Advertisement
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ : 13 ఫిబ్రవరి 2024
February Telugu Current Affairs

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ : 13 ఫిబ్రవరి 2024

తెలుగులో రోజువారీ కరెంట్ అఫైర్స్ 13 ఫిబ్రవరి 2024. పోటీ పరీక్షలకు ఉపయోగపడే జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆశావహుల కోసం వీటిని ప్రత్యేకంగా రూపొందిస్తున్నాం.

ఢిల్లీలోని ఎయిమ్స్‌లో అధునాతన చర్మ క్యాన్సర్ చికిత్స అందుబాటులోకి

ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) చర్మ క్యాన్సర్ చికిత్స కోసం కొత్త అధునాతన శస్త్రచికిత్సను ప్రవేశపెట్టింది. దీనితో ఈ ప్రత్యేక విధానాన్ని అందించే భారతదేశంలో మొట్టమొదటి ఆసుపత్రిగా నిలిచింది. మోహ్స్ మైక్రోగ్రాఫిక్ సర్జరీ అని పిలువబడే ఈ శస్త్రచికిత్స ఆరోగ్యకరమైన కణజాలానికి తక్కువ నష్టంతో ఖచ్చితమైన కణితి తొలగింపును అందిస్తుంది.

  • ఇంతకుముందు మోహ్స్ శస్త్రచికిత్స అవసరమయ్యే చర్మ క్యాన్సర్ ఉన్న రోగులు చికిత్స కోసం విదేశాలకు వెళ్లవలసి ఉండేది.
  • ఢిల్లీ ఎయిమ్స్ ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడంతో, దేశంలోనే ప్రపంచ స్థాయి చర్మ క్యాన్సర్ చికిత్సను పొందొచ్చు.
  • మొహ్స్ శస్త్రచికిత్స అనేది చర్మ కణజాలం యొక్క ఒక్కో పలుచని పొరలను తొలగించడం ద్వారా నిర్వహిస్తారు.
  • మైక్రోస్కోప్‌ సహాయంతో ప్రతి పొరను పరిశీలించడం వంటి సంక్లిష్ట ప్రక్రియ ద్వారా అన్ని క్యాన్సర్ కణాలను తొలగిస్తారు.
  • మొహ్స్ శస్త్రచికిత్స చాలా ఎక్కువ నివారణ రేటును కలిగి ఉంది. ఇది అన్ని రకాల చర్మ క్యాన్సర్‌లను 99% వరకు నివారిస్తుంది.
  • ఈ శస్త్రచికిత్స క్యాన్సర్ కణజాలాన్ని మాత్రమే తొలగిస్తుంది కాబట్టి, ఆరోగ్యకరమైన చర్మం ప్రభావితం అవ్వదు.
  • మోహ్స్ శస్త్రచికిత్స సాధ్యమైనంత ఎక్కువ ఆరోగ్యకరమైన కణజాలాన్ని సంరక్షించడానికి సహాయపడుతుంది.

ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్‌కు కేపీపీ నంబియార్ అవార్డు

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్ సోమనాథ్‌, 2024 ఏడాదికి గాను కేపీపీ నంబియార్ అవార్డు అందుకున్నారు. కేరళలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్ విభాగం ఈ అవార్డును ఆయనకు అందజేసింది. భారత సమాజాభివృద్ధికి అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఎస్.సోమనాథ్ చూపిన తిరుగులేని నిబద్ధతకు ఈ అవార్డు లభించింది.

సోమనాథ్ మూడు దశాబ్దాలకు పైగా ఇస్రోలో వివిధ నాయకత్వ స్థానాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 15 జనవరి 2022 నుండి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ యొక్క 10వ ఛైర్మనుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈయన సారథ్యంలోనే భారత్ కీలక చంద్రయాన్ 3, గగనయాన్ వంటి అంతరిక్ష పరీక్షలు జరిగాయి. చంద్రయాన్ 3 ద్వారా చంద్రుని దక్షిణ ధ్రువంలో అంతరిక్ష నౌకను విజయవంతంగా ల్యాండ్ చేసిన మొదటి దేశంగా మరియు సాఫ్ట్ ల్యాండింగ్‌ను ప్రదర్శించిన నాల్గవ దేశంగా భారతదేశం నిలిచింది.

