Advertisement
కరెంటు అఫైర్స్ : ఏప్రిల్ 2022 | అవార్డులు & గౌరవాలు
Telugu Current Affairs

కరెంటు అఫైర్స్ : ఏప్రిల్ 2022 | అవార్డులు & గౌరవాలు

ఆర్కిటెక్చర్ డిబెడో ఫ్రాన్సిస్ కెరేకు ప్రతిష్టాత్మక ప్రిట్జ్‌కర్ బహుమతి

'హ్యాపీయెస్ట్ మ్యాన్' గా పిలవబడే ప్రముఖ ఆర్కిటెక్చర్ డిబెడో ఫ్రాన్సిస్ కెరే, ప్రతిష్టాత్మక ప్రిట్జ్‌కర్ ప్రైజ్ గెలుచుకున్న మొదటి ఆఫ్రికన్'గా రికార్డుకెక్కాడు. బుర్కినా ఫాసో-జన్మించిన డైబెడో ఫ్రాన్సిస్ కెరే ఆర్కిటెక్ట్, విద్యావేత్త మరియు సామాజిక కార్యకర్తగా ప్రసిద్ధి. ప్రిట్జ్‌కర్ అవార్డును ఆర్కిటెక్చర్ రంగపు నోబెల్ బహుమతిగా పరిగణిస్తారు. నాలుగు దశాబ్దాల ప్రిట్జ్‌కర్ ప్రైజ్ చరిత్రలో ఈ ప్రతిష్టాత్మక అవార్డు ఆఫ్రికా వ్యక్తికీ దక్కడం ఇదే మొదటిసారి.

గ్రామీ అవార్డ్స్ 2022

64 వ వార్షిక గ్రామీ అవార్డుల వేడుక ఏప్రిల్ 3, 2022న లాస్ వెగాస్‌లోని MGM గ్రాండ్ గార్డెన్ అరేనాలో ఘనంగా జరిగింది. గ్రామీ అవార్డులను యునైటెడ్ స్టేట్స్ యొక్క సంగీత పరిశ్రమలో ఏడాదిలో అత్యుత్తమ రికార్డింగ్‌లు, కంపోజిషన్‌లు మరియు కళాకారుల కోసం అందిస్తారు.

ఈ అవార్డుల వేడుకలో భారతీయ-అమెరికన్ గాయకురాలు ఫల్గుణి షా ' ఎ కలర్‌ఫుల్ వరల్డ్ ' ఆల్బమ్‌కు గాను బెస్ట్ చిల్డ్రన్స్ మ్యూజిక్ ఆల్బమ్ కేటగిరిలో అవార్డు అందుకున్నారు.

ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ వి ఆర్ - (జోన్ బాటిస్ట్)
రికార్డ్ ఆఫ్ ది ఇయర్ లీవ్ ది డోర్ ఓపెన్  - (సిల్క్ సోనిక్)
సాంగ్ ఆఫ్ ది ఇయర్ లీవ్ ది డోర్ ఓపెన్  - (సిల్క్ సోనిక్)
బెస్ట్ న్యూ ఆర్టిస్ట్ ఒలివియా రోడ్రిగో
బెస్ట్ పాప్ సోలో పెరఫార్మెన్స్ డ్రైవర్స్ లైసెన్స్  - (ఒలివియా రోడ్రిగో)
బెస్ట్ పాప్ డ్యూయె & గ్రూప్ పెరఫార్మెన్స్ కిస్ మి మోర్ (సోలానా ఇమాని రోవ్ (సజా) & డోజా క్యాట్ )
బెస్ట్ డాన్స్/ఎలక్ట్రానిక్ రికార్డింగ్ అలైవ్ - ( రూఫస్ డు సోల్ )
బెస్ట్ డ్యాన్స్/ఎలక్ట్రానిక్ ఆల్బమ్ సబ్‌కాన్షియస్లీ (బ్లాక్ కాఫీ)

అవార్డుల పూర్తి జాబితా

జర్నలిస్ట్ ఆరేఫా జోహారీకి చమేలీ దేవి అవార్డు

ముంబైకి చెందిన జర్నలిస్ట్, ఆరేఫా జోహారీకి అత్యుత్తమ మహిళా మీడియా పర్సన్‌గా చమేలీ దేవి జైన్ అవార్డు 2021 లభించింది. ఆరేఫా జోహారి 'స్క్రోల్' మీడియా సంస్థ కోసం పని చేస్తున్నారు. గత ఏడాది ఏఈ అవార్డును నీతూ సింగ్‌ దక్కించుకున్నారు. మీడియం రంగంలో అత్యుత్తమ కృషి చేసే మహిళలకు ఈ అవార్డు అందిస్తారు. దీనిని 1982 లో ప్రారంభించారు.

