Advertisement
తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 22 ఫిబ్రవరి 2024
February Telugu Current Affairs

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ : 22 ఫిబ్రవరి 2024

తెలుగులో 22 ఫిబ్రవరి 2024 కరెంట్ అఫైర్స్ అంశాలను చదవండి. వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను ఈ ఆర్టికల్ ద్వారా మీకు అందిస్తున్నాం. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆశావహులకు ఇవి ఉపయోగపడతాయి.

భారతమాల కింద హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు విస్తరణ

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకమైన భారతమాల పరియోజన పథకంలో చోటు దక్కించుకుంది. ఇది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క భారతమాల పరియోజన ఫేజ్-2 లో జాబితా చేశారు.

  • రీజినల్ రింగ్ రోడ్ అనేది హైదరాబాద్ నగరం చుట్టూ 4 లైన్ల ప్రతిపాదిత రింగ్ రోడ్డు.
  • ఇది 340-కిలోమీటర్ల పొడవుతో ఇప్పటికే ఉన్న హైదరాబాద్ రోడ్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడానికి 2018లో ప్రతిపాదించారు.
  • ఇది హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న జిల్లాలను అనుసంధానించడానికి సహాయపడుతుంది.
  •  అలానే ఇది ఎన్‌హెచ్ 65, ఎన్‌హెచ్ 44, ఎన్‌హెచ్ 163, ఎన్‌హెచ్ 765 వంటి ప్రధాన జాతీయ రహదారులను కూడా అనుసంధానించడంలో సహాయపడుతుంది.
  • ఇది ప్రధానంగా రంగారెడ్డి, భువనగిరి, సిద్దిపేట మరియు సంగారెడ్డి జిల్లాలను కలుపుతుంది.
  • ఈ ప్రాజెక్టు 17,000 కోట్లు వ్యయంతో రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు.
  • ఈ ప్రాజెక్టు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ , హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ , హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ నిర్వహిస్తున్నాయి.

భారతమాల పరియోజన కార్యక్రమం జాతీయ మరియు ప్రాంతీయ స్థాయిలో భారతదేశ రహదారి నెట్‌వర్క్‌ను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చొరవలో ఆర్ఆర్ఆర్ చేర్చడం ద్వారా, తెలంగాణలో ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క నిబద్ధతను సూచిస్తుంది. ఈ ప్రాజెక్టు ఇప్పుడు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) పరిధిలోకి పోతుంది.

భారతమాల పరియోజన ఫేజ్-1 కింద 34,800 కి.మీ పొడవు జాతీయ రహదారిని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక చేసింది. డిసెంబర్-2023 నాటికి 34,800 కి.మీ.లో దాదాపు 15,549 కి.మీ పనులు పూర్తి చేసింది. భారతమాల పరియోజన కింద ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం పూర్తి నిధులు సమకూరుస్తుంది.

భారతమాల పరియోజన ఫేజ్-1 కింద అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 1,719 కి.మీ పొడవు గల కారిడార్‌లను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది, వాటిలో 1,026 కి.మీ పొడవున పనులు కొనసాగుతున్నాయి. గత డిసెంబర్ చివరి నాటికి వీటిలో 500 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం పూర్తి అయ్యింది. అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతమాల పరియోజన కింద రూ.6,586 కోట్లతో దాదాపు 384 కి.మీ మేర ఏడు ప్రాజెక్టులు బిడ్డింగ్ దశలో ఉన్నాయి.

22 వారసత్వ ఉత్సవాలతో రంగలా పంజాబ్ ఫెస్టివల్

రాష్ట్రం యొక్క వైబ్రెంట్ హెరిటేజ్‌ని సెలబ్రేట్ చేయడానికి పంజాబ్ ప్రభుత్వం "రంగలా పంజాబ్" అనే వారం రోజుల సాంస్కృతిక మహోత్సం నిర్వహించింది. రాష్ట్రాన్ని రంగాల పంజాబ్‌గా మార్చే లక్ష్యంతో ఏడాది పొడవునా 22 వారసత్వ ఉత్సవాలు నిర్వహించాలని పంజాబ్ ప్రభుత్వం భావిస్తుంది.

