Advertisement
వార్తల్లో వ్యక్తులు | జనవరి 2022
Telugu Current Affairs

వార్తల్లో వ్యక్తులు | జనవరి 2022

రైల్వే బోర్డు కొత్త చీఫ్‌గా వీకే త్రిపాఠి

ఇండియన్ రైల్వే బోర్డు ఛైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) గా వీకే త్రిపాఠి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన గోరఖ్‌పూర్‌లోని ఈశాన్య రైల్వే జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. సునీత్ శర్మ స్థానంలో 01 జనవరి 2022 నుండి బాధ్యతలు స్వీకరించనున్నారు.

చట్టపరమైన వివాహ వయస్సును సమీక్షిస్తున్న ప్యానెల్‌లో సుస్మితా దేవ్

మహిళల చట్టబద్ధమైన వివాహ వయస్సును 21 ఏళ్లకు పెంచేందుకు ఉద్దేశించిన ల్యాండ్‌మార్క్ బిల్లును పరిశీలించేందుకు కేటాయించిన పార్లమెంటరీ ప్యానెల్లో ఏకైక మహిళా సభ్యురాలుగా టీఎంసీ ఎంపీ సుస్మితా దేవ్ నిలిచారు.  ఈ 31 సభ్యుల పార్లమెంటరీ ప్యానెల్ ప్రతిష్టాత్మక మహిళల వివాహ వయస్సు బిల్ 2021 ని పరిశీలించే బాధ్యతను స్వీకరించింది, ఇది స్త్రీల వివాహానికి చట్టబద్ధమైన వయస్సును 18 నుండి 21 ఏళ్ళకి పెంచడానికి ప్రయత్నిస్తుంది.

ఓఎన్‌జీసీ తొలి మహిళ సీఎండీగా అల్కా మిట్టల్

అల్కా మిట్టల్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC)కి తాత్కాలిక ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈమె దేశంలోని అతిపెద్ద చమురు మరియు గ్యాస్ ఉత్పత్తి సంస్థకు నాయకత్వం వహించిన మొదటి మహిళగా చరిత్రకెక్కారు. ప్రస్తుత ఓఎన్‌జీసీ తాత్కాలిక అధిపతి సుభాష్ కుమార్ డిసెంబర్ 31న పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన స్థానంలో మరో తాత్కాలిక అధిపతిగా మిట్టల్ నియమితులయ్యారు. కొత్త చైర్‌పర్సన్‌ను నియమించే వరకు అల్కా మిట్టల్ ఆరు నెలల పాటు ఓఎన్‌జీసీ సీఎండీగా వ్యవహరిస్తారు.

దక్షిణ ధ్రువానికి ఒంటరిగా ట్రెక్కింగ్ చేసిన హర్‌ప్రీత్ చాందీని

దక్షిణ ధృవానికి ఒంటరిగా ట్రెక్కింగ్ చేసిన మొదటి భారతీయ సంతతి మహిళగా కెప్టెన్ హర్‌ప్రీత్ చాందీని చరిత్రకెక్కారు. కెప్టెన్ హర్‌ప్రీత్ చాందీ, భారత సంతతికి చెందిన బ్రిటిష్ సిక్కు ఆర్మీ అధికారి, ఈమె దక్షిణ ధృవానికి ఒంటరిగా మద్దతు లేని ట్రెక్‌ను పూర్తి చేయడం ద్వారా వార్తలకెక్కారు. ఈ రికార్డు నెలకొల్పిన  భారతీయ పురుషుడుగా భారత సైన్యంలో కల్నల్‌గా ఉన్న జేకే బజాజ్ ఉన్నారు.

న్యూమరాలజీలో జెసి చౌదరి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌

భారతదేశపు అగ్రశ్రేణి న్యూమరాలజిస్ట్‌లలో ఒకరైన జేసీ చౌదరి న్యూమరాలజీ రంగంలో అరుదైన మైలురాయిని సాధించారు. అతను న్యూమరాలజీలో మొట్టమొదటి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ సాధించిన వ్యక్తిగా రికార్డుకెక్కారు. యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్'కు చెందిన దాదాపు 6000 మంది న్యూమరాలజీ ఔత్సాహికులకు ప్రాచీన సైన్స్ గురించి అవగాహన కల్పించడం ద్వారా 2022 లో మొదటి ప్రపంచ రికార్డు సాధించారు.

