Advertisement
తెలుగులో కరెంట్ అఫైర్స్ 09 జనవరి 2024
January Telugu Current Affairs

తెలుగులో కరెంట్ అఫైర్స్ 09 జనవరి 2024

January 09, 2024 Current affairs in Telugu. రోజువారీ జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను తెలుగులో పొందండి. యూపీఎస్‌సి, ఏపీపీఎస్‌సి, టీఎస్‌పీఎస్‌సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వే వంటి నియామక పరీక్షల కొరకు సిద్దమవుతున్న ఆశావహుల కోసం వీటిని అందిస్తున్నాం.

ఒడిశాకు చెందిన ఏడు కొత్త ఉత్పత్తులకు జీఐ ట్యాగ్

ఒడిశా రాష్ట్రానికి చెందిన ఏడు నూతన ఉత్పత్తులకు భౌగోళిక సూచిక (జీఐ ట్యాగ్) అందించబడింది. ఈ జాబితాలో 1. లాంజియా సౌరా పెయింటింగ్, 2. కోరాపుట్ కాల జీర రైస్, 3. సిమిలిపాల్ కై చట్నీ, 4. నయాగర్ కంటెముండి వంకాయ, 5. ఒడిశా ఖజూరి గూడ, 6. ధెంకనల్ మగ్జి, 7. డంగారియా శాలువ వంటి ఉత్పత్తులు ఉన్నాయి.

1. లాంజియా సౌరా పెయింటింగ్ : ఇది ఒడిశా పురాతన గిరిజన కళారూపాలలో ఒకటి. వీటిని ఇడిటల్ లేదా ఎకాన్స్ అని కూడా పిలుస్తారు. ఈ కళాకృతులు వాటి అందం, సౌందర్యం, కర్మసంబంధమైన అనుబంధం మరియు ఐకానోగ్రఫీకి ప్రసిద్ధి చెందాయి. ఈ కళారూపం లంజియా సౌరా కమ్యూనిటీకి చెందిన వారసత్వ కళ. రాయగడ జిల్లా పరిధిలో వీరు కనిపిస్తారు. ఈ పెయింటింగ్‌లు సాంప్రదాయకంగా వారి ఇళ్లలోని మట్టి గోడలపై వేయబడతాయి. ఈ చిత్రాలు వారి దైనందిన జీవితాలు మరియు పురాణాలు, మత విశ్వాసాల దృశ్యాలను వర్ణిస్తాయి.

2. కోరాపుట్ కాల జీర రైస్ : దీనిని ప్రిన్స్ ఆఫ్ రైస్ అని కూడా పిలుస్తారు. ఈ నలుపు-రంగు బియ్యం రకం, దాని వాసన, రుచి, ఆకృతి మరియు పోషక విలువలకు ప్రసిద్ధి చెందింది. కోరాపుట్ ప్రాంతంలోని గిరిజన రైతులు ఈ వరి రకాన్ని సుమారు 1,000 సంవత్సరాలుగా సంరక్షిస్తున్నారు. ఈ బియ్యం గింజలు జీలకర్ర గింజలను పోలి ఉంటాయి కాబట్టి, దీనిని కాల జీర అని పిలుస్తారు. ఈ బియ్యం రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయిలు పెంచడంతో పాటుగా శరీరంలో జీవక్రియను మెరుగుపర్చుతుంది.

3. సిమిలిపాల్ కై చట్నీ : దీనిని రెడ్ యాంట్ చట్నీ అని కూడా పిలుస్తారు. ఇది రెడ్ వీవర్ చీమలు (ఓకోఫిల్లా స్మరాగ్డినా), సుగంధ ద్రవ్యాలు మరియు మూలికలతో తయారు చేయబడిన ఒక ప్రత్యేకమైన సువాసనగల చట్నీ. ఒడిశాలోని మయూర్‌భంజ్‌లోని అనేక గిరిజన కుటుంబాలకు ఈ ఎర్ర నేత చీమలను సేకరించడం మరియు చట్నీని అమ్మడం ఒక ముఖ్యమైన ఆదాయ వనరు. వీటిని సిమిలిపాల్ నేషనల్ పార్క్ నుండి సేకరిస్తారు. ఈ చట్నీ ప్రోటీన్, కాల్షియం, జింక్, విటమిన్ బి-12, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం మొదలైన పోషకాలకు మంచి మూలం అని నమ్ముతారు.