ఇందులో భాగంగా ఫిబ్రవరి 23 నుండి 29 వరకు మొదటి వారోత్సవం యొక్క రంగలా పంజాబ్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుక పంజాబ్ యొక్క సాంస్కృతిక వారసత్వం యొక్క సారాంశాన్ని ప్రదర్శించింది. ఈ వేడుకలు పంజాబ్ పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.

ఈ 22 వారోత్సవాలలో సంగ్రూర్‌లో తీయాన్' పండుగ, ముక్త్‌సర్‌లో మాఘీ పండుగ, ఫరీద్‌కోట్‌లో బాబా ఫరీద్ ఆగ్మాన్ పండుగ, ఎస్‌బిఎస్ నగర్‌లో ఇంక్విలాబ్ ఉత్సవం, బటిండాలో బైసాఖీ ఫెస్టివల్, పాటియాలాలో వారసత్వ ఉత్సవం, ఆనంద్‌పూర్ సాహిబ్‌లోని హోలా మొహల్లా వంటివి ఉన్నాయి.

వీటితో పాటుగా మాన్సాలో మాల్వా వంటకాలు, ఫజిల్కాలో పంజాబ్ హస్తకళ ఉత్సవం, జలంధర్‌లోని ఈక్వెస్ట్రియన్ ఫెయిర్, చండీగఢ్‌లో సైనిక సాహిత్య ఉత్సవం, పఠాన్‌కోట్‌లో నదుల ఉత్సవం, మలేర్‌కోట్లలో సూఫీ ఉత్సవం నిర్వహించనున్నట్లు పర్యాటక శాఖ పేర్కొంది.

అలానే ఆనంద్‌పూర్ సాహిబ్‌లో నిహాంగ్ ఒలింపిక్స్ నిర్వహిస్తున్నట్లు, తరన్ తరణ్‌లో దారా సింగ్ చింజ్ ఒలింపిక్స్ నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇక్కడ విజేతకు రాష్ట్ర ప్రభుత్వం నుండి నగదు బహుమతి మరియు రుస్తామే-ఎ-పంజాబ్' బిరుదు అందజేస్తున్నట్లు పర్యాటక శాఖ పేర్కొంది.

అదనంగా రోపర్ మరియు పఠాన్‌కోట్‌లలో వార్షిక సాహస క్రీడలు జరపనున్నారు. పంజాబీల ధైర్యసాహసాలను చాటిచెప్పే తొలి సర్దార్ హరి సింగ్ నల్వా జోష్ పండుగను గురుదాస్‌పూర్‌లో నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే జనవరిలో ప్రముఖ నవలా రచయితలు మరియు కవుల భాగస్వామ్యంతో పంజాబీ సంస్కృతికి సంబంధించి రంగాల పంజాబ్ ఉత్సవం అమృత్‌సర్‌లో నిర్వహించబడుతుంది.

నేపాల్‌లో శాంతి ప్రయాస్ IV మిలిటరీ వ్యాయామం

భద్రకాళిలోని నేపాలీ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లో బహుళజాతి సైనిక వ్యాయామం ' శాంతి ప్రయాస్ IV ' నిర్వహించబడింది. ఫిబ్రవరి 20 నుండు మార్చి 4 మధ్య జరిగిన ఈ వ్యాయామంలో నేపాల్, భారతదేశం, యునైటెడ్ స్టేట్స్‌, బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్‌తో సహా 19 దేశాల ఆర్మీ బృందాలు పాల్గొన్నాయి. ఈ వ్యాయామంను ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్ ప్రచండ ప్రారంభించారు.

