Advertisement
తెలుగులో వీక్లీ కరెంట్ అఫైర్స్ 12 జూన్ 2023 | తెలుగు ఎడ్యుకేషన్
Telugu Current Affairs

తెలుగులో వీక్లీ కరెంట్ అఫైర్స్ 12 జూన్ 2023 | తెలుగు ఎడ్యుకేషన్

తెలుగులో వీక్లీ కరెంట్ అఫైర్స్ అంశాలు పొందండి. యూపీఎస్‌సీ, ఎస్ఎస్‌సీ, ఏపీపీఎస్‌సీ, టీఎస్‌పీఎస్‌సీ, రైల్వే, బ్యాంకింగ్, డిఫెన్స్, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ వంటి వివిధ నియామక పరీక్షలకు సిద్దమౌతున్న ఔత్సాహికుల కోసం వీటిని ప్రత్యేకంగా రూపొందించాం.

ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్ 2023లో ఐఐటీ మద్రాస్‌కు అగ్రస్థానం

మద్రాస్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరుసగా ఐదవ సంవత్సరం కూడా ఎన్‌ఐఆర్‌ఎఫ్ మొత్తం ర్యాంకింగులో అగ్రస్థానంలో నిలిచింది. ఈ ర్యాంకింగ్ ప్రమాణాలలో ఐఐటీ మద్రాస్ 86.69% స్కోర్‌ను సాధించగా, ఐఐఎస్సీ బెంగళూరు 83.09% మరియు ఐఐటీ ఢిల్లీ 82.16% స్కోర్‌ను సాధించి తర్వాత రెండు మూడు స్థానాలలో నిలిచాయి. యూనివర్సిటీ కేటగిరిలో మాత్రం ఐఐఎస్సీ బెంగళూరు అగ్రస్థానం దక్కించుకుంది.

ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్‌లను భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఏటా విడుదల చేస్తుంది. ఈ ర్యాంకింగ్‌లు టీచింగ్, లెర్నింగ్ మరియు రిసోర్సెస్, రీసెర్చ్ మరియు ప్రొఫెషనల్ ప్రాక్టీస్, గ్రాడ్యుయేషన్ ఫలితాలు, ఔట్ రీచ్ మరియు ఇన్ క్లూసివిటీ మరియు పర్సెప్షన్ వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి . నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్) అనేది భారతదేశంలోని ఉన్నత విద్యా సంస్థలకు ర్యాంక్ ఇవ్వడానికి భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా అనుసరించబడిన ర్యాంకింగ్ పద్దతి. దీనిని 2016 నుండి ప్రచురిస్తున్నారు.

ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్స్ 2023లో టాప్ 10 ఇన్‌స్టిట్యూట్‌లు ఇక్కడ ఉన్నాయి:

  1. ఐఐటీ మద్రాస్
  2. ఐఐఎస్సీ బెంగళూరు
  3. ఐఐటీ ఢిల్లీ
  4. ఐఐటీ బాంబే
  5. ఐఐటీ కాన్పూర్
  6. ఎయిమ్స్ ఢిల్లీ
  7. ఐఐటీ ఖరగ్‌పూర్
  8. ఐఐటీ రూర్కీ
  9. ఐఐటీ గౌహతి
  10. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ

భారతదేశం యొక్క లావెండర్ రాజధానిగా భాదేర్వా

జమ్మూ ప్రాంతంలోని భాదేర్వా భారతదేశం యొక్క లావెండర్ రాజధానిగా మరియు అగ్రి స్టార్టప్ గమ్యస్థానంగా ఉద్భవించిందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రకటించారు. భదర్వాలో 2 రోజుల లావెండర్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన  సందర్బంగా ఆయన ఈ ప్రకటన చేసారు. సీఐఎస్ఆర్- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ - జమ్మూ నిర్వహించిన వన్ వీక్ వన్ ల్యాబ్ క్యాంపెయిన్‌లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. డాక్టర్ జితేంద్ర సింగ్ భాదేర్వాను భారతదేశం యొక్క పర్పుల్ విప్లవానికి జన్మస్థలంగా మరియు అగ్రి-స్టార్ట్‌అప్‌ల గమ్యస్థానంగా అభివర్ణించారు.

భాదేర్వా పట్టణంలో లావెండర్ సాగుకు అనువైన మైక్రోక్లైమేట్ ఉంది. ఇక్కడ పండే లావెండర్, లావాండుల అంగుస్టిఫోలియా జాతికి చెందినవి, ఇవి అధిక నాణ్యత మరియు సువాసనకు ప్రసిద్ధి చెందాయి. 2022లో, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, భదర్వాలో లావెండర్ పండుగను మొదటిసారి ప్రారంభించారు. ఈ ప్రాంతంలో లావెండర్ సాగును ప్రోత్సహించడానికి మరియు లావెండర్ యొక్క ప్రయోజనాలను ప్రదర్శించడానికి గత ఏడాది నుండి ఈ వేడుకను నిర్వహిస్తున్నారు.

ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ కప్‌లో గౌతమి & అభినవ్ షాలకు బంగారు పతకం

జర్మనీలోని సుహ్ల్‌లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ కప్‌లో గౌతమి భానోత్ మరియు అభినవ్ షా 16-12తో ఫ్రాన్స్‌కు చెందిన ఓసియాన్ ముల్లర్ మరియు రొమైన్ అఫ్రేర్‌లను ఓడించి మిక్స్‌డ్ ఎయిర్ రైఫిల్ స్వర్ణాన్ని గెలుచుకున్నారు.

10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌ స్వర్ణ పతక పోరులో సైన్యం మరియు అభినవ్ చౌదరి 12-16తో కొరియా జోడీ కిమ్ జూరి మరియు కిమ్ కాంఘ్యూన్ చేతిలో ఓడి రజతం దక్కించుకున్నారు. సురుచి ఇందర్ సింగ్, శుభమ్ బిస్లా జంట 16-14తో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన నిగినా సైద్కులోవా, ముఖమ్మద్ కమాలోవ్‌లపై గెలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు.

అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్

ఇంటర్నేషనల్ నార్త్-సౌత్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్ (ఐఎన్‌ఎస్‌టిసి) అనేది భారతదేశం, ఇరాన్, అజర్‌బైజాన్, రష్యా, మధ్య ఆసియా మరియు యూరప్‌లను కలిపే బహుళ-మోడల్ రవాణా కారిడార్. ఇది 7,200-కిలోమీటర్ల పొడవు (4,500 మైళ్ళు) మార్గం, ఓడ, రైలు మరియు రహదారి ద్వారా వస్తువులను రవాణా చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.

ఐఎన్‌ఎస్‌టిసి మొదటిసారిగా 2000లో భారతదేశం, ఇరాన్ మరియు రష్యాలు ప్రతిపాదించాయి. ఈ కారిడార్‌ను రూపొందించడానికి ఒప్పందం 2002లో సంతకం చేశాయి. మొదటి ట్రయల్ షిప్‌మెంట్ 2009లో ప్రయాణించబడింది. ఈ కారిడార్ ఇప్పటికీ అభివృద్ధి దశలో ఉంది. ఇది పూర్తియితే భారతదేశం మరియు ఐరోపా మధ్య వస్తువుల రవాణా సమయాన్ని మరియు ఖర్చును గణనీయంగా తగ్గిస్తుంది.

హైదరాబాద్‌లో మూడవ జీ20 హెల్త్ వర్కింగ్ గ్రూప్ సమావేశం

G20 ఇండియా ప్రెసిడెన్సీలో భాగంగా 3 వ హెల్త్ వర్కింగ్ గ్రూప్ సమావేశం జూన్ 4-6 తేదీలలో హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సమావేశంకు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి లవ్ అగర్వాల్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఫార్మా, వ్యాక్సిన్‌లు, థెరప్యూటిక్స్ మరియు డయాగ్నోస్టిక్‌లతో సహా ఆరోగ్య రంగంలో పరిశోధన మరియు ఆవిష్కరణలపై చర్చలు నిర్వహించారు.

భారతదేశ మొట్టమొదటి కార్బన్-న్యూట్రల్ గ్రామంగా భివాండి

కేంద్ర సహాయ మంత్రి, కపిల్ పాటిల్, భివండి తాలూకాలో భారతదేశంలోని మొట్టమొదటి కార్బన్-న్యూట్రల్ గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. భివండి ఉత్థాన్ నగర్ అని పిలవబడే ఈ గ్రామం 2025 నాటికి పూర్తి కానుంది. ఈ గ్రామం సౌర మరియు పవన విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా శక్తిని పొందనుంది. రెయిన్వాటర్ హార్వెస్టింగ్ మరియు వేస్ట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ వంటి అనేక ఇతర మౌలిక సదుపాయాలను ఇక్కడ అభివృద్ధి చేయనున్నారు.

భివాండి ఉత్తన్ నగర్ అభివృద్ధి అనేది సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో ఒక భాగం. 2070 నాటికి భారతదేశాన్ని నికర-జీరో కర్బన ఉద్గారిణిగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భివండి ఉత్థాన్ నగర్ అభివృద్ధి ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఒక ముఖ్యమైన అడుగు. ఈ గ్రామం భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుంది.

మణిపూర్ హింసపై విచారణకు ముగ్గురు సభ్యుల ప్యానెల్‌ ఏర్పాటు

మణిపూర్ హింసపై విచారణకు కేంద్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. గౌహతి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అజయ్ లాంబా ఆధ్వర్యంలో ఈ త్రిసభ్య విచారణ కమిషన్‌ ఏర్పాటు చేయబడింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, మే 3న మణిపూర్‌లో మరియు ఆ తర్వాత జరిగిన వివిధ వర్గాల హింస మరియు అల్లర్లకు కారణాలు మరియు వ్యాప్తికి సంబంధించిన అంశాలను ఈ కమిషన్ విచారణ చేస్తుంది.

హింసకు దారితీసిన పరిస్థితులు, జరిగిన నష్టం, పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై విచారణ చేయాలని కమిటీని కేంద్రం కోరింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కమిటీ సిఫార్సులు చేయాలని కూడా కోరింది.

ఈ ఏడాది మే 3 నుండి, ఈశాన్య భారత రాష్ట్రమైన మణిపూర్ ప్రధానంగా రెండు స్థానిక జాతి సంఘాలైన మెయిటీ మరియు కుకీల మధ్య పదేపదే అంతర్గత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ హింస ఫలితంగా 75 మందికి పైగా పౌరులు మరణించారు. అదే సమయంలో 1,700 భవనాలు (ఇళ్లు మరియు మతపరమైన ప్రదేశాలతో సహా) దగ్ధమయ్యాయి. 35,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. వేల మంది రాష్ట్రంలోని 315 సహాయ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు.

మణిపూర్‌లో మెజారిటీ జనాభా ఉన్న మెయిటీ కమ్యూనిటీకి షెడ్యూల్డ్ తెగ హోదాను పరిగణనలోకి తీసుకోవాలని మణిపూర్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన తర్వాత ఈ హింస మొదలైంది. ఈ హోదా భారత రాజ్యాంగంలో రక్షణను నిర్ధారిస్తుంది. ఈ హోదా ప్రభుత్వంలో రిజర్వ్ చేయబడిన సీట్లతో సహా వివిధ ప్రయోజనాలను మెయిటీలకు అందిస్తుంది. ఈ హోదా కోసం వారు ఎప్పటినుండో అభ్యర్థిస్తున్నారు.

అయితే ఈ చర్య కుకి మరియు నాగా ఆదివాసీ సంఘాలలో అశాంతిని, అభద్రతను కలిగించింది. నిజానికి, కోర్టు ప్రకటన వెలువడిన వెంటనే, మే 3న మణిపూర్‌లోని ఆల్-ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ నిరసనగా ర్యాలీ నిర్వహించింది. చురచన్‌పూర్‌లో మెయిటీ కమ్యూనిటీలు నివసించే అనేక గ్రామాలను కాల్చడానికి దారితీశారు. దీనికి ప్రతీకార చర్యగా ఇంఫాల్ లోయ ప్రాంతాలలోని కుకీ కమ్యూనిటీకి చెందిన అనేక ప్రాంతాలలో హింసా చోటు చేసుకుంది.