ఐసీహెచ్ఆర్ నూతన ఛైర్మన్‌గా రఘువేంద్ర తన్వర్

న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ (ఐసిహెచ్‌ఆర్) ఛైర్మన్‌గా ఎమిరిటస్ ప్రొఫెసర్ మరియు కురుక్షేత్ర విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ రఘువేంద్ర తన్వర్ నియమితులయ్యారు. ఈయన వచ్చే మూడేళ్లు ఈ బాధ్యతలు నిర్వహించనున్నారు. తన్వర్ గత 42 సంవత్సరాలగా కురుక్షేత్ర విశ్వవిద్యాలయంకు చెందిన హిస్టరీ డిపార్టుమెంటులో సేవలు అందించారు.

రఘువేంద్ర తన్వర్ 2016లో హర్యానా అకాడమీ ఆఫ్ హిస్టరీ అండ్ కల్చర్ డైరెక్టర్‌గా నియమితుడయ్యారు. అలానే 2002 నుండి 2005 వరకు యూజీసీ నేషనల్ ఫెలోషిప్, అకాడెమియాలో ప్రతిష్టాత్మకమైన హోదాలో కూడా పనిచేశారు.

కథక్ మాస్ట్రో పండిట్ బిర్జు మహారాజ్ కన్నుమూశారు

భారతదేశపు ప్రముఖ కథక్ విద్వాంసుడు మరియు పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత, పండిట్ బిర్జు మహారాజ్ 83 ఏళ్ళ వయసులో తన స్వగృహంలో గుండెపోటుతో మరణించారు. లక్నో ఘరానాకు చెందిన బిర్జూ మహారాజ్ 1938 ఫిబ్రవరి 4న జన్మించారు. ఆయన కెరీర్‌లో పద్మ విభూషణ్ అవార్డుతో పాటుగా సంగీత నాటక అకాడమీ అవార్డు, కాళిదాస్ సమ్మాన్, నృత్య చూడామణి, ఆంధ్రరత్న, నృత్య విలాస్, ఆదర్శ శిఖర్ సమ్మాన్, సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు, శిరోమణి సమ్మాన్, రాజీవ్ గాంధీ శాంతి పురస్కారం… ఇలా చాలా అవార్డులు బిర్జు మహారాజ్ అందుకున్నారు.

దేవదాస్, బాజీరావు మస్తానీ, సత్యజిత్ రే చిత్రం చెస్ కే ఖిలాడీ కి సంగీతం అందించారు. 2012 లో వచ్చిన విశ్వరూపం సినిమాకు ఆయనకు జాతీయ చలన చిత్ర పురస్కారం లభించింది.

ప్రపంచవ్యాప్తంగా ఒంటరిగా ప్రయాణించిన అతి పిన్న వయస్కురాలు జారా రూథర్‌ఫోర్డ్

బెల్జియన్-బ్రిటన్ ఉమ్మడి జాతీయరాలు అయినా 19 ఏళ్ళ జారా రూథర్‌ఫోర్డ్ ప్రపంచవ్యాప్తంగా ఒంటరిగా ప్రయాణించిన అతి పిన్న వయస్కురాలుగా రికార్డుకెక్కింది. ఆమె దాదాపు ఐదు ఖండాలలో పరిధిలో 31 దేశాల మీదగా 32,000 మైళ్ల కంటే ఎక్కువ ప్రయాణాన్ని పూర్తిచేయడం ద్వారా ఈ రికార్డు నెలకొల్పింది.

UNDP యూత్ క్లైమేట్ ఛాంపియన్‌గా ప్రజక్తా కోలి

ప్రముఖ యూట్యూబర్ ప్రజక్తా కోలీ, ఇండియా మొట్టమొదటి యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ - యూత్ క్లైమేట్ ఛాంపియన్‌గా నిలిచింది. పాపులర్ సామాజిక ప్రచార వేదికల ద్వారా మానసిక ఆరోగ్యం, మహిళల హక్కులు మరియు బాలికా విద్య కోసం ఆమె చేసిన కృషికి ఆమెకు ఈ బిరుదు ప్రదానం చేయబడింది.

Post Comment