ఈ వ్యాయామం యొక్క ప్రధాన సైనిక ప్రదర్శనలు ఖాట్మండుకు తూర్పున 50 కి.మీ దూరంలోని కబ్రే జిల్లాలోని బీరేంద్ర పీస్ ఆపరేషన్ ట్రైనింగ్ సెంటర్‌లో నిర్వహించారు. ఇందులో భారత్, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక మరియు థాయ్‌లాండ్‌తో సహా 19 దేశాల నుండి 1,125 మంది సైనిక సిబ్బంది పాల్గొన్నారు.

  • యుఎస్ ప్రభుత్వం యొక్క గ్లోబల్ పీస్ ఆపరేషన్ ఇనిషియేటివ్ సహాయంతో నేపాల్ ఆర్మీ మరియు యుఎస్ ఆర్మీలు ఉమ్మడిగా ఈ వ్యాయామం నిర్వహించాయి.
  • ఈ సంయుక్త సైనిక వ్యాయామంలో పాల్గొన్న యూఎస్ ప్రతినిధి బృందానికి డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ రాచెల్ షిల్లర్ నాయకత్వం వహించారు.
  • నేపాల్ 2000 నుండి ఈ శాంతి ప్రయాస్ వ్యాయామం నిర్వహిస్తుంది. ఇప్పటి వరకు మూడు విజయవంతమైన శాంతి ప్రయాస్ వ్యాయమాలు నిర్వహించబడ్డాయి.
  • ఈ వ్యాయామం భాగస్వామ్య దేశాల మధ్య సహకారం మరియు పరస్పర చర్యలను ప్రోత్సహిస్తుంది.
  • ఈ వ్యాయామం వాస్తవ-ప్రపంచ శాంతి పరిరక్షక దృశ్యాలను అనుకరిస్తుంది, వీటిలో సంఘర్షణ పరిష్కారం, పౌర రక్షణ, పబ్లిక్ ఆర్డర్ నిర్వహణ, మానవతా సహాయం మరియు విపత్తు సహాయం వంటివి ఉంటాయి.

శశి థరూర్‌కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారాం నైట్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్ (చెవాలియర్ డి లా లెజియన్ డి'హోన్నూర్) అందుకున్నారు. ఫ్రెంచ్ రాయబార కార్యాలయంలో సెనేట్ అధ్యక్షుడు గెరార్డ్ లార్చర్ ద్వారా ఈ అవార్డు ఆయనకు ప్రదానం చేయబడింది.

వాస్తవానికి ఈ పురస్కారం ఆగస్టు 2022లో ప్రకటించబడింది. తాజాగా ఈ ఏడాది ఫిబ్రవరి 20న ఇది ప్రదానం చేయబడింది. ఫ్రాన్స్ రాయబార కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, భారతదేశం మరియు ఫ్రాన్స్‌ల మధ్య బంధాన్ని బలోపేతం చేయడంలో థరూర్ చేసిన ప్రయత్నాలకు ఈ అవార్డు అందించబడింది.

  • చెవాలియర్ డి లా లెజియన్ డి'హోన్నూర్ (నైట్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్) 1802లో నెపోలియన్ బోనపార్టేచే స్థాపించబడింది.
  • ఇది ఫ్రాన్స్‌కు అందించిన అసాధారణ విజయాలు మరియు సేవలను గుర్తించే ఫ్రాన్స్ యొక్క అత్యున్నత పౌర పురస్కారం.
  • ఇది కళలు, సాహిత్యం, సైన్స్ మరియు ప్రజాసేవలో చేసిన అత్యుత్తమ సేవలకు అందించబడుతుంది.
  • ఈ గౌరవం పొందిన తొలి భారతీయుడు దుర్గా చరణ్ రక్షిత్ (1896).
  • పాండిచ్చేరి డిప్యూటీ మేయర్ అయిన మొహమ్మద్ హనీఫ్ 1937లో దీనిని పొందారు.
  • స్వతంత్ర భారతదేశంలో మెట్రోమాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందిన ఎలట్టువలపిల్ శ్రీధరన్ 2005లో ఈ గౌరవాన్ని అందుకున్నారు.

