Advertisement
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 10 జనవరి 2024
January Telugu Current Affairs

తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 10 జనవరి 2024

January 10, 2024 Current affairs in Telugu. రోజువారీ జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో పొందండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షల కొరకు సిద్దమవుతున్న ఆశావహుల కోసం వీటిని అందిస్తున్నాం.

జగన్నాథ్ పూరి హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్టును ప్రారంభించిన నవీన్ పట్నాయక్

పూరీలోని చారిత్రాత్మక శ్రీ జగన్నాథ దేవాలయం చుట్టూ జగన్నాథ్ పూరీ హెరిటేజ్ కారిడార్ (శ్రీమందిర్ పరిక్రమ ప్రకల్ప) అనే అభివృద్ధి ప్రాజెక్ట్‌ను జనవరి 17, 2024 న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు జగన్నాథ దేవాలయం చుట్టూ భక్తులకు మెరుగైన మౌలికసదుపాయాలను అందుబాటులోకి తెస్తుంది. ఈ శ్రీమందిర్ పరిక్రమ ప్రకల్పను పూరీ దివ్యసింగ్ దేబ్ యొక్క గజపతి మహారాజు మరియు సుమారు 90 దేవాలయాల ప్రతినిధులు మరియు వేలాది మంది భక్తుల సమక్షంలో పట్నాయక్ అధికారికంగా ఆవిష్కరించారు.

ఈ కారిడార్‌లో భాగంగా ఆలయం చుట్టూ 75 మీటర్ల పొడవున్న పాదచారుల మార్గం (శ్రీ దండ), 1.5 కిలోమీటర్ల పొడవైన వంతెన (శ్రీ సేతు), పార్కింగ్ ప్రాంతాలు, తీర్థయాత్ర కేంద్రం, విశ్రాంతి గదులు, క్లోక్‌రూమ్‌లు, మరుగుదొడ్లు మరియు భక్తుల కోసం ఇతర సౌకర్యాలు అభివృద్ధి చేస్తున్నారు. ఈ కారిడార్ ఒడియా వారసత్వం మరియు ఆలయ నిర్మాణ అంశాలను అనుసంధానిస్తుంది, జగన్నాథ దేవాలయం యొక్క వైభవాన్ని సూక్ష్మంగా ప్రతిధ్వనిస్తుంది.

జాత్యహంకార వ్యాఖ్యలపై ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసిన మాల్దీవుల ప్రభుత్వం

భారత ప్రధాని నరేంద్ర మోడీ మరియు భారతదేశం గురించి చేసిన జాత్యహంకార వ్యాఖ్యలపై మాల్దీవులు ప్రభుత్వం తన ముగ్గురు మంత్రులను జనవరి 7 సస్పెండ్ చేసింది. జనవరి 4న భారత ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటన తర్వాత, ముగ్గురు మాల్దీవుల ప్రభుత్వ మంత్రులైన మరియం షియునా, మల్షా షరీఫ్ మరియు అబ్దుల్లా మహ్జూమ్ మాజిద్‌లు సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలు భారతదేశంలో ఆగ్రహాన్ని రేకెత్తించాయి, సోషల్ మీడియా వేదికల ద్వారా పెద్ద సంఖ్యలో మాల్దీవులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. అయితే మాల్దీవుల ప్రభుత్వం ప్రారంభంలో ఈ వ్యాఖ్యలకు దూరంగా ఉండటంతో పాటుగా, వాటిని వారి వ్యక్తిగత అభిప్రాయాలుగా పేర్కొంది. భారత్ నుంచి వచ్చిన ఒత్తిడి, దేశీయంగా ఎదురుదెబ్బ తగలడంతో మాల్దీవుల ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టి ఆ ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసింది.