అత్యుత్తమ మహిళా మీడియా పర్సన్ కోసం అందించే ఈ అవార్డు, భారత స్వాతంత్ర్య ఉద్యమకారిణి చమేలీ దేవి జైన్ పేరు మీదగా అందిస్తారు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో జైలుకు వెళ్ళిన మొదటి జైన మహిళగా ఆమె నిలిచారు.

ప్రొఫెసర్ రామ్‌దరాష్ మిశ్రాకు 'సరస్వతి సమ్మాన్' గౌరవం

ప్రముఖ కవి మరియు సాహితీవేత్త ప్రొఫెసర్ రామ్‌దరాష్ మిశ్రా రాసిన హిందీ కవితా సంకలనం 'మే టు యహాన్ హున్', 'సరస్వతి సమ్మాన్ ', 2021 కి ఎంపిక చేయబడింది. 1991 లో మొదటసారి ప్రారంభించిన ఈ సరస్వతి సమ్మాన్ గౌరవాన్ని ఏటా భారతీయ భాషల్లో సేకరించిన అత్యుత్తమ సాహిత్య రచనలకు అందిస్తారు. ఈ అవార్డు గ్రహీతకు 15 లక్షల నగదు బహుమతి అందిస్తారు.

మేఘాలయ గవర్నరుకు సంత్ నామ్‌దేవ్ జాతీయ అవార్డు

ఈశాన్య రాష్ట్రాలు, కశ్మీర్, పంజాబ్, మహారాష్ట్రల మధ్య సరిహద్దు బంధాన్ని బలోపేతం చేసినందుకు గాను మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్, మాజీ ఐపిఎస్ అధికారి ఎఎస్ దులత్‌లకు ప్రతిష్టాత్మక 'సంత్ నామ్‌దేవ్ నేషనల్ అవార్డును' ప్రదానం చేయనున్నారు. వరుసగా 2021 మరియు 2020 సంవత్సరాలకు ఈ అవార్డులు అందిస్తున్నారు.

ఈ అవార్డును ఎన్సీపీ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ ఏప్రిల్ 7న న్యూఢిల్లీలో అవార్డును ప్రదానం చేసారు. ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ అధ్యక్షుడు హర్మీత్ సింగ్ కల్కా అవార్డుల కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. 'సంత్ నామ్‌దేవ్ జాతీయ అవార్డు'ను పుణెకు చెందిన సుప్రసిద్ధ NGO సర్హాద్ స్థాపించింది. ఈ అవార్డు గ్రహీతకు లక్ష రూపాయల నగదు బహుమతి అందిస్తారు.

వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయరుగా కమ్లూప్స్ రెసిడెన్షియల్ స్కూల్

"కమ్లూప్స్ రెసిడెన్షియల్ స్కూల్" పేరుతో కెనడియన్ ఫోటోగ్రాఫర్ అంబర్ బ్రాకెన్ రూపొందించిన ఫోటో 2022 వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది. వార్షిక వరల్డ్ ప్రెస్ ఫోటో కాంటెస్ట్, ముందు సంవత్సరంలో పబ్లిష్ చేయబడిన ఉత్తమ ఫోటో జర్నలిజం మరియు డాక్యుమెంటరీ ఫోటోగ్రఫీని గుర్తించి ఈ అవార్డును అందిస్తుంది.

ఈ పోటీ కోసం 130 దేశాల నుండి 4,066 ఫోటోగ్రాఫర్‌ల ద్వారా 64,823 ఎంట్రీలు నమోదు చేయబడ్డాయి. వీటిలో 23 దేశాల నుండి 24 మంది ఫోటోగ్రాఫర్‌ల ఏంటీలను తుది ఎంపికకు ఎన్నుకోగా అందులో నాలుగు ఎంట్రీలు ప్రపంచ విజేతలుగా నిలిచాయి.

  • వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ : ది న్యూయార్క్ టైమ్స్ కోసం కెనడాలోని అంబర్ బ్రాకెన్ తీసిన 'కమ్లూప్స్ రెసిడెన్షియల్ స్కూల్'
  • వరల్డ్ ప్రెస్ ఫోటో స్టోరీ ఆఫ్ ది ఇయర్ : నేషనల్ జియోగ్రాఫిక్ /పనోస్ పిక్చర్స్ కోసం ఆస్ట్రేలియాలోని మాథ్యూ అబోట్ తీసిన 'సేవింగ్ ఫారెస్ట్ విత్ ఫైర్'
  • వరల్డ్ ప్రెస్ ఫోటో లాంగ్-టర్మ్ ప్రాజెక్ట్ అవార్డు: ఫోల్హా డి సావో పాలో /పనోస్ పిక్చర్స్ కోసం లాలో డి అల్మెయిడా, బ్రెజిల్ ద్వారా 'అమెజోనియన్ డిస్టోపియా'
  • వరల్డ్ ప్రెస్ ఫోటో ఓపెన్ ఫార్మాట్ అవార్డ్: 'బ్లడ్ ఈజ్ ఎ సీడ్' బై ఇసడోరా రొమెరో, ఈక్వెడార్