ఎస్ సోమనాథ్‌ ఇస్రో చైర్మన్ బాధ్యతలు స్వీకరించక ముందు తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్‌గా, తిరువనంతపురంలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. సోమనాథ్ ప్రత్యేకించి లాంచ్ వెహికల్ సిస్టమ్స్ ఇంజినీరింగ్, స్ట్రక్చరల్ డిజైన్, స్ట్రక్చరల్ డైనమిక్స్ మరియు పైరోటెక్నిక్‌ల రంగాలలో ప్రసిద్ధి చెందారు.

  • కేపీపీ నంబియార్ అవార్డు అనేది అంతరిక్ష మరియు సాంకేతిక రంగానికి గణనీయమైన కృషి చేసిన వ్యక్తులకు ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డు.
  • భారతదేశంలో శాస్త్రీయ పరిశోధనా రంగంలో అగ్రగామిగా నిలిచిన కెపిపి నంబియార్ పేరు మీద ఈ అవార్డు ప్రారంభించబడింది.
  • ఈ అవార్డును కేరళ వ్యక్తులు మరియు సంస్థలకు మాత్రమే అందించబడుతుంది.
  • ఈ అవార్డు కేరళలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్ విభాగం అందిస్తుంది.

తెలంగాణలో డెడికేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటుకు ప్రణాళిక

తెలంగాణ ప్రభుత్వం 50 ఎకరాల నుండి 100 ఎకరాల స్థలంలో ఒక డెడికేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటుకు ప్రణాళిక ప్రకటించింది. ఈ చొరవ హైదరాబాద్ మరియు తెలంగాణను భారతదేశ ఎఐ రాజధానిగా ఉంచడం లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు శాసనసభను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తూ ఈ ప్రకటన చేశారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటు చేయడంతో పాటు, రాష్ట్రంలో ఇంటర్నెట్‌ను పౌరుల ప్రాథమిక హక్కుగా మార్చేందుకు ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు వెల్లడించారు. అలానే  రాష్ట్రవ్యాప్తంగా మానవ ఆవాసాలకు దూరంగా 1000-3000 ఎకరాల్లో 10-12 ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు కూడా ప్రకటించారు.

  • ఇంటర్నెట్‌ను ప్రాథమిక హక్కుగా ప్రవేశపెట్టడం తమ ప్రభుత్వం యొక్క అత్యంత ముఖ్యమైన కార్యక్రమాలలో ఒకటిగా పేర్కొన్నారు.
  • కేవలం డిజిటల్ మౌలిక సదుపాయాలను సృష్టించడం మాత్రమే కాకుండా, సమాజంలోని అన్ని వర్గాలకు అందుబాటులో ఉంచే అంశంపై దృష్టి సారించినట్లు తెలిపారు.
  • మహాలక్ష్మి పథకం కింద అర్హులైన కుటుంబాలకు రూ.500లకే ఎల్‌పీజీ సిలిండర్లు త్వరలో అందజేయనున్నట్లు ప్రకటించారు.
  • గృహజ్యోతి పథకం కింద అర్హులైన ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్‌ను మార్చి నుండి అందజేస్తున్నట్లు తెలిపారు.

ఒడిశాలోని గుప్తేశ్వర్ ఫారెస్ట్‌కు బయోడైవర్సిటీ-హెరిటేజ్‌ సైట్ గుర్తింపు

ఒడిశాలోని గుప్తేశ్వర్ ఫారెస్ట్ ఆ రాష్ట్రం యొక్క నాల్గవ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్‌గా గుర్తించబడింది. గుప్తేశ్వర్ ఫారెస్ట్ ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలోని జైపూర్ అటవీ డివిజన్‌లోని ధోండ్రఖోల్ రిజర్వ్ ఫారెస్ట్‌లో గుప్తేశ్వర్ శివాలయం సమీపంలో ఉంది. 350 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ప్రదేశం, తరతరాలుగా స్థానిక సమాజంచే గౌరవించబడే పవిత్రమైన తోటలకు మాత్రమే కాకుండా, అపారమైన వృక్షజాలంకు మరియు జంతుజాలానికి ప్రసిద్ధి చెందింది.