ఈ మంత్రుల సస్పెన్షన్ భారతదేశాన్ని శాంతింపజేయడానికి మరియు ప్రజల ఆగ్రహాన్ని పరిష్కరించడానికి మాల్దీవుల ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన చర్యగా భావించవచ్చు. ఈ ఘటనతో ఇరు దేశాల మధ్య సంబంధాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అయితే మంత్రుల సస్పెన్షన్ మరియు మాల్దీవుల ప్రభుత్వం క్షమాపణలు చెప్పడం భారతదేశంతో సంబంధాలను సరిదిద్దడానికి సానుకూల చర్యలుగా పరిగణించబడుతున్నాయి.

మాల్దీవులు, భారతదేశానికి నైఋతిన హిందూ మహాసముద్రంలో కొన్ని పగడపు దీవుల సముదాయాలతో ఏర్పడిన దేశం. మాల్దీవులలో 26 ప్రధాన పగడపు దిబ్బలలో పాటుగా మొత్తం 1,196 పగడపు దీవులు ఉన్నాయి. ఇది ప్రపంచంలో అత్యంత చెదరగొట్టబడిన దేశాలలో ఒకటిగా చెప్పొచ్చు.

  • రాజధాని నగరం : మాలే
  • కరెన్సీ : మాల్దీవియన్ రుఫియా
  • అధికారిక భాష : ధివేహి
  • అధ్యక్షుడు : మొహమ్మద్ ముయిజు
  • ఉపాధ్యక్షుడు : హుస్సేన్ మహ్మద్ లతీఫ్

భారత్ - మాల్దీవుల సంబంధాలు & వివాదం

జనవరి 4న భారత ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటన తర్వాత సోషల్ మీడియా వేదికగా ఆయన లక్షద్వీప్ పర్యాటక అనుభవాలను పంచుకున్నారు. ప్రధాని తన పోస్ట్‌లలో ఎక్కడా మాల్దీవుల గురించి ప్రస్తావించనప్పటికీ, భారతదేశంలో ఇంత సహజమైన అందం ఉన్నప్పుడు ఎవరైనా మాల్దీవులకు ఎందుకు వెళ్లాలని అనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో చోటు చేసుకున్నాయి. ఇది కాస్త మాల్దీవుల పర్యాటకాన్ని విభేదించేదిగా ఉండటంతో వారి మంత్రులు భారత పర్యాటకం, పరిశుభ్రతపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు.

అయితే నవంబర్ 2023లో మాల్దీవుల అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన మొహమ్మద్ ముయిజ్జూ చైనా అనుకూల వ్యక్తిగా కనిపిస్తున్నారు. మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌తో కలిసి ద్వీపసమూహ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో 'ఇండియా అవుట్' ప్రచారాన్ని ఆయన ముందుండి నడిపించారు. అయితే దీనిలో భాగంగానే ప్రధాని లక్షద్వీప్ పర్యాటన చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. బహిరంగంగా వెల్లడించకపోయినా, ఇది మోడీ ఊహాత్మక ఎత్తుగడగానే రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ వివాదం సమయంలోనే మొహమ్మద్ ముయిజ్జూ జనవరి 7 నుండి 13 వరకు చైనాలో అధికారిక పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో ఇరు దేశల మధ్య కొన్ని ఒప్పందాలు కూడా జరిగాయి. తిరుగు ప్రయాణంలో ఆయన చైనా-మాల్దీవుల సంబంధాలపై వివరణ ఇచ్చారు. ఇరు దేశాల సంబంధాలు నాలుగు సూత్రాలపై ఆధారపడి ఉన్నాయని, అవి పరస్పర గౌరవం, సార్వభౌమ సమానత్వం, ప్రాదేశిక సమగ్రత మరియు అంతర్గత విషయాలలో జోక్యం చేసుకోకపోవడం అని తెలిపారు.

ఇదే సందర్భంలో మాల్దీవుల పర్యాటకాన్ని బహిష్కరించాలని భారతదేశంలో సోషల్ మీడియా పిలుపులపై కూడా ఆయన స్పందించారు. మాల్దీవులను వేధించడానికి ఎవరికీ లైసెన్స్ లేదనే భావనను ఆయన వ్యక్తం చేశారు. అలానే తమ దేశం నుండి భారత సైనిక సిబ్బంది ఉపసంహరణకు కూడా ఆయన పిలుపునిచ్చారు. మాల్దీవులలో పెరుగుతున్న భారతదేశం యొక్క ప్రభావం కారణంగా మాల్దీవుల సార్వభౌమత్వం దెబ్బతింటుందనే బావనను ఆయన హైలైట్ చేశారు.

