Advertisement
తెలుగులో కరెంట్ అఫైర్స్ 02 ఫిబ్రవరి 2024
February Telugu Current Affairs

తెలుగులో కరెంట్ అఫైర్స్ 02 ఫిబ్రవరి 2024

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 02 ఫిబ్రవరి 2024. పోటీ పరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆశావహుల కోసం వీటిని ప్రత్యేకంగా రూపొందిస్తున్నాం.

రక్షణ రంగంలో సహకారం కోసం భారత్, ఒమన్ ఒప్పందం

రక్షణ రంగంలో సహకారం కోసం భారత్, ఒమన్ మధ్య ఊహాత్మక ఒప్పందం చోటు చేసుకుంది. 31 జనవరి 2024న మస్కట్‌లో 12 వ జాయింట్ మిలిటరీ కోఆపరేషన్ కమిటీ సమావేశంలో ఈ ఒప్పందం చోటు చేసుకుంది. ఈ సమావేశానికి ఒమన్ డాక్టర్ మహమ్మద్ బిన్ నసీర్ బిన్ అలీ అల్ జాబీ, భారత రక్షణ మంత్రిత్వ శాఖ సెక్రటరీ జనరల్ గిరిధర్ అరమనే సహ అధ్యక్షత వహించారు.

ఈ సమావేశంలో భారత్ మరియు ఒమన్ మధ్య బలమైన రక్షణ సహకారాన్ని ఇరుపక్షాలు సమీక్షించాయి. సైనిక శిక్షణ, జాయింట్ ఎక్సర్‌సైజ్, ఇన్ఫర్మేషన్ షేరింగ్, ఓషనోగ్రఫీ, షిప్ బిల్డింగ్ & ఎమ్మార్ఓ రంగాలలో సహకారానికి సంబంధించిన అంశాలు చర్చకు వచ్చాయి.

ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ డిసెంబరు 2023లో భారతదేశంలో పర్యటన సందర్భంగా ఆమోదించిన 'ఎ పార్టనర్‌షిప్ ఫర్ ది ఫ్యూచర్' అనే భారతదేశం - ఒమన్ జాయింట్ విజన్ డాక్యుమెంట్‌ను అమలుపై తాజాగా వీరు సంతకం చేశారు.

ఒమన్ సుల్తానేట్ ఆహ్వానం మేరకు 30-31 జనవరి 2024 వరకు రక్షణ కార్యదర్శి ఒమన్‌ను సందర్శించారు. గల్ఫ్ ప్రాంతంలో భారతదేశానికి అత్యంత సన్నిహిత రక్షణ భాగస్వాములలో ఒమన్ ఒకటి. భారతదేశం మరియు ఒమన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి రక్షణ సహకారం కీలక స్తంభంగా ఉద్భవించనుంది. రెండు దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్య దృక్పథంతో పనిచేయడానికి కట్టుబడి ఉన్నాయి.

ఒమన్ పశ్చిమాసియాలో ఉన్న ఒక అరబ్ దేశం. ఇది అరేబియా ద్వీపకల్పం యొక్క ఆగ్నేయ తీరంలో ఉంది. ఇది సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు యెమెన్‌లతో భూ సరిహద్దులను, ఇరాన్ మరియు పాకిస్తాన్‌లతో సముద్ర సరిహద్దులను పంచుకుంటుంది.

  • దేశం : ఒమాన్
  • రాజధాని : మస్కట్
  • కరెన్సీ : ఒమానీ రియాల్
  • సుల్తాన్ & పీఎం : హైతం బిన్ తారిఖ్ అల్ సైద్
  • క్రౌన్ ప్రిన్స్ : థెయాజిన్ బిన్ హైతం

ఐఐఎంసీకి డీమ్డ్ యూనివర్సిటీ హోదా మంజూరు

యూజీసీ ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐఐఎంసీ)కి డీమ్డ్ యూనివర్శిటీ హోదాను మంజూరు చేసింది. ఈ హోదా న్యూఢిల్లీ క్యాంపస్‌తో పాటుగా జమ్మూ, అమరావతి, ఐజ్వాల్, కొట్టాయం మరియు దెంకనల్‌లోని ఐదు ఐఐఎంసీ ప్రాంతీయ క్యాంపస్‌లకు కూడా వర్తిస్తుంది.