దీనితో పాటుగా మరో వివాదాస్పదమైన అంశం కూడా ఇందులో భాగమైంది. ఇది వరకు కొండ ప్రాంతాలలో మెయిటీల భూములను బయటివారు కొనుగోలు చేసేందుకు అవకాశం ఉండేది కాదు. ప్రస్తుతం కుకీలు మరియు ఇతర గిరిజన సంఘాలు లోయలో భూములను కొనుగోలుకు ప్రభుత్వం అనుమతిస్తుంది. దీనితో పాటుగా పొరుగున ఉన్న మయన్మార్‌లో 2021 సైనిక తిరుగుబాటు తర్వాత అనేక మంది శరణార్థులు కుకీలతో బలమైన సంబంధాలను ఏర్పరచుకున్నారు. ఈ చర్య మెయిటీ స్వదేశీ సమాజానికి మరింత అభద్రతా భావాన్ని కల్గిస్తుంది. ఈ చర్యలు అన్ని మణిపూర్ రాష్ట్రాన్ని యుద్ధ భూమిగా మార్చాయి.

ఆర్‌బిఐ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ డ్యాష్‌బోర్డ్‌ ప్రారంభం

రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ 'అంతర్దృష్టి' పేరుతో ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ డాష్‌బోర్డ్‌ను జూన్ 5న ప్రారంభించారు. భారతదేశంలో వివిధ రంగాలు మరియు జనాభా పరంగా ఆర్థిక చేరిక యొక్క సమగ్ర వీక్షణను అందించడం ఈ డ్యాష్‌బోర్డ్ యొక్క లక్ష్యం. ఇది ప్రభుత్వ ఆర్థిక చేరిక కార్యక్రమాల పురోగతిని కూడా ట్రాక్ చేస్తుంది.

అంతర్దృష్టి డాష్‌బోర్డ్‌ భారతదేశంలోని బ్యాంక్ ఖాతాలు, క్రెడిట్ కార్డ్‌లు, డెబిట్ కార్డ్‌లు మరియు మొబైల్ వాలెట్‌ల వినియోగ డేటాను అందిస్తుంది. ఈ సంబంధిత వేదికల ద్వారా నగదు ఉపసంహరణల సంఖ్య, ఎటిఎం లావాదేవీలు మరియు డిజిటల్ చెల్లింపుల వంటి బ్యాంకింగ్ సేవల డేటాను కూడా సేకరిస్తుంది.

భారతదేశంలో ఆర్థిక సేవల ప్రాప్యతలో ఇప్పటికీ గణనీయమైన అసమానతలు ఉన్నాయి. ఉదాహరణకు, బ్యాంకు ఖాతాదారుల సంఖ్యలో గ్రామీణ-పట్టణ అంతరం ఇప్పటికీ పెద్దదిగా ఉంది. 92% పట్టణ కుటుంబాలతో పోలిస్తే కేవలం 62% గ్రామీణ కుటుంబాలకు మాత్రమే బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. అంతర్దృష్టి ద్వారా ఆర్థిక సేవల ప్రాప్యతలో అసమానతలు గుర్తించడంతో పాటుగా ఆర్థిక చేరికల పురోగతిని ట్రాక్ చేయొచ్చు. తద్వారా తదుపరి అవసరమయ్యే ప్రాంతాలను గుర్తించి సంబంధిత సేవలు మెరుగుపర్చవచ్చు.

భారత్ - నమీబియా జాయింట్ కమిషన్ మొదటి సమావేశం

విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, నమీబియా విదేశాంగ మంత్రి నెటుంబో నంది-న్డైత్వాతో కలిసి మొదటి భారతదేశం-నమీబియా జాయింట్ కమిషన్‌కు అధ్యక్షత వహించారు. ఈ సమావేశం జూన్ 6న నమీబియాలోని విండ్‌హోక్‌లో జరిగింది. భారతదేశం మరియు నమీబియా మధ్య ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని సమీక్షించడానికి మరియు పరస్పర ఆసక్తి ఉన్న రంగాలలో సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ సమావేశం జరిగింది.

వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, సంస్కృతి వంటి అనేక అంశాలపై ఇరుపక్షాలు చర్చించారు. ఈ ప్రాంతంలో శాంతి మరియు సుస్థిరతను పెంపొందించడానికి కలిసి పనిచేయాలని కూడా వారు అంగీకరించారు.

రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో భారత్-నమీబియా జాయింట్ కమిషన్ సమావేశం ఒక ముఖ్యమైన ముందడుగు. రాబోయే సంవత్సరాల్లో భారతదేశం మరియు నమీబియా మధ్య సహకారం పెరుగుతుందని భావిస్తున్నారు. జాయింట్ కమిషన్ తదుపరి సమావేశాన్ని 2024లో భారత్‌లో నిర్వహించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి.

‘అమృత్ కాల్ కి ఒరే’ పుస్తకాన్ని విడుదల చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు

ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల విజయాలకు సంబంధించి రాసిన 'అమృత్ కాల్ కి ఒరే: బిజెపి విజన్ ఫర్ ది ఫ్యూచర్' అనే పుస్తకాన్ని జూన్ 5న బీజేపీ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా న్యూఢిల్లీలో విడుదల చేశారు. ఈ పుస్తకం 2025లో శతాబ్ది సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నందున, భారతదేశ భవిష్యత్తు కోసం బిజెపి విజన్‌ను వివరిస్తుంది.

ఈ కార్యక్రమంలో ప్రసంగించిన నడ్డా, ఈ పుస్తకం "భవిష్యత్ భారతదేశానికి మేనిఫెస్టో" వంటిది అని అన్నారు. రాబోయే సంవత్సరాల్లో "బలమైన, సుసంపన్నమైన మరియు సమ్మిళిత భారతదేశం" నిర్మాణానికి బిజెపి కట్టుబడిఉన్నట్లు వెల్లడించారు. ఈ పుస్తకానికి ప్రజల నుండి మరియు మీడియా నుండి మంచి ఆదరణ లభించింది. ఇది దాని సమగ్రత మరియు భారతదేశ భవిష్యత్తు కోసం దాని స్పష్టమైన దృష్టి కోసం ప్రశంసించబడింది.

ఈ పుస్తకం బీజేపీ జర్నీ, బీజేపీ విజన్ మరియు బీజేపీ ప్రతిజ్ఞ అనే మూడు భాగాలుగా విభజించబడి ఉంది. "బిజెపి జర్నీ" పేరుతో మొదటి భాగం, 1980లో పార్టీ స్థాపించినప్పటి నుండి నేటి వరకు దాని చరిత్రను వివరిస్తుంది. "బిజెపి విజన్" పేరుతో రెండవ భాగం, ఆర్థికం, సమాజం మరియు పాలన రంగాలలో భారతదేశం యొక్క భవిష్యత్తు కోసం పార్టీ దృష్టిని వివరిస్తుంది. "బిజెపి ప్రతిజ్ఞ" పేరుతో మూడవ భాగం, భారతదేశ ప్రజల పట్ల పార్టీ నిబద్ధతను తెలియజేస్తుంది.

సౌదీ అరేబియాలో ఇరాన్ దౌత్య కార్యకలాపాలు పునరుద్ధరణ

ఏడేళ్ల విరామం తర్వాత జూన్ 6న సౌదీ అరేబియాలో తన దౌత్య కార్యకలాపాలను పునఃప్రారంభించనున్నట్లు ఇరాన్ ప్రకటించింది. రియాద్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం, జెడ్డాలోని కాన్సులేట్ జనరల్ మరియు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్‌ యొక్క శాశ్వత ప్రతినిధి కార్యాలయం అధికారికంగా తిరిగి తెరవబడతాయని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి నాసర్ కనానీ తెలిపారు.

ఇరాక్‌లోని బాగ్దాద్‌లో ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్-అబ్దోల్లాహియాన్ మరియు సౌదీ విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్‌ల మధ్య సమావేశం తర్వాత రాయబార కార్యాలయాలను పునఃప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఇరాక్ ప్రధాని ముస్తఫా అల్-కదిమి ఆహ్వానం మేరకు ఇద్దరు మంత్రులు సమావేశమయ్యారు.

ఈ ఏడాది మార్చిలో, ఇరాన్ మరియు సౌదీ అరేబియా దౌత్య సంబంధాలను ఏర్పరచుకోవడానికి అంగీకరించాయి, చైనీస్ మధ్యవర్తిత్వంతో ఈ పురోగతి చోటుచేసుకుంది. 2016 లో సౌదీ అరేబియాలో షియా మతగురువును ఉరితీసిన తర్వాత ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ ఉరిశిక్ష ఇరాన్‌లో నిరసనలకు దారితీసింది అదే సమయంలో ఈ నిరసనల వెనుక ఇరాన్ ఉందని సౌదీ అరేబియా ఆరోపించింది.

ఇరాన్ మరియు సౌదీ అరేబియా మధ్య సంబంధాల సాధారణీకరణలో రాయబార కార్యాలయాల పునఃప్రారంభం ఒక ముఖ్యమైన దశ. గత కొన్నేళ్లుగా రెండు దేశాల మధ్య నెలకొన్న తీవ్ర విభేదాలను అధిగమించగలరో లేదో చూడాలి. అయితే, దౌత్యకార్యాలయాలు పునఃప్రారంభం కావడం రెండు దేశాలు సఖ్యత కోసం సుముఖంగా ఉన్నాయనడానికి సానుకూల సంకేతం.

పురుషుల 100మీ, 200మీ ఈవెంట్లలో అమ్లాన్ బోర్గోహైన్‌కు స్వర్ణం

బెల్జియంలోని మెర్క్‌సెమ్‌లో జరిగిన ఫ్లాండర్స్ కప్ 2023 అథ్లెటిక్స్ మీట్‌లో భారత స్ప్రింటర్ అమ్లాన్ బోర్గోహైన్ పురుషుల 100 మీటర్లు మరియు 200 మీటర్ల రేసుల్లో రెండు స్వర్ణ పతకాలను సాధించాడు. పురుషుల 100 మీటర్ల ఈవెంట్‌ కేవలం 10.70 సెకన్లలో పూర్తి చేసిన బోర్గోహైన్, 200 మీటర్ల రేసును 20.96 సెకన్లలో ముగించాడు.

25 ఏళ్ల బోర్గోహైన్ నమోదు చేసిన తాజా రికార్డులు అతని మునుపటి అత్యుత్తమ ప్రదర్శన కంటే ఉన్నతమైనవి. బోర్గోహైన్ యొక్క ప్రదర్శనలో గణనీయమైన మెరుగుదల కనిపించింది. ఈ రికార్డులు ఈ రెండు ఈవెంట్లలో అతన్ని అత్యంత వేగవంతమైన భారతీయ స్ప్రింటరుగా నమోదు చేసాయి.

మాల్దీవులలో ఆరవ ఎడిషన్ ఏకథా ఎక్సర్‌సైజ్

భారత్-మాల్దీవులు సంయుక్త సైనిక విన్యాసమైన 'ఏకథా ఎక్సర్‌సైజ్' ఆరవ ఎడిషన్ మాల్దీవులలో జరుగుతోంది. జూన్ 6, 2023న ప్రారంభమైన ఈ వ్యాయామం జూలై 3, 2023 వరకు కొనసాగుతుంది. భారత నౌకాదళం మరియు మాల్దీవుల జాతీయ రక్షణ దళం (ఎంఎన్‌డిఎఫ్) ఈ విన్యాసాన్ని నిర్వహిస్తున్నాయి. డైవింగ్, సముద్ర భద్రత రంగాలలో రెండు దళాల మధ్య పరస్పర చర్యను పెంపొందించడం దీని లక్ష్యం.