అయితే రాజకీయంగా, మాల్దీవుల స్వాతంత్య్రాన్ని గుర్తించి దౌత్య సంబంధాలను నెలకొల్పిన మొదటి దేశాలలో భారతదేశం ఒకటి. గత కొన్ని దశబ్దాలుగా ఈ సంబంధాలు ఇరు దేశాల మధ్య స్నేహపూర్వకంగా ఉన్నాయి. భౌగోళికంగా మాల్దీవులు హిందూ మహాసముద్రంలో, భారతదేశం యొక్క లక్షద్వీప్ దీవులకు దగ్గరగా ఉంది. ఈ ప్రాంతం భారతదేశ సముద్ర భద్రత ప్రయోజనాలకు నెలవుగా ఉంది. ఇందులో భాగంగా భారతదేశం మాల్దీవులలో నెట్‌వర్క్డ్ కోస్టల్ రాడార్ గొలుసును ఏర్పాటు చేసింది.

ఇండియన్ కోస్ట్ గార్డ్ క్రమం తప్పకుండా ఈ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తుంది. ఉగ్రవాద వ్యతిరేక సామర్థ్యాలను మెరుగుపరచడానికి భారత సైన్యం మరియు మాల్దీవుల నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ మధ్య 'ఎకువెరిన్' వంటి ఉమ్మడి సైనిక వ్యాయామాలు కూడా ఏటా నిర్వహించబడతాయి.

1988 మాల్దీవులతిరుగుబాటు సమయంలో, 2004 సునామీ సమయంలో, 2014 నీటి సంక్షోభం సమయంలో, 2019 కోవిడ్-19 సంక్షోభ సమయంలో ఈ దేశానికి సైనిక, ఆర్థిక, వైద్యం మరియు లాజిస్టికల్ మద్దతుతో సహా భారతదేశం గణనీయమైన సహాయాన్ని అందించింది. గ్రేటర్ మేల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ మరియు గుల్హిఫల్హు పోర్ట్ అభివృద్ధి వంటి మాల్దీవులలో అనేక మౌలిక సదుపాయాలు మరియు అభివృద్ధి ప్రాజెక్టులలో భారతదేశం పాలుపంచుకుంది.

మాల్దీవులలో ఆరోగ్య సంరక్షణ మరియు విద్యా రంగాలకు భారతదేశం కూడా దోహదపడింది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం సంవత్సరాలుగా గణనీయంగా పెరిగింది. అయితే చైనా కూడా ఇదే అవసరాలతో మాల్దీవులకు ఊహాత్మకంగా దగ్గర అవుతుంది. అబ్దుల్లా యమీన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI)కి అనుగుణంగా మాల్దీవులతో చైనా నిశ్చితార్థం గణనీయంగా పెరిగింది.

మాల్దీవుల ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అప్‌గ్రేడ్ చేయడం మరియు మాలే నుండి హుల్‌హుమలేను కలిపే వంతెన నిర్మాణంతో సహా ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చైనా ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగానే మాల్దీవుల ప్రభుత్వం, చైనాకు దగ్గర అవుతుంది. అయితే ప్రాంతీయ స్థిరత్వం పరంగా, భారతదేశం, చైనాలకు మాల్దీవులు కీలక భూభాగం.