ఈ నిర్ణయంతో జర్నలిజం మరియు మాస్ కమ్యూనికేషన్ కోర్సులలో ప్రత్యేకత కలిగిన ఐఐఎంసీ ఇప్పుడు డాక్టరల్ డిగ్రీలతో సహా డిగ్రీలను అందించడానికి అనుమతి లభిస్తుంది.యూజీసీ సలహా మేరకు విద్యా మంత్రిత్వ శాఖ ప్రత్యేక కేటగిరీ కింద దీనిని డీమ్డ్ యూనివర్సిటీగా ప్రకటించింది.

జార్ఖండ్ నూతన సీఎంగా చంపాయ్ సోరెన్ ప్రమాణస్వీకారం

జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన ప్రముఖ నాయకులలో ఒకరైన రవాణా మంత్రి చంపాయ్ సోరెన్ జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను భూ కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేయడంతో ఆయన తన పదవికి రాజీనామాచేయడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది.

హేమంత్ సోరెన్‌ 2008-2010 మధ్య మైనింగ్ మంత్రిగా ఉన్న సమయంలో మైనింగ్ లీజు కుంభకోణానికి సంబంధించి ఈ అరెస్టు జరిగింది. హేమంత్ సోరెన్ 2013 నుండి 2014 వరకు జార్ఖండ్ 5వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. మళ్లీ 2019 నుండి 2024 వరకు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా సేవలు అందించారు.

ఎల్ కే అద్వానీకి భారతరత్న పురస్కారం

బీజేపీ సీనియర్ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ 50వ భారతరత్న గ్రహీతగా దేశ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్నారు. ఎల్‌కే అద్వానీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సహ వ్యవస్థాపకులలో ఒకరు. మితవాద హిందూ జాతీయవాద స్వచ్చంద సంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) యందు కీలక సభ్యునిగా సేవలు అందించారు.

ఎల్‌కే అద్వానీ భారతదేశానికి 7వ ఉప ప్రధానమంత్రిగా కూడా పని చేశారు. లోక్‌సభలో ఎక్కువ కాలం ప్రతిపక్ష నేతగా కూడా సేవలు అందించారు. 2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయన బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించబడ్డారు.

అద్వానీ 8 నవంబర్ 1927లో కరాచీలో జన్మించారు. భారతదేశ విభజన సమయంలో ఆయన భారతదేశానికి వలస వచ్చారు. ఆ తర్వాత బొంబాయిలో స్థిరపడ్డారు. పద్నాలుగేళ్ల వయసులో 1941లో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరి రాజస్థాన్ ప్రచారక్‌గా పనిచేశారు. 1951లో, శ్యామ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్‌లో అద్వానీ సభ్యుడుగా చేరారు.

అద్వానీ 1967లో మొదటి ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1970 వరకు ఆర్ఎస్ఎస్ జాతీయ కార్యవర్గంలో సభ్యునిగా పనిచేశారు. 1970లో తొలిసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1989 వరకు నాలుగు పర్యాయాలు కొనసాగారు. 1973లో జన్ సంఘ్ అధ్యక్షుడుగా కూడా పనిచేశారు.

1980లో అటల్ బిహారీ వాజ్‌పేయితో పాటు బిజెపి వ్యవస్థాపక సభ్యులలో అద్వానీ ఒకరు. ఆయన మూడుసార్లు కేంద్ర బీజేపీగా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1989 లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన ఆయన తర్వాత ఏడుసార్లు ఎన్నికయ్యారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేతలో ఈయన కీలకంగా వ్యవహరించారు.

1990లో అయోధ్యలోని వివాదాస్పద రామజన్మభూమి స్థలంపై ఆలయాన్ని నిర్మించాలనే ప్రతిపాదనతో గుజరాత్‌లోని సోమనాథ్ నుండి యుపిలోని అయోధ్య వరకు 10 ఉత్తరాది రాష్ట్రాల గుండా 10,000 కిలోమీటర్ల రథయాత్ర చేసి బీజేపీ పార్టీని అధికారంలోకి తెప్పించాడు. 1990 ల చివరలో దేశంలో హిందూత్వ రాజకీయాల పెరుగుదలకు ఆయన ముఖ్య ప్రతిపాదకులలో ఒకరు.