ఈ వ్యాయామంలో జాయింట్ డైవింగ్ ఆపరేషన్‌లు, VBSS (విజిట్, బోర్డ్, సెర్చ్ మరియు సీజర్) ఆపరేషన్‌లు మరియు CQB (క్లోజ్ క్వార్టర్స్ బ్యాటిల్) డ్రిల్‌లతో సహా పలు రకాల కార్యకలాపాలు నిర్వహిస్తారు. ఈ కసరత్తు సముద్ర భద్రతపై కూడా దృష్టి సారిస్తుంది. వీటితో పాటుగా పైరసీ మరియు ఉగ్రవాదం వంటి బెదిరింపులకు ఎలా స్పందించాలనే దానిపై కసరత్తులు ఉంటాయి.

భారతదేశం మరియు మాల్దీవులు తమ ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను బలోపేతం చేసే ప్రయత్నాలలో భాగంగా ఈ వ్యాయామం నిర్వహిస్తున్నారు. రెండు దేశాలు సన్నిహిత వ్యూహాత్మక సంబంధాన్ని కలిగి ఉన్నాయి. హిందూ మహాసముద్ర ప్రాంతంలో సాధారణ భద్రతా సవాళ్లను పరిష్కరించడానికి ఇరువురు కలిసి పనిచేస్తున్నారు.

అతిపెద్ద క్లస్టర్ రీడెవలప్‌మెంట్ పథకాన్ని ప్రారంభించిన ఏక్నాథ్ షిండే

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే జూన్ 06, 2023న థానేలో ఆసియాలోనే అతిపెద్ద క్లస్టర్ రీడెవలప్‌మెంట్ పథకాన్ని ప్రారంభించారు. థానే నక్షత్ర క్లస్టర్ డెవలప్‌మెంట్ స్కీమ్ అని పిలువబడే ఈ పథకం 145 హెక్టార్ల విస్తీర్ణంతో 1 లక్షకి పైగా గృహాలతో అభివృద్ధి చేయబడుతుంది. ఈ పథకంలో వాణిజ్య మరియు రిటైల్ స్థలాలు, అలాగే విద్య మరియు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.

ఈ పథకాన్ని మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (MHADA) అమలు చేస్తోంది మరియు రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది. ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ. 10,000 కోట్లతో వచ్చే ఐదేళ్లలో పూర్తి చేయనున్నారు. థానే నక్షత్ర క్లస్టర్ డెవలప్‌మెంట్ స్కీమ్ థానే ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఒక ప్రధాన కార్యక్రమం. ఈ పథకం థానే ఆర్థిక వ్యవస్థకు చాలా అవసరమైన ప్రోత్సాహాన్ని అందించగలదని మరియు గణనీయమైన సంఖ్యలో ఉద్యోగాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు.

బాలాసోర్ రైలు ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు

278 మంది పౌరుల మృతికి కారణమైన బాలాసోర్ రైలు ప్రమాదంపై దర్యాప్తు చేసేందుకు సీబీఐ కేసు నమోదు చేసింది. రైల్వే మంత్రిత్వ శాఖ అభ్యర్థన మేరకు మరియు ఒడిశా ప్రభుత్వ సమ్మతితో జూన్ 6, 2023 న ఈ కేసు నమోదు చేయబడింది. కటక్‌లోని ప్రభుత్వ రైల్వే పోలీసు (జిఆర్‌పి) నుండి సిబిఐ కేసు దర్యాప్తును చేపట్టింది. సీబీఐ బృందం ప్రమాదంపై విధ్వంసానికి పాల్పడే అవకాశంతో పాటు అన్ని కోణాల్లోనూ విచారించనుంది.

జూన్ 2, 2023న బాలాసోర్ జిల్లాలోని బహనాగా బజార్ రైల్వే స్టేషన్‌లో మూడు రైళ్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్ మరియు గూడ్స్ రైలు ఇందులో భాగమయ్యాయి. బాలాసోర్ రైలు ప్రమాదం ఇటీవలి సంవత్సరాలలో భారతదేశంలో జరిగిన అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలలో ఒకటి. సిబిఐ దర్యాప్తు వల్ల ప్రమాదానికి దారితీసిన వాస్తవాలు, పరిస్థితులు వెలుగులోకి వస్తాయని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడవచ్చని భావిస్తున్నారు.

జసిందా ఆర్డెర్న్'కు న్యూజిలాండ్ రెండవ అత్యున్నత గౌరవం

న్యూజిలాండ్ మాజీ ప్రధాన మంత్రి జసిందా ఆర్డెర్న్ జూన్ 5, 2023న న్యూజిలాండ్ యొక్క రెండవ అత్యున్నత గౌరవమైన న్యూజిలాండ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ యొక్క డామే గ్రాండ్ కంపానియన్‌ని అందుకున్నారు. కోవిడ్ సమయంలో దేశానికి ఆమె చేసిన సేవకు గానూ ఈ గౌరవం లభించింది. వెల్లింగ్‌టన్‌లో జరిగిన కార్యక్రమంలో న్యూజిలాండ్ గవర్నర్ జనరల్ సిండి కిరో ఈ అవార్డును ఆర్డెర్న్‌కు అందజేశారు.

న్యూజిలాండ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ యొక్క డేమ్ గ్రాండ్ కంపానియన్ "దేశానికి విశిష్ట సహకారం" అందించిన వ్యక్తులకు ఇవ్వబడుతుంది. న్యూజిలాండ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్‌లో ఆర్డర్ ఆఫ్ న్యూజిలాండ్ తర్వాత ఈ అవార్డు రెండవ అత్యున్నత గౌరవం. దీనితో ఈ అవార్డు పొందిన మొదటి న్యూజిలాండ్ ప్రధాన మంత్రిగా ఆర్డెర్న్ అవతరించారు. అదే సమయంలో ఈ అవార్డు అందుకున్న అతి పిన్న వయస్కురాలుగా కూడా నిలిచారు

కోవిడ్-19 మహమ్మారి మరియు క్రైస్ట్‌చర్చ్ ఉగ్రదాడుల సమయంలో ఆర్డెర్న్ చూపించిన అసాధారణమైన నాయకత్వం ప్రపంచ దేశాల నుండి ప్రసంశలు అందుకుంది. లింగ సమానత్వం మరియు వాతావరణ మార్పు వంటి సమస్యలపై ఆమె చేసిన కృషికి కూడా ప్రసంశలు అందుకున్నారు. ఈ అవార్డు ప్రధానమంత్రిగా ఆమె సాధించిన విజయాలకు ఒక ముఖ్యమైన గుర్తింపు. ఇది ఆమె నాయకత్వానికి మరియు న్యూజిలాండ్ ప్రజలకు సేవ చేయడంలో ఆమె నిబద్ధతకు నిదర్శనం.

కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్ ప్రాజెక్ట్‌ ప్రారంభం

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ జూన్ 5, 2023న కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్ (KFON) ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 20 లక్షల కుటుంబాలకు ఉచిత ఇంటర్నెట్ కనెక్షన్‌లను అందించడంతో పాటుగా 30,000 ప్రభుత్వ సంస్థలను ఇంటర్నెట్ కనెక్షన్‌ను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్ ప్రాజెక్ట్ కేరళలోని అన్ని ప్రాంతాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించే ప్రభుత్వ యాజమాన్యంలోని నెట్‌వర్క్. ఈ ప్రాజెక్టును కేరళ స్టేట్ ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (KSITIL) అమలు చేస్తోంది.

ఈ ప్రాజెక్ట్ దాదాపు రూ. 1,500 కోట్లతో మూడు దశల్లో పూర్తి చేయనున్నారు. ప్రాజెక్ట్ యొక్క మొదటి దశ ఇప్పటికే పూర్తికానుంది. మొత్తం ప్రాజెక్ట్ 2024 చివరి నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇది రాష్ట్రంలో డిజిటల్ విభజనను తగ్గించడానికి కేరళ ప్రభుత్వం చేపట్టిన ఒక ప్రధాన కార్యక్రమం. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని మరియు కేరళ ప్రజల జీవితాలను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సురినామ్ యొక్క అత్యున్నత పౌర పురస్కారం

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సురినామ్ అత్యున్నత పౌర పురస్కారం 'గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ది చైన్ ఆఫ్ ది ఎల్లో స్టార్ ' అందించబడింది. ఆమె ఇటీవలే మూడు రోజుల సురినామ్ పర్యటన సందర్భంగా సురినామీస్ ప్రెసిడెంట్ చంద్రికాప్రసాద్ సంతోఖి ముర్ముకి ఈ అవార్డును అందించారు. గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ది చైన్ ఆఫ్ ది ఎల్లో స్టార్ అనేది సురినామ్‌లో అత్యున్నత పురస్కారం మరియు దేశానికి విశేష కృషి చేసిన వ్యక్తులకు ప్రదానం చేస్తారు.

మహిళా సాధికారతను ప్రోత్సహించడంలో ఆమె చేసిన కృషికి మరియు భారతదేశం మరియు సురినామ్ మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో ఆమె నిబద్ధతకు గాను ముర్ముకు ఈ అవార్డు లభించింది. ముర్ము సురినామ్‌ను సందర్శించిన మొదటి భారత రాష్ట్రపతిగా నిలిచారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగింది.

సురినామ్ దక్షిణ అమెరికాలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న ఒక చిన్న దేశం. ఇది 1975లో స్వతంత్రం పొందింది. దీని రాజధాని నగరం పరమారిబో, అధికారిక భాష డచ్. భారతదేశానికి సురినామ్‌తో చాల కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మరియు రెండు దేశాల సహకారానికి సుదీర్ఘ చరిత్ర ఉంది.

భారత సైన్యానికి తొలి మహిళా కమ్యూనికేషన్ కమాండ్‌గా కల్నల్ శుచితా శేఖర్

కల్నల్ శుచితా శేఖర్ జూన్ 5, 2023 న ఇండియన్ ఆర్మీ సర్వీస్ కార్ప్స్‌లో కమ్యూనికేషన్ జోన్ మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్ బెటాలియన్‌కు నాయకత్వం వహించిన మొదటి మహిళా అధికారిగా నిలిచారు. పూర్తిగా పనిచేస్తున్న నార్తర్న్ కమాండ్ యొక్క సప్లై చెయిన్ నిర్వహణకు ఆమె బాధ్యత వహిస్తారు.

శుచితా శేఖర్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ మరియు ఇండియన్ మిలిటరీ అకాడమీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. ఆమె ఆర్మీ సర్వీస్ కార్ప్స్‌లో వివిధ కమాండ్ మరియు స్టాఫ్ స్థానాల్లో పనిచేశారు. ఆమె విశిష్ట సేవా పతకాన్ని అందుకున్నారు, ఇది భారతదేశంలో మూడవ అత్యున్నత శాంతికాల శౌర్య పురస్కారం.

కమ్యూనికేషన్ జోన్ మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్ బెటాలియన్ కమాండర్‌గా ఆమె నియామకం భారత సైన్యం చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా చెప్పొచ్చు. ఆమె భారత సైన్యంలోని మహిళలందరికీ స్ఫూర్తిదాయకం మరియు ఆమె నియామకం సైన్యంలో లింగ సమానత్వం పరంగా జరుగుతున్న పురోగతికి సంకేతం.