ఇది హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారతదేశం మరియు చైనాల మధ్య ప్రాంతీయ శక్తి సమతుల్యతకు మరియు సముద్ర భద్రత చిక్కులకు పరిస్కారం అందిస్తుంది. అయితే ఈ భౌగోళిక రాజకీయ టగ్-ఆఫ్-వార్ మధ్యలో ఇప్పుడు మాల్దీవులు చిక్కుకుపోవడం, రెండు ప్రాంతీయ శక్తులతో తన సంబంధాలను సమతుల్యం చేసుకునే సవాలును ఎదుర్కోవడం ఆ దేశానికి ఇప్పుడు ప్రధాన సమస్య. అయితే పర్యాటక ఆదాయంపైనే ప్రధానంగా ఆధారపడే ఈ దేశం ఇరు వర్గాలకు దగ్గరగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఉజ్జయినిలో భారతదేశపు మొట్టమొదటి హైజీనిక్ ఫుడ్ స్ట్రీట్ 'ప్రసాదం' ప్రారంభం

కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రి మన్సుఖ్ మాండవియా దేశంలోని మొట్టమొదటి హెల్తీ & హైజీనిక్ ఫుడ్ స్ట్రీట్ 'ప్రసాదం'ను జనవరి 7న ప్రారంభించారు. దీనిని మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఉజ్జయిని పరిధిలోని నీలకంఠ్ వాన్, మహాకల్ లోక్‌లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్, ఉప ముఖ్యమంత్రి రాజేంద్ర శుక్లా జీ,  ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి నరేంద్ర శివాజీ పటేల్ పాల్గొన్నారు.

"ప్రసాదం" హెల్తీ & హైజీనిక్ ఫుడ్ స్ట్రీట్ అనేది దేశంలోని ప్రతి మూలలో ఉన్న సాధారణ పౌరులకు స్వచ్ఛమైన మరియు సురక్షితమైన స్థానిక మరియు సాంప్రదాయ ఆహారంతో కలుపుతుంది. ఈ ప్రయత్నం సామాన్య ప్రజలను మరియు పర్యాటకులను సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు దగ్గర చేస్తుంది. "ప్రసాదం" ఫుడ్ స్ట్రీట్ ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు మరియు పరిశుభ్రమైన తయారీపై దృష్టి సారించి సాంప్రదాయ భారతీయ వంటకాల యొక్క ప్రత్యేకమైన మిశ్రమాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

పృథ్వీ విజ్ఞాన్ పథకానికి ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం

మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్‌కు చెందిన పృథ్వీ విజ్ఞాన్ (పృథ్వీ) అనే విస్తృత ప‌థ‌కాన్ని కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదించింది. 2021-26 కాలంలో ఈ పథకం అమలు కోసం మొత్తం 4,797 కోట్లు బడ్జెట్ కూడా కేటాయించింది. ఈ పథకం ఆమోదం దేశంలోని ఎర్త్ సైన్స్ పరిశోధన ప్రయత్నాలకు ఒక పెద్ద ముందడుగుగా భావించవచ్చు. 2021లో ప్రారంభించబడిన ఈ పథకం 2026 వరకు అమలులో ఉంటుంది. పృథ్వీ విజ్ఞాన్ పథకం, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్‌ కింద ఇప్పటికే ఉన్న ఐదు ఉప పథకాలను కూడా అనుసంధానిస్తుంది.

  • అట్మాస్పియర్ & క్లైమేట్ రీసెర్చ్-మోడలింగ్ అబ్జర్వింగ్ సిస్టమ్స్ & సర్వీసెస్ (ACROSS)
  • ఓషన్ సర్వీసెస్, మోడలింగ్ అప్లికేషన్, రిసోర్సెస్ అండ్ టెక్నాలజీ (O-SMART)
  • పోలార్ సైన్స్ అండ్ క్రయోస్పియర్ రీసెర్చ్ (PACER)
  • సీస్మోలజీ అండ్ జియోసైన్సెస్ (SAGE)
  • రీసెర్చ్, ఎడ్యుకేషన్, ట్రైనింగ్ అండ్ ఔట్రీచ్ (REACHOUT)

పృథ్వీ విజ్ఞాన్ పథకం భూమి, వాతావరణం, మహాసముద్రాలు మరియు ధ్రువ ప్రాంతాల వంటి కీలకమైన ప్రాంతాలలో పరిశోధన, మోడలింగ్ మరియు సర్వీస్ డెలివరీని గణనీయంగా మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది భూమి వ్యవస్థ మరియు దాని మార్పు యొక్క ముఖ్యమైన సంకేతాలను గురించి మెరుగైన అవగాహన పెంపొందించేందుకు ఉపయోగపడనుంది. అలానే మెరుగైన వాతావరణ అంచనా మరియు వాతావరణ నమూనా రూపొందించుకోవడం. సముద్ర మరియు వాతావరణ ప్రమాదాలను అర్థం చేసుకోవడం వంటి అంశాల యందు దృష్టి సారిస్తుంది.