4. నయాగర్ కంటెముండి వంకాయ : నయాగర్ కంటెముండి వంకాయను భుయ్ వంకాయ అని కూడా పిలుస్తారు. ఇది ఒడిషాలోని నయాగర్ జిల్లాకు చెందిన ఒక ప్రత్యేకమైన మరియు విలువైన వ్యవసాయ ఉత్పత్తి. ఈ వంకాయ కాండం మరియు మొక్క మొత్తం ముళ్లకు ప్రసిద్ధి చెందింది. ఇతర వంకాయ జన్యురూపాలతో పోలిస్తే ఇది ఆకుపచ్చ మరియు గుండ్రని ఆకారంలో ఎక్కువ విత్తనాలు కలిగి ఉంటుంది. ఈ వంకాయ రకం కీటక నిరోధకతను కలిగి ఉంటుంది. వీటిని ఎరువుల అవసరం లేకుండా సాగు చేయవచ్చు.

5. ఒడిశా ఖజూరి గూడ : దీనిని ఖర్జూరం బెల్లం లేదా పాటలీ గుర్ అని కూడా పిలుస్తారు. ఇది ఖర్జూరపు రసంతో తయారు చేయబడిన ఒక సాంప్రదాయక తీపి వంటకం. ఇది ఒడిషాలోని గజపతి జిల్లాలో ప్రసిద్ధి చెందింది. దీనిని శీతాకాలంలో తయారు చేస్తారు. ఇది ట్రాపెజోయిడల్ రూపంలో తయారు చేయబడుతుంది. ఖజూరి గూడ శక్తి మరియు పోషకాలకు మంచి మూలం. ఇది అధిక కార్బోహైడ్రేట్లతో పాటుగా ఐరన్ పోషక విలువలను కలిగి ఉంటుంది.

6. ధెంకనల్ మగ్జి : ధెంకనల్ మాగ్జీ అనేది గేదె పాల జున్నుతో తయారు చేయబడిన ఒక రకమైన స్వీట్. ఇది దాని రుచి, ఆకారం మరియు పరిమాణం పరంగా ప్రత్యేకత కలిగి ఉంది. ఇది ఇతర చీజ్ ఆధారిత స్వీట్‌ల నుండి వేరు చేసే ప్రత్యేకమైన పోషక విలువలను కూడా కలిగి ఉంది. గోండియా బ్లాక్‌లోని మందర్-సదాంగి ప్రాంతం ఈ తీపి పదార్ధాల మూలానికి కేంద్రంగా నమ్ముతారు, ఇది ఇప్పుడు ధెంకనల్ మొత్తం జిల్లాకు వ్యాపించింది.

7. డంగారియా శాలువ : దీనినే కప్పగండ శాలువా అని కూడా అంటారు. ఇది ఒడిషాలోని నియమగిరి కొండలలో డోంగ్రియా కోంద్ తెగచే నేసిన ప్రత్యేక ఎంబ్రాయిడరీ వస్త్రం. ఈ శాలువా డోంగ్రియా కోండ్‌ల గొప్ప గిరిజన వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది ఎరుపు, పసుపు మరియు ఆకుపచ్చ రంగుల దారాలతో తెల్లటి ముతక వస్త్రంపై ఎంబ్రాయిడరీ చేయడం ద్వారా తయారు చేయబడుతుంది. ఈ శాలువను పురుషులు మరియు మహిళలు ఇద్దరూ ధరిస్తారు. దీనిని వారి కుటుంబ సభ్యులకు ప్రేమ మరియు ఆప్యాయతకు చిహ్నంగా బహుమతిగా అందిస్తారు.

