కోసం ఏర్పాటు చేయబడ్డ ఒక గొడుగు సంస్థ, ఇది మల్టీ-స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్, 2002 ప్రకారం బహుళ-రాష్ట్ర సహకార సంఘంగా స్థాపించబడింది. ఇది జనవరి 25, 2023న స్థాపించబడింది.

భారతదేశ వ్యవసాయ ఎగుమతులను పెంచడంలో మరియు రైతుల ఆదాయాలను మెరుగుపరచడంలో NCEL ప్రధాన పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. వ్యవసాయం మరియు అనుబంధ ఉత్పత్తుల కోసం ప్రపంచ మార్కెట్‌లో భారతదేశం పెద్ద వాటాను పొందేందుకు కూడా ఇది సహాయపడుతుందని భావిస్తున్నారు.

న్యూఢిల్లీలో నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ నిర్వహించిన 'సహకార ఎగుమతులపై జాతీయ సింపోజియం'లో అమిత్ షా మాట్లాడుతూ, ఇఫ్కో, అమూల్‌లా ఎన్‌సీఈఎల్‌ కూడా విజయవంతమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్‌సిఇఎల్‌కు తన లక్ష్యాలను సాధించడానికి అవసరమైన అన్ని సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని కూడా ఆయన చెప్పారు.

న్యూఢిల్లీలో అనుభవ్ అవార్డ్స్ 2023 వేదిక

డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్ మరియు పెన్షనర్స్ వెల్ఫేర్ వారు అనుభవ్ అవార్డ్స్ 2023 వేడుకను న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ అవార్డులను ప్రదానం చేశారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు ప్రజా సేవకు మరియు అనుభవ్ పోర్టల్‌లో వారి అనుభవాలను మరియు అంతర్దృష్టులను వ్రాతపూర్వకంగా పంచుకున్నందుకు ఈ అవార్డులు అందిస్తారు.

ఈ సంవత్సరం, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ కొత్తగా రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల కోసం కొత్త కేటగిరీ అవార్డును ప్రవేశపెట్టింది. చైల్డ్ అనుభవ్ పేరుతొ వారు ఎంచుకున్న రంగంలో ప్రతిభ కనబరిచిన మరియు సమాజానికి గణనీయమైన కృషి చేసిన పిల్లలకు ఇది ఇవ్వబడుతుంది.

ఈ పోర్టల్ యందు 96 మంత్రిత్వ శాఖలు/ విభాగాలు/ సంస్థలు నమోదు చేసుకుకుని ఉన్నాయి. ఇప్పటివరకు 10,000 కంటే ఎక్కువ రైట్-అప్‌లు ప్రచురించబడ్డాయి. ఈసారి, త్వరలో పదవీ విరమణ చేయబోయే/విశ్రాంత ఉద్యోగులను అనుభవ్ రైట్-అప్‌లుగా ప్రోత్సహించే లక్ష్యంతో అనుభవ్ ఔట్రీచ్ కార్యక్రమం చేపట్టబడింది.

ఈ ప్రచారం ఫలితంగా ఈఏడాది 1901 అనుభవ్ రైట్-అప్‌లు ప్రచురించబడ్డాయి. ఇది 2015లో ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుండి ఇదే ఎక్కువ. అనుభవ్ అవార్డు గ్రహీతలను మెడల్, సర్టిఫికెట్ మరియు రూ.10,000/- నగదు బహుమతితో సత్కరిస్తారు. జ్యూరీ సర్టిఫికేట్ విజేతలకు మెడల్ మరియు సర్టిఫికేట్ అందిస్తుంది. వీరి రైట్-అప్‌లు ప్రభుత్వ మరియు పాలన పనితీరును మెరుగుపర్చేందుకు ఉపయోగిస్తారు.

ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చీఫ్ భారత్ పర్యటన

ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ రాఫెల్ మరియానో ​​గ్రాస్సీ, అధికారిక పర్యటన కోసం అక్టోబర్ 23, 2023న భారతదేశానికి వచ్చారు. తన పర్యటనలో, గ్రాస్సీ ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మరియు ఇతర భారతీయ అధికారులతో సమావేశమయ్యారు. ముంబైలోని భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌ను సందర్శించిన ఆయన, అక్కడ భారతదేశ అణు పరిశోధన మరియు అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు.

ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అనేది అణు సాంకేతిక పరిజ్ఞానాన్ని సురక్షితమైన, సురక్షితమైన మరియు శాంతియుత వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, అణు రంగంలో సహకారానికి ప్రపంచ కేంద్రంగా ఉంది. ఇది 1957లో వియన్నా, ఆస్ట్రియా ప్రధానంగా కేంద్రంగా స్థాపించబడింది. ఇది ఒక అంతర్ ప్రభుత్వ సంస్థ. ఇందులో 178 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఇది ఐక్యరాజ్యసమితి యొక్క ఆరు స్వయంప్రతిపత్త సంస్థలలో ఒకటి.

Post Comment