వీటిలో పాటుగా భూమి యొక్క ధ్రువ మరియు అధిక సముద్ర ప్రాంతాల అన్వేషణ, సామాజిక అనువర్తనాల కోసం సముద్ర వనరుల అన్వేషణ మరియు వాటి స్థిరమైన వినియోగం కోసం సాంకేతికత అభివృద్ధి అలానే సామాజిక, పర్యావరణ మరియు ఆర్థిక ప్రయోజనాల కోసం ఎర్త్ సిస్టమ్స్ సైన్స్ రంగాలలో మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై కూడా దృష్టి సారిస్తుంది. పృథ్వీ పథకం, ఎర్త్ సిస్టమ్ సైన్సెస్ యొక్క తక్కువ అంచనాను మెరుగుపరచడానికి మరియు దేశానికి నమ్మకమైన సేవలను అందించడానికి భూమి వ్యవస్థలోని మొత్తం ఐదు అంశాలను సమగ్రంగా పరిశోధిస్తుంది.

ఉగాండాలో 19వ నామ్ శిఖరాగ్ర సమావేశం

నాన్-అలైన్డ్ ఉద్యమం (నామ్) యొక్క 19వ శిఖరాగ్ర సమావేశం 2024 జనవరి 15 నుండి 20 వరకు ఉగాండాలోని కంపాలాలో జరిగింది. 19వ నామ్ సమ్మిట్, ఉగాండా నాయకత్వంలో నిర్వహించబడింది. అలానే ఈ ఏడాది నుండి వచ్చే మూడేళ్ళ కాలానికి నాన్-అలైన్డ్ మూవ్‌మెంట్ (నామ్) అధ్యక్ష పదవిని కూడా అజర్‌బైజాన్ నుండి స్వీకరించింది.

మున్యోనియోలోని స్పీక్ రిసార్ట్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన 19వ నామ్ హెడ్స్ ఆఫ్ స్టేట్ మరియు గవర్నమెంట్ సమ్మిట్ సందర్భంగా అజర్‌బైజాన్ ప్రెసిడెంట్ ఇల్హామ్ అలియేవ్ నుండి ఉగాండా ప్రెసిడెంట్ యోవేరి కగుటా ముసెవెని ఈ బాధ్యతలు స్వీకరించారు.

  • 19వ నామ్ శిఖరాగ్ర సమావేశం 2024 జనవరి 15 నుండి 20 వరకు ఉగాండాలోని కంపాలాలో జరిగింది.
  • 19వ నామ్ శిఖరాగ్ర సమావేశం థీమ్ : డీపెనింగ్ కోఆపరేషన్ ఫర్ షేర్డ్ గ్లోబల్ అఫ్లూయెన్స్
  • ఉగాండా వచ్చే మూడేళ్ళ కాలానికి నామ్ అధ్యక్ష బాధ్యతలు అజర్‌బైజాన్ నుండి స్వీకరించింది.
  • ఆఫ్రికా ఖండంలోని నామ్ సభ్యత్వం లేని ఏకైక దేశమైన దక్షిణ సూడాన్, 13 ఏళ్ళ తర్వాత కొత్త నామ్ సభ్య దేశంగా చేరింది.
  • దీనితో నామ్ సభ్య దేశాల సంఖ్య 121కి చేరింది.
  • నామ్ యందు ప్రస్తుతం 121 సభ్య దేశాలు, 18 పరిశీలక దేశాలు మరియు 10 అంతర్జాతీయ సంస్థలు సభ్యులుగా ఉన్నాయి.
  • నామ్ సమ్మిట్ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది.
  • మునపటి సమావేశం 2019లో అజర్‌బైజాన్‌లోని బాకులో జరిగింది.

