Advertisement
కరెంటు అఫైర్స్ – ఏప్రిల్ 2022 | ఇండియన్ అఫైర్స్
Telugu Current Affairs

కరెంటు అఫైర్స్ – ఏప్రిల్ 2022 | ఇండియన్ అఫైర్స్

భారత్-నేపాల్ మధ్య బోర్డర్ ప్యాసింజర్ రైలు సేవలు ప్రారంభం

భారత - నేపాల్ దేశాల సరిహద్దు కనెక్టివిటీ కలిపే మొదటి బ్రాడ్-గేజ్ ప్యాసింజర్ రైలు లింకును నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా మరియు భారత ప్రధాని నరేంద్ర మోదీలు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సేవ భారతదేశంలోని జయనగర్-కుర్తా విభాగంలో 2.95 కి.మీల నిడివితో ఉండగా, మిగిలిన 65.75 కిమీ నేపాల్‌లో ఉంది. అలానే ఇదే వేదిక ద్వారా నేపాల్‌లో రూపే చెల్లింపు కార్డు సేవలు, అలానే సోలు కారిడార్ 132 కెవి పవర్ ట్రాన్స్‌మిషన్ లైన్ మరియు సబ్‌స్టేషన్‌ను ఇరు ప్రధానిలా చేత ప్రారంభించబడ్డాయి.

నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత్ విచ్చేశారు. జులై 2021లో ప్రధానమంత్రి అయిన తర్వాత దేవుబా విదేశాలకు వెళ్లడం ఇదే మొదటిసారి. అంతకుముందు ప్రధానిగా పనిచేసిన నాలుగు సార్లు ఆయన భారతదేశాన్ని సందర్శించారు. న్యూఢిల్లీలో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ఇరువురు ప్రధానులు వాణిజ్యం, సరిహద్దుల మధ్య అనుసంధానానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. అలానే విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మరియు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్'తో కూడా ఆయన చర్చల్లో పాల్గున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వారణాసికి స్వాగతం పలకడంతో, ఆయన ఈ పర్యటనలో కాశీని కూడా సందర్శించారు.

రాష్ట్రపతి కోవింద్ మూడు రోజుల తుర్క్‌మెనిస్థాన్ పర్యటన

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మూడు రోజుల పర్యటన నిమిత్తం 01 ఏప్రిల్ 2022 న తుర్క్‌మెనిస్థాన్ చేరుకున్నారు. స్వతంత్ర తుర్క్‌మెనిస్తాన్‌కు భారత రాష్ట్రపతి పర్య టించడం ఇదే మొదటిసారి. సహజ వనరులు అధికంగా ఉన్న మధ్య ఆసియా దేశమైన తుర్క్‌మెనిస్తాన్‌'తో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించే భాగంలో ఈ పర్యటన ఉండనుంది. ఈ పర్యటనలో ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన కొత్త తుర్క్‌మెనిస్థాన్ ప్రెసిడెంట్ బెర్డిముహమెడోవ్'తో భేటీ అయ్యారు. ఈ చర్చల్లో ఆఫ్ఘనిస్తాన్ కూడా పాల్గొంటున్నట్లు వెల్లడించారు.

తుర్క్‌మెనిస్తాన్‌లో 3వ రోజు పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, అష్గాబాత్‌లోని పీపుల్స్ మెమోరియల్ మాన్యుమెంట్‌తో పాటు బాగ్త్యార్లిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరియు అష్గాబత్‌లోని యోగా కాంప్లెక్స్ మరియు ఆయుర్వేద వైద్య కేంద్రాన్ని సందర్శించారు. 2015లో తుర్క్‌మెనిస్తాన్‌ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ వీటిని ప్రారంభించారు.

జైశంకర్‌తో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ద్వైపాక్షిక చర్చలు

రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్, ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో సమావేశమయ్యారు. చైనాలో రెండు రోజుల పర్యటన ముగించుకుని లావ్‌రోవ్ 01 ఏప్రిల్ 2022 సాయంత్రం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటనలో ఆయన భారత ప్రధాని నరేంద్ర మోడీతో కూడా భేటీ అయ్యారు.

ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగింది. రష్యా- ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించడానికి, ఉక్రెయిన్‌తో శాంతి చర్చలను కొనసాగించలని భారత్ ఆకాంక్షించి.

'పరీక్ష పే చర్చ' 5వ ఎడిషన్‌లో పాల్గున్న ప్రధాని మోదీ

పరీక్షా పే చర్చ 2022 సంబంధించి 5వ వార్షిక ఈవెంట్‌లో, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గున్నారు. ఏటా ప్రధాన పరీక్షల ముందు విద్యార్థుల నుండి పరీక్ష ఒత్తిడి పారదోలేందుకు మరియు విద్యార్థుల సందేహాలకు సమాధానం ఇచ్చేందుకు మోడీ ఈ కార్యక్రమాన్ని గత 5 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో క్లాస్ IX నుండి క్లాస్ XII విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గుటారు. ఈ ఏడాది ఈ కార్యక్రమంను ఏప్రిల్ 5 వ తేదీన ఢిల్లీలోని తల్కతోరా ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 75,000 మంది విద్యార్థులు హాజరయ్యారు.