ఇండస్ ఫుడ్ 2024ను ప్రారంభించిన పీయూష్ గోయల్

గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పోజిషన్ మార్ట్‌లో నిర్వహించిన 'ఇండస్ ఫుడ్ 2024' ఈవెంటును జనవరి 8న కేంద్ర వాణిజ్య & పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. ఇది ఇండస్ ఫుడ్ యొక్క ఏడవ ఎడిషన్. ఇండస్ ఫుడ్ అనేది ఫుడ్ అండ్ బెవరేజ్ పరిశ్రమకు సంబంధించి దక్షిణ ఆసియాలో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ట్రేడ్ షో. ఇది తాజా ఆహార ఉత్పత్తులు, ప్రాసెసింగ్ టెక్నాలజీలు మరియు ప్యాకేజింగ్ పరిష్కారాలను ప్రదర్శిస్తుంది. ఈ ఈవెంట్‌లో 80+ దేశాల నుండి 700 మంది ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. ఇది జనవరి 8 నుండి 10, 2024 వరకు జరిగింది.

ఈ ఈవెంట్ యందు ప్రసంగించిన మంత్రి పీయూష్ గోయల్, భారతదేశ వైవిధ్యమైన ఆహార పరిశ్రమను ప్రశంసించారు. గత తొమ్మిదేళ్లలో ప్రాసెస్ చేయబడిన ఆహార ఎగుమతుల్లో భారత్ 150% వృద్ధిని నమోదు చేయడంతో పాటుగా మొత్తం వ్యవసాయ ఎగుమతులు 53 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా భారతీయ ఆహారాలకు పెరుగుతున్న డిమాండ్‌ను గుర్తించిన ప్రభుత్వం, దేశంలోని విభిన్న వ్యవసాయ-వాతావరణ మండలాలు ఏర్పాటు చేయడంతో పాటుగా, 158 ఆహార & వ్యవసాయ  జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ (జిఐ టాగ్స్) అందించినట్లు వెల్లడించారు. దీనితో పాటుగా వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ (ఓడిఓపి) కింద దేశంలోని జిల్లాల అంతటా 708 ప్రత్యేకమైన ఆహార పదార్థాలకు ప్రత్యేక గుర్తింపు కల్పించినట్లు తెలిపారు.

ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా దేశంలోని 81 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలను అందించడంతో దేశంలో సున్నా ఆకలి మరణాలు నమోదు అయినట్లు పేర్కొన్నారు. వీటికి అదనంగా ప్రభుత్వం తక్కువ ధరలో 'భారత్ అట్టా' మరియు 'భారత్ దళ్' పేర్లతో గోధుమ పిండి, కందిపప్పు అందించడం ద్వారా ఆహార ద్రవ్యోల్బణాన్ని తగ్గించే ప్రయత్నాలు చేసినట్లు తెలిపారు.

స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు 2023 ప్రదానం

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు 2023ని న్యూఢిల్లీలోని భారత్ మండపంలో గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ప్రదానం చేశారు. ఈ ఏడాది క్లీన్ సిటీస్, క్లీనెస్ట్ కంటోన్మెంట్, సఫాయిమిత్ర సురక్ష, గంగా టౌన్స్ మరియు బెస్ట్ పెర్ఫార్మింగ్ స్టేట్ కేటగిరీల కింద మొత్తం 24 జాతీయ, 20 జోనల్ మరియు 54 రాష్ట్ర స్థాయి అవార్డులు అందజేశారు.

ఈ ఏడాది క్లీనెస్ట్ సిటీ అవార్డు కింద ఉమ్మడి విజేతలను ప్రకటించారు. వరుసగా 6 సంవత్సరాలు క్లీనెస్ట్ సిటీగా నిలిచిన ఇండోర్‌తో పాటు పోర్ట్ సిటీ సూరత్ కూడా ఈ ఏడాది అగ్రస్థానంలో నిలిచి ఈ అత్యున్నత పురస్కారం కైవసం చేసుకుంది. లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న నగరాల విభాగంలో సాస్వాద్, పటాన్, లోనావాలా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.

మధ్యప్రదేశ్‌లోని మోవ్ కంటోన్మెంట్ బోర్డు, ఈ ఏడాది క్లీనెస్ట్ కంటోన్మెంట్ బోర్డుగా ఎంపికైంది. క్లీనెస్ట్ గంగా పట్టణాలలో వారణాసి మరియు ప్రయాగ్‌రాజ్ మొదటి రెండు అవార్డులను గెలుచుకున్నాయి. అలానే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లు ఉత్తమ పనితీరు కనబరిచిన మొదటి మూడు అవార్డులను గెలుచుకోగా, చండీగఢ్ ఉత్తమ సఫాయిమిత్ర సురక్షిత్ షెహెర్ అవార్డు గెలుచుకుంది.