అలీనోద్యమ 19వ శిఖరాగ్ర సదస్సులో భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ నాయకత్వం వహించారు. వాతావరణ మార్పులు, కోవిడ్ మహమ్మారి ప్రభావం, ప్రపంచ సంఘర్షణలు మరియు అప్పులు, ద్రవ్యోల్బణం మరియు అభివృద్ధి అడ్డంకులు వంటి ఆర్థిక సవాళ్లతో సహా అలీన ఉద్యమంతో సంబంధం ఉన్న దేశాలు ఎదుర్కొంటున్న వివిధ సవాళ్లపై జైశంకర్ ప్రసంగించారు.

సభ్య దేశాల మధ్య ప్రాంతీయ ఆర్థిక కేంద్రాలు మరియు స్థితిస్థాపక సరఫరా గొలుసులను సృష్టించడం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కిచెప్పారు. 78 దేశాలలో భారత్ చేపడుతున్న 600 ప్రాజెక్టులను ఉదహరిస్తూ, భారతదేశాన్ని ప్రపంచ స్నేహితుడిగా పేర్కొన్నారు.

నాన్-అలైన్డ్ ఉద్యమం (అలీనోద్యమం) అనేది 120 దేశాలతో కూడిన ఇంటర్ గవర్నమెంట్ ఫోరమ్. ఇది ప్రచ్ఛన్న యుద్ధ ఘర్షణల నేపథ్యంలో అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని 1961లో స్థాపించబడింది. దీని కోఆర్డినేటింగ్ బ్యూరోగా యునైటెడ్ నేషన్స్ (ఐక్యరాజ్యసమితి) వ్యవహరిస్తుంది. ఇది ఐక్యరాజ్యసమితి తరువాత ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద దేశాల కూటమి.

నాన్-అలైన్‌మెంట్ అనే పదాన్ని మొదటిసారిగా 1950లో ఐక్యరాజ్యసమితిలో భారతదేశం మరియు యుగోస్లేవియా ఉపయోగించాయి. 1955లోని బాండుంగ్ కాన్ఫరెన్స్‌లో అంగీకరించిన సూత్రాల ఆధారంగా, యుగోస్లేవియాలోని బెల్‌గ్రేడ్‌లో యుగోస్లేవియా అధ్యక్షుడు జోసిప్ బ్రోజ్ టిటో, అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, ఈజిప్టు అధ్యక్షుడు గమల్ అబ్దెల్ చొరవతో 1961లో ఈ అలీన ఉద్యమం అధికారికంగా స్థాపించబడింది.

120 దేశాల ఈ కూటమి దాదాపు 4.64 బిలియన్ల మంది లేదా ప్రపంచ జనాభాలో 58.35% మందికి ప్రాతినిధ్యం వహిస్తుంది. 1950లు మరియు 1960వ దశకం ప్రారంభంలో ఈ ఉద్యమం అత్యంత పొందింది. అంతర్జాతీయ నాన్-అలైన్‌మెంట్ ఉద్యమం నిరాయుధీకరణ, జాత్యహంకారానికి వ్యతిరేకత మరియు దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షకు వ్యతిరేకతలో పెద్ద విజయాలు సాధించింది.

ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత దీనిలోని కొన్ని సభ్యు దేశాల మధ్య విభేదాలు, కొన్ని దేశాలు సోవియట్ యూనియన్, చైనా లేదా యునైటెడ్ స్టేట్స్‌తో సన్నిహిత సంబంధాలను అభివృద్ధి చేసుకున్నప్పటికీ, ఈ ఉద్యమం ప్రపంచంలోని అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య, ముఖ్యంగా గ్లోబల్ సౌత్‌లో బహుపాక్షిక సంబంధాలను అభివృద్ధి చేయడంలో విజయం సాధించింది.