  • ఈ ఫారెస్ట్ యందు 182 రకాల చెట్లు, 76 రకాల పొదలు, 177 రకాల మూలికలు, 69 రకాల తీగలు మరియు 14 రకాల ఆర్కిడ్‌ జాతులను కలిగి ఉంది.
  • ఇండియన్ ట్రంపెట్ ట్రీ, ఇండియన్ స్నేక్‌రూట్, కుంబి గమ్ ట్రీ, గార్లిక్ పియర్ ట్రీ, చైనీస్ ఫీవర్ వైన్, రోహితుక ట్రీ, జోడ్‌పాకిలి, ఇండియన్ జాయింట్‌ఫిర్ వంటి అరుదైన ఔషధ మొక్కలకు నిలయంగా ఉంది.
  • ఈ ప్రాంతం 608 జంతు జాతులకు నిలయంగా ఉంది.
  • వీటిలో 28 రకాల క్షీరదాలు, 188 రకాల పక్షులు, 18 రకాల ఉభయచరాలు, 48 రకాల సరీసృపాలు, 45 రకాల చేపలు, 141 రకాల సీతాకోకచిలుకలు, 43 రకాల మాత్‌లు, 41 రకాల ఓడనేట్స్, 30 రకాల సాలెపురుగులు ఉన్నాయి.
  • గుప్తేశ్వర్ అరణ్యంలో ఉన్న సున్నపురాయి గుహలు ఎనిమిది జాతుల గబ్బిలాలకు ఆవాసాన్ని అందిస్తున్నాయి.
  • గుప్తేశ్వర్‌ను బిహెచ్‌ఎస్‌గా పేర్కొనడం ద్వారా స్థానిక ప్రజలకు మరియు అడవికి మధ్య సాంస్కృతిక బంధాన్ని బలోపేతం చేయడమే కాకుండా దాని అమూల్యమైన జీవవైవిధ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
  • ఈ ప్రదేశాల కోసం సమగ్ర దీర్ఘకాలిక పరిరక్షణ మరియు అభివృద్ధి ప్రణాళికను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఒడిషా బయోడైవర్సిటీ బోర్డును కోరింది.

ఒడిశాలో ప్రస్తుతం నాలుగు జీవవైవిధ్య వారసత్వ ప్రదేశాలను కలిగి ఉన్నాయి. వాటిలో కంధమాల జిల్లాలోని మందసారు ​​బిహెచ్‌ఎస్‌, గజపతి జిల్లాలోని మహేంద్రగిరి బిహెచ్‌ఎస్‌, బర్గర్ మరియు బోలంగీర్ జిల్లాలోని గంధమర్దన్ బిహెచ్‌ఎస్‌ మరియు కోరాపుట్ జిల్లాలోని గుప్తేశ్వర్ ఫారెస్ట్.

యూఏఈలో తొలి హిందూ దేవాలయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

యూఏఈలోని అబుదాబిలో తొలి హిందూ దేవాలయం బాప్స్ మందిర్‌ను ఫిబ్రవరి 14న ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ మందిరాన్ని బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం (బాప్స్) స్వామినారాయణ్ సంస్థ నిర్మించింది. ఈ సంస్థను 1907లో ప్రముఖ్ స్వామి మహారాజ్ స్థాపించారు. ఆయన స్ఫూర్తితో నిర్మించిన ఈ మందిరాన్ని మహంత్ స్వామి మహారాజ్ ప్రాణప్రతిష్ట చేశారు.

2015లో ప్రధాని మోదీ తొలిసారిగా యూఏఈకి వెళ్లిన సందర్భంగా అబుదాబిలో హిందూ దేవాలయం ప్రతిపాదన వచ్చింది, ఆ తర్వాత అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ మందిర్ కోసం 27 ఎకరాల భూమిని బహుమతిగా ఇచ్చారు. సెప్టెంబర్ 2019లో మందిరానికి చట్టపరమైన హోదా లభించింది, డిసెంబర్ 2019లో నిర్మాణం ప్రారంభమైంది.

  • ఈ మందిర నిర్మాణం కోసం ఉత్తర రాజస్థాన్ నుండి పింక్ ఇసుకరాయి మరియు ఇటలీ నుండి పాలరాయి తెప్పించారు.
  • బాప్స్ మందిరం 262 అడుగుల పొడవు మరియు 180 అడుగుల వెడల్పుతో నిర్మించారు.
  • ఈ మందిర నిర్మాణంలో యూఏఈ, ఆఫ్రికా, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్, ఇండియా మరియు గల్ఫ్ నుండి 200 మంది వాలంటీర్లు పాల్గొన్నారు.
  • భారత్ & యూఏఈ మధ్య సంబంధాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ మందిర్, సర్వమత సామరస్యానికి చిహ్నంగా నిలుస్తుంది.
  • యూఏఈలో ఇది మొత్తంగా మూడవ హిందూ దేవాలయం.
  • 1958లో దుబాయ్‌లో మొదటి హిందూ దేవాలయం నిర్మించబడింది, 2022లో దుబాయ్‌లోనే  రెండవ ఆలయం ప్రారంభించబడింది.

Post Comment