ఈ ఏడాది క్లీనెస్ట్ సిటీ అవార్డుల కింద టాప్ 10 జాబితాలో నాలుగు తెలుగు రాష్ట్రాల నగరాలు చోటు దక్కించుకున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుండి విశాఖపట్నం 4వ స్థానంలో, విజయవాడ 6వ స్థానంలో తిరుపతి 8వ స్థానంలో చోటు దక్కించుకోగా, తెలంగాణ రాష్ట్రం నుండి గ్రేటర్ హైదరాబాద్ 10వ స్థానంలో నిలిచింది. లక్ష జనాభా దాటిన నగరాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుండి గుంటూరు రెండవ స్థానం దక్కించుకుంది.

అలానే స్టేట్ బెస్ట్ పెరఫార్మెర్ జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుండి పులివెందుల అగ్రస్థానం దక్కించుకోగా, లక్ష లోపు జనాభా నగరాల జాబితాలో తెలంగాణ నుండి సిద్దిపేట్ నాల్గొవ స్థానంలో నిలిచింది. అలానే 50 వేల జనాభా లోపు నగరాల జాబితాలో తెలంగాణ నుండి నిజాంపేట్ 4వ స్థానం దక్కించుకుంది. అలానే 25వేల లోపు జనాభా నగరాలలో గుండ్లపోచంపల్లి (తెలంగాణ) నాల్గొవ స్థానంలో నిలిచింది.

ఇండియా టాప్ 10 క్లీనెస్ట్ సిటీస్
రాష్ట్రం సిటీ ర్యాంకు
మధ్యప్రదేశ్ ఇండోర్ 1వ ర్యాంకు
గుజరాత్ సూరత్ 1వ ర్యాంకు
మహారాష్ట్ర నేవీ ముంబై 3వ ర్యాంకు
ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం 4వ ర్యాంకు
మధ్యప్రదేశ్ భూపాల్ 5వ ర్యాంకు
ఆంధ్రప్రదేశ్ విజయవాడ 6వ ర్యాంకు
ఢిల్లీ న్యూఢిల్లీ 7వ ర్యాంకు
ఆంధ్రప్రదేశ్ తిరుపతి 8వ ర్యాంకు
తెలంగాణ హైదరాబాద్ 9వ ర్యాంకు
మహారాష్ట్ర పూణే 10వ ర్యాంకు
లక్ష జనాభా కంటే తక్కువ కేటగిరిలో టాప్ 3 క్లీనెస్ట్ మున్సిపాలిటీలు
మహారాష్ట్ర సస్వాద్ మున్సిపాలిటీ 1వ ర్యాంకు
ఛత్తీస్‌గఢ్ పటాన్ మున్సిపాలిటీ 2వ ర్యాంకు
మహారాష్ట్ర లోనావాలా మున్సిపాలిటీ 3వ ర్యాంకు
లక్ష కంటే ఎక్కువ జనాభా కేటగిరిలో టాప్ 2 క్లీనెస్ట్ సిటీలు
బీహార్ పనాజీ 1వ ర్యాంకు
ఆంధ్రప్రదేశ్ గుంటూరు 2వ ర్యాంకు
లక్ష కంటే తక్కువ జనాభా కేటగిరిలో టాప్ 2 క్లీనెస్ట్ సిటీలు
మధ్యప్రదేశ్ నౌరోజాబాద్ 1వ ర్యాంకు
మధ్యప్రదేశ్ అమర్‌ కంటక్‌ 2వ ర్యాంకు
టాప్ 2 గంగా టౌన్ సిటీస్
ఉత్తరప్రదేశ్ వారణాసి 1వ ర్యాంకు
ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్ 2వ ర్యాంకు
ఇండియా టాప్ 3 క్లీనెస్ట్ రాష్ట్రాలు 
మహారాష్ట్ర 1వ ర్యాంకు
మధ్యప్రదేశ్ 2వ ర్యాంకు
ఛత్తీస్‌గఢ్ 3వ ర్యాంకు

పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో ఎక్సలెన్స్ కోసం ప్రధానమంత్రి అవార్డులు