రాష్ట్రపతి కోవింద్ నెదర్లాండ్స్ పర్యటన

తుర్క్‌మెనిస్తాన్ పర్యటన తర్వాత ముందుస్తు షెడ్యూల్లో భాగంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 04 ఏప్రిల్ 2022 న నెదర్లాండ్స్ రాజధాని ఆమ్‌స్టర్‌డామ్ చేరుకున్నారు. దీనితో 1988లో రాష్ట్రపతి ఆర్‌. వెంకటరామన్‌ పర్యటన తర్వాత నెదర్లాండ్స్‌ సందర్శించిన మొదటి భారత అధ్యక్షుడుగా నిలిచారు. ఇరుదేశాల మధ్య దౌత్య సంబందాలు ప్రారంభమై 75 ఏళ్లు పూర్తి చేసుకున్నందున ఈ పర్యటన చోటుచేసుకుంది.

నెదర్లాండ్స్‌, భారతదేశానికి ముఖ్యమైన ఆర్థిక మరియు వాణిజ్య భాగస్వామి ఉంది. అలానే భారత ఎఫ్డీఐ పెట్టుబడుల ప్రవాహంలో మెజారిటీ వాటా  నెదర్లాండ్స్‌ నుండి వస్తున్నాయి. అలానే వ్యవసాయం, ఆరోగ్యం, పట్టణాభివృద్ధి, సైన్స్ మరియు టెక్నాలజీ వంటి రంగాలలో పరస్పరం ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగిస్తున్నాయి.

పార్లమెంటులో అకౌంటెన్సీ బిల్లు ఆమోదం

చార్టర్డ్ అకౌంటెంట్లు , కాస్ట్ అకౌంటెంట్లు మరియు కంపెనీల ఇన్‌స్టిట్యూట్‌ల పనితీరును పునరుద్ధరించే బిల్లు 2022 ను పార్లమెంటు ఆమోదించింది. కొత్త బిల్లులోని నిబంధనల ప్రకారం, ప్రభుత్వతర సభ్యులు ఆయా సంస్థల క్రమశిక్షణా కమిటీలకు ప్రిసైడింగ్ అధికారిగా నియమించబడతారు. అయితే, ఈ మూడు సంస్థల కౌన్సిల్ ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా ఈ నియామకాలు జరుగుతాయని వెల్లడించింది. భారతదేశపు కంపెనీ వ్యవస్థలో ఆడిట్ ప్రమాణాలు మరియు ఆడిట్ సర్టిఫికెట్ల సంబంధిత అంశాల యందు పటిష్టతమైన జవాబుదారీతనం తెచ్చేందుకు ఈ చట్టాన్ని సవరించారు.

'ప్రకృతి' గ్రీన్ మస్కట్‌ ప్రారంభం

కేంద్ర పర్యావరణ, అటవీ & వాతావరణ మార్పుల మంత్రి భూపేందర్ యాదవ్ ఏప్రిల్ 5, 2022 న సమర్థవంతమైన ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ కోసం అవగాహన మస్కట్ 'ప్రకృతి' & ఇతర హరిత కార్యక్రమాలను ప్రారంభించారు. దేశంలో సమర్థవంతమైన ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ (PWM)ని అమలు పర్చేందుకు ఈ అవగాహనా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 2022 నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను దశలవారీగా నిర్మూలిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గతంలో ప్రకటించారు.

పీయూష్ గోయల్ 3 రోజుల ఆస్ట్రేలియా పర్యటన

కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మూడు రోజుల ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా 05 ఏప్రిల్ 2022 న మెల్బోర్న్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఈ పర్యటనలో వ్యాపార నాయకులు, భారతీయ విద్యార్థులు మరియు ఆస్ట్రేలియాలోని భారతీయ ప్రవాసులతో సంబాషించనున్నారు. అలానే భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఆర్థిక మరియు వాణిజ్య సహకారం కోసం ప్రధాని యొక్క ప్రత్యేక వాణిజ్య రాయబారి శ్రీ టోనీ అబాట్‌తో కూడా భేటీ కానున్నారు.

సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన మొదటి యూకే ప్రధానిగా బోరిస్ జాన్సన్

భారతదేశ పోరాటానికి గాంధీ నాయకత్వం వహించిన సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించిన మొదటి యూకే ప్రధానమంత్రిగా బోరిస్ జాన్సన్ నిలిచారు. రెండు రోజుల భారత పర్యటనకు వచ్చిన ఆయన, గుజరాత్ లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. ఆయన ఇండియాకు రావడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనలో ఆయన ప్రధాని మోదీతో పాటుగా, ప్రముఖ భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీతో భేటీ అయ్యారు. ఇరువురి మధ్య వ్యాపారం మరియు పెట్టుబడి అవకాశాలపై చర్చలు జరిగినట్లు వెల్లడించారు.

భారతదేశపు మొదటి 'కార్బన్ న్యూట్రల్ పంచాయతీగా 'పల్లి'

జమ్మూ కాశ్మీర్‌లోని పల్లి భారతదేశపు మొదటి 'కార్బన్ న్యూట్రల్ పంచాయతీ'గా అవతరించింది. జమ్మూలోని సాంబా జిల్లాలో ఉన్న ఈ పల్లి గ్రామంలో మొత్తం 340 కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాల విద్యుత్ అవసరాల కోసం ఉర్జా గ్రామ స్వరాజ్ ప్రోగ్రామ్ ద్వారా దాదాపు 1500 సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేసుకున్నాయి దీనితో పూర్తిగా సౌరశక్తితో నడిచే భారతదేశపు మొదటి పంచాయతీగా అవతరించింది

Post Comment