Advertisement
తెలుగు ఎడ్యుకేషన్ రోజువారీ కరెంట్ అఫైర్స్ 15 నవంబర్ 2023
Telugu Current Affairs

తెలుగు ఎడ్యుకేషన్ రోజువారీ కరెంట్ అఫైర్స్ 15 నవంబర్ 2023

తెలుగు ఎడ్యుకేషన్ కరెంట్ అఫైర్స్ 15 నవంబర్ 2023. తాజా జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో చదవండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి వివిధ పోటీ పరీక్షల కొరకు సిద్దమవుతున్న అభ్యర్థులకు ఇవి ఉపయోగపడతాయి.

సహారా గ్రూప్ వ్యవస్థాపకుడు సుబ్రతా రాయ్ కన్నుమూశారు

హారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్ నవంబర్ 14 న కార్డియోస్పిరేటరీ అరెస్ట్ కారణంగా 75 సంవత్సరాల వయస్సులో మరణించారు. సుబ్రతా రాయ్ 10 జూన్ 1948లో అరారియాలోని బెంగాలీ హిందూ కుటుంబంలో సుధీర్ చంద్ర రాయ్ మరియు ఛబీ రాయ్ దంపతులకు జన్మించారు. ఆయన 1978లో సహారా ఇండియా పరివార్‌ను స్థాపించారు.

సుబ్రతా రాయ్ 2012లో ఇండియా టుడే ద్వారా అత్యంత ప్రభావవంతమైన భారతీయ వ్యాపారవేత్తలలో పదవ స్థానంలో నిలిచారు. 2004లో టైమ్ మ్యాగజైన్, సహారా సమూహాన్నిభారతీయ రైల్వేల తర్వాత భారతదేశంలో రెండవ అతిపెద్ద ఎంప్లాయరుగా పేర్కొంది. సహారా భారతదేశం అంతటా 5,000 కంటే ఎక్కువ సంస్థల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ సంస్థ గొడుగు కింద దాదాపు 1.2 మిలియన్ల ఉద్యోగులు సేవలు అందిస్తున్నారు. సహారాలో 9 కోట్ల మంది పెట్టుబడిదారులు మరియు డిపాజిటర్లు ఉన్నారు. ఇది భారతదేశంలోని మొత్తం కుటుంబాలలో 13% మందికి సమానం.

2008లో సహారా గ్రూప్ సంస్థలు పెద్ద సంఖ్యలో పెట్టుబడిదారుల నుండి డబ్బును సేకరించి వివిధ నిబంధనలను ఉల్లంఘించినట్లు సెబీ ఆరోపించింది. సహారా కుంభకోణం భారతదేశ చరిత్రలో అతిపెద్ద ఆర్థిక మోసాలలో ఒకటి. సహారా సెబీ ఆదేశాలను కోర్టులో సవాలు చేసింది, అయితే 2012లో సెబీ నిర్ణయాన్ని భారత సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ పెట్టుబడిదారులకు తిరిగి చెల్లించడానికి సెబీ వద్ద ఉన్న ₹24,000 కోట్లు తిరిగి డిపాజిట్ చేయాలని సహారా ఇండియా పరివార్‌ని ఆదేశించింది.

సహారా ఇండియా పరివార్ సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించడంలో విఫలమైంది. ఫలితంగా 2014 నుండి సుబ్రతా రాయ్ తీహార్ జైలులో గడపాల్సి వచ్చింది. సహారా ఇష్యూ లక్షలాది మంది పెట్టుబడిదారులపై వినాశకరమైన ప్రభావాన్ని చూపింది. వీరిలో చాలా మంది పేదవారు ఉన్నారు. తమ సొమ్మును తిరిగి చెల్లించడంలో కంపెనీ విఫలమవడంతో ఆర్థికంగా వారు చితికిపోయారు. సహారా సమస్య భారత ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావం చూపింది. ఈ కుంభకోణం పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీసింది. భారతీయ కంపెనీలకు మూలధనాన్ని సేకరించడం కష్టతరం చేసింది.