దేశవ్యాప్తంగా ఉన్న సివిల్ సర్వెంట్లు చేసిన శ్రేష్టమైన పనిని గుర్తించి, గౌరవించడం కోసం 'ప్రధానమంత్రి అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 2023' పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీనికి సంబంధించి పీఎం అవార్డ్స్ పోర్టల్‌ అనే వెబ్సైటును కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ జనవరి 31 లోపు అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు/ రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా కలెక్టర్లు ఈ పోర్టల్‌లో నామినేషన్ల సమర్పణ చేయాల్సి ఉంటుంది. 2023 ఏడాదికి సంబంధించి రెండు వర్గాల కింద మొత్తం 16 అవార్డులు అందిస్తున్నారు. వర్గం 1 కింద 12 ప్రాధాన్యతా రంగలలో జిల్లాల సమగ్ర అభివృద్ధి కింద 10 అవార్డులు ఇవ్వబడతాయి. వర్గం 2 కింద కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాలు, రాష్ట్రాలు, జిల్లాల పరిధిలో ఆవిష్కరణల కోసం 6 అవార్డులు అందజేయబడతాయి.

  • పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో ఎక్సలెన్స్ అవార్డులు అనేవి సివిల్ సర్వెంట్లు చేసిన శ్రేష్టమైన పనిని గుర్తించి,  గౌరవిస్తాయి.
  • ఈ అవార్డుల పథకం 2019 నుండి అమలు చేస్తున్నారు.
  • కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు మరియు జిల్లా సంస్థలు చేసిన అసాధారణమైన మరియు వినూత్నమైన పనిని ఇవి గుర్తించి, గౌరవిస్తాయి.
  • ఈ అవార్డు విజేతలకు ట్రోఫీ, ప్రశంస పత్రం మరియు 20 లక్షల నగదు బహుమతి అందజేస్తారు.
  • ఈ అవార్డులను ఏటా ఏప్రిల్ 21న సివిల్ సర్వీసెస్ డే రోజున భారత ప్రధాని ప్రదానం చేస్తారు.

2019-2023 సంవత్సరాలకు సంబంధించి మొత్తం 62 అవార్డులను ప్రదానం చేసింది. 2022 ప్రైమ్ మినిస్టర్స్ అవార్డ్స్ కింద 743 జిల్లా కలెక్టర్లు, 2,520 నామినేషన్లు సమర్పించారు. ఇందులో 15 నామినేషన్లకు ప్రధానమంత్రి అవార్డులు అందజేశారు. ఈ ప్రధానమంత్రి అవార్డులను ఈ ప్రధానమంత్రి అవార్డులను ఏటా ఏప్రిల్ 21న సివిల్ సర్వీసెస్ డే రోజున భారత ప్రధాని ప్రదానం చేస్తారు. అవార్డు విజేతల కథలను సన్సద్ టీవీలో ప్రచారమయ్యే “అభినవ్ పహల్” టెలివిజన్ సిరీస్‌లో ప్రదర్శిస్తారు.

బిల్కిస్ బానో కేసులో గుజరాత్ ప్రభుత్వ రిమిషన్ ఆర్డర్‌ను రద్దు చేసిన సుప్రీం

బిల్కిస్ బానోపై అత్యాచారం కేసులో 11 మంది దోషులకు క్షమాపణలు మంజూరు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారత అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. గుజరాత్ ప్రభుత్వ రిమిషన్ ఆర్డర్‌ను సవాల్ చేస్తూ బిల్కిస్ బానో స్వయంగా దాఖలు చేసిన పిటిషన్‌కు ప్రతిస్పందనగా సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. బిల్కిస్ బానో దాఖలు చేసిన పిటిషన్‌ను కొనసాగించవచ్చని జనవరి 8న ఇచ్చిన మధ్యంతర తీర్పులో పేర్కొంది. 2022 లో గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన ఈ 11 మంది దోషులు రెండు వారాల్లోగా లొంగిపోవాలని కూడా ఆదేశించింది.