1998 నుండి 2004 వరకు సుదీర్ఘ కాలం హోం వ్యవహారాల మంత్రిగా సేవలు అందించారు. 2002 నుండి 2004 వరకు ఉప ప్రధాన మంత్రిగా పనిచేశారు. 2019 వరకు భారత పార్లమెంటులో పనిచేశారు. బిజెపిని ఒక ప్రధాన రాజకీయ పార్టీగా ఎదగడంలో ప్రధాన పాత్ర వహించాడు. 2015 లో అడ్వాణీకి భారతదేశం యొక్క రెండవ అత్యున్నత పౌర గౌరవం అయిన పద్మ విభూషణ్ అందించబడింది. తాజాగా 2024 లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అందుకున్నారు.

పారిస్ ఒలింపిక్స్ 2024 టార్చ్ బేరర్‌గా అభినవ్ బింద్రా ఎంపిక

ఒలింపిక్ క్రీడలలో భారతదేశం యొక్క మొట్టమొదటి వ్యక్తిగత స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా రాబోయే 2024 పారిస్ ఒలింపిక్ క్రీడలకు టార్చ్ బేరర్‌గా ఎంపికయ్యాడు. దీనితో ఏప్రిల్ 16 నుండి జూలై 26 వరకు జరిగే ఒలింపిక్ టార్చ్ రిలేలో ఆయన పాల్గొంటారు. ఫ్రాన్స్ అంతటా మొత్తం 11,000 మంది టార్చ్ బేరర్లు ఎంపిక చేయబడ్డారు, వీరిలో 10,000 మంది ఒలింపిక్ టార్చ్ రిలేలో మరియు 1,000 మంది పారాలింపిక్ టార్చ్ రిలేలో పాల్గొంటారు.

జూలై 26న పారిస్‌లో ప్రారంభ వేడుకలకు చేరుకోవడానికి ముందు 68 రోజుల పాటు ఫ్రాన్స్ అంతటా ఈ ఒలింపిక్ జ్వాలా ప్రయాణిస్తుంది. ఐదు విదేశీ భూభాగాలతో సహా 65 భూభాగాలను కవర్ చేస్తూ ఈ టార్చ్ రిలే 68 రోజుల పాటు కొనసాగేలా సెట్ చేయబడింది. ఈ ప్రయాణం ఏప్రిల్ 16న పెలోపొన్నీస్ నుండి ప్రారంభమై ఏథెన్స్ వరకు ప్రయాణిస్తుంది, అక్కడ నుండి మధ్యధరా సముద్రం దాటి మే 8న మార్సెయిల్‌కి చేరుకుంటుంది, ఆ తర్వాత ఫ్రాన్స్ అంతటా ప్రయాణించి జులై 26న పారిస్ చేరుకుంటుంది.

అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అథ్లెట్స్ కమిషన్ సభ్యుడుగా సేవలు అందిస్తున్నారు. బింద్రా 2008లో బీజింగ్ ఒలింపిక్ క్రీడల్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇది భారత్ నుండి వ్యక్తిగత విభాగంలో సాధించిన మొట్టమొదటి ఒలింపిక్ గోల్డ్ మెడల్.

తమిళనాడులో కలైంజర్ స్పోర్ట్స్ కిట్ పథకం ప్రారంభం

తమిళనాడు ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి జయంతిని పురస్కరించుకుని ‘కలైంజర్ స్పోర్ట్స్ కిట్’ అనే నూతన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం రాష్ట్రంలోని మొత్తం 12,000 గ్రామ పంచాయతీలకు స్పోర్ట్స్ కిట్‌లను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

తమిళనాడులో అట్టడుగు స్థాయిలో క్రీడల అభివృద్ధిని ప్రోత్సహించడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. ఇది యువ ప్రతిభను పెంపొందించడం మరియు వివిధ క్రీడలలో రాణించడానికి అవసరమైన క్రీడా పరికరాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకాన్ని క్రీడల అభివృద్ధి మరియు యువజన సంక్షేమ శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఫిబ్రవరి 7, 2024న తిరుచ్చిలో అధికారికంగా ప్రారంభించారు.