ఈ గౌరవం పొందిన ఇతర భారతీయులలో మానవ హక్కుల కార్యకర్తలు సెడ్రిక్ ప్రకాష్ (2006), అంజలి గోపాలన్ (2013), బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ (2014) ఈ అవార్డును అందుకున్నారు. అలానే టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ 2023లో ఈ గౌరవాన్ని అందుకున్నారు.

ఈ గౌరవం పొందిన ఇతర భారతీయులలో నటులు శివాజీ గణేశన్ (1995), కమల్ హాసన్ (2016) మరియు సౌమిత్ర ఛటర్జీ (2017), మరియు పారిశ్రామికవేత్త నాదిర్ గోద్రెజ్ (2008), ఫ్యాషన్ డిజైనర్ మనీష్ అరోరా (2016) మరియు విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీ (2018) ఉన్నారు.

ఒడిశాలో దేశంలో మొట్టమొదటి స్కిల్ ఇండియా సెంటర్‌ ప్రారంభం

కేంద్ర విద్య మరియు నైపుణ్యాభివృద్ధి & వ్యవస్థాపకత మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఫిబ్రవరి 20న ఒడిశాలోని సంబల్‌పూర్‌లో దేశంలోని మొట్టమొదటి స్కిల్ ఇండియా సెంటర్ (ఎస్ఐసి)ని ప్రారంభించారు. సంబల్‌పూర్‌లోని మొదటి స్కిల్ ఇండియా సెంటర్ దేశవ్యాప్తంగా ప్రణాళికాబద్ధమైన భవిష్యత్తు కేంద్రాలకు నమూనాగా పనిచేస్తుంది. ఈ చొరవ భారతదేశంలో నైపుణ్యాభివృద్ధిని విప్లవాత్మకంగా మార్చే అవకాశం ఉంది.

ఈ సెంటర్‌లో అత్యుత్తమ-తరగతి మౌలిక సదుపాయాలు, అత్యాధునిక సాంకేతికతలు మరియు ఆధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంచారు. యువత తమ తమ రంగాలలో విజయవంతం కావడానికి అవసరమైన నైపుణ్యాలను పొందేలా చేయడంలో ఇవి ఉత్ప్రేరకంగా పనిచేస్తాయి. స్థానిక వ్యవస్థాపకతను పెంపొందించడానికి మరియు సామాజిక-ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి ఇవి తమ వంతు పాత్రను పోషిస్తాయి.

స్కిల్ ఇండియా సెంటర్‌ అభివృద్ధి చెందుతున్న జాబ్ మార్కెట్ యొక్క డిమాండ్‌లకు అనుగుణంగా అధిక-నాణ్యత శిక్షణా కార్యక్రమాలను అందిస్తుంది. భారతదేశం యొక్క 21వ శతాబ్దపు పురోగతిని ముందుకు నడిపించడంలో అవసరమయ్యే నైపుణ్యం కలిగిన కార్మికులను అందించడంతో ఇది కీలక పాత్రను పోషించనుంది.

  • నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అనేది దేశంలోని నైపుణ్య పర్యావరణ వ్యవస్థ యొక్క ప్రధాన రూపశిల్పి.
  • ఇది భారత ప్రభుత్వంలోని నైపుణ్యాభివృద్ధి & వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న ఒక పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ సంస్థ.
  • నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్,  ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో దేశంలోని యువతకు సాధికారత కల్పించడానికి వృత్తిపరమైన శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
  • ఇది స్కిల్ ఇండియా మిషన్‌ వ్యూహాత్మక అమలు మరియు జ్ఞాన భాగస్వామిగా ఉండటానికి స్థాపించబడింది.

Post Comment