2002 గుజరాత్ మత అల్లర్లలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం మరియు ఆమె కుటుంబ సభ్యులను చంపిన కేసులో జీవిత ఖైదు పడిన 11 మంది దోషులకు క్షమాపణలు ఇచ్చే అధికారం గుజరాత్ రాష్ట్రానికి లేదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. న్యాయమూర్తులు బివి నాగరత్న, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. 2022 ఆగస్ట్‌లో సైక్లోస్టైల్ పద్ధతిలో ఎటువంటి దరఖాస్తు లేకుండా రిమిషన్ ఆర్డర్‌లను ఆమోదించినందుకు గుజరాత్ ప్రభుత్వాన్ని కూడా సుప్రీం కోర్టు నిలదీసింది.

ఈ కేసుకు సంబంధించి బానో దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు, సీపీఐ(ఎం) నేత సుభాషిణి అలీ, స్వతంత్ర పాత్రికేయురాలు రేవతి లాల్, లక్నో యూనివర్శిటీ మాజీ వైస్ ఛాన్సలర్ రూప్ రేఖా వర్మ సహా పలు ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఈ రిలీవ్‌ను సవాలు చేశారు. అలానే టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా కూడా ఈ ఉపశమనం మరియు వారి ముందస్తు విడుదలకు వ్యతిరేకంగా పిల్ దాఖలు చేశారు.

2002 గుజరాత్ గోద్రా రైలు దహనం ఘటన తర్వాత చెలరేగిన మత అల్లర్ల భయానక భయాందోళనల నుండి పారిపోతున్నప్పుడు 21 ఏళ్ళ బిల్కిస్ బానో అత్యాచారానికి గురైంది. ఆ సమయంలో ఆమె ఐదు నెలల గర్భిణిగా ఉంది. ఈ అల్లర్లలో చనిపోయిన ఏడుగురు కుటుంబ సభ్యులలో ఆమె మూడేళ్ల కుమార్తె కూడా ఉంది. ఈ కేసులో మొత్తం 11 మంది దోషులుగా తేలారు. 2008లో 11 మంది దోషులకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. అయితే ఆగస్టు 15, 2022న గుజరాత్ ప్రభుత్వం వీరికి ఈ కేసు నుండి ఉపశమనం మంజూరు చేసి, విడుదల చేసింది.

జాతీయ క్రీడా అవార్డులు 2023

యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వ శాఖ 2023 జాతీయ క్రీడా అవార్డులను ప్రకటించింది. అవార్డు గ్రహీతలు 09 జనవరి 2024న భారత రాష్ట్రపతి నుండి వారి అవార్డులను అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం యేటా ఆరు విభాగాల్లో జాతీయ క్రీడా అవార్డులను అందజేస్తుంది. 2004 నుండి ఈ ఆరు జాతీయ క్రీడా అవార్డులతో పాటుగా టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు కూడా అందజేస్తున్నారు.

మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2023ను చిరాగ్ చంద్రశేఖర్ శెట్టిక మరియు రాంకిరెడ్డి సాత్విక్ సాయి రాజ్ అందుకోగా, మరో 26 మంది క్రీడాకారులకు అర్జున అవార్డులను అందజేశారు. ఈ ఏడాది టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డులను స్కైడైవర్ అన్షు కుమార్ తివారీ మరియు పర్వీన్ సింగ్ అందుకున్నారు.