చిత్తడి నేలలు, మడ అడవుల పునరుజ్జీవనం కోసం రెండు నూతన పథకాలు

దేశవ్యాప్తంగా చిత్తడి నేలలు మరియు మడ అడవులను పునరుద్ధరించే చర్యలో భాగంగా, అమృత్ ధరోహర్ మరియు మిష్టి (మంగ్రోవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్‌లైన్ హాబిటాట్స్ అండ్ ట్యాంజిబుల్ ఇన్‌కమ్స్) పేరుతో రెండు పథకాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ పథకాలను ప్రపంచ పర్యావరణ దినోత్సవం అయినా జూన్ 5వ తేదీన ప్రారంభించారు.

అమృత్ ధరోహర్ యోజన భారతదేశంలో ఇప్పటికే ఉన్న రామ్‌సర్ సైట్‌ల పరిరక్షణలో ప్రజలను భాగస్వామ్యం చేస్తుంది. ఈ పథకం చిత్తడి నేలల యొక్క సరైన వినియోగాన్ని ప్రోత్సహించడం, పర్యావరణ పర్యాటకాన్ని పెంచడం మరియు స్థానిక కమ్యూనిటీలు ఆదాయాన్ని పెంపొందించడంలో సహాయపడటం కోసం లక్ష్యంగా పెట్టుకుంది. అమృత్ ధరోహర్ పథకం భారతదేశంలోని చిత్తడి నేలలను పరిరక్షించడం మరియు పునరుద్ధరించడం కోసం ఒక ముఖ్యమైన అడుగు. ఈ పథకం స్థానిక కమ్యూనిటీలకు గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలను అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది మరియు దేశం యొక్క సహజ వారసత్వాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.

మిష్టి (MISHTI) పథకం భారతదేశ తీరప్రాంతంలో ఉన్న మడ పర్యావరణ వ్యవస్థలను పరిరక్షించడానికి మరియు పునరుద్ధరించడానికి ప్రారంభించబడింది. ఈ పథకం రాబోయే ఐదేళ్లలో మడ అడవులను 540 చదరపు కిలోమీటర్ల మేర పెంచడం మరియు తీరప్రాంతాలలో స్థిరమైన అభివృద్ధి మరియు జీవనోపాధిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మరియు స్థానిక సంఘాల సహకారంతో పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ అమలు చేయనుంది.

ఈ పథకం తీరప్రాంతం వెంబడి మరియు ఉప్పు పాన్ భూములలో మడ అడవులను పెంచడం ఆక్వాకల్చర్, ఎకో-టూరిజం మరియు సాంప్రదాయ చేతిపనుల వంటి స్థానిక కమ్యూనిటీల కోసం స్థిరమైన జీవనోపాధి పెంపొందించడం, మడ అడవుల సంరక్షణ మరియు నిర్వహణలో స్థానిక కమ్యూనిటీలను భాగస్వామ్యం చేయడం వంటి అంశాలపై దృష్టి సారిస్తుంది.

ఈ రెండు పథకాలకు పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నిధులు సమకూరుస్తుంది. నేషనల్ వెట్‌ల్యాండ్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ (NWCP) ద్వారా అమలు చేయబడుతాయి. భారతదేశంలో ప్రస్తుతం 75 రామ్‌సర్ సైట్‌లు గుర్తించబడ్డాయి. రామ్‌సర్ కన్వెన్షన్ అనేది 1971లో ఆమోదించబడిన అంతర్జాతీయ ఒప్పందం. ఇది ప్రపంచ స్థాయిలో చిత్తడి నేలలను సంరక్షించడం మరియు నిర్వహించడం కోసం బాధ్యత వహిస్తుంది.

వన్ స్టూడెంట్ వన్ ట్రీ క్యాంపెయిన్ ప్రారంభం

ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) జూన్ 5, 2023న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సంధర్బంగా ఒక విద్యార్థి ఒక చెట్టు ప్రచారం 2023 కార్యక్రమాన్ని ప్రారంభించింది. విద్యార్థులు, అధ్యాపకులను పర్యావరణ పరిరక్షణ వైపు ప్రోత్సహించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యం.

ఎఐసిటీఈ ఆమోదం పొందిన అన్ని సంస్థలు ఈ చెట్ల పెంపకం డ్రైవ్‌ను ప్లాన్ చేయాలని మరియు నాటిన చెట్ల వివరాలను ఒక పోర్టల్‌లో సమర్పించాలని కోరింది. ప్లాంటేషన్ డ్రైవ్ యొక్క చిత్రాన్ని కూడా సంస్థలు సమర్పించాల్సి ఉంటుంది. 2030 నాటికి భారతదేశంలో అటవీ విస్తీర్ణం ప్రస్తుత 21.7% నుండి 33%కి పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో ఈ ప్రచారం కూడా ఒక భాగం.

ఈ ప్రచారంలో చెట్ల ప్రాముఖ్యత మరియు పర్యావరణ పరిరక్షణలో వాటి పాత్ర గురించి అవగాహన కల్పించాలని భావిస్తున్నారు. విద్యార్థులు మరియు ఇతర భాగస్వాములలో చెట్లను నాటడం మరియు వాటిని సంరక్షించడం వంటి బాధ్యతాయుత భావాన్ని సృష్టించాలని కూడా భావిస్తున్నారు.

దేశంలో తొలి అంతర్జాతీయ క్రూయిజ్ వెసెల్ ప్రారంభం

కేంద్ర షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్ భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ఎంవి ఎంప్రెస్‌ను చెన్నై నుండి శ్రీలంకకు జూన్ 5, 2023న ఫ్లాగ్ ఆఫ్ చేశారు. ఈ నౌకను ₹17.21 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇందులో 3,000 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. ఈ నౌక చెన్నై మరియు శ్రీలంకల మధ్య వారానికోసారి నడుస్తుంది, ట్రింకోమలీ, హంబన్‌టోట మరియు జాఫ్నా ఓడరేవులను కవర్ చేస్తుంది.

చెన్నైలోని క్రూయిజ్ టూరిజం టెర్మినల్‌ను కూడా అదే రోజు ప్రారంభించారు. ఈ టెర్మినల్ అంతర్జాతీయ క్రూయిజ్ ప్రయాణికులకు అవసరమైన అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేయబడింది. ఎంవి ఎంప్రెస్ ప్రారంభం మరియు క్రూయిజ్ టూరిజం టెర్మినల్ ప్రారంభోత్సవం భారతదేశంలో క్రూయిజ్ టూరిజం అభివృద్ధిలో ఒక ముఖ్యమైన దశ. ఈ కార్యక్రమాలు దేశంలో పర్యాటకాన్ని పెంపొందిస్తాయని మరియు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయని భావిస్తున్నారు.

కోల్‌కతాలో ఎయిర్ ప్యూరిఫైర్‌ బస్సులు ప్రారంభం

కోల్‌కతాలో పెరుగుతున్న కాలుష్య స్థాయిలను అధిగమించే ప్రయత్నంలో, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఎయిర్ ప్యూరిఫైయర్‌లతో కూడిన బస్సులను ప్రవేశపెట్టింది. పశ్చిమ బెంగాల్ కాలుష్య నియంత్రణ మండలి (WBPCB) ద్వారా జూన్ 6, 2023న వీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. మొదటి దశలో భాగంగా మొత్తం 20 ఎయిర్ ప్యూరిఫైయర్‌లను అమర్చిన బస్సులను నడుపుతుంది.

బస్సుల లోపల ప్రసరించే గాలిని క్లీన్ చేయడానికి బస్సులలో శుద్ధ వాయు అనే పేరుతొ బస్ ఇన్‌సైడ్ ఎయిర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ (BIAPS) అమర్చింది. ఈ బస్సులు ప్రస్తుతానికి పైలట్ ప్రాతిపదికన నడపబడుతున్నాయి. వీటిని ఐఐటీ ఢిల్లీ పరిశోధకుల సహాయంతో అభివృద్ధి చేసింది. భారతదేశంలోని అత్యంత కాలుష్య నగరాల్లో ఒకటిగా ఉన్న కోల్‌కతాలో గాలి నాణ్యతను మెరుగుపరచడానికి బస్సులు సహాయపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇవి భారతదేశంలోనే మొదటివి.

మధ్యప్రదేశ్‌లో 'సీఎం లెర్న్ అండ్ ఎర్న్ స్కీమ్' ప్రారంభం

రాష్ట్రంలోని యువతకు శిక్షణ మరియు ఉపాధి అవకాశాలను అందించడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం సీఎం లెర్న్ అండ్ ఎర్న్ అనే నూతన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని జూన్ 7, 2023న ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు. ఐటీ, తయారీ, వ్యవసాయం, ఆతిథ్యంతో సహా 100కి పైగా రంగాలలో ఉపాధి శిక్షణ అందించడం ఈ పథకం లక్ష్యం.

ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల ద్వారా ఈ శిక్షణ ఇవ్వనున్నారు. ఈ పథకంలో పాల్గొనే యువతకు శిక్షణ సమయంలో నెలకు రూ. 8,000 నుండి రూ.10,000 స్టైపెండ్ అందిస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత వారికి ప్లేస్‌మెంట్ సహాయం కూడా అందజేస్తారు. ఈ పథకం కింద లక్ష మంది యువతకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఆ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి సరైన ముందడుగు. ఈ పథకం ద్వారా యువతకు శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు వారు స్వావలంబన సాధించేందుకు దోహదపడుతుందని భావిస్తున్నారు.

దేశంలో ఇంధన సహకారం కోసం బిమ్స్‌టెక్ సెంటర్ ప్రారంభం

దేశంలో ఇంధన సహకారం కోసం బిమ్స్‌టెక్ సెంటర్ ఫర్ ఎనర్జీ కోఆపరేషన్ ఈ ఏడాది చివర్లో ఢిల్లీలో ఏర్పాటు చేయనున్నట్లు బిమ్స్‌టెక్ సెక్రటరీ జనరల్ టెన్జిన్ లెక్‌ఫెల్ ప్రకటించారు. ఇది ఇంధన సహకారానికి సంబందించి దేశంలో సెక్రటేరియట్‌గా పనిచేస్తుంది. బిమ్స్‌టెక్ (బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ-సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్) అనేది దక్షిణాసియా మరియు ఆగ్నేయాసియాలోని ఏడు దేశాల ఉప-ప్రాంతీయ సమూహం.

ఈ సమూహంలో బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మయన్మార్, నేపాల్, శ్రీలంక మరియు థాయిలాండ్ దేశాలు ఉన్నాయి. ఇది సభ్య దేశాల మధ్య ఇంధన సహకారాన్ని ప్రోత్సహించడానికి ఒక కేంద్రంగా ఉంటుంది. ఇంటర్ గ్రిడ్ కనెక్టివిటీ, ఇంధన సామర్థ్యం, ​​పునరుత్పాదక ఇంధనం వంటి ప్రాజెక్టులపై పని చేస్తుంది.

దేశంలో బిమ్స్‌టెక్ సెంటర్ ఫర్ ఎనర్జీ కోఆపరేషన్ ప్రారంభోత్సవం ఇంధన సహకారం అభివృద్ధిలో ఒక ముఖ్యమైన దశ. ఈ కేంద్రం సభ్య దేశాల మధ్య ఇంధన వాణిజ్యం మరియు పెట్టుబడులను ప్రోత్సహిస్తుందని మరియు ఈ ప్రాంతంలో ఇంధన భద్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఐదు కొత్త నాన్-పర్మనెంట్‌ దేశాలకు చోటు

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి ఐదు కొత్త నాన్-పర్మనెంట్‌ సభ్య దేశాలు ఎన్నుకోబడ్డాయి. ఈ జాబితాలో అల్జీరియా, గయానా, సియెర్రా లియోన్, స్లోవేనియా మరియు దక్షిణ కొరియాలు ఉన్నాయి. ఈ ఎన్నికైన ఐదు దేశాలు ఇప్పటికే నాన్-పర్మనెంట్‌ జాబితాలో ఉన్న మరో ఐదు దేశాలు అయినా అల్బేనియా, బ్రెజిల్, గాబన్, ఘనా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సరసన చేరుతాయి.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఐదు శాశ్వత సభ్యులు మరియు పది మంది ఎన్నుకోబడిన, శాశ్వతేతర సభ్యులచే నిర్వహించబడుతుంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఐక్యరాజ్యసమితిలో అత్యంత శక్తివంతమైన సంస్థ. ఇది అంతర్జాతీయ శాంతి భద్రతలను కాపాడే బాధ్యతను నిర్వహిస్తుంది . భద్రతా మండలిలో ఐదు శాశ్వత సభ్యు దేశాలుగా చైనా, ఫ్రాన్స్, రష్యా, యునైటెడ్ కింగ్‌డమ్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఉన్నాయి. భద్రతా మండలిలోని ఇతర పది నాన్-పర్మనెంట్‌ సభ్యులను జనరల్ అసెంబ్లీ ద్వారా రెండేళ్ల కాలానికి ఎన్నుకుంటారు.

