Advertisement
వార్తల్లో వ్యక్తులు : మార్చి 2022 | తెలుగు కరెంటు అఫైర్స్
Telugu Current Affairs

వార్తల్లో వ్యక్తులు : మార్చి 2022 | తెలుగు కరెంటు అఫైర్స్

నాక్ చైర్‌పర్సన్‌గా డాక్టర్ భూషణ్ పట్వర్ధన్

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) విద్యావేత్త మరియు పరిశోధనా శాస్త్రవేత్త ప్రొఫెసర్ భూషణ్ పట్వర్ధన్‌, నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (NAAC) ఎగ్జిక్యూటివ్ కమిటీకి కొత్త చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు.

యష్ రాజ్ ఫిల్మ్స్ సీఈఓగా అక్షయ్ విధాని

ప్రముఖ ఇండియన్ లీడింగ్ ఫిల్మ్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ యష్ రాజ్ ఫిల్మ్స్, అక్షయ్ విధానిని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించింది. విధాని ప్రస్తుతం యష్ రాజ్ స్టూడియోస్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఫైనాన్స్ మరియు బిజినెస్ అఫైర్స్ మరియు హెడ్ ఆఫ్ ఆపరేషన్స్‌గా పనిచేస్తున్నారు. 1970 లో యష్ చోప్రా ఏర్పాటు చేసిన ఈ సినీ నిర్మాణ సంస్థ తర్వాత కాలంలో భారతదేశంలోని అతిపెద్ద ఫిల్మ్ స్టూడియోలలో ఒకటిగా ఎదిగింది.

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్(52) కన్నుమూశారు

ఆస్ట్రేలియా క్రికెట్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్, అనుమానాస్పద గుండెపోటుతో 52 ఏళ్ల వయసులో థాయ్‌లాండ్‌లోని కో స్యామ్యూయ్‌లోని అతని విల్లాలో కన్నుమూశారు. రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నరైనా షేన్ వార్న్, ఆస్ట్రేలియా జట్టు తరుపున 145 టెస్ట్ మ్యాచులలో 708 వికెట్లు తీయగా, 194 వన్డే మ్యాచులలో 293 వికెట్లు పడగొట్టాడు. 2007 వరకు టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలరుగా ఉన్న షేన్ వార్న్, విస్డెన్ క్రికెటర్లలో ఒకరిగా పేరు పొందాడు.

చైనాలో భారత కొత్త రాయబారి ప్రదీప్ కుమార్ రావత్

చైనాలో భారత కొత్త రాయబారిగా ప్రదీప్ కుమార్ రావత్ బాధ్యతలు స్వీకరించారు. రావత్, 1990 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS)కు చెందిన అధికారి. ఈయన మాండరిన్ భాషలో అనర్గళంగా మాట్లాడగలరు, ఈయన ఇదివరకు నెదర్లాండ్స్‌లో భారత రాయబారిగా ఉన్నారు. తూర్పు లడఖ్‌లో దీర్ఘకాల సరిహద్దు ప్రతిష్టంభనను పరిష్కరించడానికి ఇరు దేశాలు ప్రయత్నిస్తున్న సమయంలో చైనాలో భారత రాయబారిగా ఆయన నియామకం జరిగింది.

మిస్ వరల్డ్ 2021 విజేతగా కరోలినా బిలావ్స్కా

ప్యూర్టో రికోలోని శాన్ జువాన్‌లో జరిగిన పోటీల 70వ ఎడిషన్‌లో పోలాండ్‌కు చెందిన కరోలినా బిలావ్స్కా మిస్ వరల్డ్ 2021 కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఇదే పోటీలో మిస్ యూఎస్ఏ శ్రీ సైనీ రెండవ స్థానంలో, ఆఫ్రికా కోట్ డి ఐవోయిర్ చెందిన ఒలివియా యాస్‌ మూడవ స్థానంలో నిలిచారు.

మిస్ వరల్డ్ 2021, మిస్ వరల్డ్ పోటీల 70వ ఎడిషన్, మార్చి 16, 2022న ప్యూర్టో రికోలోని శాన్ జువాన్‌లోని కోకాకోలా మ్యూజిక్ హాల్‌లో జరిగింది. సమార్పుకులుగా పీటర్ ఆండ్రీ, ఫెర్నాండో అలెండేలు వ్యవహరించారు.

ఐక్యరాజ్యసమితి సలహాదారుగా భారత ఆర్థికవేత్త జయతీ ఘోష్

భారత ఆర్థికవేత్త జయతీ ఘోష్ ఐక్యరాజ్యసమితి సలహా బోర్డు సభ్యురాలిగా ఎంపికయ్యారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్, బహుపాక్షికత (మల్టీలాటెరలిజం)పై కొత్తగా ఏర్పాటుచేసిన ఉన్నత-స్థాయి సలహా బోర్డుకు ఆమెను నియమిస్తున్నట్లు ప్రకటించారు. జయతీ ఘోష్ ఇప్పటికే యూఎన్ ఎకనామిక్స్ & సోషల్ అఫైర్స్ సంబంధించి ఉన్నతస్థాయి సలహా బోర్డులో సభ్యురాలుగా ఉన్నారు.

ఫెడెక్స్ నూతన సీఈఓగా భారతీయ అమెరికన్ రాజ్ సుబ్రమణ్యం

అంతర్జాతీయ డెలివరీ దిగ్గజం ఫెడెక్స్ (FedEx) యొక్క కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా భారతీయ అమెరికన్ రాజ్ సుబ్రమణ్యం నియమితులయ్యారు. 1971లో ఫెడెక్స్ స్థాపించిన నుండి ఆ సంస్థ చైర్మన్ మరియు సీఈఓగా ఉన్న ఫ్రెడరిక్ డబ్ల్యూ స్మిత్ స్థానంలో రాజ్ సుబ్రమణ్యం త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. రాజ్ సుబ్రమణ్యం ప్రస్తుతం ఆ సంస్థ ప్రెసిడెంట్ మరియు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసరుగా ఉన్నారు. ఈయన ఐఐటీ ముంబై నుండి కెమికల్ ఇంజినీరింగులో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు.

Post Comment