హర్యానాలో 9వ భారతీయ అంతర్జాతీయ సైన్స్ ఫెస్టివల్

9వ భారత అంతర్జాతీయ సైన్స్ ఫెస్టివల్ (IISF) 2023, జనవరి 17 నుండి 20, 2024 వరకు హర్యానాలోని ఫరీదాబాద్‌లో నిర్వహించనున్నారు. ఈ ఫెస్టివల్ అమృత్ కాల్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ పబ్లిక్ ఔట్రీచ్ అనే థీమ్‌తో జరగనుంది. భారతీయ సైన్స్ క్యాలెండర్‌లో ఐఐఎస్ఎఫ్ ఒక ప్రధాన కార్యక్రమం. దీనిని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ విజ్ఞాన భారతి సహకారంతో నిర్వహిస్తోంది. ఇది ముఖ్యంగా విద్యార్థులు మరియు యువతలో సైన్స్ మరియు టెక్నాలజీని ప్రోత్సహించడానికి ఉద్దేశించబడింది.

ఈ మెగా సైన్స్ ఫెయిర్ ఫరీదాబాద్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీకి చెందిన క్యాంపస్ ఆఫ్ ట్రాన్స్‌లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ మరియు రీజనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఐఐఎస్‌ఎఫ్‌లో 10,000 మందికి పైగా పాఠశాల విద్యార్థులు, 500 మంది యువ పరిశోధకులు పాల్గొంటారని అంచనా. ఈ కార్యక్రమం 2015 నుండి యేటా నిర్వహిస్తున్నారు.

ఎవరెస్ట్ ముందు స్కైడైవ్ చేసిన తోలి భారతీయ మహిళగా శీతల్ మహాజన్

భారతీయ స్కైడైవర్ శీతల్ మహాజన్ మౌంట్ ఎవరెస్ట్ శిఖరం ముందు 21,500 అడుగుల నుండి హెలికాప్టర్‌పై నుండి దూకిన ప్రపంచంలోనే మొదటి మహిళగా అవతరించారు. అలానే మహాజన్ 17,444 అడుగుల ఎత్తులో కాలాపత్తర్ శిఖరం వద్ద దిగిన మొదటి మహిళగా కూడా నిలిచారు. 41 ఏళ్ల మహాజన్ నవంబర్ 13న ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరం ముందు భాగంలో స్కైడైవింగ్‌ను పూర్తి చేసినట్లు నివేదించబడింది.

స్కైడైవర్ శీతల్ మహాజన్ తన పేరుమీద ఎనిమిది ప్రపంచ రికార్డులను కలిగి ఉన్నారు. ఆమె అంటార్కిటికా మీదుగా 10,000 అడుగుల నుండి వేగవంతమైన ఫ్రీ ఫాల్ జంప్ చేసిన మొదటి మహిళగా, ఉత్తర మరియు దక్షిణ ధృవాల మీదుగా దూకిన అతి పిన్న వయస్కురాలుగా నిలిచారు. భారత ప్రభుత్వం ఆమెను 2011 లో నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీతో సత్కరించింది.

పంజాబ్ & హర్యానా కుక్కకాటు బాధితులకు 10 వేలు పరిహారం

పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు, కుక్క కాటుకు సంబంధించిన కేసులలో ప్రతి పంటి గాటికి కనీసం 10వేల ఆర్థిక సహాయం అందించాలని తీర్పునిచ్చింది. కుక్క కాటుకు గురైన బాధితులకు నష్టపరిహారం చెల్లించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని పేర్కొంది. ఈ తీర్పు రెండు రాష్ట్రాల్లో కుక్కకాటు బాధితులకు లబ్ది చేకూర్చుతుంది. దేశంలో కుక్క కాటు బాధితులకు పరిహారం చెల్లించడానికి స్పష్టమైన చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ లేదు.

ఈ తీర్పు భారతదేశంలో వీధి కుక్కల సంఖ్యను నియంత్రించడానికి చర్యలు తీసుకోవాల్సిన ప్రాముఖ్యతను గుర్తుచేస్తుంది. వీధి కుక్కలు ప్రజారోగ్యానికి పెద్ద ప్రమాదం, ప్రతి సంవత్సరం వేలాది మంది కుక్క కాటుకు గురవుతున్నారు. వీరిలో అత్యధికం పిల్లలు ఉంటున్నారు. వీధి కుక్కల జనాభాను నియంత్రించడానికి, కుక్కల యజమానులు తమ జంతువులను సరిగ్గా చేసుకునేలా చేయడానికి ప్రభుత్వాలు మరింత కృషి చేయాలి.