భారతదేశం యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో ఎనిమిది పర్యాయాలు నాన్-పర్మనెంట్‌ సభ్య దేశంగా బాధ్యతలు నిర్వర్తించింది. ఇటీవలే కాలంలో భద్రతా మండలిలో శాశ్వత స్థానం కోసం భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి మరింత మంది శాశ్వత సభ్యులను చేర్చడానికి కౌన్సిల్ విస్తరణకు భారత్ పిలుపునిచ్చింది.

భద్రతా మండలిలో ఉన్న సమయంలో, సిరియా వివాదం, ఇరాన్‌లో అణు సమస్య మరియు ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతి ప్రక్రియతో సహా అనేక కీలక అంతర్జాతీయ సమస్యలను పరిష్కరించడంలో భారతదేశం నిర్మాణాత్మక పాత్ర పోషించింది. ఉగ్రవాద నిరోధకం మరియు అణ్వస్త్ర వ్యాప్తి నిరోధంపై ఐక్యరాజ్యసమితి చేస్తున్న కృషికి భారతదేశం కూడా బలమైన మద్దతుదారుగా ఉంది. భద్రతా మండలిలో భారతదేశంను శాశ్వత సభ్య దేశంగా చేర్చేందుకు చాలా దేశాలు సానుకూలత వ్యక్తం చేస్తున్నాయి. రాబోయే కాలంలో ఇది సాధ్యమవ్వచ్చు.

హర్యానాలో క్లీన్ సిటీ-సేఫ్ సిటీ ప్రచార కార్యక్రమం ప్రారంభం

హర్యానా ప్రభుత్వం ఇంటింటికీ చెత్త సేకరణ మరియు వెస్ట్ మానేజ్మెంట్ గురించి అవగాహన పెంచడానికి ఒక ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలోని ప్రతి నగరాన్ని 'క్లీన్ సిటీ-సేఫ్ సిటీ'గా మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న నిరంతర ప్రయత్నాల్లో ఇదొక భాగమని ఆ రాష్ట్ర పట్టణ స్థానిక సంస్థల మంత్రి డాక్టర్ కమల్ గుప్తా వెల్లడించారు.

ఈ కార్యక్రమం వ్యర్థాల విభజన యొక్క ప్రాముఖ్యత మరియు వ్యర్థాలను పారవేసే వివిధ మార్గాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడంపై ప్రచారం దృష్టి సారిస్తుంది. ఇది అక్రమ వ్యర్థాలను పారవేయడం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను కూడా హైలైట్ చేస్తుంది. దీనిని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రచారం చేయనున్నారు. ముఖ్యంగా పౌరులు మరియు వ్యాపారాలను ఇందులో భాగం చేయనున్నారు.

రాష్ట్రంలో వేస్ట్ మేనేజ్‌మెంట్ పద్ధతులను మెరుగుపరచడానికి మరియు హర్యానాను పరిశుభ్రమైన మరియు ఆరోగ్యకరమైన నివాసస్థలంగా మార్చడానికి ఈ ప్రచారం సహాయపడుతుందని హర్యానా ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రచారం హర్యానా పట్టణ స్థానిక సంస్థల విభాగం ద్వారా అమలు చేయబడుతుంది.

యూపీలో నంద్ బాబా మిల్క్ మిషన్ పథకం ప్రారంభం

ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం పాల ఉత్పత్తిదారులకు తమ పాలను సరసమైన ధరకు విక్రయించే సౌకర్యాన్ని అందించడానికి నంద్ బాబా మిల్క్ మిషన్ అనే నూతన పథకంను ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని 1,000 కోట్ల బడ్జెట్‌తో జూన్ 6, 2023న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ పథకాన్ని ప్రారంభించారు.

2024-25 నాటికి ఉత్తరప్రదేశ్‌లో పాల ఉత్పత్తిని 15% పెంచడం, పాల ఉత్పత్తిదారులకు గిట్టుబాటు ధర కల్పించడం, ఉత్తరప్రదేశ్‌లో డెయిరీ రంగాన్ని బలోపేతం చేయడం మరియు డెయిరీ రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యాలు. ఈ పథకం రాష్ట్రంలోని 1 మిలియన్ పాల ఉత్పత్తిదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని మరియు రాష్ట్రంలో పాల ఉత్పత్తిని పెంచుతుందని భావిస్తున్నారు.

అగ్ని ప్రైమ్ బాలిస్టిక్ క్షిపణి టెస్టింగ్ విజయవంతం

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఒ) అభివృద్ధి చేసిన కొత్త తరం బాలిస్టిక్ క్షిపణి 'అగ్ని ప్రైమ్' జూన్ 7, 2023న ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుండి విజయవంతంగా పరీక్షించబడింది. ఇది రెండు దశల ఘన-ఇంధన క్షిపణి, ఇది 2,000 కి.మీ పరిధిలో 1,000 కిలోల పేలోడ్‌ను మోసుకెళ్లగలదు.

అగ్ని ప్రైమ్ యొక్క ఈ విజయవంతమైన విమాన పరీక్ష డిఆర్‌డిఒకి ఒక ముఖ్యమైన విజయంగా చెప్పొచ్చు. ఇది దేశం యొక్క అధునాతన క్షిపణి సాంకేతికతను మరియు అధునాతన ఆయుధ వ్యవస్థలను అభివృద్ధి చేయగల సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. అగ్ని ప్రైమ్ సమీప భవిష్యత్తులో భారత సైన్యంలోకి చేర్చబడుతుందని భావిస్తున్నారు. ఇది భారతదేశం యొక్క క్షిపణి ఆయుధశాలకు ఒక ముఖ్యమైన చేరిక, అగ్ని-II కంటే అధునాతనమైన మరియు సామర్థ్యం గల క్షిపణి,

ముడి ఉక్కు ఉత్పత్తిలో రెండవ అతిపెద్ద దేశంగా భారత్

భారతదేశం ప్రపంచంలో 2వ అతిపెద్ద ముడి ఉక్కు ఉత్పత్తిదారుగా అవతరించినట్లు కేంద్ర ఉక్కు మంత్రిజ్యోతిరాదిత్య సింధియా ఒక ప్రకటనలో వెల్లడించారు. భారతదేశం 2022-23 ఆర్థిక సంవత్సరంలో 126.26 మిలియన్ టన్నుల ముడి ఉక్కును ఉత్పత్తి చేసింది. ప్రస్తుతం ప్రపంచ అతి పెద్ద ముడి ఉక్కు ఉత్త్పత్తిదారుల జాబితాలో చైనా, ఇండియా, జపాన్ టాప్ 3స్థానాలలో ఉన్నాయి.

భారత ఉక్కు పరిశ్రమ వృద్ధి దేశ ఆర్థిక వ్యవస్థకు సానుకూల పరిణామం. ఇది ఉద్యోగాలను సృష్టిస్తుంది, ఎగుమతులను పెంచుతుంది మరియు దేశం యొక్క వాణిజ్య లోటును తగ్గించడంలో సహాయపడుతుంది. భారతీయ ఉక్కు పరిశ్రమ వృద్ధి రాబోయే సంవత్సరాల్లో ఇలానే కొనసాగుతుందని అంచనా. 2030 నాటికి 300 మిలియన్ టన్నుల ముడి ఉక్కును ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది చైనా మరియు జపాన్ దేశాలతో పోటీపడి ప్రపంచంలోనే అతిపెద్ద ముడి ఉక్కు ఉత్పత్తిదారుగా భారత్ అవతరించే అవకాశం ఉంది.

ఉగాండా తదుపరి భారత హైకమిషనర్‌గా ఉపేందర్ సింగ్ రావత్‌

ఉగాండాలో భారత తదుపరి హైకమిషనర్‌గా ఉపేందర్ సింగ్ రావత్‌ను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నియమించింది. ఉపేందర్ సింగ్ 1998 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి. ప్రస్తుతం ఈయన పనామాలో భారత రాయబారిగా పనిచేస్తున్నారు.

ఉగాండా తూర్పు ఆఫ్రికాలో ఒక భూపరివేష్టిత దేశం. దీని ఉత్తరసరిహద్దులో దక్షిణ సూడాన్, తూర్పు సరిహద్దులో కెన్యా, దక్షిణసరిహద్దులో టాంజానియా నైఋతి సరిహద్దులో రువాండా పశ్చిమసరిహద్దులో కాంగో దేశాలు ఉన్నాయి. దీని రాజధాని కంపాలా నగరం. ఉగాండాలో 34.8 మిలియన్ల జనాభా ఉంది. ఇది ఇథియోపియా తర్వాత ప్రపంచంలో రెండవ అత్యధిక జనాభా కలిగిన భూపరివేష్టిత దేశం.

ఇండియన్ పాడెల్ ఫెడరేషన్‌తో చేతులు కలిపిన పుల్లెల గోపీచంద్

భారత పాడెల్ ఫెడరేషన్ (IPF) బ్యాడ్మింటన్ లెజెండ్ పుల్లెల గోపీచంద్‌తో ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఐపిఎఫ్ సలహాదారుగా గోపీచంద్ భారతదేశంలో పాడెల్ క్రీడను ప్రోత్సహించడంలో సహాయం చేస్తారు. గోపీచంద్‌ పాడెల్ ప్లేయర్‌లకు శిక్షణా కార్యక్రమాలు మరియు కోచింగ్ వనరులను అభివృద్ధి చేయడానికి ఐపిప్‌తో కలిసి పని చేస్తారు.

పాడెల్ ఒక రాకెట్ క్రీడ, ఇది డబుల్స్ టెన్నిస్ కోర్ట్ కంటే కొంచెం చిన్నదిగా ఉండే ఇండోర్ కోర్టులో ఆడబడుతుంది. దీనిని టెన్నిస్, స్క్వాష్ మరియు బ్యాడ్మింటన్‌ల మిశ్రమ ఆటగా చెప్పొచ్చు. ఇది ఇప్పుడిప్పుడే ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందుతోంది. గోపీచంద్ పద్మభూషణ్, ద్రోణాచార్య మరియు అర్జున అవార్డు గ్రహీత. ప్రపంచ స్థాయి షట్లర్‌లను తయారు చేయడంలో చెరగని ముద్ర వేశారు. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన బ్యాడ్మింటన్ అకాడమీలలో ఒకటైన గోపీచంద్ అకాడమీ వ్యవస్థాపకుడు కూడా.

5వ రాష్ట్ర ఆహార భద్రత సూచిక విడుదల

కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జూన్ 7, 2023న ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా 5వ రాష్ట్ర ఆహార భద్రత సూచికను (SFSI)ని ఆవిష్కరించింది. ఈ సూచిక ఆహార భద్రతకు సంబంధించిన ఆరు కీలక అంశాలలో రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల పనితీరును తెలియజేస్తుంది.