అస్సామీ కవి నీలమణి ఫూకాన్‌కు జ్ఞానపీఠ్ అవార్డు

ప్రముఖ అస్సామీ కవి నీలమణి ఫూకాన్‌కు ఏప్రిల్ 11, 2022 న జరిగిన ఒక కార్యక్రమంలో 56వ జ్ఞానపీఠ్ అవార్డును ప్రదానం చేశారు. 88 ఏళ్ళ ఫూకాన్ ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను పరిగణనలోకి తీసుకుని తొలిసారిగా అస్సాంలో ఈ అవార్డు ప్రదానోత్సవం జరిగింది. జ్ఞానపీఠ్ అవార్డు, అతి పురాతన మరియు అత్యున్నత భారతీయ సాహిత్య పురస్కారంగా కీర్తించబడుతుంది. దీనిని 1961 లో స్థాపించారు. అవార్డు గ్రహీతకు 11 లక్షల నగదు బహుమతి అందజేస్తారు.

ప్రధాని మోడీకి లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు

ప్రముఖ గాయని లతా మంగేష్కర్ స్మారకార్థం ఏర్పాటు చేసిన తొలి లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డుతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని సత్కరించనున్నారు. దేశానికి, సమాజానికి నిస్వార్థ సేవ చేసినందుకు గానూ ప్రధాని మోదీ ఈ అవార్డును అందుకోనున్నారు. దీనికి సంబంధించిన అవార్డు వేడుక 24 ఏప్రిల్ 2022 న ముంబైలో జరగనుంది. ఇక నుండి ఏటా దేశం కోసం అత్యుత్తమ సేవలు అందించిన పౌరులకు ఈ అవార్డు ఇవ్వనున్నారు.

ప్రభాత్ పట్నాయక్‌కు మాల్కం ఆదిశేషయ్య అవార్డు

సుప్రసిద్ధ భారతీయ ఆర్థికవేత్త మరియు రాజకీయ వ్యాఖ్యాత, ప్రభాత్ పట్నాయక్ మాల్కం ఆదిశేషయ్య అవార్డు 2022 కి ఎంపికయ్యారు. ఈ అవార్డును ఎలిజబెత్ ఆదిశేషయ్య ట్రస్ట్ 2018 లో స్థాపించింది. ఇది డెవలప్‌మెంట్ స్టడీస్‌లో విశిష్టమైన సేవలు చేసిన సామాజిక శాస్త్రవేత్తలకు అందజేస్తారు. అవార్డు గ్రహీతకు ప్రశంసా పత్రం మరియు 2 లక్షల నగదు బహుమతిని అందిస్తారు.

మాల్కం సత్యనాథన్ ఆదిశేషయ్య (18 ఏప్రిల్ 1910 - 21 నవంబర్ 1994), భారతీయ ఆర్థికవేత్తగా మరియు విద్యావేత్తగా ప్రసిద్ధి. ఈయన 1976లో భారతదేశం యొక్క మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌ను అందుకున్నారు.

బెంగాలీ రచయిత అమర్ మిత్రకు ప్రతిష్టాత్మక ఓ హెన్రీ ప్రైజ్

ప్రముఖ బెంగాలీ రచయిత అమర్ మిత్రా 45 సంవత్సరాల క్రితం తాను రాసిన 'గాన్‌బురో' అనే చిన్న కథకు ఈ సంవత్సరం ఓహెన్రీ బహుమతిని అందుకున్నారు. ఇది అంతకుముందు ది ఓల్డ్ మ్యాన్ ఆఫ్ కుసుంపూర్ పేరుతో ఆంగ్లంలోకి అనువదించబడింది. అమర్ మిత్రా 2006 లో భారత ప్రభుత్వం నుండి సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు.

షూజిత్ సిర్కార్‌కు డైరెక్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు

ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (AIMA) 'సర్దార్ ఉధమ్' చిత్రం దర్శుకుడు షూజిత్ సిర్కార్‌కు డైరెక్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించింది. 2021 AIMA మేనేజింగ్ ఇండియా అవార్డులను రోడ్డు రవాణా & రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ అందించారు.

జలియన్ వాలాబాగ్ ఊచకోత నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం గత ఏడాది ఆక్టోబరులో విడుదలయి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ కథ పంజాబీ సిక్కు విప్లవకారుడు ఉధమ్ సింగ్ ప్రధాన పాత్రగా సాగుతుంది. జలియన్‌వాలా బాగ్ మారణకాండలో వందలాది మంది క్రూరంగా చంపబడిన తర్వాత, దీనికి కారణమైన అప్పటి పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైఖేల్ ఓడ్వైర్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఉధమ్ సింగ్ ఇంగ్లాండ్ వెళ్లి ఆయన్ను హతమార్చుతాడు. ఈ హత్య విచారణ తరువాత ఆయన అక్కడే ఉరి తీయబడతాడు.

Post Comment