  1. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు
  2. అర్జున అవార్డు
  3. ద్రోణాచార్య అవార్డు
  4. మేజర్ ధ్యాన్ చంద్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్
  5. మౌలానా అబుల్ కలాం ఆజాద్ రోలింగ్ ట్రోఫీ
  6. రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం
నెం క్రీడాకారుడి పేరు క్రీడా కేటగిరి
మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2023 విజేతలు
1. చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి బ్యాడ్మింటన్
2. రంకిరెడ్డి సాత్విక్ సాయి రాజ్ బ్యాడ్మింటన్
2023 అర్జున అవార్డు విజేతలు
1 ఓజస్ ప్రవీణ్ డియోటలే విలువిద్య
2 అదితి గోపీచంద్ స్వామి విలువిద్య
3 శ్రీశంకర్ ఎం వ్యాయామ క్రీడలు
4 పరుల్ చౌదరి వ్యాయామ క్రీడలు
5 మహమ్మద్ హుసాముద్దీన్ బాక్సింగ్
6 ఆర్ వైశాలి చదరంగం
7 మహమ్మద్ షమీ క్రికెట్
8 అనుష్ అగర్వాలా గుర్రపుస్వారీ
9 దివ్యకృతి సింగ్ ఈక్వెస్ట్రియన్ డ్రెస్సేజ్
10 దీక్షా దాగర్ గోల్ఫ్
11 కృష్ణ బహదూర్ పాఠక్ హాకీ
12 పుఖ్రంబం సుశీల చాను హాకీ
13 పవన్ కుమార్ కబడ్డీ
14 రీతు నేగి కబడ్డీ
15 నస్రీన్ ఖో-ఖో
16 పింకీ లాన్ బౌల్స్
17 ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ షూటింగ్
18 ఈషా సింగ్ షూటింగ్
19 హరీందర్ పాల్ సింగ్ సంధు స్క్వాష్
20 అహికా ముఖర్జీ టేబుల్ టెన్నిస్
21 సునీల్ కుమార్ రెజ్లింగ్
22 యాంటిమ్ రెజ్లింగ్
23 నౌరెమ్ రోషిబినా దేవి వుషు
24 శీతల్ దేవి పారా ఆర్చరీ
25 ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి బ్లైండ్ క్రికెట్
26 ప్రాచీ యాదవ్ పారా కానోయింగ్
ద్రోణాచార్య అవార్డు 2023 విజేతలు (రెగ్యులర్)
1 లలిత్ కుమార్ రెజ్లింగ్
2 ఆర్బీ రమేష్ చదరంగం
3 మహావీర్ ప్రసాద్ సైనీ పారా అథ్లెటిక్స్
4 శివేంద్ర సింగ్ హాకీ
5 గణేష్ ప్రభాకర్ దేవ్రుఖ్కర్ మల్లఖాంబ్
ద్రోణాచార్య అవార్డు 2023 విజేతలు (లైఫ్‌టైమ్)
1 జస్కీరత్ సింగ్ గ్రేవాల్ గోల్ఫ్
2 భాస్కరన్ ఇ కబడ్డీ
3 జయంత కుమార్ పుషీలాల్ టేబుల్ టెన్నిస్
మేజర్ ధ్యాన్ చంద్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ 2023 విజేతలు
1 మంజుషా కన్వర్ బ్యాడ్మింటన్
2 వినీత్ కుమార్ శర్మ హాకీ
3 కవిత సెల్వరాజ్ కబడ్డీ
మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ 2023
1 గురునానక్ దేవ్ యూనివర్సిటీ, అమృత్సర్ యూనివర్సిటీ విజేత
2 లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, పంజాబ్ 1వ  రన్నరప్ యూనివర్సిటీ
3 కురుక్షేత్ర విశ్వవిద్యాలయం, కురుక్షేత్ర 2 వ రన్నరప్ యూనివర్సిటీ
  • మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును గడిసిన నాలుగు సంవత్సరాల కాలంలో అత్యుత్తమ ప్రదర్శన కోసం అందించబడుతుంది.
  • అర్జున అవార్డులు ఆటలలో అత్యుత్తమ ప్రదర్శన, నాయకత్వ లక్షణాలు, క్రీడాస్ఫూర్తి మరియు క్రమశిక్షణ వంటి అంశాలలో అందించబడుతుంది.
  • ద్రోణాచార్య అవార్డులను క్రీడాకారులు అంతర్జాతీయ ఈవెంట్‌లలో రాణించేలా చేసినందుకు కోచ్‌లకు ఇవ్వబడుతుంది.
  • ధ్యన్ చంద్ అవార్డ్ ఫర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ ఇన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అవార్డును పదవీ విరమణ తర్వాత క్రీడా రంగానికి అందించిన సేవలకు గాను అందజేస్తారు.
  • ఇంటర్-యూనివర్శిటీ టోర్నమెంట్‌లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విశ్వవిద్యాలయానికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ ఇవ్వబడుతుంది.
  • రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం క్రీడల ప్రమోషన్ మరియు డెవలప్‌మెంట్ రంగంలో కీలక పాత్ర పోషించే సంస్థలు లేదా కార్పొరేట్‌లకు అందజేస్తారు.
  • టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డులు సాహస క్రీడలలో అత్యుత్తమ ప్రదర్శనకు అందజేస్తారు.

Post Comment