5వ రాష్ట్ర ఆహార భద్రత సూచికలో పెద్ద రాష్ట్రాలలో కేరళ అగ్రస్థానంలో నిలిచింది, పంజాబ్ మరియు తమిళనాడు తర్వాతి స్థానాల్లో చోటు దక్కించుకున్నాయి. చిన్న రాష్ట్రాలలో గోవా అగ్రగామిగా ఉండగా, మణిపూర్ మరియు సిక్కిం తర్వాతి స్థానాల్లో నిలిచాయి. కేంద్రపాలిత ప్రాంతాలలో జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, చండీగఢ్‌లు వరుసగా మొదటి, రెండవ మరియు మూడవ ర్యాంక్‌లను పొందాయి.

భారతదేశంలో ఆహార భద్రతను మెరుగుపరచడానికి రాష్ట్ర ఆహార భద్రత సూచిక ఉపయోగపడుతుంది. ఈ ఇండెక్స్ దేశంలో ఆహార భద్రత స్థితిని సమగ్రంగా అంచనా వేస్తుంది మరియు అభివృద్ధి అవసరమయ్యే ప్రాంతాలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది.

న్యాయవ్యవస్థ పథకం పర్యవేక్షణ కోసం న్యాయ వికాస్ పోర్టల్‌ ప్రారంభం

న్యాయ వ్యవస్థ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల మెరుగైన డెలివరీని సులభతరం చేయడం కోసం మరియు న్యాయవ్యవస్థ పథకం పర్యవేక్షణ కోసం భారత ప్రభుత్వం న్యాయ వికాస్ అనే పోర్టల్‌ను ప్రారంభించింది. న్యాయ వికాస్ పోర్టల్ అనేది దేశవ్యాప్తంగా న్యాయపరమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల స్థితిగతులపై సమాచారాన్ని అందించే వెబ్ ఆధారిత ప్లాట్‌ఫారమ్. ఇది సంబంధిత ప్రాజెక్ట్‌ల పురోగతిని ట్రాక్ చేయడానికి మరియు అభిప్రాయాన్ని తెలియజేయడానికి అవకాశం కల్పిస్తుంది.

న్యాయ వికాస్ పోర్టల్ ప్రారంభం భారతదేశంలోని న్యాయ వ్యవస్థ యొక్క పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని మెరుగుపరచడానికి ఒక ముఖ్యమైన అడుగు. న్యాయపరమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు సకాలంలో మరియు సమర్ధవంతంగా అమలు చేయబడేలా పోర్టల్ సహాయం చేస్తుంది.

యువ సాధికారత కోసం నయే భారత్ కే సప్నే ప్రచార కార్యక్రమం

ప్రముఖ సోషల్ మీడియా సంస్థ మెటా మరియు మహిళా & శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ "నయే భారత్ కే సప్నే" (డ్రీమ్స్ ఆఫ్ ఎ న్యూ ఇండియా) అనే కొత్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాయి. భారతదేశంలోని యువత భవిష్యత్తు కోసం వారి కలలు మరియు ఆకాంక్షలను పంచుకోవడానికి సాధికారత కల్పించడం ఈ ప్రచారం లక్ష్యం. ఈ ప్రచారాన్ని జూన్ 8, 2023న కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి జుబిన్ ఇరానీ ప్రారంభించారు.

ఈ ప్రచారంలో పాల్గొనేందుకు, యువతి, యువకులు ఇన్‌స్టాగ్రామ్ లేదా ఫేస్‌బుక్‌లో హ్యాష్‌ట్యాగ్ (#) అమృత్ జనరేషన్‌ని ఉపయోగించి తమ ఆకాంక్షలను ప్రదర్శించే రీల్‌ను సృష్టించవచ్చు. ఈ రీల్స్ 60 సెకన్ల కంటే ఎక్కువ ఉండకూడదు. ఈ ప్రచారం జూన్ 8 నుండి ఆగస్టు 8, 2023 వరకు రెండు నెలల పాటు కొనసాగుతుంది. ఈ ప్రచారంలో విజేతలను న్యాయనిర్ణేతల బృందం ఎంపిక చేసి వారికి బహుమతులు అందజేస్తుంది.

"నయే భారత్ కే సప్నే" ప్రచారం భారతదేశంలోని యువకులను శక్తివంతం చేయడానికి ఒక గొప్ప కార్యక్రమం. ఇది యువతకు వారి కలలు మరియు ఆకాంక్షలను పంచుకోవడానికి ఒక వేదికను అందిస్తుంది మరియు ఇది యువత సాధికారత యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి కూడా సహాయపడుతుంది.

వ్యసన రహిత భారత్ కోసం అడిక్షన్ ఫ్రీ అమృత్ కాల్ ప్రచార కార్యక్రమం

నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) జూన్ 7, 2023న "వ్యసనం రహిత అమృత్ కాల్" అనే జాతీయ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం పొగాకు మరియు మాదక ద్రవ్యాలు లేని దేశాన్ని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్‌సిపిసిఆర్ మరియు సిటిజన్స్ గ్రూప్ అయిన టుబాకో ఫ్రీ ఇండియా యొక్క భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దేశంలోని పిల్లలలో పొగాకు మరియు మాదకద్రవ్యాల వ్యసనం యొక్క ముఖ్యమైన సమస్యను పరిష్కరించడానికి ఈ ప్రచారం ప్రయత్నిస్తుంది.

ఎన్‌సిపిసిఆర్ ఛైర్‌పర్సన్ ప్రియాంక్ కానూంగో దీనిని ప్రారంభించారు. పొగాకు మరియు మాదకద్రవ్యాల ప్రమాదాల గురించి అవగాహన పెంపొందించడంపై ఇది దృష్టి పెడుతుంది. వ్యసనాన్ని ఎలా నిరోధించాలో కూడా తెలియజేస్తుంది. పాఠశాలలు, కళాశాలలు మరియు ఇతర కమ్యూనిటీ సెట్టింగ్‌లలో ఈ ప్రచారం నిర్వహించబడుతుంది.

జమ్మూ & కాశ్మీరులో కిసాన్ సంపర్క్ అభియాన్ విజయవంతం

కిసాన్ సంపర్క్ అభియాన్ ప్రచార కార్యక్రమం జమ్మూ కాశ్మీర్‌లోని రెండు లక్షల మందికి పైగా రైతులకు చేరువై రికార్డు సృష్టించింది.  ఈ ఏడాది ఏప్రిల్ 24 న ఆ రాష్ట్ర వ్యవసాయ & రైతుల సంక్షేమ శాఖ ఈ ప్రచారాన్ని ప్రారంభించింది. కిసాన్ సంపర్క్ అభియాన్ అనేది రైతులకు ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ పద్ధతులు మరియు ఇతర సంబంధిత అంశాల గురించి సమాచారాన్ని అందించడానికి ఉద్దేశించిన రైతు ఔట్రీచ్ కార్యక్రమం. జమ్మూ కాశ్మీర్‌లోని అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

దక్ష్ కిసాన్ మరియు కిసాన్ సతి అనే రెండు ప్రధాన కార్యక్రమాల ద్వారా జమ్మూ కాశ్మీర్‌ ప్రాంతంలోని వ్యవసాయ రంగంలో నూతన ఉత్సాహం కల్పిసున్నారు. దక్ష్ కిసాన్ అనేది వ్యవసాయ కమ్యూనిటీ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన మొదటి-రకం ఆన్‌లైన్ హైబ్రిడ్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్. ఇప్పటి వరకు 27000 మంది రైతులు దక్ష్ కిసాన్ పోర్టల్ క్రింద నమోదు చేయబడ్డారు. సుమారు 8000 మంది రైతులు తమ ఎంపిక చేసుకున్న స్కిల్లింగ్ కోర్సులో నమోదు చేసుకున్నారు.

దక్ష్ కిసాన్ అనేది రైతుల నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (LMS). ఇది దేశంలోనే మొట్టమొదటిసారిగా వ్యవసాయ ఉత్పత్తి శాఖ ద్వారా అభివృద్ధి చేయబడింది, ఈ రాష్ట్రంలోని వ్యవసాయ-వాతావరణ మండలాల ప్రకారం 121 నైపుణ్య కోర్సులు రైతులకు ఉచితంగా ఇందులో అందుబాటులో ఉన్నాయి.

కిసాన్ సాథీ అనేది చిన్న మరియు సన్నకారు రైతుల వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ఒక ఎప్‌పిఓ ఆధారిత వ్యవస్థీకృత సరఫరా గొలుసు. ఇది జమ్మూ మరియు కాశ్మీర్ వ్యవసాయ ఉత్పత్తి విభాగం యొక్క సమగ్ర వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమం. కిసాన్ సాథి సహజ వ్యవసాయం ద్వారా వ్యవసాయ స్థిరత్వంపై పనిచేస్తుంది, రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారిస్తుంది.

యూకేలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై తొలి ప్రపంచ శిఖరాగ్ర సదస్సు

ఈ ఏడాది చివర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భద్రతపై యూకే మొదటి గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహించనుంది. 2023 నవంబర్ 14-15 తేదీల్లో లండన్‌లో ఈ సమ్మిట్ జరగనుంది. యూకే ప్రభుత్వం మరియు కృత్రిమ మేధస్సులో ప్రముఖ పరిశోధనా సంస్థ అయిన అలాన్ ట్యూరింగ్ ఇన్స్టిట్యూట్ ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నాయి.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భద్రతకు సంబంధించిన సవాళ్లు మరియు అవకాశాల గురించి చర్చించడానికి ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థలు మరియు పౌర సమాజానికి చెందిన నాయకులను ఈ సమ్మిట్ ఒకచోట చేర్చుతుంది. ఎఐ భద్రతపై అంతర్జాతీయ సహకారం మరియు నిబంధనల అభివృద్ధిపై పురోగతి సాధించడానికి ఈ శిఖరాగ్ర సమావేశం ఉమ్మడి వేదికను అందిస్తుంది.

ఆన్‌లైన్ డ్రెడ్జింగ్ మానిటరింగ్ సిస్టమ్ - సాగర్ సమృద్ధి ప్రారంభం

కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్, 'సాగర్ సమృద్ధి' అనే ఆన్‌లైన్ డ్రెడ్జింగ్ మానిటరింగ్ సిస్టమ్‌ను ప్రారంభించారు. ఈ వ్యవస్థను నేషనల్ టెక్నాలజీ సెంటర్ ఫర్ పోర్ట్‌లు, వాటర్‌వేస్ అండ్ కోస్ట్స్ (NTCPWC) సమర్థతను మెరుగుపరచడానికి అభివృద్ధి చేసారు. భారతదేశంలోని ప్రధాన నౌకాశ్రయాలలో ఈ మానిటరింగ్ సిస్టమ్ రోజువారీ మరియు నెలవారీ పురోగతిని విజువలైజేషన్, డ్రెడ్జర్ పనితీరు మరియు డౌన్‌టైమ్ పర్యవేక్షణకు ఉపయోగపడనుంది.

భారతదేశంలోని ఓడరేవుల డిజిటలైజేషన్‌లో సాగర్ సమృద్ధి వ్యవస్థ ఒక ముఖ్యమైన ముందడుగు. ఇది డ్రెడ్జింగ్ కార్యకలాపాల సామర్థ్యాన్ని మరియు పారదర్శకతను మెరుగుపరచడానికి సహాయపడుతుంది, ఇది చివరికి భారత ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూరుస్తుంది.

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ మొత్తం మహిళల హజ్ విమానంతో చరిత్ర సృష్టించింది

టాటా గ్రూప్‌కు చెందిన అంతర్జాతీయ బడ్జెట్ ఎయిర్‌లైన్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ భారతదేశం యొక్క మొట్టమొదటి మొత్తం మహిళల హజ్ విమానాన్ని నిర్వహించడం ద్వారా చరిత్ర సృష్టించింది. ఎయిర్ ఇండియాకు చెందిన IX 3025 విమానం, జూన్ 9న భారతదేశంలోని కోజికోడ్ నుండి145 మంది మహిళా యాత్రికులతో బయలుదేరి, సౌదీ అరేబియాలోని జెడ్డాకు చేరుకుంది. పైలట్లు, క్యాబిన్ సిబ్బంది మరియు గ్రౌండ్ స్టాఫ్‌తో సహా విమానంలోని మొత్తం సిబ్బంది మహిళలే.