తెలంగాణలో అతిపెద్ద అగ్రి షో కిసాన్ 24 ప్రారంభం

తెలంగాణలో నిర్వహించే అతిపెద్ద వ్యవసాయ ప్రదర్శన అయిన కిసాన్ అగ్రి షో 2024కి హైదరాబాద్ ఆతిథ్యం ఇచ్చింది. అగ్రి పరిశ్రమల ప్రముఖులు, నిపుణులు, విధాన నిర్ణేతలు మరియు రైతులను ఒకచోట చేర్చి ఈ వేడుక ఫిబ్రవరి 1 నుండి ఫిబ్రవరి 3, 2024 వరకు హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ మూడు రోజుల ఈవెంట్ వ్యవసాయ రంగంలో తాజా పురోగతుల ప్రదర్శనపై దృష్టి సారిస్తుంది. వ్యవసాయ యంత్రాలు, నీరు & నీటిపారుదల పరిష్కారాలు, రక్షిత సాగు సాంకేతికతలు, ఐఓటీ అప్లికేషన్‌లు, ఆవిష్కరణలు & స్టార్టప్‌లు వంటివి ఇందులో ప్రదర్శనకు ఉంచబడతాయి.

ఈ ఈవెంట్‌లో 140కి పైగా ఎగ్జిబిటర్లు వివిధ వ్యవసాయ రంగాల్లో ఉత్పత్తులు మరియు సేవలను ప్రదర్శిస్తున్నారు. రైతులకు ఇన్ఫర్మేటివ్ సెషన్‌లను అందించడానికి తెలంగాణ హార్టికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రత్యేక సదస్సు కూడా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ మరియు పొరుగు రాష్ట్రాల నుండి పది వేలకు పైగా రైతులు మరియు వ్యవసాయ రంగ నిపుణులు హాజరయ్యారు.

డిజిటల్ డిటాక్స్ ఇనిషియేటివ్‌ను ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం

కర్ణాటక ప్రభుత్వం ఆల్ ఇండియా గేమ్ డెవలపర్స్ ఫోరమ్ (AIGDF) సహకారంతో డిజిటల్ డిటాక్స్ ఇనిషియేటివ్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా కర్నాటక అంతటా డిజిటల్ డిటాక్స్ కేంద్రాలు ఏర్పాటు చేయబడతాయి. గేమింగ్ మరియు సోషల్ మీడియాపై అధిక డిజిటల్ వినియోగం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాల గురించి ఇవి అవగాహన కల్పిస్తాయి. బాధ్యతాయుతమైన మరియు సమతుల్య సాంకేతిక అలవాట్లను ఇవి ప్రోత్సహిస్తాయి.

దీని కోసం కర్నాటక ప్రభుత్వం, ఆల్ ఇండియా గేమ్ డెవలపర్స్ ఫోరమ్ మరియు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ కలిసి మైండ్‌ఫుల్ టెక్నాలజీ గురించి అవగాహన పెంచడానికి ఉమ్మడిగా పని చేయనున్నాయి. కర్ణాటక ప్రభుత్వం గత సంవత్సరం కూడా ఆన్‌లైన్ భద్రత మరియు సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా ఎలా ఉపయోగించాలి మరియు ఆఫ్-స్క్రీన్ సమయాన్ని ఎలా ఉపయోగించాలి అనే దానిపై విద్యార్థులు మరియు అధ్యాపకులకు అవగహన కల్పించడానికి సోషల్ మీడియా దిగ్గజం మెటాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

ప్రపంచంలో అత్యంత స్థిరమైన అల్యూమినియం ఉత్పత్తిదారుగా వేదాంత

ఎస్&పి గ్లోబల్ కార్పొరేట్ సస్టైనబిలిటీ అసెస్‌మెంట్ ప్రకారం వేదాంత అల్యూమినియం ప్రపంచంలో అత్యంత స్థిరమైన అల్యూమినియం ఉత్పత్తిదారుగా గుర్తించబడింది. ఈ గుర్తింపు పర్యావరణం, సామాజిక మరియు పాలన పద్ధతులను కవర్ చేస్తూ స్థిరత్వంలో వేదాంత అల్యూమినియం యొక్క ప్రపంచ నాయకత్వాన్ని పునరుద్ఘాటిస్తుంది.