ఉగాండా తూర్పు ఆఫ్రికా లోని ఒక భూపరివేష్టిత దేశం. దీని ఉత్తరసరిహద్దులో దక్షిణ సూడాన్, తూర్పు సరిహద్దులో కెన్యా, దక్షిణసరిహద్దులో టాంజానియా నైఋతి సరిహద్దులో రువాండా పశ్చిమసరిహద్దులో కాంగో దేశాలు ఉన్నాయి. ఉగాండాను సాధారణంగా 'ఆఫ్రికా ముత్యం' అని పిలుస్తారు, ఇది భూమధ్యరేఖకు ఆనుకుని ఉంది. ప్రపంచంలో రెండవ అతిపెద్ద మంచినీటి సరస్సు విక్టోరియా ఇక్కడే ఉంది. ఉగాండా బ్రిటిష్ వలస పాలన నుండి 9 అక్టోబర్ 1962లో స్వాతంత్య్రం పొందింది.

  • దేశం : రిపబ్లిక్ ఆఫ్ ఉగాండా
  • రాజధాని నగరం : కంపాలా
  • అధికారిక భాషలు : ఇంగ్లీష్, స్వాహిలి
  • కరెన్సీ : ఉగాండా షిల్లింగ్
  • అధ్యక్షుడు యోవేరి ముసెవేని
  • ఉపాధ్యక్షుడు : జెస్సికా అలుపో
  • ప్రధాన మంత్రి : రోబినా నబ్బంజా

ఇండియన్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ నరవానే ఆటోబయోగ్రఫీ విడుదల

భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవానే ఇటీవలి తన స్వీయచరిత్రను 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' పేరుతొ మార్కెట్లోకి విడుదల చేశారు. జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే స్వయంగా రచించిన ఈ పుస్తకం బాల్యం నుండి భారత సాయుధ దళాల అత్యున్నత స్థాయికి ఎదగడం వరకు అతని ప్రయాణాన్ని వివరిస్తుంది. ఆయన పాల్గొన్న వివిధ సైనిక కార్యకలాపాలు మరియు నాయకత్వ పాత్రలలో అతని అనుభవాలను కూడా ఈ పుస్తకం కవర్ చేస్తుంది.

ఈ పుస్తకం 2020 గాల్వాన్ వ్యాలీ ఘర్షణలతో సహా, తూర్పు లడఖ్‌లో చైనాతో సైనిక ప్రతిష్టంభనపై మెమోయిర్ అంతర్దృష్టిని కూడా అందిస్తుంది. చైనా సైనికులు ఆగస్ట్ 31, 2020న జనరల్ నరవానే మరియు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మధ్య జరిగిన సంభాషణను ప్రచురించిన సారాంశాలు కూడా ఇందులో వివరించబడ్డాయి.

ఈ శీర్షిక అధికారికంగా ఏప్రిల్ 30, 2024న విడుదల చేయబడుతుంది. అయితే దీని ముందస్తు ఆర్డర్ కోసం అమెజాన్ ఇప్పటికే స్లాట్స్ అందుబాటులో ఉంచింది. 448 పేజీల ఈ పుస్తకం, పెంగ్విన్ ప్రచురణకర్త ద్వారా పబ్లిష్ చేయబడుతుంది.

జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే, భారత 28వ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా సేవలు అందించారు. జనరల్ బిపిన్ రావత్ నుండి 31 డిసెంబర్ 2019న ఈ బాధ్యతలు స్వీకరించిన ఆయన 30 ఏప్రిల్ 2022 వరకు ఈ హోదాలో ఉన్నారు. జనరల్ నరవానే భారత సైనిక దౌత్యానికి ప్రేరణనిచ్చాడు, భారతదేశ భాగస్వామ్య దేశాలతో సత్సంబంధాలను కొనసాగించడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు.

నేషనల్ డిఫెన్స్ అకాడమీ మరియు ఇండియన్ మిలిటరీ అకాడమీ యొక్క పూర్వ విద్యార్థి అయిన ఆయన, జూన్ 1980లో ది సిక్కు లైట్ ఇన్‌ఫాంట్రీ రెజిమెంట్‌లో నియమించబడ్డాడు. భారత ఆర్మీకి ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం నుండి పరమ విశిష్ట సేవా పతకం (2019), అతి విశిష్ట సేవా పతకం (2017), విశిష్ట సేవా పతకం (2015) అందుకున్నారు.

వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024 యొక్క 10వ ఎడిషన్‌ను మహాత్మా మందిర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 10న ప్రారంభించారు. వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ మొదటిసారిగా 2003లో ప్రారంభించబడింది. తర్వాత కాలంలో ఇది గుజరాత్ యొక్క అత్యంత ముఖ్యమైన ఆర్థిక వేదికలలో ఒకటిగా అభివృద్ధి చెందింది. ఇది వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ యొక్క 20వ వార్షికోత్సవం.

10 వ వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ ఈ ఏడాది జనవరి 10 నుండి 12 వరకు గుజరాత్‌లోని గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరిగింది. ఈ ఏడాది ఈ సమ్మిట్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) మరియు ఇండస్ట్రియల్ ఎక్స్‌టెన్షన్ బ్యూరో భాగస్వామ్యంతో గుజరాత్ ప్రభుత్వం నిర్వహించబడింది. వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌లో ఈ ఏడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రెసిడెంట్ & అబుదాబి పాలకుడు హెచ్‌ఆర్‌హెచ్ షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సమ్మిట్‌కు మొజాంబిక్ ప్రెసిడెంట్ ఫిలిప్ న్యూసీ, తైమూర్ లెస్టే ప్రెసిడెంట్ జోస్ రామోస్-హోర్టా, చెక్ రిపబ్లిక్ ప్రధాన మంత్రి  పీటర్ ఫియాలా, వియత్నాం డిప్యూటీ ప్రధాన మంత్రి ట్రాన్ లూ క్వాంగ్ కూడా హాజరయ్యారు. అలానే జాతీయ మరియు అంతర్జాతీయ ప్రముఖ వ్యాపార వేత్తలు కూడా ఇందులో పాల్గొన్నారు.

వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024, గేట్‌వే టు ది ఫ్యూచర్ అనే థీమ్‌పై దృష్టి సారిస్తుంది. ఈ సమావేశం సెమీకండక్టర్, గ్రీన్ హైడ్రోజన్, స్పేస్ టెక్నాలజీ తయారీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ, సస్టైనబుల్ మాన్యుఫ్యాక్చరింగ్, పునరుత్పాదక ఇంధనం, పరిశ్రమలు 4.0 పై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తెలిపారు.

ఈ శిఖరాగ్ర సమావేశాలు ఇప్పటి వరకు ముంబై, ఢిల్లీ, బెంగళూరు, లక్నో, చెన్నై, కోల్‌కతా మరియు చండీగఢ్ వంటి ప్రధాన నగరాల్లో అలాగే న్యూజెర్సీ, దుబాయ్, సింగపూర్, టోక్యో, ఫ్రాంక్‌ఫర్ట్, మిలన్, కోపెన్‌హాగన్ వంటి అంతర్జాతీయ నగరాల్లో జరిగాయి. ఈ సమ్మిట్‌లో గుజరాత్ ప్రభుత్వంతో పాటుగా 34 దేశాలు మరియు 16 కార్పొరేట్ సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి.

వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ అనేది గుజరాత్ రాష్ట్రంలో నిర్వహించే  ద్వైవార్షిక పెట్టుబడిదారుల ప్రపంచ వ్యాపార కార్యక్రమం. ఈ సమ్మిట్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార నాయకులు, పెట్టుబడిదారులు, కార్పొరేషన్లను, ఆలోచనాపరులును, విధానాలు మరియు అభిప్రాయ రూపకర్తలను ఒకచోట చేర్చే లక్ష్యంతో నిర్వహించబడుతుంది. గుజరాత్‌ను ఒక ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా ప్రోత్సహించడంతో పాటుగా వివిధ రంగాలలో భాగస్వామ్యాలు మరియు సహకారాలను సులభతరం చేయడం దీని ప్రధాన లక్ష్యం.

Post Comment