భారతదేశంలో విమానయానంలో మహిళలకు ఇది ఒక ముఖ్యమైన మైలురాయి. భారతదేశంలో హజ్ విమానాన్ని పూర్తిగా మహిళా సిబ్బంది నిర్వహించడం ఇదే మొదటిసారి మరియు భారతదేశంలో ఏవియేషన్ పరిశ్రమలో పనిచేస్తున్న మహిళల సంఖ్య పెరుగుతుందనడానికి ఇది నిదర్శనం.

ఈ విమానానికి భారత తొలి మహిళా వాణిజ్య పైలట్‌లలో ఒకరైన కనికా మెహ్రా కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆమెతో పాటు ఫస్ట్ ఆఫీసర్ గరిమా పాసి కూడా ఉన్నారు. క్యాబిన్ క్రూలో బిజిత ఎంబీ, శ్రీలక్ష్మి, సుష్మా శర్మ మరియు సుభాంగి బిస్వాస్ ఉన్నారు.

ఢిల్లీ విమానాశ్రయంలో డిజియాత్ర అందుబాటులోకి

ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ మొబైల్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేయకుండానే ప్రయాణికులు 'డిజియాత్ర' సౌకర్యాన్ని ఉపయోగించుకునే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. విమానాశ్రయం యొక్క టెర్మినల్ 3 నుండి ప్రయాణించే ప్రయాణికులు ఇప్పుడు యాప్ అవసరం లేకుండానే డిజియాత్ర సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు.

డిజియాత్ర అనేది ఫేషియల్ రికగ్నిషన్ ఆధారిత వ్యవస్థ, ఇది ప్రయాణికులు విమానాశ్రయంలో అతుకులు లేని, ఆలస్యం లేని ప్రయాణ అనుభవాన్ని పొందేలా చేస్తుంది. డిజియాత్ర ప్రస్తుతం ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్ 3 మరియు టెర్మినల్ 2 యొక్కగేట్ల వద్ద అందుబాటులో ఉంది. ఈ సదుపాయాన్ని త్వరలో భారతదేశంలోని ఇతర విమానాశ్రయాలకు విస్తరించాలని భావిస్తున్నారు.

రూపే ప్రీపెయిడ్ ఫారెక్స్ కార్డుల జారీకి బ్యాంకులకు అనుమతి

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జూన్ 8, 2023న రూపే ప్రీపెయిడ్ ఫారెక్స్ కార్డ్‌లను జారీ చేయడానికి బ్యాంకులకు అనుమతించినట్లు ప్రకటించింది. ఈ కార్డ్‌లను ఎటిఎంలు, పాయింట్ ఆఫ్ సేల్ మెషీన్‌లు మరియు విదేశాలలో ఉన్న ఆన్‌లైన్ వ్యాపారుల వద్ద ఉపయోగించవచ్చు. ఇవి విదేశాలకు వెళ్లే భారతీయుల సాధారణ చెల్లింపులకు అవకాశం కల్పిస్తాయి. ఇకపై విదేశీ కరెన్సీ మార్పిడి సేవలపై ఆధారపడాల్సిన అవసరం లేదు

రూపే ప్రీపెయిడ్ ఫారెక్స్ కార్డులను జారీ చేయడానికి బ్యాంకులను అనుమతించాలనే నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా రూపే కార్డుల వినియోగాన్ని ప్రోత్సహించే ఆర్‌బిఐ ప్రయత్నాలలో భాగమే. రూపే అనేది ఆర్బీఐచే అభివృద్ధి చేయబడిన దేశీయ చెల్లింపు వ్యవస్థ. ఇది ప్రస్తుతం భారతదేశంలో మూడవ అతిపెద్ద చెల్లింపు వ్యవస్థ.

గల్ఫ్‌లో భారతదేశం, ఫ్రాన్స్, యుఎఇల తోలి మారిటైమ్ ఎక్సర్‌సైజ్‌

భారతదేశం, ఫ్రాన్స్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క మొదటి ఎడిషన్ మారిటైమ్ పార్టనర్‌షిప్ వ్యాయామం 2023 జూన్ 7 న గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో నిర్వహించారు. ఈ తొలి త్రైపాక్షిక సముద్ర వ్యాయామంలో మూడు దేశాలకు చెందిన నౌకాదళాలు పాల్గొన్నాయి.

ఈ వ్యాయామంలో వ్యూహాత్మక కాల్పులు మరియు కసరత్తులతో కూడిన ఉపరితల యుద్ధం, క్లోజ్ క్వార్టర్ యుక్తులతో పాటుగా ఫ్రెంచ్ రాఫెల్ మరియు యూఏఈ  డాష్ 8 ఎంపీఎతో అధునాతన వైమానిక రక్షణ వ్యాయామం, హెలికాప్టర్ క్రాస్ ఆపరేషన్స్ వంటి విస్తృత కార్యకలాపాలు నిర్వహించారు.

ఈ వ్యాయామం భాగస్వామ్య నౌకాదళాల మధ్య సముద్ర సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది. సముద్ర వాణిజ్యంలో సాంప్రదాయ మరియు సాంప్రదాయేతర బెదిరింపులను పరిష్కరించడానికి మెరుగైన పరస్పర సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది, తద్వారా ఈ ప్రాంతంలో వాణిజ్య నావిగేషన్ స్వఛ్చకు మద్దతు దొరుకుతుంది.

జమ్మూలో కొత్త వెంకటేశ్వర ఆలయం ప్రారంభం

లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జూన్ 08, 2023న జమ్మూలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రారంభించారు. ఈ ఆలయం జమ్మూ నగర శివార్లలోని మజీన్‌లో ఏర్పాటు చేసారు. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి బాలాజీ ఆలయానికి ప్రతిరూపం.

ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ₹ 35 కోట్ల వ్యయంతో నిర్మించింది. ఇది 62 ఎకరాల విస్తీర్ణంతో 10,000 మంది భక్తులకు వసతి కల్పించే సామర్థ్యం కలిగి ఉంది. ఆలయ గర్భగుడిలో నల్ల గ్రానైట్ రాతితో చెక్కబడిన 6 అడుగుల 4 అంగుళాల ఎత్తైన వెంకటేశ్వర స్వామి విగ్రహంను ప్రతిష్టించారు.

కేంద్రమంత్రులు జి కిషన్‌రెడ్డి, డాక్టర్‌ జితేంద్రసింగ్‌, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఇతర ప్రముఖుల సమక్షంలో ఈ ఆలయాన్ని ప్రారంభించారు. ఈ ఆలయం జమ్మూ కాశ్మీర్‌లో మతపరమైన పర్యాటకాన్ని పెంచుతుందని ఎల్‌జీ సిన్హా అన్నారు. దేవాలయం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయన్నారు.

భారత్, న్యూజిలాండ్ మధ్య మొదటి రౌండ్ టేబుల్ సమావేశం

భారతదేశం మరియు న్యూజిలాండ్ మధ్య మొదటి రౌండ్ టేబుల్ ఉమ్మడి సమావేశం జూన్ 8, 2023న న్యూ ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి భారత ప్రభుత్వ వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి రాజేష్ అగర్వాల్ మరియు భారతదేశంలోని న్యూజిలాండ్ హైకమిషనర్ డేవిడ్ పైన్ సహ అధ్యక్షత వహించారు.

భారతదేశం మరియు న్యూజిలాండ్ మధ్య ఆర్థిక మరియు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఈ సమావేశం సానుకూల అడుగు. ఇరుపక్షాలు సంభాషణను కొనసాగించాలని మరియు కొత్త సహకార రంగాలను గుర్తించేందుకు కలిసి పనిచేయాలని అంగీకరించాయి. యూపీఐ సిస్టమ్ సులభతరం, ప్రాంప్ట్ ట్రేడ్ ఇష్యూతో సహా కొన్ని రంగాలలో తమ సహకారాన్ని మరింత పెంపొందించేందుకు అంగీకరించాయి.

ఈ సమావేశంలో వాణిజ్యం మరియు పెట్టుబడులపై జాయింట్ వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసేందుకు ఇరుపక్షాలు ముందుకొచ్చాయి. భారతదేశంలో న్యూజిలాండ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రాంను ప్రోత్సహించేందుకు కలిసి పనిచేయాలనే నిర్ణయానికి సమ్మతం తెలిపాయి. తదుపరి రౌండ్ టేబుల్ ఉమ్మడి సమావేశాన్ని 2024లో న్యూజిలాండ్‌లో నిర్వహించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి.

డిజిటల్ చెల్లింపుల ప్రపంచ ర్యాంకింగ్‌లో భారతదేశంకు అగ్రస్థానం

డిజిటల్ చెల్లింపులలో చైనాను అధిగమించి భారతదేశం ప్రపంచ ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో నిలిచింది. మైగొవ్ఇండియా నివేదిక ప్రకారం 2022లో 89.5 మిలియన్ల లావాదేవీలు నమోదు కాబడ్డాయి. 2022లో ప్రపంచ రియాల్-టైమ్ చెల్లింపులలో భారతదేశం 46% వాటాను కలిగి ఉంది, ఇది తదుపరి నాలుగు అగ్ర దేశాల సంయుక్త డిజిటల్ చెల్లింపుల కంటే ఎక్కువ. ఈ జాబితాలో బ్రెజిల్, చైనాలు తర్వాత స్థానాలలో ఉన్నాయి.

భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల వృద్ధి రాబోయే సంవత్సరాల్లో కొనసాగుతుందని భావిస్తున్నారు. మొబైల్ ఫోన్‌ల ఆదరణ పెరుగుతుండటం మరియు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేస్తున్న నిరంతర ప్రయత్నాలు దీనికి కారణం. ఈ కింది అంశాలు కూడా దీనికి దోహదపడ్డాయి.

  • డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ మరియు భారత్ ఇంటర్‌ఫేస్ ఫర్ మనీ (భీమ్ వంటి అనేక కార్యక్రమాలను చేపట్టింది.
  • భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది మరియుఎటిఎంలు మరియు పిఓఎస్ మెషీన్‌ల యొక్క పెద్ద నెట్‌వర్క్‌ను కలిగి ఉంది.
  • భారతదేశంలో మొబైల్ ఫోన్ వాడకం చాలా ఎక్కువగా ఉంది, ఇది డిజిటల్ చెల్లింపు పద్ధతులను ఉపయోగించడం ప్రజలకు సులభతరం చేసింది.
  • డిజిటల్ చెల్లింపుల ధర భారతదేశంలో చాలా తక్కువగా ఉంది, ఇది అన్నిరకాల ప్రజలు ఉపయోగించేలా చేసింది.

కాన్సర్ చికిత్స కోసం భారతదేశపు మొట్టమొదటి గంజాయి పరిశోధన ప్రాజెక్ట్

క్యాన్సర్‌కు ఔషధాన్ని ఉత్పత్తి చేసే భారతదేశపు మొట్టమొదటి గంజాయి పరిశోధన ప్రాజెక్ట్‌ను కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ (సీఎస్ఐఆర్-ఐఐఐఎం) జమ్మూలో నిర్వహిస్తోంది. ఈ ప్రాజెక్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్ నిధులు సమకూరుస్తుంది. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ దీనికి నాయకత్వం వహిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్ క్యాన్సర్ చికిత్స కోసం గంజాయి ఆధారిత మందులను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించింది, ముఖ్యంగా ఇతర చికిత్సలకు స్పందించని క్యాన్సర్ రోగులకు, మూర్ఛ మరియు మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి ఇతర వ్యాధులకు చికిత్స చేయడానికి గంజాయి యొక్క సామర్థ్యాన్ని కూడా ప్రాజెక్ట్ పరిశీలిస్తోంది.