అశోక్ లేలాండ్ నుండి భారతదేశపు తోలి ఎల్‌ఎన్‌జి ట్రక్

అశోక్ లేలాండ్, దేశంలోని తొలి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జి)తో నడిచే హాలేజ్ ట్రక్కును హోసూర్‌లోని మహానగర్ గ్యాస్ లిమిటెడ్‌కు డెలివరీ చేసినట్లు ప్రకటించింది. అశోక్ లేలాండ్ AVTR 1922 భారతదేశపు వాణిజ్య వాహన పరిశ్రమలో ఒక ముఖ్యమైన మైలురాయి. ఇది దేశం యొక్క మొట్టమొదటి ఎల్‌ఎన్‌జి-శక్తితో నడిచే ట్రక్కు.

ఈ సంచలనాత్మక వాహనం అశోక్ లేలాండ్ యొక్క AVTR ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడింది. ఇది మాడ్యులారిటీ మరియు సామర్థ్యానికి ప్రసిద్ధి చెందింది. AVTR 1922 6-సిలిండర్ హెచ్-సిరీస్ ఇంజిన్‌తో అభివృద్ధి చేయబడింది. ఇది లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఆధారితంగా నడుస్తుంది. ఇది సాంప్రదాయ డీజిల్ ఇంధనాలకు ప్రత్యామ్నాయం.

అయితే అశోక్ లేలాండ్ భారతదేశంలో ఎల్‌ఎన్‌జితో నడిచే వాణిజ్య వాహనాలను పరిశోధించిన మొదటి కంపెనీ కాదు. సెప్టెంబర్ 2022లో బ్లూ ఎనర్జీ మోటార్, ఇవేకో గ్రూప్‌తో కలిసి, దాని ఎల్‌ఎన్‌జి-ఆధారిత ట్రక్కును ఆవిష్కరించింది. ఈ సంస్థ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్) నుండి 100 యూనిట్లకు ఆర్డర్‌లను కూడా పొందింది.

ఇండియన్ నేవీ గన్నేరీ సింపోజియం 2023

ఇండియన్ నేవీ గన్నేరీ సింపోజియం 2023 కార్యక్రమం సదరన్ నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో నేవీ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ గన్నేరీ అండ్ మిస్సైల్ వార్‌ఫేర్ అయిన ఐఎన్ఎస్ ద్రోణాచార్య యందు నవంబర్ 13, 14 తేదీలలో నిర్వహించబడింది. నౌకాదళ సింపోజియం అనేది ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడే ఒక ముఖ్యమైన కార్యక్రమం, ఇది గన్నరీ రంగంలోని నిపుణుల కోసం ఒక వేదికను అందిస్తుంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గన్నేరీ స్పెషలిస్ట్ అయిన నావల్ స్టాఫ్ చీఫ్ అడ్ఎమ్ ఆర్ హరి కుమార్ హాజరయ్యారు. అలానే భారత నావికాదళానికి చెందిన ఫ్లీట్స్ మరియు ఫ్రంట్‌లైన్ షిప్‌ల నుండి గన్నేరీ నిపుణులు కూడా సింపోజియమ్‌కు హాజరయ్యారు. ఈ ఏడాది సింపోజియమ్‌ 'గన్నేరీ అండ్ మిస్సైల్ వార్‌ఫేర్‌లో ఎమర్జింగ్ టెక్నాలజీస్' అనే థీమ్ ఆధారంగా నిర్వహించబడింది.

నావల్ గన్నేరీ అనేది నావికాదళ ఫిరంగులను ఉపయోగించి శత్రు ఉపరితల నౌకలు, జలాంతర్గాములు మరియు తీర లక్ష్యాలను ఛేదించే కళ. ఇది నౌకాదళ తుపాకుల రూపకల్పన, నిర్వహణ మరియు శిక్షణ ఇవ్వడం వరకు అనేక రకాల కార్యకలాపాలను కలిగి ఉంటుంది.

Post Comment