జీవవైవిధ్యం, వృత్తిపరమైన ఆరోగ్యం & భద్రత, సామాజిక ప్రభావం, మానవ హక్కులు, ప్రతిభ ప్రణాళిక మరియు నీటి నిర్వహణ పద్ధతులతో సహా ప్రమాణాలపై ఈ కంపెనీ అత్యధిక స్కోర్‌ను సాధించింది. ఇది అల్యూమినియం పరిశ్రమలో స్థిరమైన పద్ధతులను అమలు చేయడంలో వేదాంత అల్యూమినియం యొక్క నాయకత్వాన్ని హైలైట్ చేస్తుంది. ఇది పర్యావరణ బాధ్యత, సామాజిక సంక్షేమం మరియు నైతిక పాలన పట్ల కంపెనీ నిబద్ధతను కూడా సూచిస్తుంది.

వేదాంత లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ అయిన వేదాంత అల్యూమినియం, ప్రపంచ ప్రముఖ అల్యూమినియం ఉత్పత్తిదారులలో ఒకటి. మెటల్ ఆఫ్ ది ఫ్యూచర్ అనే నినాదంతో ఒడిశా మరియు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఇది కార్యకలాపాలు నిర్వహిస్తుంది.  కంపెనీ భారతదేశంలో అతిపెద్ద అల్యూమినియం ఉత్పత్తిదారునిగా కూడా ఉంది.

అల్యూమినియం ఏరోస్పేస్, ఏవియేషన్, ఎలక్ట్రికల్, ట్రాన్స్‌పోర్టేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కన్స్యూమర్ గూడ్స్ మరియు ఎలక్ట్రిక్ వాహనాలు మరియు పునరుత్పాదక శక్తి వంటి సోలార్ విద్యుత్ వంటి రంగాలలో విరివిగా ఉపయోగించబడుతుంది. ఇది తక్కువ కార్బన్ భవిష్యత్తుకు కీలకమైనది. అల్యూమినియం నేడు ప్రపంచంలో రెండవ అతి ముఖ్యమైన లోహంగా ఉంది.

2050 నాటికి కొత్త క్యాన్సర్ కేసులు 77 శాతం పెరిగే అవకాశం

ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ అంచనా ప్రకారం 2050 నాటికి కొత్త క్యాన్సర్ కేసులు 77% పెరుగున్నట్లు పేర్కొంది. ఈ అంచనా వేసిన పెరుగుదలకు ప్రధాన కారకాలు పొగాకు, ఆల్కహాల్, ఊబకాయం మరియు వాయు కాలుష్యాలుగా పేర్కొంది. 2050నాటికి 35 మిలియన్లకు పైగా కొత్త క్యాన్సర్ కేసులు అంచనా వేచిన ఈ నివేదిక, 2022లో నిర్ధారణ అయిన 20 మిలియన్ కేసుల నుండి 77% పెరుగుదలగా పేర్కొంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ 115 దేశాల నుండి సేకరించిన ఈ సర్వే ఫలితాలను కూడా ప్రచురించింది. యూనివర్సల్ హెల్త్ కవరేజ్‌లో భాగంగా చాలా దేశాలు ప్రాధాన్యత కలిగిన క్యాన్సర్ మరియు పాలియేటివ్ కేర్ సేవలకు తగినంతగా ఆర్థిక సహాయం చేయడం లేదని ఈ నివేదిక పేర్కొంది.

హై హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ దేశాలు అత్యధిక సంపూర్ణ క్యాన్సర్ కేసుల పెరుగుదలను (4.8 మిలియన్ కేసులు) ఈ స్టడీ అంచనా వేచింది, అయితే తక్కువ హెచ్డిఐ దేశాలు 142% పెరుగుదలను మరియు మధ్యస్థ హెచ్డిఐ దేశాలు 2050 నాటికి క్యాన్సర్ సంభవం 99% పెరుగుదలను ఎదుర్కొంటాయిని హెచ్చరించింది.

క్యాన్సర్ కేసులు మరియు మరణాల పెరుగుదలను తగ్గించడానికి ముందస్తుగా గుర్తించడం మరియు చికిత్సలో పెట్టుబడిని పెంచడం చాలా కీలకం అని తెలిపింది. 2020లో 19.3 మిలియన్ కొత్త క్యాన్సర్ కేసులు మరియు దాదాపు 10.0 మిలియన్ క్యాన్సర్ మరణాలు సంభవించినట్లు పేర్కొంది. 2.3 మిలియన్ కొత్త కేసులతో మహిళల రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను అధిగమించినట్లు తెలిపింది.

Post Comment