ఈ ప్రాజెక్ట్ విజయవంతం అవుతుందని మరియు కొత్త మరియు సమర్థవంతమైన క్యాన్సర్ చికిత్సల అభివృద్ధికి ఇది దారితీస్తుందని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులను గంజాయికి ఉందని వారు నమ్ముతారు.

గంజాయి అనేది కన్నబేసి కుటుంబానికి చెందిన పుష్పించే మొక్కల జాతి. ఈ కుటుంబంలో ప్రధానంగా మూడు జాతులను గుర్తించబడవచ్చు, అవి కన్నబేసి సాటివా, కన్నబేసి ఇండికా మరియుకన్నబేసి రుడెరాలిస్.

ఈ మొక్కలలో ఉండే కానబినాయిడ్స్‌ మానవుల్లో తీవ్రమైన మత్తును కల్గిస్తాయి, జ్ఞాపకశక్తి కోల్పోవడం మరియు ప్రవర్తనల తీవ్రమైన మార్పులను కలుగజేస్తాయి. అదే సమయంలో కన్నాబినాయిడ్స్ మానవుల్లో ఆందోళనను కూడా నియంత్రిస్తాయి మరియు సైకోసిస్ లాంటి ప్రభావాలను ఉత్పత్తి చేయగలవు. ఎక్స్పోజర్ వయస్సులో కానబినాయిడ్స్ ప్రభావం అభిజ్ఞా పనితీరుపై ప్రభావం చూపుతుందని పరిశోధనలు తెలుపుతున్నాయి.

డిజిటల్ ప్రభుత్వ బాండ్‌ను విడుదల చేసిన మొదటి దేశంగా ఇజ్రాయెల్

ఇజ్రాయెల్ ప్రపంచంలోనే మొట్టమొదటి డిజిటల్ ప్రభుత్వ బాండ్‌ను విడుదల చేయనున్న దేశంగా నిలవనుంది. ఈ డిజిటల్ బాండ్‌ను ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రిత్వ శాఖ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం మరియు టెల్ అవీవ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఉమ్మడిగా అభివృద్ధి చేస్తున్నాయి.

ఈ డిజిటల్ బాండ్ ఈఆర్‌సి-1155 టోకెన్ రూపంలో జారీ చేయబడుతుంది. ఎథిరియం బ్లాక్‌చెయిన్‌లో ఫంగబుల్ మరియు నాన్-ఫంగబుల్ టోకెన్‌లకు ఈ రకమైన టోకెన్ ప్రమాణం. ఈ బాండ్ టెల్ అవీవ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ యొక్క బ్లాక్‌చెయిన్ ప్లాట్‌ఫారమ్‌లో వర్తకం చేయబడుతుంది, దీనికి ఈడెన్ నెట్‌వర్క్ అని పేరుపెట్టారు.

డిజిటల్ బాండ్ సాంప్రదాయ ప్రభుత్వ బాండ్ల కంటే అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇది బ్లాక్‌చెయిన్‌లో నిల్వ చేయబడుతుంది కాబట్టి ఇది మరింత సురక్షితంగా ఉంటుంది. ఇది బ్లాక్‌చెయిన్ ప్లాట్‌ఫారమ్‌లో వర్తకం చేయబడుతుంది కాబట్టి ఇది మరింత సమర్థవంతంగా ఉంటుంది.

అట్లాంటిక్ డిక్లరేషన్‌పై సంతకం చేసిన యూఎస్ & యూకే

యునైటెడ్ స్టేట్స్ మరియు యునైటెడ్ కింగ్‌డమ్ ఇటీవల అట్లాంటిక్ డిక్లరేషన్‌పై సంతకం చేశాయి, ఇది ఇరు దేశాల మధ్య 21వ శతాబ్దపు ఆర్థిక భాగస్వామ్యం కోసం రూపొందించుకున్న ఒక ఫ్రేమ్‌వర్క్. ఈ ఫ్రేమ్‌వర్క్ రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం, పెట్టుబడులు మరియు ఆవిష్కరణలను పెంచడం మరియు భాగస్వామ్య ప్రపంచ సవాళ్లను పరిష్కరించడమే లక్ష్యంగా పని చేయనుంది.

బ్రెక్సిట్ అనంతరాన్ని తగ్గించేందుకు విస్తృతమైన పారిశ్రామిక రాయితీల ద్వారా కొత్త హరిత ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు అట్లాంటిక్ డిక్లరేషన్‌పై యూకే సంతకం చేసింది. ఇరు దేశాల రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి, ఆరోగ్య భద్రతను మెరుగుపరచడానికి మరియు అంతరిక్షంలో కొత్త అవకాశాలను అన్వేషించడానికి కలిసి చేయనున్నారు. అలానే ఆఫ్‌షోర్ విండ్ మరియు న్యూక్లియర్ పవర్ వంటి క్లీన్ ఎనర్జీ టెక్నాలజీల అభివృద్ధికి పరస్పర సహకారం అందించుకోనున్నారు.

అట్లాంటిక్ డిక్లరేషన్ యూఎస్-యూకే సంబంధాలలో ఒక ముఖ్యమైన ముందడుగు. 21వ శతాబ్దపు సవాళ్లను పరిష్కరించడానికి కలిసి పనిచేయడానికి రెండు దేశాల నిబద్ధతను ఇది పునరుద్ఘాటిస్తుంది. ఈ ప్రకటన ఆర్థిక వృద్ధికి ఊతమిస్తుందని మరియు రెండు దేశాలలో ఉద్యోగాలను సృష్టిస్తుందని కూడా భావిస్తున్నారు.

ఇండియా & సెర్బియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం

భారతదేశం మరియు సెర్బియా ఈ దశాబ్దం చివరి నాటికి ఒక బిలియన్ యూరోల ద్వైపాక్షిక వాణిజ్య పరిమాణాన్ని సాధించాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. ఆ దేశ పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరియు సెర్బియా కౌంటర్ అలెగ్జాండర్ వుసిక్ మధ్య ఈ ఒప్పందం చోటు చేసుచేసుకుంది. ఇది ప్రస్తుత వాణిజ్య స్థాయి కంటే చాలా ఎక్కువ. ఇది దాదాపు 320 మిలియన్ యూరోలకు సమానం.

వ్యవసాయం, ఫార్మాస్యూటికల్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రక్షణ, ఇంధనం మరియు మౌలిక సదుపాయాల రంగాలలో ఈ వాణిజ్యం జరిగే అవకాశం ఉంది. ఈ రంగాల్లో ఇరు దేశాలు ఇప్పటికే పలు ఒప్పందాలపై సంతకాలు చేసి ఉన్నాయి. భవిష్యత్తులోనూ పరస్పరం సహకరించుకోవాలని భావిస్తున్నారు.

భారత్, సెర్బియా మధ్య కుదిరిన ఒప్పందం ఇరు దేశాలకు సానుకూల పరిణామం. 21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొనేందుకు కలిసి పనిచేయాలన్న రెండు దేశాల నిబద్ధతకు ఇది సంకేతం. ఈ ఒప్పందం ఆర్థిక వృద్ధిని పెంపొందించడంతోపాటు రెండు దేశాల్లోనూ ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని అంచనా.

ఢిల్లీలో హమారీ భాషా, హమారీ విరాసత్ ఎగ్జిబిషన్‌

నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా 75వ అంతర్జాతీయ ఆర్కైవ్స్ డే సందర్భంగా "హమారీ భాషా, హమారీ విరాసత్" పేరుతొ ఒక ప్రదర్శనను ఏర్పాటు చేసింది. ఈ ఎగ్జిబిషన్ ఒక దేశంగా భారతదేశం యొక్క భాషా వైవిధ్యం యొక్క అమూల్యమైన వారసత్వాన్ని గుర్తుచేసే ప్రయత్నంలో భాగంగా ఏర్పాటు చేయబడింది. ఈ ప్రదర్శనను రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి మీనాకాశీ లేఖి ప్రారంభించారు.

భారతదేశ భాషా వారసత్వాన్ని సంరక్షించడంలో మరియు ప్రచారం చేయడంలో ఆర్కైవ్‌ల ప్రాముఖ్యతను కూడా ఈ ప్రదర్శన హైలైట్ చేసింది. ఈ వేదిక ద్వారా ఆర్కైవల్ మెటీరియల్స్ యొక్క డిజిటలైజేషన్ మరియు యాక్సెసిబిలిటీ యొక్క ఆవశ్యకతను తెలియజేసారు. పరిశోధకులు, విద్యార్థులు మరియు సాధారణ ప్రజలు భారతదేశం యొక్క గొప్ప భాషా చరిత్ర గురించి మరింత తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. భారతీయ జాతీయ ఆర్కైవ్స్ ప్రాంగణంలో సుమారు 72,000 కంటే ఎక్కువ మాన్యుస్క్రిప్ట్‌లు అందుబాటులో ఉన్నాయి.

క్లాసిఫైడ్ డాక్యుమెంట్ల నిర్వహణపై ట్రంప్‌పై అభియోగాలు

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై గూఢచర్య చట్టాన్ని ఉల్లంఘించి ఉద్దేశపూర్వకంగా దేశ రక్షణ రహస్యాలను నిలుపుకోవడం, తప్పుడు ప్రకటనలు చేయడం మరియు న్యాయ కుట్రకు ఆటంకం కలిగించడం వంటి మొత్తం ఏడు ఆరోపణలతో అభియోగాలు మోపబడ్డాయి. దీనికి సంబంధించి ఫ్లోరిడాలోని సదరన్ డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో అభియోగపత్రం దాఖలు చేయబడింది.

ట్రంప్ అధ్యక్ష పదవిని విడిచిపెట్టిన తర్వాత తన మార్-ఎ-లాగో నివాసంలో సంబంధిత రహస్య పత్రాలను ఉంచుకున్నట్లు ఇందులో అభియోగం మోపారు. ట్రంప్ తన వద్ద ఉంచుకున్న రహస్య పత్రాల గురించి నేషనల్ ఆర్కైవ్స్‌కు తప్పుడు ఇచ్చినట్లు, తన మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మెడోస్‌తో కలిసి రహస్య పత్రాలను నిర్వహించడంపై ప్రభుత్వ విచారణను అడ్డుకోవడానికి కుట్ర పన్నినట్లు నివేదించారు. ఈ అన్ని ఆరోపణలపై దోషిగా తేలితే, ట్రంప్ 100 సంవత్సరాల జైలు శిక్షను అనుభవించవచ్చు.

ట్రంప్ చుట్టూ కొనసాగుతున్న చట్టపరమైన డ్రామాలో నేరారోపణ ఒక ప్రధాన పరిణామం. ఫెడరల్ ఆరోపణలపై అమెరికా మాజీ అధ్యక్షుడిపై అభియోగాలు మోపడం ఇదే తొలిసారి. ఈ అభియోగపత్రం ట్రంప్ రాజకీయ భవిష్యత్తుపై కూడా గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. దోషిగా తేలితే, ట్రంప్ ప్రభుత్వ పదవిని నిర్వహించకుండా నిరోధించబడతారు.

ఈ నేరారోపణ కూడా అమెరికన్ చరిత్రలో ఒక ముఖ్యమైన చరిత్రగా నిలవనుంది. రహస్య పత్రాల నిర్వహణకు సంబంధించి మాజీ అధ్యక్షుడిపై నేరం మోపడం ఇదే తొలిసారి. మాజీ రాష్ట్రపతులు కూడా చట్టానికి అతీతులు కాదని ఈ అభియోగపత్రం గుర్తు చేస్తోంది.

Post Comment